విభజన వద్దన్న ఎంపీలను పిడిగుద్దులు గుద్దారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విభజన వద్దన్న ఎంపీలను పిడిగుద్దులు గుద్దారు

విభజన వద్దన్న ఎంపీలను పిడిగుద్దులు గుద్దారు

Written By news on Sunday, May 4, 2014 | 5/04/2014

అమలాపురం/ఏలూరు, న్యూస్‌లైన్: ‘‘ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పార్లమెంట్ గేట్లు మూసి, మీడియా కళ్లు గప్పి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేసింది. ఇందుకు బీజేపీ నేతలు బాకాలూదితే,  చంద్రబాబు ఎంపీలు ఓట్లు వేశారు. విభజన వద్దన్న ఎంపీలను పిడిగుద్దులు గుద్దారు. ఇప్పుడా మూడు పార్టీలు విభజనతో తమకేం సంబంధం లేదన్నట్లుగా మాట్లాడుతున్నాయి. విభజనకు అనుకూలంగా వైఎస్సార్ కాంగ్రెస్ లేఖ ఇచ్చినట్టు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయి. ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున, ఒక తండ్రిలా ఆలోచించి ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని వైఎస్సార్‌సీపీ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. జీవోఎం సమావేశంలో రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమని వైఎస్సార్‌సీపీ స్పష్టం చేసింది. తరువాత సమైక్య రాష్ట్రం కోసం ఆందోళనలు చేసింది. అయినా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారంటే వీరి బుర్రల్లో ఉన్నది మెదడా? లేక తాటిమట్టా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల దుయ్యబట్టారు.

శనివారం తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో జరిగిన ‘వైఎస్సార్ జనభేరి’కి హాజరైన జనసందోహంలో ఓ భాగం. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న షర్మిల
‘‘రాష్ట్ర విభజన గురించి ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని సోనియాగాంధీ చెబుతున్నారు. ఏం ఆలోచించి మీరు రాష్ట్రాన్ని విభజించారు? అధికారం కోసం ఆలోచించారా? నీ కొడుకు రాహుల్ గాంధీకి ప్రధాని పదవి కట్టబెట్టడం కోసమా? రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ ప్రాతిపదికన విభజించింది? దానికి బీజేపీ ఏ ప్రాతిపదికన మద్దతు ఇచ్చింది?’’ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు చేయాలని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి నాడు శాసనసభలో మాట్లాడినట్టు సోనియాగాంధీ గుంటూరు సభలో చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీకి అంత దమ్ముంటే నాటి అసెంబ్లీ రికార్డులను బయట పెట్టాలని సవాల్ చేశారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ఇప్పుడు వచ్చి సీమాంధ్రకు అన్యాయం జరిగింది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని హామీలివ్వడం చూస్తుంటే... చేతులతో మనిషిని చంపేసి శవంపై పడి ఏడ్చినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం, కొత్తపేట నియోజకవర్గం, పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో నారాయణపురం, ఆచంట నియోజకవర్గంలోని మార్టేరులో ‘వైఎస్సార్ జనభేరి’ సభలు నిర్వహించారు.
Share this article :

0 comments: