బుక్కపట్నం: ‘మీకు అండగా నేనుంటా.. అధైర్యపడకుండా బతకండి. మీకే కష్టం వచ్చినా, నాకు, ఇక్కడున్న నేతలకు చెప్పండి’ అని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సురేంద్ర కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. రైతు భరోసా యాత్రలో భాగంగా జగన్ సోమవారం అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం పి.కొత్తకోటలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు సురేంద్ర (24) కుటుంబాన్ని పరామర్శించారు. జగన్ వివరాలు అడుగుతుంటే సురేంద్ర భార్య శాంతమ్మ బోరున విలపించింది. జగన్ ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఓదార్చారు ‘మీకు అండగా నేనుంటా.. మీరు ఎవ్వరూ అధైర్యపడొద్దు’ అని ధైర్యం చెప్పారు.
జగన్: ఏమ్మా తల్లీ? ఎన్ని ఎకరాలు పొలం ఉంది?
శాంతమ్మ (సురేంద్ర భార్య): మాకు నాలుగెకరాలు ఉంది సార్. రెండుబోర్లు వేశాం. నీళ్లు పడలేదు. లాభం లేదని అప్పు చేసి ఆటో కొనుక్కున్నాం. గిట్టుబాటు కాలేదు. అందుకే మా ఆయన పురుగుల మందు తాగి సచ్చిపోయాడయ్యా (బోరున ఏడుస్తూ జగన్ ముందు పడిపోయింది. వెంటనే జగన్ ఆమె తల నిమురుతూ ఊరుకో తల్లీ.. ధైర్యంగా ఉండు అని సముదాయించారు.)
జగన్: ప్రభుత్వం దిగివచ్చేవరకు పోరాటం చేద్దాం. మీకు అండగా ఇక్కడ మన జిల్లా నాయకులు ఉంటారు. కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేద్దాం. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ వదలం. అవసరమైతే ఆ ధర్నాకు నేను కూడా వస్తా. మీరేం భయపడాల్సిన పని లేదు.
శాంతమ్మ జోక్యం చేసుకుని: సార్ నేను పదిదాకా చదువుకున్నాను. నాకు ఏదైనా అంగన్వాడీ పోస్టు ఇప్పించండి .
జగన్: మన పార్టీ అధికారంలో లేదు. ఇప్పుడు మనం చెప్పినా అది జరగదమ్మా. ఇంతలో సోమశేఖరరెడ్డి జోక్యం చేసుకుని జిల్లా కేంద్రంలోని మా కాలేజీలో ఏదైనా ఉద్యోగం ఇస్తాం. అని భరోసా ఇచ్చారు. గురునాథరెడ్డి సైతం ఏదో ఒక ప్రైవేటు ఉద్యోగం ఇప్పిస్తాంలే తల్లీ.. నువ్వేం భయపడొద్దు అన్నారు.
జగన్: ఇదిగో ఈ డబ్బులు తీసుకోమ్మా. కాస్త ఆదరవుగా ఉంటుంది. ధైర్యంగా ఉండండి. ప్రభుత్వం నుంచి మీకు సాయం అందే వరకూ గట్టిగా పోరాడతాం. కానీ ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం లేదు. కానీ మనం మాత్రం గట్టిగా ప్రయత్నిద్దాం.
0 comments:
Post a Comment