ప్రతి మహిళనూ లక్షాధికారిని చేస్తాను.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రతి మహిళనూ లక్షాధికారిని చేస్తాను..

ప్రతి మహిళనూ లక్షాధికారిని చేస్తాను..

Written By news on Saturday, March 22, 2014 | 3/22/2014

అక్కాచెల్లెళ్ల కన్నీరు తుడుస్తా
 రూ.20వేల కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా
 తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో వైఎస్ జగన్ పునరుద్ఘాటన

 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘డ్వాక్రా అక్కాచెల్లెమ్మలు.. తీసుకున్న అప్పుకు ప్రతి నెలా రెండేసి వేలు వాయిదాలు కట్టడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వడ్డీలు కట్టేందుకు మరోసారి అప్పులు చేస్తున్నారు. ఆ అప్పులు తీర్చేందుకు పనులకు వెళ్లడమే కాకుండా తమ పిల్లలను కూడా పనులకు తీసుకువెళ్లే దయనీయ పరిస్థితి చూశాను. అక్కా, చెల్లెమ్మలకు అప్పుల ఊబి నుంచి విముక్తి కల్పించి కొత్త జీవితాన్ని ప్రసాదించేందుకు వారు తీసుకున్న డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించాను. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజే ఆ రుణాల మాఫీ ఫైలుపై సంతకం చేస్తాను.. అక్కాచెల్లెళ్ల కన్నీరు తుడుస్తాను’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదో రోజుశుక్రవారం మండపేట పట్టణంలో జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. జనస్పందన వెల్లువెత్తడంతో ఐదు కిలోమీటర్ల మేరరోడ్‌షోకు పదిగంటలకుపైగా పట్టింది. పురవీధుల్లో కిక్కిరిసిన జనసందోహం మధ్య రాత్రి 9 గంటల వరకు జగన్ పర్యటించారు. దారిపొడవునా జగన్‌కు జనం బ్రహ్మరథం పట్టారు. మంగళహారతులు పడుతూ, పూలవర్షం కురిపిస్తూ, భారీ బాణసంచాతో జననీరాజనాలు పలికారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో మండపేట రోడ్లన్నీ జనసునామీని తలపించాయి. దారి పొడవునా ప్రజలు జగన్‌ను కలిసి.. అధికారంలోకి రాగానే తమ కష్టాలు తీర్చాలంటూ పలు సమస్యలు చెప్పుకొన్నారు. రాబోయేది ప్రజల ప్రభుత్వమేనని జగన్ వారికి భరోసా ఇచ్చారు.
 
 ప్రతి మహిళనూ లక్షాధికారిని చేస్తాను..
 
 మండపేట మారేడుబాక సెంటర్‌లో బంధువుల ఇంటికి వచ్చిన పశ్చిమగోదావరి జిల్లా రెడ్డిపోలవరానికి చెందిన పోలపర్తి సాయికుమారి స్థానిక డ్వాక్రా సంఘ సభ్యులతో కలిసి జగన్ దగ్గరకొచ్చారు. ‘అన్నా మీరు.. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెబుతున్నారు.. రోజూ టీవీల్లో చూస్తున్నాం’ అని అన్నారు. ‘రుణమాఫీ అనేది భారంతో కూడుకున్న పని. అయినప్పటికీ నా డ్వాక్రా అక్కాచెల్లెమ్మల కోసం వారు తీసుకున్న రూ.20వేల కోట్ల డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేస్తానమ్మా. అంతేకాదు వడ్డీ లేని రుణాలిస్తాను. ఆ మహానేత కలలు కన్నట్టుగా ప్రతీ మహిళను లక్షాధికారిని చేస్తా. మీరంతా నిశ్చింతగా సంతోషంగా ఉండండి.. అదే నాక్కావాల్సింది’ అని జగన్ వారికి ధైర్యం చెప్పారు.
 
 వికలాంగులకు రూ.వెయ్యి పింఛను
 
 రోడ్ షో సాగుతుండగా.. ఎస్సీ కాలనీకి చెందిన ముమ్మిడివరపు నాగమణి అనే రెండు చేతులు, కాళ్లూ లేని వికలాంగురాలిని క్వాన్వాయ్‌పై నుంచే చూసిన జగన్ వాహనం దిగి ఆమె దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరిం చారు. కనీసం రెండు చేతులూ ఎత్తి నమస్కరించలేకపోతున్నానంటూ ఆమె విలపించడంతో జగన్ చలించిపోయారు. ‘అన్నా.. మీ నాన్న గారి దయ వల్ల మాకు రూ.500పింఛన్ వస్తోంది.. అయితే అది ఏమూలకూ సరిపోవడం లేదన్నా’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. మరో రెండు నెలల్లో రాజన్న కలలుగన్న మన ప్రభుత్వం రాగానే మీ పింఛన్‌ను వెయ్యి రూపాయలకు పెంచుతానమ్మా అంటూ జగన్ చెప్పడంతో ఆమె ఉబ్బితబ్బిబ్బయింది.
 
 అందరికీ ధైర్యం చెబుతూ..
 
 ఎస్సీ కాలనీలోనే.. నిమ్మన మంగరాజు అనే వృద్ధుడు ఇంటి మెట్ల వద్ద వేచి చూస్తుం డడాన్ని గమనించిన జగన్ వాహనం దిగి ఆయన వద్దకు వెళ్లి మాట్లాడారు. ఆయన బాగోలు అడిగి తెలుసుకున్నారు. మార్గమధ్యంలో కలిసిన పలువురు వృద్ధులు పింఛను డబ్బులు సరిపోవడం లేదని చెప్పగా.. తమ ప్రభుత్వం రాగానే రూ.200 పింఛన్‌ను రూ.700 చేస్తామని భరోసా ఇచ్చారు. రామాలయంసెంటర్‌లో జగన్‌ను కలిసిన పలివెల జయసుశీల అనే మహిళ.. తనకొడుకు పలివెల వెంకన్నకు రెండు కాళ్లూ లేవని, ఏమీచేయలేని స్థితిలో ఇంటిలోనే ఉంటున్నాడని బోరున విలపించింది. ఆమె కన్నీరును తుడిచిన జగన్.. మన ప్రభుత్వం రాగానే ఆదుకుంటానని చెప్పారు.
 
 వైద్యం చేయించుకోలేకపోతున్నా.. ఆదుకోండి..
 

 రాజారత్న రోడ్‌లో వేమగిరి లోవమ్మ అనే మహిళ జగన్‌ను కలిసి.. గతంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒళ్లంతా కాలిపోయిందని, భర్త రిక్షా కార్మికుడు కావడం తో ఆర్థిక స్థోమతలేక వైద్యం చేయించుకోలేకపోతున్నానంటూ వాపోయింది. ముఖమంతా కాలిపోయి మాట్లాడేందుకు సైతం ఇబ్బందిపడుతున్న ఆమెను దగ్గరకు తీసుకొని ఓదార్చిన జగన్ ‘త్వరలోనే మన ప్రభుత్వం వస్తుంది.. తప్పకుండా మీ కష్టాలు తీరుస్తా’నని ధైర్యం చెప్పారు. అలాగే పూరిగుడిసెలో ఉంటున్న అన్నందేవుల పాపమ్మ వద్దకు వెళ్లిన జగన్ వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, రాజన్న రాజ్యంలో పింఛన్ పెంచుతామంటూ హామీ ఇచ్చారు.
 
 విజయమ్మగా నామకరణం..
 
 న్యూకాలనీలో వారా సూర్యచంద్రశేఖర్, చిన్నారి దంపతులు తమ మొదటి సంతానమైన మూడు నెలల పసికందును తీసుకొచ్చి పేరు పెట్టి ఆశీర్వదించాలని జగన్‌ను కోరారు. ఆ చిన్నారిని చేతిలోకి తీసుకొని జగన్ ముద్దాడి విజయమ్మగా నామకరణం చేశారు. వెన్నెముక దెబ్బతిని మంచాన పడ్డ టేకి కుమారస్వామి ఇంటికి వెళ్లి జగన్ పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. తనకు ఇద్దరు కుమార్తెలను పోషించడం చాలా ఇబ్బందిగా ఉందని, వారిద్దరికీ పెళ్లిళ్లు ఎలా చేయాలోనంటూ కన్నీటిపర్యంతమయ్యారు. సూర్యచంద్రా పేపర్‌మిల్లు నుంచి ఎటువంటి పరిహారం అందలేదని చెప్పగా, మీకు కాబోయే ఎమ్మెల్యే గిరజాల వెంకటస్వామినాయుడు అన్ని విధాలా సాయమందిస్తారని చెప్పారు. పరిహారం సమస్యను పరిష్కరించాలని జగన్ ఆయనకు సూచించారు.
 
 పార్టీలో చేరికలు..
 

 జగన్ సమక్షంలో విశాఖ జిల్లా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, కామత్‌రాజు, బిఎన్ పాత్రుడు, జహీరాబాద్‌కు చెందిన మొయిద్దీన్ పార్టీలో చేరారు. వారికి జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రోడ్ షోలో అమలాపురం పార్లమెంటు అభ్యర్థి, ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్, మండపేట కోఆర్డినేటర్ గిరజాల వెంకటస్వామి నాయుడు,  మండపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: