వైఎస్సార్ కాంగ్రెస్ను గెలిపించుకుందాం.. కేంద్రంలో ప్రధానిని మనమే నిర్ణయిద్దాం
అవసరమైతే కేంద్రం మెడలు వంచి.. సీమాంధ్ర అభివృద్ధికి నిధులు తెచ్చుకుందాం
పదవులు వద్దనుకుని ఇచ్చిన మాటకు నిలబడిన నాయకుడు జగన్..
చంద్రబాబు భరోసాతోనే కాంగ్రెస్ రాష్ట్రాన్ని రెండుగా చీల్చింది
సమైక్యం కోసం పోరాడింది వైఎస్సార్ సీపీయే
వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేటలలో షర్మిల బహిరంగ సభలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘‘రాబోయే రోజుల్లో జగనన్న పాలనలో మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును మన చేతులతో మనమే నిర్మించుకుందాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మీరిచ్చే విజయంతో కేంద్రంలో ప్రధానిని మనమే నిర్ణయిద్దాం.. అవసరమైతే కేంద్రం మెడలు వంచి సీమాంధ్ర అభివృద్ధికి అవసరమైనవన్నీ సాధించుకుందాం. జగనన్న నాయకత్వంలో కొత్త రాష్ర్టంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుదాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లూ ప్రజలకు ఏమీ చేయని చంద్రబాబు.. ఇప్పుడు ఆల్ ఫ్రీ అంటూ ప్రజల్ని మోసం చేయడానికి వస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేటలలో నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’ బహిరంగ సభల్లో షర్మిల ఉద్వేగంగా మాట్లాడారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..
మీ కష్టాలు చూసి తన కష్టాలు మరచిపోయాడు..
- మీరు ఒక్క అవకాశం ఇస్తే జగనన్న మీ కోసం తన జీవితాన్నే ధారపోయడానికి సిద్ధంగా ఉన్నాడు. జగనన్నకు మీరు, మీ సంతోషం, మీ ముఖాన చిరునవ్వు ముఖ్యం. ఐదేళ్లుగా జగనన్న మీ కష్టాలు చూసి తన కష్టాలు మరిచిపోయాడు. మీ అభిమానాన్ని చూసి తనకు జరిగిన అవమానాన్ని మరిచిపోయాడు. పదవులు వద్దనుకుని విలువలు, విశ్వసనీయతకు కట్టుబడ్డాడు. మీరూ ఐదేళ్లుగా చూశారు.. ప్రతి రోజూ ఎండనక, వాననక, చీకటనక జగనన్న జనంలోనే ఉన్నాడు. అట్లాంటి నాయకుడిని సీఎం చేసుకుందాం. మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకుందాం.
- జగనన్న సీఎం కాగానే.. రైతులకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాడు. రైతులు, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతోపాటు డ్వాక్రా మహిళా సంఘాల రుణాలు రద్దు చేస్తాడు. ఆరోగ్యశ్రీని అద్భుతంగా అమలు చేస్తాడు. సంక్షేమ, అభివృద్ధి పథకాలు బ్రహ్మాండంగా అమలు చేసి మళ్లీ రాజన్న రాజ్యం తెస్తాడు.
ఓటేసే ముందు వైఎస్ను తలచుకోండి
- ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ప్రజలు ఓటేసే ముందు రాష్ర్టంలో సువర్ణపాలన అందించి అభివృద్ధి, సంక్షేమ రంగాలను సమర్థంగా అమలు చేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని ఒక్క సారి గుర్తు చేసుకోండి.
- రాష్ర్టంలో ఏ రైతూ బాధపడకూడదనే ఉద్దేశంతో వైఎస్ కోటి ఎకరాలకు సాగునీరు అందించడానికి జలయజ్ఞం రూపొందించి, దాన్ని పూర్తి చేయడానికి శక్తి వంచన లేకుండా పనిచేశారు. రైతులకు పెట్టుబడి ధర తగ్గేలా చేసి మద్దతు ధర పెంచారు. వ్యవసాయానికి ఏడు గంటల ఉచిత విద్యుత్ ఇస్తానని మాట ఇచ్చారు. మగాడిలాగా మాట మీద నిలబడి చూపించారు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, నష్టపరిహారం... ఇలా రైతు ఏది కావాలంటే అది ఇచ్చారు. ఒకసారి రైతులకు రుణాల మీద వడ్డీలు మాఫీ చేశారు. ఇంకోసారి రైతులకు రుణ మాఫీ చేశారు.
- చంద్రబాబు నాయుడు రైతులకు, మహిళలకు రూపాయి వడ్డీకి రుణాలిస్తే, వైఎస్ సీఎం అవగానే వీరికి పావలా వడ్డీకి రుణాలిచ్చారు. అంతవరకు ఏనాడూ బ్యాంకు ముఖం చూడని లక్షలాది మంది మహిళలు రుణాలు తీసుకుని చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా స్థిరపడిన రోజులవి.
- డబ్బులేని కారణంగా ఏ ఒక్కరి చదువు ఆగిపోకూడదని, ప్రతి పేద కుటుంబంలోనూ విద్యార్థులు ఏది కావాలనుకుంటే అది ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుందనే భరోసా వైఎస్ కల్పించారు. అందువల్లే రాష్ట్రంలో లక్షల మంది పేదలు పెద్ద చదువులు చదివి లక్షణంగా ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.
- చంద్రబాబు వృద్ధులకు, వితంతువులకు రూ.75, వికలాంగులకు రూ.200 పింఛన్ ఇస్తే, రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక వృద్ధులకు, వితంతువులకు రూ.200, వికలాంగులకు రూ.500 పింఛన్ ఇచ్చారు. చంద్రబాబు 16 లక్షల మందికి పింఛన్లు ఇస్తే రాజశేఖరరెడ్డి 71 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారు.
- చంద్రబాబు కిలో రూ.2 బియ్యాన్ని రూ.5.25 చేస్తే రాష్ర్టంలో ప్రతి ఒక్కరూ రెండు పూటలా భోజనం చేయాలనే లక్ష్యంతో బియ్యం ధరను మళ్లీ రూ.2 చేశారు రాజశేఖరరెడ్డి. దేశంలో ఐదేళ్లలో 47 లక్షల పక్కా ఇళ్లు కట్టి చూపిస్తే, వైఎస్ ఒక్క రాష్ర్టంలోనే ఐదేళ్లలో 47 లక్షల ఇళ్లు కట్టి చూపించారు.
- ఆరోగ్య శ్రీ, 108, 104, అభయహస్తం, ఉపాధి హామీ లాంటి ఏ పథకాలు తీసుకున్నా వైఎస్ అద్భుతంగా అమలు చేసి చూపించారు. వైఎస్ ఏనాడూ ఒక్క రూపాయి చార్జీ, పన్ను పెంచలేదు.
కిరణ్ రాక మన దురదృష్టం..
మన దురదృష్టం కొద్దీ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ప్రజలకు నీళ్లివ్వలేదు. కొత్త ఇళ్లివ్వలేదు. రేషన్ కార్డు ఇవ్వలేదు. విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇవ్వలేదు. రైతులకు మద్దతు ధర ఇవ్వలేదు. సొంతంగా ఏ ప్రాజెక్టూ పూర్తి చేయలేదు. ప్రజల మీద పన్నులు వేసి, చార్జీలు పెంచి సంక్షేమానికి పాతర వేసి, అభివృద్ధిని అటకెక్కించారు.
బాబు లేఖతోనే రాష్ట్ర విభజన
- రాష్ట్రాన్ని కొబ్బరి చిప్పల్లా విభజించుకోవాలని చంద్రబాబు ఇచ్చిన లేఖతోనే కాంగ్రెస్ సాహసం చేసింది. లేఖ వెనక్కు తీసుకోమంటే బాబు తీసుకోలేదు. విభజన నుంచి కాంగ్రెస్ వెనక్కు తగ్గలేదు.
- సమైక్య రాష్ర్టం కోసం చివరి వరకు పోరాడింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే. విజయమ్మ, జగన్తో పాటు, సీమాంధ్రకు చెందిన 175 నియోజక వర్గాల సమన్వయకర్తలు సమైక్య రాష్ర్టం కోసం ధర్నాలు చేశారు. దీక్షలు చేశారు. పదవుల్లో వున్న వారు వారి పదవులకు రాజీనామా చేశారు.
0 comments:
Post a Comment