హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపు కోసం ఈ ఎన్నికల్లో గట్టిగా కృషి చేయాలని పలువురు సినీ రంగ ప్రముఖులు నిర్ణయించారు. ప్రముఖ దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి, నిర్మాత జి.ఆదిశేషగిరిరావు, దర్శకుడు ఆదిత్య, సినీ నటులు గిరిబాబు, సినీ హీరో రాజా, సీనియర్ క్యారెక్టర్ నటుడు హేమసుందర్తో సహా పలువురు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. త్వరలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తమ ప్రచారాన్ని ప్రారంభించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ సందర్భంగా కోదండరామిరెడ్డి మాట్లాడుతూ... ఒక సీఎం ఎలా ఉండాలో వైఎస్ చూపించారని కొనియాడారు.
వైఎస్ అంటే తనకు ఎంతో అభిమానమని, ఆ అభిమానంతోనే జగన్కు మద్దతు నివ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. కొత్త రాష్ట్రానికి జగన్ నాయకత్వం చాలా అవసరమన్నారు. జాబు కావాలంటే బాబు రావాలంటూ చంద్రబాబు చేసుకుంటున్న ప్రచారాన్ని గిరిబాబు ఎద్దేవా చేస్తూ... జబ్బు రావాలంటే బాబు రావాలి.. జబ్బులు పోవాలంటే జగన్ రావాలి అన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్ సీఎం కావాలని తాము నమ్ముతున్నామని తెలిపారు.
మీడియా టార్గెట్ చేస్తోంది
మీడియా మొత్తం జగన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శ లు చేస్తోందని హీరో రాజా ఆక్షేపించారు. మీడియా జగన్పై ఎంత బురద జల్లినా ఆయన విజయాన్ని ఆపలేరన్నారు. అన్ని పార్టీ లూ కలిసి జగన్పై విమర్శలు చేస్తున్నాయంటే ఆయన ఎంత బలవంతుడనేది అర్థమవుతోందని హేమసుందర్ అన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడుతోంది కనుక కొత్త రక్తం చాలా అవసరమని, పాత వారికి వీడ్కోలు పలకాల్సిందేనని చెప్పారు. ఒకటీ రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర నుంచి పర్యటన ప్రారంభమవుతుందని దర్శకుడు ఆదిత్య తెలిపారు. ఇప్పటికే సినీనటులు విజయచందర్, పృథ్వి పార్టీ తరపున ప్రచారంలో ఉన్నారు.
0 comments:
Post a Comment