విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్ చెప్పారు. ఆదివారం ఉదయం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన ఆయన హైదరాబాద్ నుంచి నగరానికి రోడ్డుమార్గంలో వచ్చారు. గరికపాడు నుంచి విజయవాడ వరకు భారీ బైక్, కార్ల ర్యాలీతో ఆయన్ను నేతలు, అభిమానులు స్వాగతించారు.
విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఆదివారం ఉదయం హైదరాబాద్లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన కోనేరుకు జిల్లాలో ఘనస్వాగతం లభించింది. జగ్గయ్యపేట నియోజకవర్గం గరికపాడు వద్ద నుంచి విజయవాడ వరకూ భారీ బైక్, కార్ల ర్యాలీ నిర్వహించారు. జగ్గయ్యపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను స్వాగతం పలికారు. గరికపాడు, తక్కెళ్లపాడు, అనుమంచిపల్లి, షేర్మహమ్మద్పేట గ్రామాల మీదుగా జగ్గయ్యపేట వర కు బైక్, కార్ల ర్యాలీని కార్యకర్తలు నిర్వహించారు. జగ్గయ్యపేటలో ర్యాలీకి అపూర్వ స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయన పలుచోట్ల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధి తన వల్లనే సాధ్యమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తనను పార్లమెంట్ అభ్యర్థిగా పంపించారన్నారు. ఇక్కడ ఎంతమంది ఎంపీలు పనిచేసినా, ఆశించిన అభివృద్ధి చేయలేక పోయారన్నారు. ప్రజలందరి అభీష్టం మేరకే రాజకీయల్లోకి రావడం జరిగిందని, అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని స్పష్టం చేశారు. జగ్గయ్యపేట నుంచి నందిగామ నియోజకవర్గం మునగచర్ల వద్దకు రాగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. అక్కడ నుంచి ర్యాలీ అంబారుపేట చేరుకుని సత్యమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు వసంత నాగేశ్వరరావు గృహంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. కంచికచర్లలోని శ్రీ శివసాయిక్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. క్షేత్ర వ్యవస్థాపకుడు, స్థానిక సర్పంచ్ గద్దె ప్రసాద్ ఆధ్వర్యంలో కోనేరుకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఇబ్రహీంపట్నం రింగుసెంటర్ వద్ద పార్టీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు ఎదురేగి స్వాగతం పలికారు. జోగి రమేష్ పుష్పగుచ్ఛం సమర్పించి పార్టీలో చేరిన కోనేరు రాజేంద్రప్రసాద్కు శుభాకాంక్షలు తెలిపారు.
నగరంలో...
విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్కు చేరుకోగా నగర అధ్యక్షుడు జలీల్ఖాన్, విజయవాడ తూర్పు, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తలు వంగవీటి రాధాకృష్ణ, పి.గౌతంరెడ్డి స్వాగతం పలికారు. భవానీపురం, బ్యాంక్ సెంటర్, కుమ్మరిపాలెం సెంటర్, రథం సెంటర్, వినాయకుడి గుడి వద్ద కార్యకర్తలు స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడ పార్టీ కార్యాలయానికి చేరుకుని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడ తిరువూరు సమన్వయకర్త రక్షణనిధితోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు కోనేరును అభినందించారు. జిల్లా ప్రచార కార్యదర్శి సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, మాజీ మేయర్ తాడి శకుంతల, పలువురు మాజీ కార్పొరేటర్లు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
0 comments:
Post a Comment