సాక్షి ప్రతినిధి, కడప: జగన్ గెలుపు ప్రజల గెలుపని, వైఎస్ రాజశేఖరరెడ్డి నాటి సువర్ణ యుగం జగన్బాబుతోనే సాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. వైఎస్సార్ జిల్లాలో గురువారం రెండోరోజు కడప, మైదుకూరు, బద్వేల్, సిద్దవటంలలో విజయమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయూ ప్రాంతాల్లో జరిగిన సభల్లో ఆమె మాట్లాడారు. గత నాలుగున్నరేళ్లుగా మనం పడుతున్న కష్టాలకు చరమగీతం పాడే రోజు అతిచేరువలో ఉందని చెప్పారు. ప్రజల కోసం నాలుగున్నరేళ్లుగా పోరాటం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిలో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిలో ఉన్న పట్టుదల, నాయకత్వ లక్షణాలు, ప్రజల పట్ల ఆపేక్ష ఉన్నాయని ఆమె తెలిపారు. అందుకే పేద పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుడుతున్నారని చెప్పారు. వృద్ధులకిచ్చే రూ.200 పింఛన్ను రూ.700 చే సేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రైతులకు గిట్టుబాటు ధరల కోసం రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి నెలకొల్పేందుకు, డ్వాక్రా మహిళలకు అండగా నిలిచేందుకు రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేసేందుకు జగన్ కృతనిశ్చయంతో ఉన్నట్లు విజయమ్మ తెలిపారు. తండ్రి లాగా ప్రజల కోసం అన్నీ తానై చేయాలనే తలంపుతో గుడిసెలేని ఆంధ్రప్రదేశ్ను చూడాలనే లక్ష్యంతో ఏడాదికి 10 లక్షల ఇళ్లు నిర్మించనున్నారని చెప్పారు.
చంద్రబాబు చీకటి పాలనలో..
‘తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాలు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు.. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర ప్రజానీకం మొత్తం అనేక అవస్థలు పడింది. ప్రజా సంక్షేమంతో సంబంధం లేదన్నట్లు పూర్తి నియంతృత్వంతో వ్యవహరించారు’ అని విజయమ్మ విమర్శించారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ ప్రజల్ని హీనంగా చూసిన చంద్రబాబు.. మరోమారు అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు.
0 comments:
Post a Comment