నేడు కందుకూరు, సింగరాయకొండలో బహిరంగ సభలు
సాక్షి, ఒంగోలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారయాత్ర ‘ వైఎస్సార్ జనభేరి’ ఆదివారం రాత్రి జిల్లాలోకి ప్రవేశించింది. నెల్లూరు జిల్లా పర్యటన ముగించుకుని జగన్ సరిగ్గా రాత్రి 11.16 గంటలకు ప్రకాశం జిల్లా సరిహద్దులోకి రాగా.. కనిగిరి నియోజకవర్గం పామూరు వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
ఎన్నికల కోడ్ నిబంధనల మేరకు అప్పటికే రోడ్షో ముగించిన జగన్ ప్రచార రథంలోనే కూర్చొని తనకోసం ఎదురుచూస్తున్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ నేరుగా కందుకూరు బసకేంద్రం వద్దకు చేరుకున్నారు. మార్గమధ్యలో ఊరూరా ప్రధాన రహదారి వెంట ప్రజలు జగన్ను చూసేందుకు బారులుతీరారు. పామూరు దాటిన తర్వాత నుచ్చుపొద, ఇనిమెర్ల, లక్ష్మీనరసాపురం, మోపాడుబంగ్లా, మోపాడు, బొట్లగూడూరు, పాబోలువారిపల్లె, అయ్యవారిపల్లె, బోడవాడ అడ్డరోడ్డు, మాలకొండ మీదుగా కాన్వాయ్ కందుకూరు పట్టణంలోకి ప్రవేశించింది.
కందుకూరు వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి పోతుల రామారావు, కొండపి అభ్యర్థి జూపూడి ప్రభాకరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ, నియోజకవర్గ సమన్వయకర్త ఉన్నం వీరాస్వామి తదితరులు జగన్కు స్వాగతం పలికారు. కందుకూరులోని వైఎస్సార్ సీపీ నేత ఎంఎం కొండయ్య నివాసంలో జగన్ రాత్రిబస చేశారు.
వైఎస్సార్ జనభేరి ఇలా..
‘వైఎస్సార్ జనభేరి’ యాత్ర జిల్లాలో సోమవారం కందుకూరు, కొండపి నియోజకవర్గాల్లో జరగనుంది. ఉదయం 10 గంటలకు కందుకూరు బహిరంగ సభలో జగన్మోహన్రెడ్డి ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు కొండపి నియోజకవర్గం సింగరాయకొండ వెళతారు. అక్కడ జరిగే బహిరంగ సభలోనూ ప్రసంగిస్తారు.
0 comments:
Post a Comment