సాక్షి ప్రతినిధి, అనంతపురం : వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం నాటి జిల్లా పర్యటనలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ నెల 16న ఆమె కదిరి నుంచి ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించిన విషయం విదితమే. మంగళవారం కళ్యాణదుర్గం, రాయదుర్గంలో పర్యటించిన వైఎస్ విజయమ్మ.. బుధవారం గుంతకల్లు నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకే సూర్యుడు కన్నెర్ర చేశాడు. సూర్యుడితో జనం పోటీ పడ్డారు.
ఎండవేడిమి పెరిగే కొద్దీ జనం కూడా రెట్టింపవుతూ వచ్చారు. గుంతకల్లులో వైఎస్ విజయమ్మ నిర్వహించిన రోడ్షోకు అడగడుగునా జనం నీరాజనం పలికారు. హనుమాన్ సర్కిల్ నుంచి బస్టాండ్ సర్కిల్ వరకూ విజయమ్మ నిర్వహించిన రోడ్షోకు జనం పోటెత్తారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన మైనార్టీ వర్గానికి చెందిన మహిళలు విజయమ్మకు మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ బస్టాండు సర్కిల్లో నిర్వహించిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ చేసిన ప్రసంగానికి మంచి స్పందన లభించింది. ఫీజు రీయింబర్స్మెంట్తో పేద విద్యార్థులను ఇంజనీర్లుగానూ, డాక్టర్లుగానూ వైఎస్ తీర్చిదిద్దితే.. సత్యం రామలింగరాజు అందించిన ముడుపుల మూటతో చంద్రబాబు తన కుమారుడికి ఫీజు రీయింబర్స్మెంట్ పొందారంటూ వైఎస్ విజయమ్మ సంధించిన విమర్శనాస్త్రానికి యువత నుంచి మంచి స్పందన లభించింది.
డ్వాక్రా మహిళలు చంద్రబాబు పాలనలో మైక్రో ఫైనాన్స్ సంస్థల బారిన పడి ఆత్మహత్యలు చేసుకుంటే.. వైఎస్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక పావలా వడ్డీకే రుణాలు ఇప్పించి లక్షాధికారులను చేసేందుకు యత్నించిన తీరును వైఎస్ విజయమ్మ వివరించినప్పుడు మహిళల నుంచి మంచి స్పందన లభించింది. గుంతకల్లులో జనసంద్రం పోటెత్తడంతో గుత్తికి షెడ్యూలు సమయంకన్నా 2.30 గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకున్నారు. విజయమ్మ చేరుకునే సరికే గుత్తిలో ఆర్టీసీ బస్డాండ్ సర్కిల్ జనంతో కిక్కిరిసిపోయింది. అక్కడ పోటెత్తిన జనసంద్రాన్ని ఉద్దేశించి వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ పంట రుణాలు మాఫీ చేస్తానంటూ చంద్రబాబు ఇస్తోన్న హామీలో అధికార కాంక్ష తప్ప.. చిత్తశుద్ధి కన్పించడం లేదని వైఎస్ విజయమ్మ చెప్పినప్పుడు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. బహిరంగసభ ముగిసిన తర్వాత గుత్తి ఆర్ఎస్ వరకూ నిర్వహించిన రోడ్షోకు జనం పోటెత్తారు. గుత్తి ఆర్ఎస్లో రోడ్షోను ముగించుకున్న ఆమె పామిడికి చేరుకునే సరికి రాత్రి 7 గంటలైంది.
అప్పటికే పామిడి వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. అంబేద్కర్ సర్కిల్లో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ విజయమ్మ మాట్లాడారు. బహిరంగసభ అనంతరం పామిడిలో నిర్వహించిన రోడ్షోకు మహిళలు అధిక సంఖ్యలో హాజరై.. సంఘీభావం ప్రకటించారు. గుంతకల్లు నియోజకవర్గంలోని గుంతకల్లు మున్సిపాల్టీ, గుత్తి, పామిడి నగర పంచాయతీల్లో వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారానికి భారీ స్థాయిలో జనస్పందన లభించడం ప్రత్యర్థి పార్టీల నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది
0 comments:
Post a Comment