అంకెల్లోనే బంగారు తెలంగాణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అంకెల్లోనే బంగారు తెలంగాణ

అంకెల్లోనే బంగారు తెలంగాణ

Written By news on Thursday, November 6, 2014 | 11/06/2014

అంకెల్లోనే బంగారు తెలంగాణ
బడ్జెట్‌పై తెలంగాణ వైఎస్సార్‌సీపీ మండిపాటు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలిబడ్జెట్ పూర్తిగా అంకెల గారిడీయే తప్ప ఆ అంకెల్లో ఎంత మాత్రమూ వాస్తవికత లేదని తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. రూ.లక్ష కోట్ల ముసుగు లో ప్రజలను మభ్యపెట్టే యత్నమే తప్ప, సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పట్టంచుకోలేదని ఆరోపించింది. వాస్తవ ఆదాయానికి, ప్రభుత్వ లెక్కలకు ఏ మాత్రం పొంతన లేదని, ఒకవేళ ఆ లెక్కలు నిజమైతే శాఖల వారీగా ఆదాయాన్ని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించింది.

పార్టీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లుతో కలసి  వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసిందని, రూ.లక్ష కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో డొల్లతనం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని పొంగులేటి అన్నారు. ‘ప్రణాళికా వ్యయంలో రూ.48,648 కోట్లు చూపారు. సమైక్యరాష్ట్రంలో 2012-13 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.47,712కోట్లను ప్రణాళిక వ్యయంలో కేటాయించారు. 2013-14 ఏడాదికి ఆ మొత్తం ఇంకా తగ్గి రూ.42,185 కోట్లుగా పేర్కొన్నారు.

అలాంటిది రాష్ట్రం విడిపోయాక తెలంగాణకు మాత్రమే రూ.48,648 కోట్లుగా బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. అదికూడా పదినెలల కాలానికి చెందిన బడ్జెట్‌లోనే. ఈ లెక్కన 12 నెలలకు కలుపుకుంటే రూ. 52 వేల కోట్ల పై మాటే. వీటన్నింటికి ఆదాయం ఎలా వస్తుందన్నదానిపై ప్రభుత్వం ఏ మాత్రం స్పష్టత ఇవ్వలేదు. సమైక్య రాష్ట్రంలో కేవలం 45శాతం ఆదాయం మాత్రమే ఉన్న తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన 5నెలల్లోనే ఇంత ఆదాయం పెరిగిందా? ఒకవేళ పెరి గితే ఆ ఆదాయం, పద్దులు ఎందుకు వివరించలేదు?’’ అని పొంగులేటి నిలదీశారు. ‘ఇక కేంద్ర గ్రాంట్లు రూ. 21,720 కోట్లుగా బడ్జెట్‌లో పేర్కొన్నారు. 2012-13 ఏడాదిలో 12 నెలల బడ్జెట్‌కు గాను రూ.7,412 కోట్లు, 2013-14లో రూ. 8,990 కోట్లు కేంద్ర గ్రాంట్లు వచ్చాయి.

మరి ఇప్పుడు రూ. 21,720 కోట్లు కేంద్ర గ్రాంట్లు ఎలా సాధ్యం’ అని ప్రశ్నించారు. ఇంతకంటే ఆశ్చర్యకరంగా తెలంగాణలో తలసరి ఆదాయం రూ. 93,150గా బడ్జెట్‌ల లెక్కల ద్వారా ప్రభుత్వం చెప్పిం దని, ఇది దేశంలో ఆదాయ సూచిలో ముందున్నామని చెప్పుకుంటున్న గుజరాత్ తలసరి ఆదాయం కంటే కూడా రూ.20వేలు ఎక్కువని పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితుల ప్రకారం తెలంగాణ బడ్జెట్ రూ. 60-65 వేల కోట్లకు మించి పోయే అవకాశం లేదు. కానీ ప్రభుత్వం రూ. లక్ష కోట్లు లక్ష్యంగా ప్రజలను మోసం చేయచూడటం  బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.

అంకెల గారడీతో ప్రభుత్వం అన్నివర్గాలను మోసం చేయడం దురదృష్టకరమని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష నేతతాటి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ధోరణిని అసెంబ్లీ లోపల, బయట ఎండగడుతామని హెచ్చరించారు. ఈ బడ్జెట్ కొత్తసీసాలో పాత సారాలా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఎద్దేవా చేశారు. శాఖల వారీగా లెక్కలు చూపమంటే అధికార పక్షం జావగారిపోతోందన్నారు.
Share this article :

0 comments: