మా కుటుంబానికి ఏదైనా జరిగితే సీఎం చంద్రబాబుదే బాధ్యత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మా కుటుంబానికి ఏదైనా జరిగితే సీఎం చంద్రబాబుదే బాధ్యత

మా కుటుంబానికి ఏదైనా జరిగితే సీఎం చంద్రబాబుదే బాధ్యత

Written By news on Friday, November 7, 2014 | 11/07/2014

మా కుటుంబానికి ఏదైనా జరిగితే సీఎం చంద్రబాబుదే బాధ్యత
  • ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ హెచ్చరిక
  •  నంద్యాలకు ఉప ఎన్నికలు వస్తాయని కర్నూలు టీడీపీ అధ్యక్షుడు వ్యాఖ్యానిస్తున్నారు
  •  భూమాను కేసులో ఇరికించేందుకు డీజీపీ, సీఎంలతో చర్చించామని చెబుతున్నారు
  •  పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి నాతండ్రిపై తప్పుడు కేసులు నమోదు చేశారు
  •  మా వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు, ఎంతదూరమైనా పోరాడుతాం
సాక్షి, హైదరాబాద్: తన తండ్రి భూమా నాగిరెడ్డికి, తన కుటుంబానికి ఏదైనా జరిగితే అందుకు సీఎం చంద్రబాబే బాధ్యత వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరించారు. నంద్యాల స్థానానికి ఉప ఎన్నిక వస్తుందంటూ టీడీపీ నేతలు బాహాటంగా చేస్తున్న ప్రకటనల తర్వాత, ఈ విషయంలో తన భయం తనకున్నందునే తానీమాట చెప్తున్నానన్నారు. నంద్యాల మున్సిపల్ సమావేశంలో ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి తన తండ్రి భూమా నాగిరెడ్డిపై కేసులు నమోదు చేశారని తప్పుబట్టారు. తమవైపు నుంచి ఎలాంటి తప్పు లేదని, ఈ విషయంలో వెనక్కి తగ్గకుండా ఎంతదూరమైనా పోరాడుతామన్నారు.

వైఎస్సార్‌సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డితో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. నంద్యాలలో ఉప ఎన్నిక వస్తుందంటూ కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు. భూమాను కేసులో ఎలా ఇరికించాలనే విషయమై డీజీపీ,సీఎంలతో చర్చించామని వెంకటేశ్వర్లు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో తన తండ్రికి గాని, తన కుటుంబానికి గాని  ఇబ్బంది జరిగితే సీఎం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఆమె ఇంకా ఏం చెప్పారంటే...
 
నంద్యాల మున్సిపల్ సమావేశంలో ఏం జరిగిందనే విషయమై కొన్ని టీవీ చానెళ్లు ఏకపక్షంగా చూపిస్తున్నాయి. మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం నాగిరెడ్డికి ఎమ్మెల్యేగా మాట్లాడే హక్కు ఉన్నా చైర్‌పర్సన్ సులోచన గౌరవించలేదు. ఎమ్మెల్యే మాట్లాడుతున్నపుడు ప్రొటోకాల్‌నూ పాటించకుండా ఎజెండా ముగిసిందంటూ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ‘తలుపులు వేయండ్రా...’ అని నా తండ్రి చెప్పిన ఒక్క మాటను పట్టుకుని ఆయనపై మూడు తప్పుడు కేసులు బనాయించి రిమాండ్‌కు పంపారు.

పథకం ప్రకారం హత్యాయత్నం చేయాలనుకుంటే పోలీసులు, మీడియా వాళ్లు అందరూ ఉండగా చేస్తారా? పోలీసులకు కేసు పెట్టేటపుడు  ఆ ఆలోచన కూడా రాలేదా? రెండు పార్టీలు కొట్టుకున్నపుడు ఇద్దరిపైనా కేసులు పెట్టాలి కదా?  నాగిరెడ్డిపైనే కేసు ఎలా పెట్టారు? అసెంబ్లీ, లోక్‌సభలో అధికార ప్రతిపక్షాలు వాగ్వాదాలకు, గొడవ పడుతున్నపుడు కూడా స్పీకర్, సీఎం, ప్రతిపక్ష నేతలపై ఇలాగే కేసులు పెట్టి, రౌడీషీట్లు తెరుస్తారా?
 
టీడీపీ వారిపై మేము ఫిర్యాదు చేస్తున్నా పోలీసులు తీసుకోవడం లేదు. ఎందుకిలా చేస్తున్నారని అడిగితే చేతులు పెకైత్తి ‘పై నుంచి ఒత్తిడులు వస్తున్నాయి’ అని సమాధానమిస్తున్నారు.

నా తల్లిదండ్రులు ఏనాడూ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించలేదు. రౌడీయిజం, గూండాయిజం చేసి ఉంటే నా తండ్రి నాలుగుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు ఎంపీగా, నా తల్లి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉండేవారే కాదు. నా తల్లి చనిపోయిన షాక్‌నుంచి మేము తేరుకోకముందే నాన్నను మానసికంగా బలహీనుడిని చేయాలనే కేసు మోపారు.
 
జిల్లా ఎస్పీకి బుద్ధి లేదా?: మైసూరారెడ్డి

నాగిరెడ్డిపై రౌడీషీటు తెరవడం అనేది దుర్మార్గమైన చర్య. ఐపీఎస్ చదువుకున్న జిల్లా ఎస్పీ అధికారపక్షం ఒత్తిడులకు తలొగ్గి బుద్ధి లేకుండా వ్యవహరించారు. ఒక వ్యక్తిపై రౌడీ షీటుకు అవకాశం కల్పిస్తూ జారీ అయిన 743 స్టాండింగ్ ఆర్డర్‌కు ఎలాంటి రాజ్యాంగ బద్ధత లేదని, వాటికి ఎలాంటి నియమ నిబంధనల స్వభావం లేదని 1999, మార్చి 30వ తేదీన ‘మహ్మద్ ఖదీర్ వర్సెస్ హైదరాబాద్ పోలీసు కమిషనర్’ కేసులో హైకోర్టు తీర్పునిచ్చింది. ఐపీఎస్ అధికారికి ఇది తెలియదా?

స్థానిక ఎన్నికల సందర్భంగా గుంటూరు జిల్లా ముప్పాళ్ల ఎంపీటీసీలు సమావేశానికి వెళ్తుంటే ముస్లిం ఎమ్మెల్యేపైనా, అంబటి రాంబాబుపైనా  దాడి చేసిన వారిపై ఇప్పటికీ కేసులు పెట్టలేదు?వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రోజా, సునీల్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టారు. ‘సరస్వతీ’ భూముల విషయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు పెట్టారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్‌పై అకారణంగా రౌడీషీటు పెట్టారు.
 
Share this article :

0 comments: