వైఎస్సార్‌సీపీలోకి ఇద్దరు ఎమ్మెల్సీలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీలోకి ఇద్దరు ఎమ్మెల్సీలు

వైఎస్సార్‌సీపీలోకి ఇద్దరు ఎమ్మెల్సీలు

Written By news on Saturday, April 12, 2014 | 4/12/2014


*  పార్టీలో చేరిన విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య
 * మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ జయచంద్రనాయుడు కూడా

 
 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఓ మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేతో పాటు విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
 
 విజయనగరం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, లావు రత్తయ్య, చిత్తూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ కె.జయచంద్రనాయుడు, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణలు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో వేర్వేరు సందర్భాల్లో కలిసి పార్టీలో చేరారు. వారికి జగన్ పార్టీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు, విజయనగరం జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
 
 జగన్ సారథ్యంలోనే సీమాంధ్ర అభివృద్ధి : కోలగట్ల
 జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోనే సీమాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కోలగట్ల వీరభద్రస్వామి చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయడం ఒక్క జగన్‌కే సాధ్యమన్నారు.

రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఇది తేటతెల్లమైందని చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటేయాలని ప్రజల దగ్గరకు వెళ్లినప్పుడు ‘మీరు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరితే బాగుంటుంది’ అని సూచించారని, తమ కార్యకర్తల అభిప్రాయం కూడా ఇదేనని తెలిపారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడమో లేదా తన కుటుంబీకుల్లో ఒకరిని రంగంలోకి దించడమో చేస్తానన్నారు. తన సోదరుడు తమ్మన్న శెట్టి కూడా పోటీ చేసే అవకాశం ఉందని, అయితే అది జగన్ నిర్ణయాన్నిబట్టే ఉంటుందని చెప్పారు.
 
 ఉద్యోగులకు మంచి పీఆర్‌సీ ఇస్తానన్నారు : గాదె
 ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మంచి పీఆర్సీ ఇస్తానని జగన్‌మోహన్‌రెడ్డి వాగ్దానం చేశారని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆయన తండ్రి వైఎస్ మాదిరిగానే స్నేహపూర్వకంగా వ్యవహరిస్తానని జగన్ తనతో చెప్పారన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించేందుకు కృషి చేస్తానన్నారని తెలిపారు.
 
 
 ఉపాధ్యాయులు, ఉద్యోగుల డిమాండ్లపై ఓ వినతిపత్రాన్ని జగన్‌కు సమర్పించానని, ‘అన్నీ ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తాను శీనన్నా..’ అని ఆప్యాయంగా హామీ ఇచ్చారని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలతో ఎంతో సన్నిహితంగా ఉండేవారని, తమకు ఇచ్చిన హామీలన్నింటినీ ఆయన నెరవేర్చారని గాదె తెలిపారు. జగన్ కూడా అదే విధంగా చేస్తారని తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.
 
 బాబు ఒంట్లో 50 శాతం కాంగ్రెస్ రక్తమే : రత్తయ్య
 తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఒంట్లో ప్రవహిస్తున్న రక్తంలో 50 శాతం కాంగ్రెస్‌దని, మరో 30 శాతం బీజేపీదైతే మిగతా 20 శాతమే టీడీపీదని విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య విమర్శించారు. టీడీపీ ప్రస్తుతం సహజత్వాన్ని కోల్పోయిందని చెప్పారు. వైఎస్సార్‌సీపీలో చేరిన అనంతరం ఆయన సీజీసీ సభ్యురాలు లక్ష్మీపార్వతితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్న చివరి దశలో తానేమీ టికెట్ ఆశించి పార్టీలో చేరలేదని, పార్టీకి అన్ని విధాలా మద్దతు తెలిపేందుకే వచ్చానని చెప్పారు.
 

 సీమాంధ్రకు దృఢమైన నాయకత్వం కావాలని, అది ఒక్క జగన్‌కే సాధ్యమని చెప్పారు. విద్య, వైద్యం, పారిశ్రామికాభివృద్ధి, విద్యార్థులకు ఉపకార వేతనాలు, వసతి, దుస్తులు, పుస్తకాలు, ఆరోగ్య పరిరక్షణ వంటి సంక్షేమ పథకాలు జగన్ ఒక్కరి వల్లే సాధ్యమవుతాయన్నారు. ప్రజల ఆకాంక్షను జగన్ నెరవేరుస్తారని తెలిపారు. తానూ సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నానని చెప్పారు. టీడీపీలో టికెట్ రాకపోవడం వల్లే వైఎస్సార్ సీపీలో చేరారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘నన్ను టీడీపీ వాళ్లు నాలుగుసార్లు పిలిచారు. నేను ఒక్కసారే వెళ్లాను. ఎన్టీఆర్‌తో నాకు చాలా అనుబంధం ఉంది. ఇప్పుడు కూడా టికెట్ కోసం నేను వైఎస్సార్‌సీపీలోకి రాలేదు’’ అని చెప్పారు.
 
 మాటకు కట్టుబడే వ్యక్తి జగన్:ఘంటా మురళీరామకృష్ణ
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి అని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే, నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఘంటా మురళీ రామకృష్ణ కొనియాడారు. వైఎస్‌లాగే జగన్ అన్ని రకాల సంక్షేమ పథకాలు కొనసాగిస్తారన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్‌తో వచ్చి లోటస్‌పాండ్‌లో జగన్ సమక్షంలో తాను పార్టీలో చేరినట్టు తెలిపారు. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.
 
 బాబు పాలనలో రాష్ట్రం వెనక్కు వెళ్లింది: లక్ష్మీపార్వతి
 చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్ర పరిస్థితి ఎంతో దిగజారిపోయిందని లక్ష్మీపార్వతి ఆరోపించారు. అప్పటివరకూ రూ.3 వేల కోట్ల అప్పుంటే, చంద్రబాబు దానిని రూ.36 వేల కోట్లకు తీసుకువెళ్లారన్నారు. కళాశాలల్లో పేదలు చదువుకోనీయకుండా చేశారని, మద్యపాన నిషేధం ఎత్తేశారని దుయ్యబట్టారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని జగన్ నివాసం వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు.  బాబు హయాంలో ప్రభుత్వ సంస్థలు మూతపడ్డాయని, విద్యుత్ సమస్యలూ ఎక్కువయ్యాయన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని, వైఎస్సార్‌సీపీ తరపున ప్రచారం చేస్తానని తెలిపారు. రాష్ట్రానికి ప్రస్తుతం కొత్త నాయకత్వం కావాలని, అది జగన్‌కే సాధ్యమన్నారు.
Share this article :

0 comments: