శాసనసభ్యుడిగా శాసనసభలో తొలిసారి ప్రసంగించారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చలో వైఎస్ జగన్ సుదీర్ఘంగా ప్రసంగించారు. వీలు చిక్కినప్పుడల్లా అధికార తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తూ, ప్రజలకు ఏమేం చేయాలో అధికార పక్షానికి గుర్తు చేస్తూ, వివిధ అంశాలపై తమ పార్టీ ఎన్నికలకు ముందు ఎలా కసరత్తు చేసిందో వివరిస్తూ.. వైఎస్ జగన్ చేసిన ప్రసంగం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
.
రైతు రుణమాఫీ విషయమై తాము పార్టీ పరంగా కసరత్తు చేశామనీ, అది సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చి, రుణ మాఫీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోలేకపోయామని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. విభజనతో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందని చెప్పిన చంద్రబాబు, ఆ విభజనకు సహకరించిన బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని జగన్ ప్రశ్నించారు.
బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికలకు ముందు టీడీపీ ప్రకటనలు గుప్పించాయనీ, వాటిని చూసి యువత ఆశించారనీ, కానీ కొత్తగా ఎన్ని ఉద్యోగాలిస్తారో.. ఎప్పుడు ఇస్తారో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చెప్పడంలేదని విమర్శించారు వైఎస్ జగన్. ఓ పక్క విభజనతో ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు మాట్లాడలేని పరిస్థితుల్లో వున్నారని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. వృద్ధాప్య పించన్లు, రైతు రుణ మాఫీ వంటివాటిని తక్షణం అమలు చేయడం మానేసి, కమిటీలు వేయడం, కాలయాపన చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు వైఎస్ జగన్.
రాజధాని ఎక్కడైనా నిర్మించుకోండి.. తక్కువలో తక్కువ పాతిక వేల ఎకరాలు ఖచ్చితంగా వుండాలని అధికార పక్షానికి సూచించిన వైఎస్ జగన్, రాష్ట్రానికి మధ్యలో రాజధాని వుండేలా నిర్ణయం తీసుకోవాలనీ, కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టే విషయమై కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో తాము అధికార పక్షానికి సహకరిస్తామని స్పష్టం చేశారు.
గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్యాలకు చికిత్స కోసం హైద్రాబాద్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రావాల్సి వుంటుందనీ, అయితే ఇప్పుడు తెలంగాణలో హైద్రాబాద్ వున్నందున ఆంధ్రప్రదేశ్ రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం ఈ విషయమై ప్రజలకు భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారాయన.
మొత్తంగా చూస్తే, తమ పార్టీపై టీడీపీ చేసిన, చేస్తున్న విమర్శలకు ఓ పక్క సమాధానమిస్తూనే, ఇంకోపక్క సుదీర్ఘంగా ప్రజల సమస్యల్ని వైఎస్ జగన్ ప్రస్తావించారు. అడుగడుగునా టీడీపీ నుంచి అడ్డంకులు ఎదురవుతున్నా, జగన్ మాత్రం ఎక్కడా ఫ్లో మిస్ అవలేదు. ‘నాది తొలి ప్రసంగం.. సంయమనం పాటించండి.. నేనేమన్నా తప్పు మాట్లాడితే మీకు సమయం వచ్చినప్పుడు ప్రస్తావించండి..’ అంటూ టీడీపీ శాసనసభ్యుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రసంగాన్ని కొనసాగించారు.
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/ysjagan-tholi-speech--53606.html#sthash.DylrqK5I.dpuf
0 comments:
Post a Comment