కేవలం తన కుటుంబ సభ్యులకు మాత్రమే టికెట్లు ఇప్పించి, ఒక రకంగా విజయనగరం జిల్లా మొత్తమ్మీద తన కుటుంబ ఆధిపత్యాన్ని చాటాలన్న తపన బొత్స సత్యనారాయణకు చాలా రోజుల నుంచే ఉంది. జడ్పీ చైర్ పర్సన్ గా పనిచేస్తున్న ఆయన భార్య ఝాన్సీ లక్ష్మిని ఎంపీ పదవికి పోటీ చేయించాలని కాంగ్రెస్ పెద్దలు ఆదేశిస్తే, మళ్లీ జడ్పీ పదవిని తన కుటుంబానికే ఇవ్వాలన్న షరతుతో అప్పట్లో బొత్స అంగీకరించారు. అలాగే, చీపురుపల్లి స్థానాన్ని తనకు తానుగా ఇచ్చిన మీసాల నీలకంఠం నాయుడితో ఎచ్చెర్ల కూడా ఖాళీ చేయించారు. ఒకరకంగా ఆయనను అవమానించి, ఈసారికి పోటీ నుంచి తప్పిద్దామనుకున్న బొత్సకు.. నీలకంఠం నాయుడు గట్టి షాకే ఇచ్చారు.
పోటీ మాత్రమే విరమించుకుంటారనుకున్న నాయుడు ఏకంగా పార్టీనే వీడిపోవడంతో బొత్స తీవ్ర ఆందోళన చెందారు. కోల్పోతున్న పట్టును నిలబెట్టుకోడానికి తీవ్ర ప్రయత్నాలే చేశారు. నాయకులు పార్టీని వదిలి వెళ్లిపోతున్న విషయాన్ని తెలుసుకుని తెర వెనుక చాలా మంత్రాంగం నడిపారు. అటు మీసాల నీలకంఠంనాయుడిని, ఇటు బెల్లాన చంద్రశేఖర్, ఆయన అనుచరుల్ని నియంత్రించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నించారు. పిలిచి మాట్లాడారు. బంధుత్వం కలిపి ఒత్తిడి చేశారు. ఫోన్లు చేసి ప్రాధేయపడ్డారు. రకరకాలుగా ప్రలోభ పెట్టారు. అయినా ఫలితం లేకపోయింది. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను హుటాహుటిన చీపురుపల్లికి చేరుకుని, ప్రత్యేకంగా ఓ ఇల్లు తీసుకున్నారు. ఇక్కడే మకాం పెడతానని, అన్ని వేళలా అందుబాటులో ఉంటానని, బొత్స సత్యనారాయణ ఇక్కడే పోటీ చేస్తారని నేతలతో ప్రెస్ మీట్ పెట్టి చెప్పించారు. వదిలి వెళ్లిన నేతలంతా తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు. దానికీ ఏమాత్రం స్పందన కనిపించలేదు.
0 comments:
Post a Comment