హైదరాబాద్ : ఈ నెల 29 నుంచి నాలుగు రోజులు పాటు రంగారెడ్డి జిల్లాలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర చేయనున్నారు. 29వ తేదీ నుంచి జూలై 2వ తేదీ వరకు ఈ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లోని 15 మంది కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను స్వయంగా కలుసుకుని పరామర్శిస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆయన తరఫున సోదరి వైఎస్ షర్మిల పరామర్శయాత్రను చేపడుతున్నారు.
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఇదివరకే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పు పూర్తి కాగా, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో ఆయన సోదరి షర్మిల పరామర్శ యాత్రను పూర్తిచేసి ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించనున్నారని వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ ప్రధానకార్యదర్శి, పార్టీ రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి కె.శివకుమార్ తెలిపారు. శనివారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి.సురేష్రెడ్డితో కలిసి రంగారెడ్డి జిల్లా పరామర్శయాత్ర షెడ్యూల్ను ఆయన విడుదల చేశారు.
పరామర్శ యాత్ర షెడ్యూల్ ఇదీ: 29న ఉదయం లోటస్పాండ్లోని తమ నివాసం నుంచి షర్మిల బయలుదేరి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని జిల్లెలగూడలో అంజయ్య కుటుంబాన్ని మొదట పరామర్శిస్తారు. అక్కడి నుంచి మంకాళ్ గ్రామంలో ఎంగల జోసెఫ్ కుటుంబాన్ని కలుసుకుంటారు. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని దండుమైలారం గ్రామంలో పోకల్కార్ మేహష్జీ కుటుంబాన్ని పరామర్శిస్తారు. 30న మేడ్చల్ నియోజకవర్గంలోని కండ్లకోయలో సుముద్రాల సాయిబాబాగౌడ్ కుటుంబాన్ని, ఆ తర్వాత మేడ్చల్ గ్రామంలో కొల్తూరి ముత్యాలు కుటుంబాన్ని ఆమె పరామర్శిస్తారు. అక్కడి నుంచి ఇదే నియోజకవర్గంలోని కేసారం గ్రామంలో చెన్నూరి వెంకటేష్ కుటుంబాన్ని, మూడుచింతలపల్లి గ్రామంలోని జామా కృష్ణయ్య కుటుంబాన్ని, లక్ష్మాపూర్ గ్రామంలోని నూతనకంటి మహేశ్ కుటుంబాన్ని ఆమె కలుసుకుంటారు. జులై 1న చేవెళ్ల నియోజకవర్గం ఎన్కెపల్లి గ్రామానికి చెందిన ఈడిగ సుగుణ కుటుంబాన్ని, పరిగి నియోజకవర్గంలోని రంగాపూర్కు చెందిన కల్ప కృష్ణారెడ్డి కుటుంబాన్ని, పరిగిగ్రామంలోని బంగరిగళ్ల శ్రీనివాస్ కుటుంబాన్ని, తాండూరు నియోజకవర్గంలోని గొట్టిగఖుర్దు గ్రామానికి చెందిన ఆవునల లక్ష్మణయ్యచారి కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తారు. 2న వికారాబాద్ నియోజకవర్గంలోని మర్పల్లి గ్రామంలో కమ్మరి నారాయణ కుటుంబాన్ని, మోమిన్పేట్ గ్రామంలో అరిగె యాదయ్య కుటుంబాన్ని, ఎన్కెతల గ్రామంలో ఆలంపల్లి వెంకటేశ్ కుటుంబాన్ని కలుసుకుని ఆమె తమ పరామర్శయాత్రను ముగిస్తారు.
0 comments:
Post a Comment