హైదరాబాద్: చంద్రబాబు నాయుడు మోసపూరిత విధానాలపై రైతన్న కన్నెర్ర చేశాడు. రుణమాఫీ అమలుపై మాటమార్చినందుకు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన గళం విప్పారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో రైతులు, డ్వాక్రా మహిళలు రోడ్డెక్కారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద చేపట్టిన మహాధర్నాకు రైతులు, డ్వాక్రా మహిళలు సంఘీభావం ప్రకటించారు.
రాయలసీమలోని నాలుగు జిల్లాలో వైఎస్ఆర్ మహాధర్నాకు భారీ స్పందన వస్తోంది. ధర్నా అడ్డుకునేందుకు పోలీసులను భారీగా మోహరించినా జనం ఖాతరు చేయకుండా వచ్చి మద్దతు తెలియజేశారు. వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు, రైతులు, మహిళలు, యువకులు, డ్వాక్రా సంఘాల వారు తరలివచ్చారు. జిల్లాల వారీగా సమాచారం..
కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ధర్నా ఆరంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
అనంతపురంలో వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ధర్నా ప్రారంభించారు. కలెక్టరేట్ దగ్గర జరుగుతున్న ధర్నాలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, రైతులు, డ్వాక్రా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
కర్నూలు జిల్లాలో రైతులు కదంతొక్కారు. ధర్నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు యువకులు, మహిళలు మద్దతు తెలియజేశారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో 25 వాహనాల్లో ప్రజలు తరలివచ్చారు.
చిత్తూరు జిల్లా ధర్నాకు పెద్ద ఎత్తున రైతులు, డ్వాక్రా మహిళలు తరలివచ్చారు. పార్టీ నాయకులు రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.