వైఎస్ పాలనపై టీడీపీ లేనిపోని అభాండాలు వేస్తోందని, చంద్రబాబు నాయుడు పాస్ పోర్టు చెక్ చేస్తే ఆయన సింగపూర్ ఎన్నిసార్లు వెళ్లారో తెలుస్తుందని, అలాగే గాలి జనార్ధనరెడ్డిని కాలువ శ్రీనివాసులు సింగపూర్ తీసుకెళ్లి చంద్రబాబుతో ఎన్నిసార్లు భేటీ చేయించారో స్పష్టం అవుతుందని ఆయన అన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే కూడా చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్లారని గుర్తు చేశారు. శ్రీకాంత్ రెడ్డి వాటిని నిరూపిస్తారని, నిరూపించలేకపోతే ఆయన రాజీనామా చేస్తారని, నిరూపిస్తే కాలువ శ్రీనివాసులు రాజీనామా చేస్తారా అని సవాలు చేశారు. నిండు సభ సాక్షిగా తాను సవాలు చేస్తున్నానని ఆయన చెప్పారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించి ఐదు సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా ఆయన అప్పుడు అలా చేశారు, ఇలా చేశారంటూ తవ్వుకోవడం సరికాదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన తర్వాత వేరే ప్రభుత్వం, వేరే ముఖ్యమంత్రులు ఐదేళ్లు పాలన చేశారని, నిజంగా టీడీపీవాళ్లు మాట్లాడాలనుకుంటే.. సభలో లేని వ్యక్తి, మరణించి.. సభకు రాలేని వ్యక్తి గురించి మాట్లాడటం కంటే గవర్నర్ ప్రసంగంలో అంశాలను ప్రస్తావించి, రైతుల రుణాలను ఎలా మాఫీ చేస్తారో, రైతుల భయాలను ఎలా దూరం చేస్తారో మాట్లాడాలని అన్నారు.
ప్రశ్నలు అడగాల్సింది తామని, సమాధానాలు చెప్పాల్సింది ప్రభుత్వమని చెప్పారు. అయినా వైఎస్ఆర్ పై ధూళిపాళ్ల తన ఆరోపణలు కొనసాగిస్తూనే వచ్చారు. దాంతో, స్పీకర్కు నోటీసు ఇవ్వకుండా..స్పీకర్ అనుమతి లేకుండా సభలో లేని, సభకు రాలేని వ్యక్తుల గురించి మాట్లాడమేంటని వైఎస్ జగన్ నిలదీశారు. గవర్నర్ ప్రసంగం పేరిట ఐదేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి గురించి చర్చేంటని, ఇష్టమొచ్చినట్లుగా అసెంబ్లీ నడుస్తుంటే నిబంధనలు ఉండి ఎందుకని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎలా నడుస్తోందన్నది ప్రజలు గమనిస్తున్నారని ఆయన చెప్పారు.
0 comments:
Post a Comment