సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు కలిసి యువనాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని అడ్డుకునేందుకు కుట్రపన్నుతున్నాయని సీనియర్ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్ అన్నారు. ప్రముఖ జర్నలిస్టు ఎ.ఎస్.ఆర్.మూర్తి రచించిన ‘యువ కెరటం’ పుస్తకాన్ని ఆయన ఆదివారమిక్కడ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు అనుకూలమైన పథకాలు, పేదలకు అన్ని సౌకర్యాలు కల్పించడంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విజయవంతమయ్యారని అన్నారు.
చంద్రబాబు హయాంలో సింగరేణిని, ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నించారని, వైఎస్ వచ్చాక వాటికి స్థిరత్వం కల్పించి లాభాలదిశగా తీసుకెళ్లారని గుర్తుచేశారు. ప్రపంచబ్యాంక్కు ఆయన ఏనాడూ లొంగలేదన్నారు. వైఎస్ మరణానంతరం ఆయన ఆశయాలు, పథకాలను అమలు చేయాలన్న పట్టుదలతో యువనేత జగన్ ముందుకు సాగుతున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఎవరైతే ఇచ్చిన హామీల్లో 60 శాతమైనా నెరవేరుస్తారో వారినే ఎంపిక చేసుకునేందుకు ప్రజలు మొగ్గుచూపుతారని, అలాంటి లక్షణాలు జగన్కే ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారని ఏబీకే పేర్కొన్నారు. ప్రజల్లో జగన్కున్న ఆదరాభిమానాలు చూడలేకే కేంద్రంలోని పెద్దలు ఆయనపై అవినీతి ఆరోపణలు మోపి జైలుకు పంపారని, అయితే ఆ సమయంలోనూ ఆయన బెదరకుండా ఎంతో నిబ్బరంగా ఉన్నారని ప్రశంసించారు. పుస్తక రచయిత ఎ.ఎస్.ఆర్.మూర్తి మాట్లాడుతూ.. వైఎస్సార్ మృతి తరువాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కొత్త పార్టీ పుట్టుక, రాజకీయంగా ఎదిగిన జగన్పై ఢిల్లీ స్థాయిలో దృష్టిపెట్టడం, అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ రాజకీయంగా అణిచివేసేందుకు చూడటం వంటి పలు అంశాలన్నింటినీ పుస్తకంలో పొందుపరిచినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు డా.సురేందర్రాజు, పుస్తక సహరచయిత బుర్రా విజయశేఖర్, పాత్రికేయులు తోట భావనారాయణ, ఆకెళ్ల రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment