ఇంట్లో ఎంత మంది ఉన్నారంటూ వడివేలు భార్య బిర్లా (36)ను అడిగి తెలుసుకున్నారు. ఫించన్ వస్తోందా అని ప్రశ్నించారు. ఆస్తులు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. ఏమీ లేవని, కూలి పనులకు వెళితేనే కుటుంబ పోషణ జరుగుతుందని ఆమె తెలపడంతో ఏ పనులకు వెళుతున్నావమ్మా అంటూ జననేత ప్రశ్నించారు. వరినాట్లు, చెరుకు కోతలు, ఇటుకల తయారీ పనులకు వెళతానని ఆమె తెలిపారు. ఉపాధి హామీ పనులకు వెళ్లడం లేదా అని జననేత ప్రశ్నించగా కూలీ రూ.20 నుంచి రూ.50 వరకు మాత్రమే వస్తుందని, అందుకే ఇతర పనులకు వెళుతున్నానని చెప్పారు.
ఈ పనుల్లో రోజుకు రూ.100 నుంచి రూ. 200 వస్తుందని తెలిపారు. గ్యాస్ కనెక్షన్ ఉందా అని జననేత ప్రశ్నించగా గ్యాస్ లేదని కట్టెల పొయ్యి మాత్రమే ఉందని ఆమె వెల్లడించారు. అనంతరం జననేత వడివేలు కుమార్తె నిర్మల (13) తలపై చేయిపెట్టి ఆశీర్వదిస్తూ ఏం చదువుతున్నావమ్మా అని ప్రశ్నించారు. ఆరూరు పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నానని అమ్మాయి చెప్పింది. బాగా చదువుకోమ్మా నాలుగు నెలల్లో మంచిరోజులు వస్తాయి అమ్మ ఒడి పథకం ద్వారా మీ చదువుకోసం తల్లి అకౌంట్లో ప్రతి నెలా రూ.500 జమచేస్తా. ఫించన్ రెండు వందల నుంచి ఏడు వందల రూపాయలు వచ్చేలా చేస్తానని వారికి భరోసా ఇచ్చారు.
ఏం కష్టం వచ్చినా తోబుట్టువులా నేను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తన తరపున ఆర్కే.రోజాను గానీ, చక్రపాణి రెడ్డిని గానీ సంప్రదించాలన్నారు. వడివేలు రెడ్డి తల్లి కాటమ్మ (74) తలపై చేయి ఉంచి ఓదార్చారు. కుటుంబ సభ్యులు ఆప్యాయంగా అరటిపండు తినిపించగా ఆయన తినడం వారికి ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది. నువ్వు సీఎంగా మళ్లీ రావాలన్నా అని వారు తెలపడం ప్రత్యేకతను సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ గాయత్రీదేవి, నియోజకవర్గ సమన్వయకర్త ఆర్కేరోజా, జెడ్పీటీసీ మాజీ సభ్యులు చక్రపాణిరెడ్డి, మండల కన్వీనర్ మనోహర్నాయుడు, మహిళా కన్వీనర్ మేరీజయరాం తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు టీకే.హరి, శ్యామ్లాల్, స్థానిక నాయకులు మురళీనాయుడు, నాగభూషణం రాజు తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment