హిందూపురం:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల పట్ల అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బాబు ఎన్నికలకు ముందు బూటకపు హామీలిచ్చారని జగన్ విమర్శించారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆదివారం హిందూపురం బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ముందుగా సభకు హాజరైన ప్రతీ ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసిన వైఎస్ జగన్.. చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు సిద్ధప్ప కుటుంబాన్ని పరామర్శించిన సంగతిని సభలో వైఎస్ జగన్ ప్రస్తావించారు.
సిద్ధప్ప లేని కుటుంబాన్ని పరామర్శిస్తే గుండె బరువెక్కిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రైతు ఆత్మహత్యకు చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాలన్నారు. అనంతపురంలో ఆత్మహత్యలే జరగలేదని బాబు తెలిపారని.. జగన్ రైతు భరోసా యాత్ర చేస్తున్నారని తెలియగానే వారికి చెక్కులు పంపించే కార్యక్రమం చేపట్టారని జగన్ ఎద్దేవా చేశారు. బాబు బామ్మర్ది బాలకృష్ణ నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మిగతా చోట్ల రైతు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని జగన్ తెలిపారు. తన పాలనలో ఎవరూ ఆత్మహత్య చేసుకోలేదన్నాడు..ఇప్పుడు 29 మంది చనిపోయారని అంటూ బాబు మాట మారుస్తున్నారని జగన్ మండిపడ్డారు.
ఎన్నికల ముందు టీవీ పెడితే.. జాబు కావాలంటే బాబు రావాలని ఒకటే మోత మోగించిన విషయాన్ని గుర్తు చేశారు. బాబు సీఎం అయ్యారు.. ఉన్న జాబ్ లు పోయాయని జగన్ అన్నారు. అప్పటి రూ.87 కోట్ల రుణాలు కాస్తా రూ. 96 కోట్లకు చేరుకున్నాయని.. బాబు రుణమాఫీతో వడ్డీ కూడా మాఫీ కాలేదన్నారు. బాబు చేసిన రుణమాఫీ పేరుతో చేసింది రూ. 4,600 కోట్లు మాత్రమేనన్నారు.
0 comments:
Post a Comment