కార్యకర్తల్లో కదనోత్సాహం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కార్యకర్తల్లో కదనోత్సాహం

కార్యకర్తల్లో కదనోత్సాహం

Written By news on Monday, February 3, 2014 | 2/03/2014

శ్రేణుల్లో స్ఫూర్తి
 ఎన్నికల ముంగిట కార్యకర్తల్లో కదనోత్సాహం
 ఇడుపులపాయ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఇడుపులపాయ నుంచి సాక్షి ప్రతినిధులు: సార్వత్రిక ఎన్నికల ముంగిట పార్టీ శ్రేణుల్లో పోరాట పటిమను నింపుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండో ప్లీనరీ (ప్రజా ప్రస్థానం) విజయవంతంగా ముగిసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి చెంత ఇడుపులపాయలో ఏర్పాటైన ప్రాంగణం జగన్నినాదాలతో మార్మోగింది. పార్టీ జెండాల రెపరెపలు, కార్యకర్తల కదనోత్సాహం నడుమ రానున్న ఎన్నికల్లో గెలుపు సాధించాలన్న దృఢ నిశ్చయంతో శ్రేణులన్నీ ప్రతిన బూనాయి. పార్టీ అగ్ర నేతల ప్రసంగాలు వారిలో స్ఫూర్తిని నింపి, కర్తవ్య బోధ చేశాయి. పార్టీ ఆవిర్భావం నుంచి పోరాటాలతో రాటుదేలిన పార్టీ కార్యకర్తలు ఇదే పటిమను ఎన్నికల వరకూ కొనసాగించాలని నేతలు పిలుపు నిచ్చారు. ఉత్సాహ భరిత వాతావరణంలో పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నిక, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే నేతల పట్టుదల, సంక్షేమ కార్యక్రమాల పునరుద్ధరణకు కంకణం కట్టుకోవడం ఈ ప్లీనరీలో ప్రధానాంశాలుగా నిలిచాయి. రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో మొత్తం 23 జిల్లాల నుంచి సుమారు పది వేల మంది ప్రతినిధులు, ముఖ్య నేతలు ప్లీనరీలో పాల్గొనడం విశేషం. ఆదివారం రోజంతా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటం, నాలుగేళ్లుగా వివిధ ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాలకు తూట్లు పొడవడంపై పార్టీ సాగిస్తున్న పోరుబాటపై తదితర అంశాలపై ప్లీనరీ క్షుణ్ణంగా సమీక్షించుకుంది. మొత్తమ్మీద ఎన్నికల సమయంలో జరిగిన ఈ ప్లీనరీ పార్టీ శ్రేణులను ఉత్తేజితులను చేసి, వారిని సమరోన్ముఖులను చేసేందుకు దోహదపడింది.
 
 ప్లీనరీ సాగిందిలా: పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఉదయం 9.30 గంటలకు వైఎస్ సమాధి వద్దకు చేరుకుని నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జగన్ వెంట వైఎస్ విజయమ్మ, షర్మిల ఉన్నారు. అక్కడ్నుంచి నేరుగా ప్లీనరీ ప్రాంగణానికి చేరుకునిపార్టీ జెండాను ఆవిష్కరించారు. తర్వాత ప్లీనరీ వేదికపైకి చేరుకుని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్లీనరీ ప్రారంభం కాగానే పార్టీ క్రమశిక్షణ కమిటీ సంఘం సభ్యుడు శెట్టిపల్లి రఘురామిరెడ్డి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌తో పాటు ఇతర ప్రధాన నాయకులను వేదికపైకి ఆహ్వానించారు. తర్వాత ఇటీవల కాలంలో దివంగతులైన 33 మంది పార్టీ నాయకులు, శ్రేణులకు మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ నివాళులర్పిస్తూ తీర్మానం చేశారు. అధ్యక్షుడితో పాటు ప్లీనరీకి విచ్చేసిన ప్రజలు, కార్యకర్తలు రెండు నిమిషాలు మౌనం పాటించారు. తర్వాత పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రారంభోపన్యాసం చేశారు. తర్వాత  పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే కృష్ణదాస్ ప్రమాణం చేయించారు. పార్టీ పురోగతి కోసం నిధులను విరాళంగా ఇవ్వాలని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన పలువురు నేతలు విరాళాలను ప్రకటించారు. తర్వాత పార్టీ అధ్యక్షుడిగా రెండోసారి జగన్ ఎన్నికైనట్లు పార్టీ సంస్థాగత ఎన్నికల కన్వీనర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. అనంతరం షర్మిల, జగన్, నేతలు ప్రసంగించారు.
 
 తెలంగాణ నేతల సమైక్య నినాదం: ప్లీనరీలో పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ.. ‘‘సమైక్యవాదం తీసుకోవడంతో వైఎస్సార్‌సీపీ సీమాంధ్రకే పరిమితమైందని అంటున్నారు. కానీ, సమైక్యవాదులే తెలంగాణలో ఎక్కువగా ఉన్నారు. ఒక్కసారి జగన్  అడుగుపెడితే సీమాంధ్రలో ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలంగాణలో అదే విధంగా వస్తాయి. తెలంగాణ ఏర్పాటై.. అందులోని కొన్ని జిల్లాలు అభివృద్ధి చెందకపోతే వాటికి మళ్లీ ప్రత్యేక రాష్ట్రం కావాలంటే ఇస్తారా? ఇదే అభిప్రాయాన్ని తెలంగాణలో లక్షల గుండెలు చెబుతున్నాయి. అని అన్నారు.  తెలంగాణ నుంచి ఎవరూ రాలేదని కూడా కొందరు అంటున్నారు. నేను వచ్చాను.. జనక్‌ప్రసాద్, పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, చల్లా వెంకట్రామిరెడ్డి, యడ్డా కృష్ణారెడ్డి, బాలమణెమ్మతో పాటు అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు వచ్చారు..’’ అని గట్టు రాంచంద్రరావు అనగానే... ప్లీనరీ వేదికపై ఉన్న తెలంగాణ నేతలు ఒక్కసారిగా లేచి నిలబడి.. ‘జై జగన్’ .. ‘జోహార్ వైఎస్సార్’ అంటూ నినదించారు.
Share this article :

0 comments: