చర్చించడమంటే విభజనకు అనుకూలమని అభిప్రాయం వ్యక్తం చేయడం కాదా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చర్చించడమంటే విభజనకు అనుకూలమని అభిప్రాయం వ్యక్తం చేయడం కాదా?

చర్చించడమంటే విభజనకు అనుకూలమని అభిప్రాయం వ్యక్తం చేయడం కాదా?

Written By news on Friday, January 10, 2014 | 1/10/2014

చర్చకు ముందే ఓటింగ్: విజయమ్మ
* సమైక్య తీర్మానం చేశాకే బిల్లు పెట్టాలని మేం ఎంత డిమాండ్ చేసినా వినలేదు: విజయమ్మ
ఏ తీర్మానమూ లేకుండానే బిల్లును సభలో ప్రవేశపెట్టేసి.. చర్చించమంటున్నారు
ఇప్పుడు చర్చ జరిగాక ఓటింగ్ పెడతారో లేదోనని భయంగా ఉంది
ఓటింగ్ లేకుండా చర్చించడమంటే.. మనం విభజనకు అనుకూలమని అభిప్రాయం వ్యక్తం చేయడం కాదా?
విజయమ్మ ప్రసంగానికి అడుగడుగునా అడ్డుతగిలిన కాంగ్రెస్, టీడీపీ సభ్యులు

 
 సాక్షి, హైదరాబాద్:  తెలంగాణ బిల్లుపై చర్చించటానికంటే ముందు ఓటింగ్ నిర్వహించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ శాసన సభలో గట్టిగా డిమాండ్ చేశారు. బిల్లుపై చర్చించడం అంటే.. విభజనకు అనుకూలమనే అభిప్రాయం వ్యక్తమవడం నిజం కాదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో చర్చ జరిగితే అది కేవలం అభిప్రాయ సేకరణకే పరిమితమవుతుందన్న మాటలు వినిపిస్తున్నందున ముందుగా ఓటింగ్ నిర్వహించి విభజనకు అనుకూలమా, వ్యతిరేకమా అన్న విషయాన్ని తేల్చాల్సి ఉందని కుండబద్దలు కొట్టారు. గురువారం ఉదయం ఆమె తమ పార్టీ పక్షాన ఉన్న అనుమానాలపై అసెంబ్లీలో మాట్లాడారు. ‘‘మేం చర్చకు వ్యతిరేకం కాదు, చర్చను అడ్డుకోవటానికి కాదు మేం పోరాడుతోంది.
 
  ఓ పద్ధతి, సంప్రదాయం అంటూ లేకుండా, కనీసం ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత సభలో లేని సమయంలో విచిత్రమైన పరిస్థితిలో బిల్లు ప్రవేశపెట్టడం మన దురదృష్టం. ఆర్టికల్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది.. ఇష్టమొచ్చినట్టు విభజన చేయటానికి కాదు. ఒక విధానం అనేది ఉండాలి. బిల్లు వచ్చినప్పుడు రాష్ట్ర సంబంధిత తీర్మానం ఉండాలని ఎన్నో కమిషన్లు చెప్పాయి. ఇవేవీ లేకుండా మనం అసెంబ్లీలో బిల్లు పెట్టుకున్నాం. పశ్చిమబెంగాల్‌లో బీసీరాయ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రాష్ట్రంలోని బేరూబారూ అనే ప్రాంతాన్ని పాకిస్థాన్‌లో కలిపే అంశానికి సంబంధించి ఆ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పెట్టారు. అప్పుడు చేసిన తీర్మానం ఆధారంగా నాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ సుప్రీంకోర్టు అభిప్రాయం తీసుకోవటంతో ఆ ప్రాంతం ఇప్పుడు మనదేశంలోనే అంతర్భాగంగా ఉండే పరిస్థితి వచ్చింది’’ అని విజయమ్మ గుర్తుచేశారు.
 
 తర్వాత ఓటింగ్ జరుగుతుందో లేదో..
 ‘‘ఇప్పుడు మన అసెంబ్లీలో మాట్లాడేవి కేవలం అభిప్రాయాలు మాత్రమేనని, తర్వాత ఓటింగ్ ఉండదని నాయకులు చెప్తున్న నేపథ్యంలో మా భయాలు మాకున్నాయి. అందుకే ముందు తీర్మానం పెట్టాలని చాలా పోరాడాం, బిల్లు రాకముందే అసెంబ్లీలో తీర్మానం చేద్దామని ముఖ్యమంత్రిని కోరాం. తీర్మానం చేసేలా చూడాలని రాష్ట్రపతికి కూడా విజ్ఞప్తి చేశాం. ఇలా అన్ని ప్రయత్నాలు చేశాం. కానీ తీర్మానం లేకుండానే బిల్లు పెట్టారు. ఇక తర్వాత ఓటింగ్ జరుగుతుందో లేదో నమ్మకం లేదు. సభ విభజనకు అనుకూలమా, వ్యతిరేకమా అనేది ముందే తెలుసుకోవాలని కోరుతున్నాం. మేం మాట్లాడకపోతే విభజనకు అనుకూలమని మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు.
 
కానీ పదేళ్లు కలిసిండాలనో, రాజధాని ఎక్కడ అనో... ఇలాంటి అంశాలపై చర్చిస్తే దాని అర్థమేంటి అధ్యక్షా..? విభజనకు అనుకూలమని కాదా? అందుకే నేను అందరినీ అడుగుతున్నా, చేతులెత్తి అభ్యర్థిస్తున్నా. అభివృద్ధి చెంది మూడో స్థానంలో ఉన్న మన రాష్ట్రాన్ని విభజించకుండా సమైక్యంగా ఉంచేలా చూడాలని కోరుతున్నా. మేం విభజనకు వ్యతిరేకం, సమైక్యంగా ఉండాలనే ముందుగా ఓటింగ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మేం చర్చలకు వ్యతిరేకం, అడ్డంకి కాదు. దీన్ని రికార్డ్ చేయాలని కోరుతున్నా’’అని పేర్కొన్నారు.
 
 అడుగడుగునా అడ్డు తగిలిన కాంగ్రెస్, టీడీపీ
 గురువారం సభ ప్రారంభం అవగానే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సభ్యులు పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేయటంతో స్పీకర్ సభను అరగంటపాటు వాయిదావేశారు. మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలు మళ్లీ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేయటంతో, సభ సజావుగా సాగేందుకు సహకరించాలని, ఇప్పటికే ఐదురోజుల సమయం వృథా అయిందని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేశారు. బిల్లుపై ఉన్న అనుమానాలపై మాట్లాడేందుకు తొలుత విజయమ్మకు అవకాశం ఇస్తానని పేర్కొనటంతో వారు శాంతించారు. వెంటనే విజయమ్మ లేచి మాట్లాడ్డం ప్రారంభించగానే ఇటు కాంగ్రెస్, అటు దేశం సభ్యులు గగ్గోలు పెడుతూ అడుగడుగునా అడ్డు తగ లటం ప్రారంభించారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు లేచి ఇదేం దారుణమంటూ నిలదీశారు. ఓ దశలో దేశం సభ్యుడు దయాకరరావు లేచి నేరుగా వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. సభ మొత్తం గందరగోళంగా మారినా వెంటనే జోక్యం చేసుకోని స్పీకర్ అలా చూస్తుండిపోయారు.
 
 ఆ గందరగోళంలోనే విజయమ్మ మాట్లాడాల్సి వచ్చింది. పశ్చిమబెంగాల్‌లోని బేరూబారూ విషయాన్ని విజయమ్మ ప్రస్తావించినప్పుడు కూడా సభ్యులు ఆమెను మాట్లాడనీయలేదు. వారిని వారించాల్సిన స్పీకర్, కేవలం బిల్లుపై ఉన్న అనుమానాలను మాత్రమే ప్రస్తావించాలని, ఉపన్యాసం వద్దంటూ విజయమ్మను వారించే ప్రయత్నం చేయటం విశేషం. బిల్లు పెట్టినప్పుడు సభలో చంద్రబాబు లేరని విజయమ్మ పేర్కొనటంపై దేశం నేత పయ్యావుల కేశవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందు చర్చించి ఆ తర్వాత ఓటింగ్ ద్వారా బిల్లును ఓడించాలని ఈ సందర్భంగా కేశవ్ అనటంతో టీఆర్‌ఎస్ సభ్యులు, తెలంగాణ కాంగ్రెస్ సభ్యులు లేచి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కానీ తెలుగుదేశం తెలంగాణ నేతలు కిమ్మనకుండా కూర్చోవటం విశేషం.

Share this article :

0 comments: