నేరేడుచర్ల, కోదాడ, సూర్యాపేటల్లో సభలు..
జిల్లాలో రెండోసారి పర్యటన
సాక్షిప్రతినిధి, నల్లగొండ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ఆ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ప్రచారం చేయనున్నారు. శుక్రవారం ఆమె హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. గతేడాది షర్మిల జిల్లాలో జరిపిన పాదయాత్రకు అనూహ్య స్పందన వచ్చింది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే పార్టీ నాయకత్వం మరోసారి జిల్లాలో ప్రచారానికి పంపుతున్నారని సమాచారం. జిల్లాలో నల్లగొండ లోక్సభ సహా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నల్లగొండ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో 18వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం దాకా రోడ్షోలో షర్మిల పాల్గొంటారు.
నేరేడుచర్ల నుంచి మొదలయ్యే ప్రచార కార్యక్రమంలో తొలుత ఇక్కడ ప్రసంగిస్తారు. హుజూ ర్నగర్ మీదుగా కోదాడకు చేరుకుని పట్టణంలో ప్రచారంలో పాల్గొని అక్కడ కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. కోదాడ నుంచి హైవే మీదుగా, సూర్యాపేటకు చేరుకుని పట్టణంలో రోడ్ షోలో పాల్గొని సభలో ప్రసంగిస్తారు. దీంతో ఒకరోజులో మూడు నియోజకవర్గాల్లో షర్మిల పర్యటన ముగుస్తుంది. గత ఏడాది ఫిబ్రవరిలో షర్మిల జిల్లాలోని దేవరకొండ, మునుగోడు, నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవ ర్గాల్లో పాదయాత్ర చేశారు. ఆమె యాత్రకు జిల్లాలో పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. షర్మిల పాదయాత్రకు అనూహ్యమైన స్పందన రావడంతో, ఈసారి కూడా ఆమెనే ఎన్నికల ప్రచారానికి తీసుకొస్తే బాగుం టుందని ఇక్కడి పార్టీ నేతలు కోరడంతో పర్యటన ఖరారు చేశారని చెబుతున్నారు. అదే మాదిరిగా, గతంలో సూర్యాపట, కోదాడల్లో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్.విజయలక్ష్మి పర్యటించారు. దీంతో ఈ తడవ జగన్ సోదరి షర్మిలతో ప్రచారం చేయించాలని భావించి నట్లు చెబుతున్నారు.
0 comments:
Post a Comment