అట్టహాసంగా ప్రారంభమైన వైఎస్సార్ మెమోరియల్ రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అట్టహాసంగా ప్రారంభమైన వైఎస్సార్ మెమోరియల్ రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు

అట్టహాసంగా ప్రారంభమైన వైఎస్సార్ మెమోరియల్ రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు

Written By news on Monday, January 13, 2014 | 1/13/2014

అట్టహాసంగా ప్రారంభమైన ఎడ్ల పందేలు
పర్చూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ మెమోరియల్ రాష్ట్ర స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు ఆదివారం నూతలపాడు గ్రామంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గ్రామీణ ప్రాంతమైన నూతలపాడులో రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు నిర్వహించడం అభినందనీయమని వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త, తాజా మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పార్టీ స్థానిక నాయకుడు పావులూరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన సభలో రవికుమార్ మాట్లాడారు. నూతలపాడు జూనియర్ కళాశాలలో గొట్టిపాటి నరసింహారావు(నరసయ్య) ప్రాంగణంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలను ఆదివారం ఉదయం గొట్టిపాటి రవికుమార్, వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ ప్రారంభించారు. అనంతరం నరసయ్య 50వ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసయ్య సతీమణి పద్మ, కుమార్తె లక్ష్మి పాల్గొన్నారు. సభా వేదికపై దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, గొట్టిపాటి నరసింహారావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నరసయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కొద్దిసేపు మౌనం పాటించారు.  
 
 సభలో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. ఒంగోలు జాతి పశుసంపదపై మక్కువతో గతంలో మార్టూరులో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు నిర్వహించినట్లు తెలిపారు. అప్పట్లో 250 జతల ఎడ్లు పోటీల్లో పాల్గొన్నాయని గుర్తుచేశారు. తర్వాత అనివార్య కారణాల వల్ల పోటీలు నిర్వహించలేకపోయామన్నారు. వైఎస్సార్ పేరున భవనం శ్రీనివాసరెడ్డి పోటీలు నిర్వహించడం అభినంద నీయమన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాలు సక్రమం గా అమలవుతాయని పేర్కొన్నారు. వైఎస్సార్ మరణం తర్వాత ప్రస్తుత పాలకులు రాష్ట్రాన్ని ఏ విధంగా బ్రష్టు పట్టించారో ప్రతి ఒక్క పౌరుడూ గమనిస్తూనే ఉన్నారన్నారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పారు. తన అన్న కుమారుడు భరత్‌ను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
 
 గొట్టిపాటి భరత్ మాట్లాడుతూ.. ‘నాన్న పుట్టినరోజున ఆయనకు ఇష్టమైన ఎడ్లపోటీలు నిర్వహించడం ఆనందంగా ఉంద’ని అన్నారు. నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ సీపీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు తనకు అండగా నిలవాలని కోరారు. పోటీల నిర్వాహకుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు భవనం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. నరసయ్య జయంతి రోజున రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
 
 కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా సభ్యులు వల్లభరెడ్డి సుబ్బారెడ్డి, జూనియర్ కళాశాల యాజమాన్య ప్రతినిధి భవనం వెంకటరామిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్రా శేషగిరిరావు, తాటి వెంకట్రావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మనుబోతు వెంకటరెడ్డి, పార్టీ మండల కన్వీనర్లు తోకల కృష్ణమోహన్, బండారు ప్రభాకరరావు, పఠాన్ కాలేషావలి, కోట విజయభాస్కరరెడ్డి, ధూలిపాళ్ళ వేణుబాబు, దండా చౌదరి, యద్దనపూడి, పర్చూరు మండలాల యూత్ అధ్యక్షులు తమ్మా అమ్మిరెడ్డి, ఆకుల హేమంత్, నూతలపాడు సర్పంచ్ సుమలత, నూతలపాడు, ఆదిపూడి, పూనూరు సహకార సంఘాల అధ్యక్షులు కుర్రి బాపిరెడ్డి, యర్రం లక్ష్మారెడ్డి, పావులూరి వాసు, పార్టీ నాయకులు యర్రం నాగిరెడ్డి, వల్లభరెడ్డి రామకృష్ణారెడ్డి, దేవిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కొసనా రాంప్రసాద్, గాజుల రమేష్, దరువూరి వీరయ్యచౌదరి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: