రాష్ట్రంలో ఓడిపోవడంతోనే.. అధికారం దక్కించుకోకుండా ఉండిపోతున్నంతనే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖేల్ ఖతం అయిపోయినట్లేనని మురిసిపోతూ ఉండే అనేకానేకమందికి ఈ వార్త ఒక చేదు గుళిక. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు సమర్థించుకునే వివరాలు కాదు.. సాక్షాత్తూ ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంక వివరాల ప్రకారమే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఈ దేశంలో అనేక ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకంటె ఎంతో మెరుగైన స్థితిలో ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ కంటె వెనుకబడి ఉన్న పార్టీల్లో కొమ్ములు తిరిగిన మొనగాడు పార్టీలు ఎన్నో ఉన్నాయి. చిన్న చిన్న వ్యత్యాసాలు అధికారం అందుకునే విధిరాతను నిర్ణయించే రాజకీయాల్లో.. వారికంటె ఎంతో మెరుగైన దశలో ప్రస్తుతం ఓడిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉన్నదన్నమాట నిజం.
వివరాల్లోకి వెళితే..
దేశంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగిన రెండు పార్టీలు మాత్రమే ఒక కోటికంటె ఎక్కువ ఓట్లు సాధించాయి. ఆ పార్టీలు ఒకటి ఆమ్ఆద్మీ పార్టీ అయితే రెండోది వైఎస్సార్ కాంగ్రెస్. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన తేడా ఉంది. ఆమ్ఆద్మీ పార్టీ దేశంలో 400 స్థానాల్లో పోటీచేసి ఈ మాత్రం ఓట్లు సంపాదించింది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే పోటీచేసి ఈ మాత్రం గరిష్టమైన ఓట్లను సాధించింది.
ఇంతా కలిపి ఆమ్ఆద్మీ సాధించింది 2 శాతం ఓటుషేర్ మాత్రమే. ఆ మాత్రానికి వారికి 1,13,25,635 ఓట్లు లభించాయి. అదే. వైఎస్సార్ కాంగ్రెస్ 2.5 శాతం ఓట్షేర్ సాధించింది. 1,39,91,280 ఓట్లను సొంతం చేసుకుంది. ఈ రెండుపార్టీల్లో వైకాపా ఏకంగా 9 ఎంపీసీట్లు గెలుచుకోగా, ఆప్ సాధించింది కేవలం నాలుగు స్థానాలే.
పోల్చిచూస్తే.. 18సీట్లు సాధించిన శివసేన, సున్న సీట్లున్న డీఎంకే, 20 సీట్లు గెలిచిన బిజూ జనతాదళ్, ఆరు సీట్లు గెలిచిన ఎన్సీపీ, 11 సీట్లు గెలిచిన తెరాస, రెండు సీట్లు గెలిచిన జెడియూ వీటన్నింటికంటె.. వైఎస్సార్ కాంగ్రెస్ చాలా ముందంజలో ఉన్నట్లు లెక్క. పై చెప్పిన పార్టీల్లో టాప్ పొజిషన్లో ఉన్న శివసేనకు వచ్చింది... 1.9 ఓట్ షేర్ మాత్రమే. వారు సాధించింది.. 1,02,62,982 ఓట్లు మాత్రమే. అంటే వైకాపా కంటె ఏకంగా 38 లక్షల ఓట్లు వెనుకబడి ఉన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విడతలో అధికారం అందుకోలేకపోయి ఉండవచ్చు.. కానీ ప్రజాదరణలో మాత్రం వెనకబడిన పార్టీ కాదనే వాస్తవాన్ని ఎన్నికల సంఘం ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.
0 comments:
Post a Comment