గుండం రామచంద్రారెడ్డి: 108.. 104.. ఈ నెంబర్లు రాష్ట్ర ప్రజల పాలిటి అపర ఆరోగ్య సంజీవనిలు. మారుమూల కుగ్రామం నుంచి మహానగరం వరకు.. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు.. ఆ ‘కుయ్.. కుయ్’ వాహనాలు వేలాది ప్రాణాలను కాపాడాయి. లక్షలాది రోగులకు సాంత్వననిచ్చాయి. ఒక్క ఫోన్కాల్తో రోగుల దగ్గరికే వెళ్లి అత్యవసర వైద్యసేవలందించి, అవసరమైతే ఆసుపత్రులకు తరలించి సేవలందించాయి. కానీ వైఎస్ మరణానంతరం పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ పథకాలు అటకెక్కాయి.
చంద్రబాబు హయాంలో..
ఆపదలో ఆస్పత్రికెళ్లాలంటే వందలాది రూపాయలు చెల్లించి ఏ ప్రైవేటు వాహనాన్ని మాట్లాడుకుని వెళ్లాల్సిన పరిస్థితి. రోడ్డు ప్రమాదం జరిగితే అంబులెన్సులు లేవు. పురిటినొప్పులకు ఎద్దుల బళ్లు లేదా వ్యక్తిగత వాహనాలే దిక్కు. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే డోలీలోనే తీసుకుపోవాల్సిన పరిస్థితి. అంబులెన్సు అంటే ఏంటో ప్రజలకు తెలియని పరిస్థితి. వేళగాని వేళ ప్రమాదం జరిగితే ప్రాణంపై ఆశ వదులుకోవాల్సిన దుస్థితి. ఎలాగోలా ఆస్పత్రికి తీసుకెళ్లినా వైద్యం చేసేవారు కరువు. ఇక పల్లెటూరి రోగుల పరిస్థితిని ఊహించలేం. వృద్ధులు, బాలింతలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికెళ్లినా సరైన మందులు దొరికేవి కావు. పట్నంలో ఉన్న పెద్దాస్పత్రులకు వెళ్లలేని పరిస్థితి. పల్లెటూళ్లలో దీర్ఘకాలిక జబ్బులతో పాటు సాధారణ జబ్బులతో బాధపడే కోట్లాది మంది పేద రోగులు దుర్భర పరిస్థితులు అనుభవించేవారు.
వైఎస్ హయాంలో..
108 సేవలు
+ 2006 సెప్టెంబర్లో తొలుత 8 జిల్లాల్లో 310 అంబులెన్సులతో పథకాన్ని వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రారంభించారు.
+ 2007 నవంబర్ నాటికి పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి 802 వాహనాలు ఇచ్చారు.
+ 2009 నాటికే ఈ పథకం పై సుమారు రూ.300 కోట్లకు పైగా వెచ్చించారు.
+ రోజుకు 6వేలకు పైగా ఎమర్జన్సీ కాల్స్ వస్తే అందులో నాలుగువేల కాల్స్ను అటెండ్ చేసేవారు.
+ రోజూ రాష్ట్రవ్యాప్తంగా ఆపదలో ఉన్న 3500 నుంచి 4వేల మందిని కాపాడి ఆస్పత్రులకు చేరుస్తున్నాయి ఈ అంబులెన్సులు.
+ పథకానికి ఏటా రూ.100 కోట్లు తక్కువ కాకుండా కేటాయింపులు జరిపారు.
+ 70 శాతం మంది గర్భిణులు ప్రసవం కోసం 108 అంబులెన్సులకు ఫోన్ చేసి వినియోగించుకునేవారు.
+ ఫోన్ చేసిన అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో ఘటనా స్థలానికి 25 నిముషాల్లోనే చేరుకునేవి.
+ 108 వాహనాల్లో అత్యవసర పరికరాలతో పాటు మందులకు, సిబ్బందికి లోటు లేకుండా ఉండేది.
104 సేవలు
+ పల్లెటూళ్లలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 3 కి.మీ. దూరంలో ఉన్న గర్భిణులు, చిన్నారులు, వృద్ధుల వైద్యం కోసం ఈ పథకాన్ని రూపొందించారు.
+ 2008 ఫిబ్రవరిలో 104 పథకం మహబూబ్నగర్, కడప, ఆదిలాబాద్, శ్రీకాకుళం జిల్లాల్లో పెలైట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు.
+ 2009 ఫిబ్రవరి నాటికి అంటే ఏడాదిలోనే రాష్ట్రమంతటికీ ఈ పథకాన్ని వర్తింపచేశారు. దీనికోసం 475 సంచార వైద్యశాలలను (104 వాహనాలను) ఏర్పాటు చేశారు.
+ వైద్య సలహాల కోసం 104 కాల్సెంటర్నూ ప్రారంభించారు. రోజూ 12వేల నుంచి 50 వేల ఫోన్కాల్స్ వచ్చేవి.
+2009 నాటికి ఈ పథకానికి సుమారు రూ. 300 కోట్లు వెచ్చించారు. ప్రతి వాహనంలో 67 రకాల మందులు, వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్ ఉండేవారు.
+ ఏటా రూ.80 కోట్లకు తగ్గకుండా బడ్జెట్ను కేటాయించేవారు.
+ రోజుకు దాదాపు 900 పల్లెలకు ఈ వాహనాలు వెళ్లేవి. నెలమొత్తం మీద సరాసరి 25వేల పల్లెల్లో సేవలందించేవి.
+ ఏటా 2.5 కోట్ల మంది పల్లెటూరి రోగులకు 104 వైద్య సేవలు అందేవి.
పూర్వవైభవం తీసుకువస్తాం : వైఎస్ జగన్
108, 104 పథకాలకు పూర్వవైభవం తెస్తామని 2014 ఫిబ్రవరి 2న ఇడుపులపాయలో జరిగిన పార్టీ ప్లీనరీలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. 108 వాహనాల్లో ఉండాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. 104 వాహనాల్లో అవసరమైన ఔషధాలన్నీ అందుబాటులో ఉంచుతామని, మందులతో పాటు అవ్వ తాతలకు కళ్లద్దాలు కూడా 104 వాహనాల ద్వారానే ఉచితంగా అందిస్తామన్నారు.
రోశయ్య, కిరణ్ హయాంలో
- వీళ్లిద్దరి హయాంలో ఈ పథకాల అమలు కుంటుపడింది. రాష్ట్రం మొత్తంమీద 650 వాహనాలకు మించి తిరగడం లేదు. వీటిలోనూ 60 శాతం వాహనాలు పూర్తిగా మరమ్మతులకు వచ్చాయి.
- ఏటా వందకోట్లకు పైగా 108 పథకానికి అవసరముంటే బడ్జెట్లో 60 కోట్లు కూడా పెట్టలేదు.
- వేతనాల కోసం సిబ్బంది 2010లో ఒకసారి, 2013లో ఒకసారి సమ్మెచేయడంతో 2 నెలల పాటు పథకం పూర్తిగా ఆగిపోయింది.
- రోజూ 4వేల ఎమర్జన్సీ కాల్స్ను అటెండ్ చేసే వాహనాలు 2500 కాల్స్కు కూడా వెళ్లలేక పోతున్నాయి.
- వాహనాలు మరమ్మతులకు రావడం వల్ల ఘటనాస్థలికి చేరే సమయం 25 నిముషాల నుంచి 40 నిమిషాలకు పెరిగింది.
- 104 వాహనాల్లో 67 రకాల మందులు అందుబాటులో ఉండాలి. కానీ 20 రకాల మందులు కూడా లేవు.
- 104 వాహనాల వెంట వైద్యులు వెళ్లడం లేదు. చాలా జిల్లాల్లో నాలుగు మాసాలుగా ఉద్యోగులకు జీతాలు లేవు.
- రోజువారీగా 900 గ్రా మాల్లో ఈ పథకం ద్వారా పేదలకు సేవలందాలి. కానీ ఇప్పుడా సంఖ్య 600 కు పడిపోయింది.
- ఒక్కో గ్రామానికి 60 నుంచి 80 మందికి మందులివ్వడమే గాక వైద్య పరీక్షలు చేసి ప్రధాన ఆస్పత్రులకు తరలిస్తుండేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు.
- మధుమేహం, మూర్ఛవ్యాధి, టీబీ, గుండెజబ్బు, తదితర దీర్ఘకాలిక రోగాలకు మందులు ఇచ్చేవారు. ఇప్పుడవి మందుల షాపుల్లో కొనుక్కోవాల్సి వస్తుంది.
- పథకానికి ఏటా రూ.80 కోట్లు అవసరం ఉంటే రూ.40 కోట్లు
ఇస్తున్నారు.
మహానేత పాలనలో నిరంతర సేవలు
‘జిల్లాలోని గిరిజన ప్రాంతాలకు సైతం 108 వాహనాలు వెళ్లేవి. కుయ్..కుయ్..మంటూ వెళితే ఆపదలో ఉన్న వారిని కాపాడుతుందనే ధీమా వైఎస్ పాలనలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ శబ్దం విందామన్నా వినిపించడం లేదు. చాలా వాహనాలు మూలనపడ్డాయి. ఒక్కమాటలో చెప్పాలంటే వైఎస్సార్ చనిపోయాక 108 పథకం అమలు దారుణంగా మారింది. వాహనాల కొరత ఏర్పడింది. ఏదైనా రిపేరు వచ్చినా పక్కనపడేస్తున్నారే తప్ప వాటిని బాగుచేయించే నాధుడు కూడా కరవయ్యాడు. మళ్లీ ఆ నాటి రోజులు రావాలని ఆశ.’
- వి. ఫరీద్, మెడికల్ డిస్ట్రిబ్యూటర్, ఖమ్మం.
104 వాహనాలే రావట్లే!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో 104 సేవలు చాలా సమర్ధవంతగా ఉండేవి. నెలలో కనీసం రెండు సార్లు అయినా గ్రామాలకు వచ్చి వైద్య సేవలు అందేవి. ఆయన మరణంతో ఆ సేవలను పట్టించుకున్న వారే లేరు. ఒకప్పుడు సంజీవని వాహనం గ్రామాల్లోకి వచ్చి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందుల పంపిణీ జరిగేది. పేద ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకొనే వారు లేరు. చేతిలో చిల్లి గవ్వలేక మందులు కొనే డబ్బు ల్లేక రోగాలతో సతమతం అవుతున్నాం. మునపటిలా సేవలు అందిస్తే లక్ష్యం నెరవేరుతుంది.
-బొర్రా రాంబాబు, చిలుకూరు, నల్లగొండ జిల్లా.
గోలీలు కొనుక్కుంటున్నా..
104 వాహనం ఉన్నా ఉపయోగంలేదు. మందు గోలీలు అడిగితే డాక్టర్ చీటీ తెమ్మంటున్నారు. నాకు గోలీలు ఇచ్చినన పాపాన పోలేదు. పేదలకోసం ఇంటి ముందుకే సర్కారు దవాఖాన వస్తదని చెపుకోవడమే తప్ప ఉపయోగంలేదు. ప్రతి నెల రూ. 225 వెచ్చించి బీపీ, షుగర్ గోలీలు మందుల దుకాణంలో తెచ్చుకుం టున్నా. ప్రతి శనివారం ఊరికి వాహనం వచ్చేది. ఇప్పు డు ఆ వాహన కూతే వినపడటం లేదు. మందుల కోసం నానా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. పేద రోగుల బాధలు ప్రభుత్వానికి పట్టడం లేదు.
- శంకరయ్య, చినరామన్చర్ల(బచ్చన్నపేట), వరంగల్
పేదల ఆరోగ్యం ఆగమాగం
ఏ ఒక్క పేదవాడికి ఆపద ఎదురైనా 108కు ఫోన్ చేయగానే స్పందించి కొన్ని నిమిషాల్లోనే ఆ వాహనం ఇంటి ముందు ఆగేది. రోగిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు నిలిపేది. ఆరోజులు ఆయనతోనే పోయాయి. ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వైఎస్ మరణాంతరం పేదల బతుకులు ఆగమాగం అయింది. ఆరోగ్యమే మహాభాగ్యమనేలా పథకాన్ని అమలు చేసిన వైఎస్ ఉంటే పేదలకు ఆరోగ్యంపై బరోసా ఉండేది. అలాంటి మహానేత మళ్ళీ వస్తే బాగుంటుంది.
-సుతారపు ఉపేంద్ర, మానుకోట
0 comments:
Post a Comment