ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలుకు బాబు బేరం? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలుకు బాబు బేరం?

ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలుకు బాబు బేరం?

Written By news on Saturday, July 11, 2015 | 7/11/2015

http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/chandrababu-naidu-tapping-technology-bargain-purchase-1-2-482581.html
-వికీలీక్స్‌లో ఏపీ సర్కారు బాగోతం
-ఓర్టస్ కన్సల్టింగ్ కంపెనీతో ఏపీ ఇంటెలిజెన్స్ సంప్రదింపులు
-సింగపూర్ హ్యాకింగ్‌టీమ్‌కు బాధ్యతలు అప్పగించిన ఓర్టస్
-7.5 కోట్లకు ప్రాథమిక అంచనాలు పంపిన హ్యాకింగ్‌టీమ్
-ప్రభాకర్, మగ్లిట్టా మధ్య మెయిల్స్‌ను బయటపెట్టిన వికీలీక్స్
-మరోసారి అడ్డంగా బుక్కైన చంద్రబాబు
-ట్యాపింగ్ తీవ్రమైన నేరమని కోడైకూసిన సీమాంధ్ర మీడియా
-వికీలీక్స్ సమాచారానికి ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయత
-బాబు వ్యవహారంపై భగ్గుమంటున్న తెలంగాణవాదులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాగోతం బయటపడింది. ఓవైపు తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నదంటూ గగ్గోలు పెడుతూనే అదే సమయంలో సెల్‌ఫోన్లు, ఈ మెయిల్ సమాచారాన్ని దొంగచాటుగా ట్యాపింగ్ చేసే టెక్నాలజీని సమకూర్చుకునేందుకు ఆయన తీవ్రంగా యత్నించారు. ఫోన్లను ట్యాపింగ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఒక కన్సల్టెన్సీ సంస్థద్వారా బేరసారాలు నడిపింది. సుమారు 7.5 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ టెక్నాలజీ కొనుగోలుకు సిద్ధమైంది. ఈ సంగతులు వికీలీక్స్ పరిశోధనలో బయటపడ్డాయి. 

babu


అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ మెయిళ్లు, సెల్‌ఫోన్ల సంభాషణలపై నిఘాపెట్టి ట్యాపింగ్ చేసే టెక్నాలజీని అమ్మే సంస్థలు అనేకం ఉన్నాయి. ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాల మీద నిఘాకోసమంటూ ఈ సంస్థలు అమ్మే సాఫ్ట్ట్‌వేర్‌ను చట్టవ్యతిరేక పనుల్లో వాడుతున్నారు. ఇలా అక్రమంగా హ్యాక్ చేసిన సుమారు 10 లక్షల ఈమెయిళ్లను వికీలీక్స్ శుక్రవారం బయటపెట్టింది. ఇందులో చంద్రబాబు సర్కారు బాగోతం వెలుగుచూసింది. సెల్‌ఫోన్లు, డెస్క్‌టాప్‌ల మీద నిఘా పెట్టే సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి తెలంగాణ మీద ప్రయోగించేందుకు ఏపీ ప్రభుత్వం పూనుకుంది. సదరు టెక్నాలజీని కొనుగోలు చేసేందుకు ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు జూబ్లీహిల్స్‌లోని ఓర్టస్ అనే ఐటీ కన్సల్టెన్సీ సంస్థతో సంప్రదింపులు నడిపారు. 

వీరికోసం ఓర్టస్ కంపెనీ డైరెక్టర్ కాసు ప్రభాకర్‌రెడ్డి ఇలాంటి టెక్నాలజీని విక్రయించే హాకింగ్‌టీమ్.కామ్ అనే సంస్థతో బేరసారాలు జరిపారు. 25నుంచి 50 సెల్‌ఫోన్ల నంబర్లపై ట్యాపింగ్ జరిపేందుకు టెక్నాలజీ కావాలని హాకింగ్‌టీమ్‌కు ఆర్డర్ చేశారు. ఇందుకు సంబంధించిన ఈ-మెయిళ్లు శుక్రవారం వెలుగు చూశాయి. ప్రాథమికంగా ఏడున్నర కోట్ల రూపాయలు చెల్లించి ఆ టెక్నాలజీని అమ్మేందుకు కన్సల్టెన్సీ జరిపిన సంప్రదింపుల కేబుళ్లను వికీలీక్స్ బయటపెట్టింది. బయటపడ్డ కేబుళ్లలోని సమాచారం ప్రకారం జూన్ 12న ఓర్టస్ కంపెనీ డైరెక్టర్ ప్రభాకర్ సింగపూర్‌లోని హాకింగ్ టీమ్ సింగపూర్ రిప్రజెంటేటివ్ ఆఫీస్ చీఫ్ డేనియల్ మగ్లిట్టాతో ఈ మెయిల్ ద్వారా సంప్రదింపులు జరిపారు. 

line


ఏపీ పోలీసులకు అత్యవసరంగా సెల్యులార్ ఇంటర్‌సెప్షన్ హార్డ్‌వేర్ కావాలని ఆర్డర్ చేశారు. ఏ అవసరాలకోసం దాన్ని వినియోగించదలిచింది వివరాలను ఆయన ఈ మెయిల్‌కు జత చేశారు. టెక్నాలజీకి సంబంధించి అనేక సందేహాలతో కూడిన ప్రశ్నావళిని హాకింగ్ టీమ్‌కు పంపించారు. అంచనాగా ఒక ధర ఎంతో చెబితే తాను తన క్లయింట్ (ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్)కు చెప్పి ఆ మొత్తం సమకూర్చేందుకు యత్నిస్తానని ప్రభాకర్‌రెడ్డి ఆ మెయిల్‌లో స్పష్టం చేశారు. హాకింగ్ టీమ్‌కు సంబంధించిన ఇతర టెక్నాలజీ కొనుగోలుకు సైతం యత్నిస్తానని హామీ ఇచ్చారు. 

సుమారు 20నుంచి 50 మ్బైల్ లైసెన్స్‌లు అర్జంటుగా కావాలని అందులో కోరారు. దీనిపై స్పందించిన హాకింగ్‌టీమ్ ప్రతినిధి మగ్లిట్టా, ప్రభాకర్‌రెడ్డి పంపిన ప్రతిపాదనను పరిశీలించినట్టు ధృవీకరిస్తూ ఆయన కోరిన సాప్ట్‌వేర్ కావాలంటే ఉజ్జాయింపుగా సుమారు 7.5 కోట్ల రూపాయలు అవుతుందని, అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని స్పష్టం చేశారు. ఒకసారి క్లయింట్ (ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్)ను కలిస్తే ఇంకా ఇతర విషయాలు మాట్లాడవచ్చని ప్రతిపాదించారు. జూన్ 16, 17 తేదీల్లో కూడా స్కైప్‌లో ఇద్దరూ సంభాషించుకున్నారు. 

ఇదీ హాకింగ్‌టీమ్ కంపెనీ కథ..


ఇటలీలోని మిలాన్ కేంద్రంగా గిజ్మోడో హాకింగ్‌టీమ్ సంస్థ పనిచేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా పోలీసులు, ఇంటెలిజన్స్ సంస్థలకు ఫోన్లను ట్యాప్ చేసే సాప్ట్‌వేర్‌ను చట్టబద్ధమైన పద్ధతుల్లో అమ్ముతున్నామని బాహాటంగా చెప్తున్నా ఈ సంస్థ బ్లాక్‌బెర్రీ, అ్రండాయిడ్, ఆపిల్ పోన్లలో నిఘాపెట్టే సాప్ట్‌వేర్‌ను లోడ్‌చేసే పరికరాలు అమ్ముతారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే రష్యా, సౌదీ అరేబియా తదితర దేశాలకు ఇలాంటి సాప్ట్‌వేర్ అమ్మింది. ఆసియాలో ఈ సంస్థకు సింగపూర్‌లో రిప్రజెంటేటివ్ కార్యాలయం ఉంది. దానికి చీఫ్‌గా మగ్లిట్టా పనిచేస్తున్నారు. భారత్‌లో ఈ సంస్థ ప్రతినిధులు పర్యటనలు కూడా జరిపారు. 

ఎక్కడిదీ ఓర్టస్..?


ఇది ఐటీ కన్సల్టెన్సీ సంస్థ. దీని రిజిస్టర్ ఆఫీస్ జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 7 లోని బీ6 ఇంటినెంబర్‌తో ఉంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ అయిన ఈ సంస్థ డైరెక్టర్లుగా కాసు ప్రభాకర్‌రెడ్డి, జోత్స్నరెడ్డి, కుంజిబెట్టు విష్ణుదాస్ ప్రభు ఉన్నారు. ఇటలీకి చెందిన ఒక సంస్థ ఫోన్లు, డెస్క్‌టాప్‌లు, ఈమెయిళ్లపై నిఘా పెట్టే సాప్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సాప్ట్‌వేర్‌ను వివిధ ఏజెన్సీలకు అమ్మింది. ఆ సాప్ట్‌వేర్‌ను హాకింగ్‌టీమ్ అనే సంస్థ అమ్మకందారుగా సింగపూర్ నుంచి పనిచేస్తున్నది. ఓర్టస్ సంస్థ ఆ అమ్మకందారును ఏపీ పోలీసుల కోసం సంప్రదించింది. 

మొగున్ని కొట్టి...


ఓటుకు నోటు కేసు బయటపడగానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందంటూ గగ్గోలు పెట్టారు. గల్లీనుంచి ఢిల్లీదాకా ఫిర్యాదులు చేశారు. ఏపీ మంత్రులు అదే తారకమంత్రమన్నట్టు నానా యాగీ చేశారు. చంద్రజ్యోతి వంటి పత్రికలు ట్యాపింగ్ ఎంత నేరమో ఎన్ని ప్రభుత్వాలు ఆ కారణంగా కూలిపోయాయో కథలు చెప్పాయి. ఇంతా చేసి ట్యాపింగ్ జరిగిందంటూ ధృవీకరించే ఏ చిన్న ఆధారమూ చూపలేక సెల్‌ఫోన్ ప్రొవైడర్లకు నోటీసులిచ్చి భయానక పరిస్థితిని సృష్టించారు. ఇంతాచేసి బాబు చేసిందేమిటి? సరిగ్గా తెలంగాణ మీద ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్న సమయంలోనే ట్యాపింగ్ టెక్నాలజీ కోసం రూ.7.5 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధపడ్డారు. 

ఈ విషయం వికీలీక్స్ బయటపెట్టడంతో తేలుకుట్టిన దొంగలా ఆయన పరిస్థితి మారిపోయింది. ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలుకు చంద్రబాబు యత్నించడం మీద తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. తెలంగాణ మీద ప్రయోగించేందుకే ఆయన సదరు టెక్నాలజీ కోసం వెంపర్లాడుతున్నారని వారు ఆరోపించారు. మొగున్ని కొట్టి మొగసాలకెక్కినట్టు తాను ఓ వైపు ట్యాపింగ్‌కోసం యత్నిస్తూ ఎదుటివారిమీద నిందలు వేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. 

ట్యాపింగ్ అనేది ఘోరమైన నేరమే అయితే చంద్రబాబుకు ఏ శిక్షపడుతుందో సీమాంధ్ర మీడియా ఇపుడు వివరించాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఓటుకు నోటు కేసుతో పాటు ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలులో కూడా చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వికీలీక్స్ సమాచారానికి తిరుగులేదని వారంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సత్వరమే ఈ కొనుగోళ్ల బేరసారాల మీద విచారణ జరిపించాలని, సదరు టెక్నాలజీ ఏపీ ప్రభుత్వానికి చేరిందా అనే విషయం తేల్చాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు.
Share this article :

0 comments: