విశాఖ : రైతు రుణమాఫీపై చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి ఓటు వేసిన రైతులు...మాఫీ కాని రుణభారంతో ఇప్పటివరకూ 86మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అదే విషయాన్ని ప్రశ్నిస్తే...ఆత్మహత్యలు, ఎప్పుడు..ఎక్కడ జరిగాయంటూ బాబు బుకాయిస్తున్నారంటూ అన్నారు. మృతి చెందిన 86మంది రైతు కుటుంబాలను సంక్రాంతి తర్వాత పరామర్శించబోతున్నానని వైఎస్ జగన్ తెలిపారు.
87 వేల కోట్ల రైతు రుణాలు వున్న విషయం ఎన్నికల ముందు చంద్రబాబుతోపాటు ప్రతి ఒక్కరికీ తెలుసునని వైఎస్ జగన్ అన్నారు. అయితే ఇప్పుడు తాను చెప్పింది రైతు రుణాల గురించి కాదని క్రాప్ లోన్ల గురించని చంద్రబాబు మాట మార్చారని ధ్వజమెత్తారు. తాను విశాఖను వస్తున్నానని, ధర్నాలో పాల్గొంటానని తెలిసీ నిన్న మీటింగ్ పెట్టిన చంద్రబాబు..కోటి మందికి పైగా రైతులుంటే కేవలం 22 లక్షల మందికి మాత్రమే..బిస్కెట్లు వేసినట్టుగా కాస్తోకూస్తో ఇస్తానని ప్రకటించారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు.
ప్రతి పిల్లాడికీ ఉద్యోగం ఇస్తాం, సిఎంగా చేసిన తొమ్మిదేళ్ల అనుభవం వుంది, ప్రపంచానికి ట్యూషన్ చెప్పిన అనుభవమూ వుందని ఎన్నికల ముందు చంద్రబాబు ఊదరగొట్టారన్నారు. అయితే నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తావ్ అంటూ బాబును కాలర్ పట్టుకునే నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. పింఛన్ల విషయంలో అవ్వాతాతల జీవితాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని వైఎస్ జగన్ అన్నారు.
కొత్త పెన్షన్ల గురించి సరేసరి, వున్న వాటిపై కోత విధిస్తున్నారని అన్నారు. వేసిన కమిటీల్లో అంతా టిడిపి కార్యకర్తలేనని ఆయన విమర్శించారు. హుద్ హుద్ తుఫాను వచ్చినప్పుడు విశాఖలో ఉన్న చంద్రబాబు ...ప్రజలకు చేసింది శూన్యమన్నారు. బాధితులకు పులిహోరా, పాల ప్యాకెట్లు...కుక్కలకు విసిరేసినట్లు విసిరేశారని ఆవేదన చెందారు
0 comments:
Post a Comment