లీటరు పెట్రోలు ధర రు 45లు, రు 50ల మధ్య.... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లీటరు పెట్రోలు ధర రు 45లు, రు 50ల మధ్య....

లీటరు పెట్రోలు ధర రు 45లు, రు 50ల మధ్య....

Written By news on Saturday, January 17, 2015 | 1/17/2015


క్రూడ్ ఆయిల్‌కు అనుగుణంగా పెట్రోలు ధరలు తగ్గించాలి
సాక్షి, హైదరాబాద్ :  అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. పార్టీ శాసనసభాపక్షం కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు సగానికి తగ్గినా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ రేట్లను ఆ మేరకు తగ్గించడం లేదని తప్పు పట్టారు.

 ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఈ విషయంలో ఏమీ మాట్లాడ్డం లేదని వారన్నారు. గత జూన్‌లో ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 115 డాలర్లుగా ఉంటే అది సగానికంటే తక్కువగా ప్రస్తుతం 47.5 డాలర్లకు పడిపోయిందనీ కానీ భారత దేశంలో ఆ మేరకు ధరలు తగ్గలేదని అన్నారు. ఒక బ్యారెల్ 115 డాలర్లుగా ఉన్నపుడు ఇక్కడ లీటరు పెట్రోలు ధర రు 80లుగా ఉండేదన్నారు. 47.5 డాలర్లకు తగ్గిన నేపథ్యంలో ఒక లీటరు పెట్రోలు ధర రు 45లు, రు 50ల మధ్య ఉండాలనీ అయితే అదింకా రు67- 68 మధ్యే ఉందన్నారు.
 
 సార్క్ దేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, పాకిస్తాన్‌లో కూడా భారత్ కంటే పెట్రోలు, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయని వారు ప్రస్తావించారు. కేంద్రం మొక్కుబడిగా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించిందే తప్ప నిష్పత్తి ప్రకారం ధరలను తగ్గించలేదన్నారు.  కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై పన్నులు వేసి వాళ్ల ఆదాయాన్ని పెంచుకుంటోందని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పన్నులు వసూలు చేస్తున్నారని వాటిని తగ్గించాల్సిన అవసరం ఉందని ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు  డిమాండ్ చేసిన చంద్రబాబు ఇపుడు భారత్‌లో పెట్రోలు, డీజిల్‌పై ఎక్కువగా వసూలు చేస్తున్న పన్నులను తగ్గించాలని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎందుకు కోరడం లేదని వారు ప్రశ్నించారు. గతంలో ఇవే ధరలకు ముడిపెట్టి, ఆర్టీసీ, రైల్వే చార్జీలను అమాంతం పెంచేశారని, ఇపుడు తగ్గుతున్న ధరలను బట్టి వాటిని కూడా ఎందుకు తగ్గించడం లేదని వారు ప్రశ్నించారు. పెట్రో ధరల పేరు చెప్పి నిత్యావసర సరుకులు, ఎరువుల ధరలు కూడా ఆకాశానికి అంటాయని ఇపుడు వాటిని తగ్గించడానికి చర్యలు తీసుకోవడం లేదని వారు విమర్శించారు. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఘోరంగా విఫలమయ్యాయని వారు దుయ్యబట్టారు
Share this article :

0 comments: