* వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక మృతి చెందిన ఓ అభిమాని భార్య ఆవేదన
* కల్వకుర్తి నియోజకవర్గంలో 3 కుటుంబాలకు షర్మిల పరామర్శ
* జగనన్న ఉన్నాడని భరోసా ఇచ్చిన షర్మిల
* నేడు అచ్చంపేట, కొల్లాపూర్లో యాత్ర

‘పరామర్శ యాత్ర’లో భాగంగా సోమవారం మహబూబ్నగర్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలోని రెడ్డిపురం, దేవుని పడకల్, వెలిజాల గ్రామాల్లోని మూడు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. దేవుని పడకల్కు చెందిన తుమ్మల నర్సింహ, వెలిజాలలో మరణించిన సంతోజు అంజనమ్మ కుటుంబాలను ఆమె పరామర్శించి జగనన్న అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.

రాయపురెడ్డి ఇంట్లో వారి కుటుంబంలో ఒకరిగా మారి ఓదార్చిన షర్మిల... జగనన్న ఉన్నాడని, త్వరలోనే మంచిరోజులు వస్తాయని వారికి భరోసా ఇచ్చారు. ఆ కుటుంబానికే చెందిన ఓ వికలాంగ యువకుడి చదువుకోవాలన్న ఆశను, కళాశాలకు వెళ్లలేని నిస్సహాయతను చూసిన షర్మిల.. ఆ యువకుడికి తగిన సహాయం అందించాల్సిందిగా ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జిల్లా వైఎస్సార్ సీపీ కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డికి సూచించారు. ఎంపీ విజిటింగ్ కార్డును అందించి, తన వ్యక్తిగత సహాయకుడి ఫోన్ నంబర్ కూడా వారికి ఇచ్చి ఏ సాయం కావాలన్నా ఫోన్ చేయి పెద్దమ్మా! అంటూ ఆమె ఆప్యాయతను పంచారు.


రాజకీయం కోసం రాలేదు..: షర్మిల
కుర్మేడు, బ్రాహ్మణపల్లిలో పల్లె జనం విజ్ఞప్తి మేరకు షర్మిల మాట్లాడారు. వైఎస్ ఉంటే పేదలకు కష్టాలు ఉండేవి కావని ఆమె చెప్పారు. ఐదేళ్లలో ఏ ఒక్క చార్జీ కూడా పెంచకుండా జనరంజక పాలన అందించిన ఏకైక ముఖ్యమంత్రి రాజన్న అని, అందుకే ఆయన మరణిస్తే తట్టుకోలేక వందలాది మంది ప్రాణాలొదిలారన్నారు. రాజకీయాల కోసం తాను రాలేదని, దివంగత నేత వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన ప్రతి కుటుంబాన్ని కలిసి వారికి ధైర్యం చెప్పాలన్న జగనన్నమాట మీద వచ్చానని షర్మిల తెలిపారు. పేదలకు అండగా నిలవడమే తమ కుటుంబం లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.
బ్రహ్మరథం పట్టిన పల్లె జనం
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఉద్దేశించిన ఈ యాత్రను షర్మిల హైదరాబాద్లోని లోటస్పాండ్లో తమ నివాసం నుంచి ప్రారంభించారు. తల్లి విజయమ్మ, సోదరుడు, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, వదిన భారతి, వైవీ సుబ్బారెడ్డి దంపతుల ఆశీస్సులు తీసుకుని ఆమె బయలుదేరారు.
షర్మిల పర్యటన సాగిన ప్రతి పల్లెలో పాలమూరు జనం నీరాజనాలు పట్టారు. ఈ తొలిరోజు పరామర్శ యాత్రలో పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా పార్టీ కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, ఇతర నాయకులు శివకుమార్, కొండా రాఘవరెడ్డి, నల్లా సూర్యప్రకాశ్ రావు, మామిడి శ్యాంసుందర్రెడ్డి, బీస్వ రవీందర్ ఉన్నారు.
0 comments:
Post a Comment