షర్మిల జనభేరి యాత్ర శుక్రవారం ఉదయం పది గంటలకు కనిగిరి నుంచి ప్రారంభమైంది. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ముక్కుకాశిరెడ్డి ఆమెకు వీడ్కోలు పలకగా..అక్కడ నుంచి గిద్దలూరు చేరుకున్నారు. ఆమెకు దారిపొడవునా అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆమె వెంట వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. గిద్దలూరులో షర్మిల ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి వైఖరిని ఎండగట్టారు. బాబు తొమ్మిదేళ్ల పాలనలో విసిగిపోయిన ప్రజలు ఆయన్ను ఓడించారని తెలిపారు. వైఎస్సార్ చేపట్టిన పథకాలను గుర్తుచేశారు.
మున్సిపాలిటీలతో పాటు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు ఓటువేయాలని కోరారు. గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ముత్తుముల అశోక్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి వెంకటసుబ్బమ్మలను ప్రజలకు పరిచయం చేశారు. అశోక్రెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు పార్టీ సర్వసన్నద్ధంగా ఉందన్నారు. దివంగత నేత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని తెలిపారు.
ఆయన మరణించి ఐదేళ్లు దాటుతున్నా ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేకపోతున్నారన్నారు. మున్సిపల్ నుంచి శాసనసభ ఎన్నికల వరకు అన్నింటా కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. బడుగు, బలహీనవర్గాల వారికి అండగా నిలబడేది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, దర్శి, గిద్దలూరు సమన్వయకర్తలు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, వై వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు రంగారెడ్డి, భాస్కర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి తదితరులతో పాటు, గిద్దలూరు పరిసర ప్రాంతాల్లోని మండలాల కన్వీనర్లు, నాయకులు పాల్గొన్నారు.
మార్కాపురంలో పోటెత్తిన అభిమానం..
మార్కాపురంలో పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభకు జనం పోటెత్తారు. దాదాపు అరగంటపాటు సాగిన షర్మిల ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు జంకె వెంకటరెడ్డి, వెన్నా హనుమారెడ్డి, ఉడుముల శ్రీనివాసులురెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి డాక్టర్ కనకదుర్గ ఇతర మున్సిపల్ వార్డు అభ్యర్థులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
షర్మిల మార్కాపురంలో సభ ముగించుకుని, త్రిపురాంతకం మీదుగా గుంటూరు జిల్లా వినుకొండకు బయలుదేరారు. మార్గ మధ్యంలో అడుగడుగునా ఆమెకు ఘన స్వాగతం లభించింది. చిన్న పిల్లలను ముద్దాడుతూ, ఆశీర్వదించేందుకు వచ్చిన ముసలివారిని అక్కున చేర్చుకుంటూ షర్మిల పర్యటన సాగింది.
0 comments:
Post a Comment