కడప: రైతు రుణమాఫీ చేస్తామనే ఒకే ఒక అబద్ధం చెప్పి ఉంటే మనం కూడా కచ్చితంగా అధికారంలోకి వచ్చి ఉండేవాళ్లమని కడప కార్పొరేటర్లతో సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఒక్కసారి అబద్ధం చెప్పి ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని ఉంటే ఐదేళ్లకే ప్రజలు ఇంటికి పంపిస్తారని వైఎస్ జగన్ అన్నారు.
రాబోయే రోజుల్లో వారి అబద్ధాలు, మోసాలు బయటకు వస్తాయని, సాధారణంగా ఒక సీఎంపై రెండేళ్ల తర్వాతగాని అసంతృప్తి కలుగుతుందని, కాని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎంపై 25 రోజుల్లోనే అసంతృప్తి కలుగుతోందని వైఎస్ జగన్ అన్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాని పరిస్థితి నెలకొంటుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత, విలువలపై ఆధారపడి ఉందన్నారు.
నిజమైన ప్రతిపక్షం లాక్కున్న ఎంపీలు, ఎమ్మెల్సీలలో ఉండదని, నిజమైన ప్రతిపక్షం అంటే ప్రజలేనని పార్టీ కార్పోరేట్లకు వైఎస్ జగన్ వివరించారు. అధికార పక్షం మోసం చేస్తుందని తెలుసుకున్న రోజు ప్రజలే తిరగబడతారని వైఎస్ జగన్ అన్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర ఇచ్చినా .. భవిష్యత్లో 160 స్థానాలు ఇచ్చి మనల్ని నిలబెడతారని వైఎస్ జగన్ తెలిపారు.
మనందరం ఒకటిగా తోడుగా ఉందాం. పోలీసు కేసులు, ఒత్తిళ్లు అనేకం ఉంటాయి. ఏ ఒక్కరికి ఇబ్బంది ఉన్నా.. అందరం కలిసి పోరాడదాం. మీకు తోడుగా నేనుండి.. రోడ్డుపైకి రావడానికైనా సిద్ధం అని కార్యకర్తలతో వైఎస్ జగన్ అన్నారు.
కడప కార్పొరేషన్ మేయర్గా సురేష్ బాబుకు మద్దతు పలకాలని కార్పోరేటర్లకు వైఎస్ జగన్ సూచించారు. డిప్యూటీ మేయర్, ఇతర పదవుల ఎంపికలో అన్ని కులాలు, మతాలకు ప్రాధాన్యత ఇచ్చామని..కడప నుంచే రాష్ట్రానికి ఒక సందేశాన్ని అందిస్తున్నామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేసి.. లాక్కునే స్థాయికి ప్రస్తుత రాజకీయాలు దిగజారాయని వైఎస్ జగన్ అన్నారు
0 comments:
Post a Comment