* మంగళగిరి చేనేత వస్త్రాలను పంపిణీ చేయాలి
* రాజధాని శంకుస్థాపన రోజునే ఎయిమ్స్కూ శంకుస్థాపన చేయాలి
మంగళగిరి: రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో కోట్లాది రూపాయల భూములను అమాయక రైతులను మాయచేసి, మభ్యపెట్టి, బెదిరించి, మోసం చేసి లాక్కున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పండుగ రోజు పంచె, చీరె పంపిణీ చేస్తామని చెప్పడం రైతులను అవమానపరచడమేనని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) అన్నారు.
పండుగకు పంచె, చీరె కొనుక్కోలేని స్థితిలో వారున్నట్లు అనుకుంటున్నారా అని మండిపడ్డారు. బుధవారం ఎమ్మెల్యే సాక్షితో మాట్లాడుతూ అదే ప్రాం తంలో ఉపాధికోల్పోయి అల్లాడిపోతున్న రైతుకూలీలు, కౌలు రైతులు, చేతి వృత్తుల వారు, లంకభూములు, అసైన్డ్, దేవాదాయ శాఖ భూములు సాగుచేసే రైతులు కనిపించలేదా? అని ప్రశ్నించారు. వారు మాత్రం పండుగ చేసుకోరా? అని అడిగారు. ఒక వేళ చీరె, పంచెలను పంపిణీ చేయదలిస్తే, మంగళగిరిలో చేనేత కార్మికులు నేసిన వస్త్రాలనే పంపిణీ చేసి నేతన్నలను ఆదుకోవాలని కోరారు. ఆప్కో కొనుగోలు చేయకపోవడంతో లక్షలాది రూపాయల నేత వస్త్రాలు నిల్వలు పేరుకుపోయాయని, వాటిని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు పంపిణీ చేయాలని సూచించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి మంగళగిరి శానిటోరియంలో ఎయిమ్స్(అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ) నిర్మాణం జరుగుతుందని ప్రచారం చేశారన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు తొత్తులుగా మారిన ప్రభుత్వం దాని నిర్మాణం నిలిపివేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో రాజధానికి శంకుస్థాపన రోజే ఎయిమ్స్కు కూడా శంకుస్థాపన చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హితవు పలికారు.
ఒకవైపు నీటిపారుదల శాఖ ప్రకాశం బ్యారేజిపై భారీ వాహనాలు తిరిగితే ప్రమాదం అని వాటిని నిషేధిస్తే, అక్రమంగా నిర్మించిన సీఎం విశ్రాంతి గృహం అవసరాల కోసం భారీ వాహనాలు తిప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మరోవైపు రాజధాని ప్రాంతంలోని అధికారులతో పాటు సీఆర్డీఏ కమిషనర్ నుంచి అటెండర్ వరకు రోజంతా చంద్రబాబు అవినీతి సంపాదనకు మార్గా లు వెతుకుతూ ప్రజాసమస్యలను, ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారని విమర్శించారు.
విదేశీయులను ఆహ్వానించాలంటే కేంద్రప్రభుత్వం ద్వారా ఆహ్వానించాలని, చంద్రబాబు మాత్రం దేశంలో తనకంటే ఎవరు గొప్పఅనే రీతిలో వ్యవహరిస్తూ కేంద్రప్రభుత్వాన్ని పక్కనపెట్టి తానే విదేశీ నాయకులను ఆహ్వానించడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం కుమారుడు ఆస్తులు వెల్లడించిన దానిలో నిజమెంతుందో అందరికీ తెలిసిపోయిందన్నారు. రాజధానిని నిర్మించేది తానొక్కడినేనంటున్న బాబు తన కొరకు, తన వందిమాగదుల కొరకు ఆ పేరుతో వ్యాపారం చేస్తున్నారని రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదని ఆర్కే హెచ్చరించారు.
0 comments:
Post a Comment