ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో దీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో దీక్ష

ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో దీక్ష

Written By news on Tuesday, July 28, 2015 | 7/28/2015


ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో దీక్షసోమవారం అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం రోళ్ల బహిరంగ సభలో ప్రసంగిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
దేశం మొత్తం చూసేలా పార్టీ ఎంపీలు,ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ధర్నా
♦  ఏడాదిగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైకపార్టీ వైఎస్సార్‌సీపీనే
♦  ప్రత్యేకహోదాపై టీడీపీకి చిత్తశుద్ధిలేదు, ఉంటే కేంద్ర మంత్రివర్గం నుంచి ఎందుకు తప్పుకోవడంలేదు?
♦  ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియని రాహుల్‌గాంధీ గురించి మాట్లాడటం అనవసరం
♦  రుణమాఫీ పేరుతో మోసం చేసిన చంద్రబాబుకు రైతుల ఉసురు తగులుతుంది
♦  ఏ వర్గాన్నీ వదలకుండా అందరినీ మోసం చేశాడు
♦  నాడు ఎన్టీఆర్‌కు, నేడు రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు
♦  పోరాడితేనే పలుకుతారు.. అందుకే మనం పోరాడాలి
♦  ఏ క్షణం ఎన్నికలు వచ్చినా టీడీపీ బంగాళాఖాతంలో కలుస్తుంది
♦  ‘అనంత’ రైతు భరోసాయాత్రలో నిప్పులు చెరిగిన విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి


(సాక్షి ప్రతినిధి, అనంతపురం): ప్రత్యేక  హోదాపై కేంద్రప్రభుత్వం ప్రకటన చేయకపోతే సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో చేసిన దీక్ష తరహాలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా, దీక్ష చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన 67 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు, వేలాదిమంది కార్యకర్తలతో ధర్నా చేస్తామని స్పష్టంచేశారు. ఏడురోజులుగా అనంతపురంలో సాగుతున్న మూడోవిడత రైతు భరోసా యాత్ర చివరిరోజు సోమవారం రొళ్ల మండలకేంద్రంలో ప్రజలనుద్దేశించి, హనుమంతనపల్లిలో మీడియాతో జగన్ మాట్లాడారు. ప్రతిపక్ష నేత ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే...
    
రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అలసత్వం వహిస్తున్నా చంద్రబాబు మాట్లాడరు. టీడీపీ మంత్రులు కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకోవాల్సి వస్తుందని ఆ అంశం గురించి నోరెత్తరు. కేంద్రంతో తెగదెంపులు చేసుకోరెందుకని వైఎస్సార్‌సీపీ ఎన్నోసార్లు నిలదీసింది. ఏడాదిగా ప్రత్యేకహోదా కోసం పోరాడింది వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే! రెండుసార్లు ప్రధాని, నాలుగుసార్లు ఆర్థికశాఖ కేంద్రమంత్రిని కలిశాం. కేంద్రానికి అర్థమయ్యేలా మంగళగిరిలో దీక్ష చేశాం. వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది కాబట్టే ప్రత్యేకహోదా ఇవ్వబోమని కేంద్రం చెప్పడంలేదు. ఇప్పటికైనా ప్రత్యేకహోదాపై ప్రకటన చేయకపోతే త్వరలో దేశం మొత్తం చూసేలా ఢిల్లీలో ధర్నా, దీక్ష చేస్తాం.

రెండు మూడు నెలలు ఎక్కడ ఉన్నారో కనపడని రాహుల్‌గాంధీ గురించి ఏం చెప్పాలి? ఆయన గురించి మాట్లాడటం అనవసరం. ఎవరేంటో ప్రజలకు బాగా తెలుసు. హుద్‌హుద్ తుపాను, బస్సుప్రమాదం, రైతుల ఆత్మహత్యలు.. ఇలా ఏ సంఘటన జరిగినా అక్కడ కన్పించేది వైఎస్ జగనే! ఈ విషయం ప్రజలకూ తెలుసు.
 
చంద్రబాబుకు రైతుల ఉసురు తగులుతుంది
చంద్రబాబు ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఇప్పుడు ఏం చేస్తున్నారని ఆలోచిస్తే గుండె తరుక్కుపోతోంది. రైతుల రుణాలను బేషరతుగా మాఫీ చేస్తానని ప్రతీ మీటింగ్‌లో చెప్పారు. కానీ భిక్షం వేసినట్లు వడ్డీకి కూడా సరిపోని విధంగా రుణమాఫీ అమలు చేశారు. చంద్రబాబు చేసిన మోసం, అప్పులబాధ తాళలేక రైతులు ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. ఈ ఉసురు చంద్రబాబుకు త ప్పక తగులుతుంది.
గతంలో రైతులకు బ్యాంకుల నుంచి పావలావడ్డీ, వడ్డీలేని రుణాలు అందేవి. ఇవాళ 14-18 శాతం అపరాధ వడ్డీ చెల్లిస్తున్నారు. ఈ వడ్డీ ఎవరు చెల్లిస్తారు? చంద్రబాబు కడతారా? బ్యాంకులో రుణాలు రెన్యువల్ కాలేదు, ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌సబ్సిడీ అందలేదు. కానీ రుణాలు మాఫీ అయ్యాయని రైతులు తనకు శాలువాలు కప్పుతున్నారని చంద్రబాబు సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఆయన అబద్ధాలకు ఇంకా పుల్‌స్టాప్ పెట్టలేదు.
మీ మాటలు నమ్మి మోసపోయి అప్పులబాధతో రైతులు ఆత్మహత్యలకు తెగిస్తున్నారని అసెంబ్లీలో చంద్రబాబును అడిగా! ఆత్మహత్యలను ఒప్పుకునేందుకు ఆయన మనసు ఒప్పుకోలేదు. రూ.5లక్షలు పరిహారం ఇవ్వాల్సి వస్తుందనే ఆయన ఒప్పుకోలేదు. ఆయన పబ్లిసిటీ వస్తుందంటే పరిహారం ఇస్తారు... లేదంటే లేదు. ఆత్మహత్యలను గుర్తించడంలో కూడా పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారు.
* డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోగా వారి పొదుపు అకౌంట్లలోని సొమ్మును బకాయిల్లో జమ చేసుకుంటున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని లేదంటే నెలకు రూ.2 వేలు నిరుద్యోగృభతి ఇస్తానని ఎన్నో అబద్ధాలు చెప్పారు. కానీ ఒక్క హామీ అమలు చేయలేదు. నాడు కూతుర్ని ఇచ్చిన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, ఇప్పుడు ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు. మళ్లీ ఎన్టీఆర్ ఫోటో పెట్టి దండ వేస్తున్నారు. అలాగే తన మోసాన్ని ప్రజలు మరిచిపోయారులే అని మళ్లీ ప్రజల్లోకి వచ్చి కల్లబొల్లి మాటలు చెబుతారు. ఇది ఆయనకు అలవాటే!

ప్రాజెక్టు నిర్మించినవాళ్లు గొప్పా? కుళాయి తిప్పి నీళ్లు వదిలినవారు గొప్పా?

చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు హంద్రీ-నీవా కోసం కేవలం రూ.13 కోట్లు కేటాయించారు. తర్వాత సీఎం అయిన వైఎస్సార్ రూ.5,800 కోట్లు కేటాయించారు. వైఎస్ హయాంలోనే హంద్రీ-నీవా పనులు 85 శాతం పూర్తయ్యాయి. కానీ జిల్లాకు వచ్చిన ప్రతీసారి హంద్రీ-నీవాకు నీళ్లు తానే ఇస్తున్నానని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారు. ప్రాజెక్టు నిర్మించినవాళ్లు గొప్పా? కుళాయి తిప్పి నీళ్లు వదిలినవారు గొప్పా?
ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే చంద్రబాబు పలకలేదు. బంద్‌చేస్తామని హెచ్చరిస్తే పలికారు. మునిసిపల్ కార్మికులు  14రోజులు సమ్మె చేస్తే పట్టించుకోలేదు. నాలుగు రోజుల్లో పరిష్కరించకపోతే బంద్ చేస్తామని చెబితే పలికారు. ఇలా పోరాటం చేసి ఒత్తిడి తెస్తేనే చంద్రబాబు కాస్తోకూస్తో పలుకుతారు. అందుకే అందరం కలసి చంద్రబాబుపై ఒత్తిడి తేవాలి.ఏ క్షణం ఎన్నికలు వచ్చినా టీడీపీ బంగాళాఖాతంలో కలుస్తుంది.
 
విత్తనాలు కూడా ఇవ్వలేని స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం
రైతు భరోసా యాత్రలో భాగంగా గుడిబండ మండలం పీసీగిరి సమీపంలోని బీడుపొలాల్లో రైతులు ఉండటం గమనించిన జగన్ కాన్వాయ్ నిలిపి వారి వద్దకు వెళ్లారు. గౌరమ్మ అనే మహిళా రైతు పొలంలోకి వెళ్లి ఆమెతో మాట్లాడారు. ‘‘జిల్లాలో 5.50 లక్షల క్వింటాళ్లు అవసరమైతే కేవలం రెండు లక్షల క్వింటాళ్లు మాత్రమే ఇచ్చారు. వీటిని కూడా టీడీపీ నేతలు బ్లాక్‌మార్కెట్లో అమ్ముకుంటూ దొరికారు. జిల్లాల్లో 20 లక్షల ఎకరాల్లో పంటలు సాగవ్వాలి. ఇప్పటివరకూ కేవలం ఐదు లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు.

కనీసం విత్తనాలిస్తే రెండు వర్షాలు పడితే విత్తనం వేద్దాం, పంట పండుతుంది, పశువులకు మేతయినా దొరుకుతుందని రైతులు ఆశపడుతున్నారు. కానీ విత్తనాలు కూడా ఇవ్వలేని దుర్భరస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది’’ అని జగన్ మండిపడ్డారు. అదే ప్రాంతంలో గొర్రెలు మేపుతున్న కాపరుల సమస్యలపై ఆరా తీశారు. వైఎస్ హయాంలో గొర్రెలకు ఇన్సూరెన్స్ వచ్చేదనీ, ఇప్పుడు రావడంలేదనీ వారు జగన్‌కు చెప్పుకున్నారు. గొర్రెలకు మేత, నీళ్లు లేక కర్ణాటక వలస పోతున్నామని చెప్పారు. చంద్రబాబు హయాంలో అందరికీ కష్టాలేననీ, అందరం కలిసి పోరాడదామని జగన్ వారికి ధైర్యం చెప్పారు.
Share this article :

0 comments: