- ఎన్నికపై నెలకొన్న సస్పెన్స్కు తెర
- ఆమె గెలిస్తే ఉప ఎన్నిక నిర్వహణ
- ఈసీ నిర్ణయంతో అభిమానులకు ఊరటకుదుటపడిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆపదలో కొండంత అండ. ఎలాంటి సమయంలోనైనా నేనున్నాననే భరోసా. పార్టీలకు అతీతంగా.. వర్గాలకు తావివ్వక చిరునవ్వుతో ప్రజల హృదయాలను గెలిచిన శోభమ్మ మృతి జిల్లా ప్రజలను కలచివేసింది. ముఖ్యంగా ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గ ప్రజలకు తీరని దుఃఖం మిగిల్చింది. ఇక గెలుపు లాంఛనమేనన్న పరిస్థితుల్లో ఆమె అకాలమరణంతో ఎన్నో ప్రశ్నలు తెరపైకొచ్చాయి.
ఈవీఎంలలో ఆమె పేరును తొలగిస్తారని.. ఓటు వేసినా చెల్లదని.. గెలిచినా పరిగణనలోకి తీసుకోరనే ప్రచారం గందరగోళానికి తావిచ్చింది. ఎట్టకేలకు ఈ సస్పెన్స్కు ఎన్నికల కమిషన్ తెరదించింది. శోభా నాగిరెడ్డికి వేసే ఓట్లు చెల్లుబాటు అవుతాయని.. ఒకవేళ ఆమె గెలిస్తే ఉప ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం పట్ల ఆమె అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆళ్లగడ్డ అసెంబ్లీ బరిలో నిలిచిన శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఈనెల 24న మరణించిన విషయం తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఎన్నిక నిర్వహణపై ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం. ఆడపడచులా భావించిన నియోజకవర్గ ప్రజలు ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆదివారం ఎన్నికల అధికారి భన్వర్లాల్ ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డికి ఓటేస్తే చెల్లదని ప్రకటించారు.
పారదర్శక పాలనతో తనకంటూ ప్రత్యేకతను సొంతం చేసుకున్న ఆమెకు ఓటుతో నివాళి అర్పించాలనుకున్న ప్రజలకు ఆ ప్రకటన ఆశ్చర్యం కలిగించింది. దీంతో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి.. జిల్లా కలెక్టర్, జేసీలతో సంప్రదింపులు జరిపారు. అదేవిధంగా సోమవారం ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ అధికారులతో మాట్లాడి ఆళ్లగడ్డ ఎన్నికపై స్పష్టత కోరారు.
ఆర్టికల్ 52 ఆర్పీ యాక్ట్ 1951 ప్రకారం ఆళ్లగడ్డ ఎన్నికకు ఎలాంటి అభ్యంతరం లేదని.. మెజార్టీ ప్రజలు ఎవరికి అధికంగా ఓట్లు వేస్తారో వారినే ఎమ్మెల్యేగా ప్రకటిస్తామని వారు స్పష్టం చేశారు. అయితే గెలిచిన అభ్యర్థి అప్పటికే మృతి చెందినట్లయితే ఉప ఎన్నిక నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. ఎట్టకేలకు నిర్ణయం వెలువడటంతో ఊపిరి పీల్చుకున్న అధికారయంత్రాంగం సోమవారం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై బ్యాలెట్ యూనిట్ను అమర్చే కార్యక్రమం పూర్తి చేశారు.
- ఆళ్లగడ్డలో సంతాప సభ
- ఉద్వేగంతో ప్రసంగించిన భూమా నాగిరెడ్డి
ఆళ్లగడ్డ న్యూస్లైన్: జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి శోభమ్మ చివరి కోరికను నెరవేరుద్దామని నంద్యాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. ఆళ్లగడ్డ పట్టణంలోని శోభమ్మ ఘాట్లో సోమవారం శోభానాగిరెడ్డి సంతాపసభ వేలాది మంది కార్యకర్తల మధ్య జరిగింది. శోభా నాగిరెడ్డికి ఓటు వేస్తే చెల్లుతుందని కేంద్ర ఎన్నికల సంఘం సమావేశానికి గంట ముందు ప్రకటించడంతో కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపింది.
ఆమె చిత్రపటానికి నివాళ్లు అర్పించి ఆత్మశాంతి కోసం అందరూ ఒక్క నిమిషం మౌనం పాటించారు. అనంతరం సభలో భూమా ఉద్వేగంతో మాట్లాడారు. ‘శోభానాగిరెడ్డికి ఓటు వేస్తే చెల్లదని రెండు రోజుల క్రితం తెలిసినప్పుడు నాతో పాటు అభిమానులు ఆందోళన చెందారు. ఆళ్లగడ్డను టీడీపీ ఖాతాలోకి పోనియమని వైస్ జగన్మోహన్రెడ్డికి చెప్పాను. అవసరమైతే ఇండిపెండెంట్కు మద్దతు ఇచ్చి గెలిపించుకుంటామనే ధీమా ఉండేది.
శోభానాగిరెడ్డి మొండి మనిషి, చనిపోయిన తరువాత కూడా బరిలో నిలిచి తనకు పడే ఓట్లు చెల్లించుకునేలా చేసుకుంది. ఆమెకు ఓటు వేస్తే చెల్లదని చెప్పినపుడు బాధపడిన కార్యకర్తలు ఈసీ ప్రకటనతో ప్రస్తుతం ఆనందపడుతున్నారు. ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని అరుదైన గుర్తింపును శోభానాగిరెడ్డికి దక్కబోతుంది. చనిపోయిన తరువాత లక్ష ఓట్ల మెజార్టీతో వచ్చేలా గిన్నిస్ రికార్డు సాధిం చడానికి కార్యకర్తలు కృషి చేయాలి. చిన్న వయస్సులో తండ్రిని పొగొట్టుకున్నాను.
పెరుగుతున్న వయస్సులో ముగ్గురు అన్నలు దూరమైనారు.. కోలుకుంటున్న సమయంలో శోభమ్మను కోల్పోయాను. శోభానాగిరెడ్డి మరణంతో బరువెక్కిన మనస్సును వేలాది కుటుంబాల కోసం నిబ్బరం చేసుకుంటున్నాను. ధైర్యంగా ప్రజల కోసం కుటుంబం మొత్తం వస్తున్నాం.అందరం కలుద్దాం... జగనన్నను సీఎం చేసి.. శోభమ్మ చివరి కోరికను నెరువెరుద్దాం’ అంటూ ప్రసంగించారు.
ఘాట్ను ఆహ్లాదంగా తీర్చిదిద్దుతా:
శోభానాగిరెడ్డి అంత్యక్రియలు నిర్వహించిన ప్రాంతాన్ని శోభమ్మ ఘాట్గా భూమా నాగిరెడ్డి నామకరణం చేశారు. అక్కడ ఆమె జ్ఞాపకాలను భద్రపరిచి ఇల్లు కూడా నిర్మించుకుంటానని తెలిపారు. శోభమ్మ ఘాట్ను ఆహ్లాదంగా తీర్చిదిద్దుతాన్నారు. సమావేశంలో మిల్క్ డైయిరీ చైర్మన్ భూమా నారాయణరెడ్డి, నాయకులు అన్సర్, రఘనాథరెడ్డి, నిజాం, శ్రీకాంతరెడ్డి, రాముయాదవ్, బీవీ రామిరెడ్డి, సింగం వెంకటేశ్వరరెడ్డి, చంద్రశేఖరరెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment