01 February 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

రెండో పంట.. రైతుల హక్కు: పార్థసారధి

Written By news on Saturday, February 7, 2015 | 2/07/2015


రెండో పంట.. రైతుల హక్కు: పార్థసారధి
హైదరాబాద్: త్వరలో వైఎస్ ఆర్ సీపీ రైతుహక్కు పరిరక్షణ కమిటీ ఏపీ రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నట్టు వైఎస్ ఆర్ సీపీ నేత పార్థసారధి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను రెండో పంట వేయొద్దని ఏపీ ప్రభుత్వం చెప్పడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రెండో పంట వేసుకునే రైతులకు వైఎస్ ఆర్ సీపీ అండగా ఉంటుందని పార్థసారధి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో నూతన రాజధాని నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం రాజధాని ప్రాంత రైతుల నుంచి భూములు కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుల తరపున వైఎస్ ఆర్ సీపీ పోరాడుతుందుని ఆయన చెప్పారు.

అమాయక రైతుల భూములు లాక్కుని ఏపీ రాజధాని నిర్మించాలనుకోవడం దారుణమన్నారు. రాజధానికి వైఎస్ ఆర్ సీపీ వ్యతిరేకం కాదని పార్థసారధి స్పష్టం చేశారు. అవసరమైతే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కూడా రాజధాని గ్రామాల్లో పర్యటిస్తారని పార్థసారధి చెప్పారు.

విగ్రహాల తొలగింపులో రాజకీయ కక్ష: అంబటి

 కక్షతో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను తొలగించినా, తరలించినా వైఎస్ ఆర్ సీపీ కార్యకర్తలు, వైఎస్ ఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరని వైఎస్ ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు హెచ్చరించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దురుద్దేశంతో వ్యవహరిస్తే ప్రతిఘటిస్తామన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దురద్దేశంతో వైఎస్ ఆర్ విగ్రహాన్ని తాకితే ఏ శక్తి ఉందో తెలుస్తుందని చెప్పారు.

ఎన్టీఆర్ ను విగ్రహాంగా మార్చింది చంద్రబాబు కాదా?  అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని చెప్పారు. టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్టు కొన్ని ఛానల్స్ లో వస్తున్న ప్రచారం అవాస్తవమని అంబటి ఖండించారు. కాగా, వైఎస్ ఆర్ సీపీ మానవతా దృక్పథంతోనే పోటీ చేయడం లేదని అంబటి స్పష్టం చేశారు.

సుధారాణి కుటుంబాన్ని బెదిరిస్తున్నారు

హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) బిల్లును అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ సర్కార్ దురాగతాలకు పాల్పడుతుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. శనివారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. భూములు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న రైతులు అభ్యంతర ఫారాలను ఇవ్వడానికి వెళ్తే గడువు ముగిసిపోయిందంటూ సర్కారు వేధింపులకు గురిచేస్తుందన్నారు. ఇందులో భాగంగానే రైతు బోయపాటి సుధారాణి ఇంటికి పోలీసులు, టీడీపీ నేతలు వెళ్లి బెదిరింపులకు దిగుతున్నారన్నారు.
సుధారాణి కుటుంబం వారి బెదిరింపులకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని ఆయన తెలిపారు. అమాయక రైతులను పోలీసులు వేధిస్తున్నారని.. ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే తీవ్ర ఉద్యమం తప్పదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

బాబూ.. నాటి మాటలేమయ్యాయి!


బాబూ.. నాటి మాటలేమయ్యాయి!
  • బాబుపై వైఎస్సార్‌సీపీ వాసిరెడ్డి పద్మ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు 2013 సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపుదలను వ్యతిరేకిస్తూ చెప్పిన మాటలు ఏమయ్యాయని వైఎస్సార్‌సీపీ సూటిగా ప్రశ్నించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీలు పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, అలాగే పెట్రోల్, డీజిల్‌పై పెంచిన వ్యాట్ పన్నును వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

విద్యుత్ చార్జీలు పెంచాలనే ఆలోచనను మానుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజాందోళన చేపడతామని హెచ్చరించారు. 2013 ఏప్రిల్ 2న చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో కాకినాడ సభలో మాట్లాడుతూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరే కించారని ఆమె గుర్తుచేశారు.

తాను అధికారంలోకొస్తే విద్యుత్ చార్జీలు అసలు పెంచనని, కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన చార్జీలను కూడా తగ్గిస్తానని ఆ రోజున ప్రకటించిన చంద్రబాబు ఈరోజు ప్రజలపై భారం మోపడం దారుణమని వ్యాఖ్యానించారు. ‘‘పెంచిన చార్జీలను బేషరతుగా తగ్గించాలని, లేకుంటే ప్రభుత్వం నుంచి వైదొలగాలని కూడా చంద్రబాబు ఆరోజు డిమాండ్ చేశారు.  ప్రభుత్వం నుంచి వైదొలగకపోతే ప్రజలు తిరగబడాలని కూడా పిలుపునిచ్చారు. ఆరోజు ప్రజలకు భారం అనిపించిన విద్యుత్ చార్జీలు ఈరోజు భారంగా బాబుకు అనిపించడం లేదా ?’’ అని ఆమె ప్రశ్నించారు.
 
ఉద్యమించిన వారిని పొట్టన పెట్టుకున్న చరిత్ర మీది...

చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలోనూ ఏటా కరెంటు చార్జీలు పెంచడమేగాక అందుకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారిపై కాల్పులు జరిపి పొట్టన బెట్టుకున్నారని పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత  వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాలనలో ఏనాడూ విద్యుత్ చార్జీలు, పన్నులు, ఆర్టీసీ చార్జీలు పెంచలేదని, ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్ సీఎంలు, చంద్రబాబు చార్జీలు పెంచుతున్నారని తెలిపారు.

నేడు కర్నూలుకు వై.ఎస్.జగన్


నేడు కర్నూలుకు వై.ఎస్.జగన్ రాక
కర్నూలు (ఓల్డ్‌సిటీ) : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శనివారం కర్నూలుకు రానున్నారు. నగరంలో జరగనున్న విశ్వభారతి హాస్పిటల్స్ అధినేత డి.కాంతారెడ్డి కూతురి పెళ్లికి ఆయన హాజరుకానున్నారు.
 
 కాంతారెడ్డి, అనురాధ దంపతుల కుమార్తె నిహారిక వివాహం.. వైఎస్సార్ కడప జిల్లా పులివెందులకు చెందిన మల్లపు శివశంకర్‌రెడ్డి, ఉషాప్రియ దంపతుల కుమారుడు హితేశ్‌రెడ్డితో జరగనుంది. వివాహ ముహూర్తం శనివారం ఉదయం 11.31 గంటలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థానిక నందికొట్కూరు రోడ్డులోని ఎస్.ఎస్.గార్డెన్ ఫంక్షన్ హాల్‌కు రానున్నారు. పెళ్లికి హాజరై  తిరిగి సాయంత్రం  హైదరాబాద్‌కు చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

రైతులను భయపెడితే చూస్తూ ఊరుకోం

Written By news on Friday, February 6, 2015 | 2/06/2015


'రైతులను భయపెడితే చూస్తూ ఊరుకోం'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజధాని నిర్మాణం కోసం రైతులనుంచి ఏపీ ప్రభుత్వం భూములు కోరిన నేపథ్యంలో విజయవాడలోని కృష్ణానదిలో రాజధాని ప్రాంత రైతులు శుక్రవారం వినూత్న నిరసనకు దిగారు. మోకళ్ల లోతు వరకూ నీళ్లలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. సీఆర్ డీఏ కమిషనర్ శ్రీకాంత్ వైఖరికి నిరసనగా వైఎ స్ ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో రైతుల ఇళ్లు తీసుకుంటామని, నోటిఫై చేసిన ప్రతి సెంట్ భూమిని తీసుకుంటామని సీఆర్ డీఏ కమిషనర్ అంటున్నారని ఆర్కే చెప్పారు.

రోజురోజుకీ రైతులను సీఆర్ డీఏ కమిషనర్ శ్రీకాంత్ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రెండో పంట వేయొద్దని చెప్పే అధికారం సీఆర్ డీఏ కమిషనర్ కు ఎక్కడదంటూ ధ్వజమెత్తారు. ఆయన అధికారా? రాజకీయ నేతా? అంటూ ప్రశ్నించారు. రైతులను సీఆర్ డీఏ కమిషనర్ భయపడితే తాము చూస్తూ ఊరుకోమంటూ ఆర్కే స్పష్టం చేశారు.

గూండాగిరీని ప్రోత్సహిస్తున్నారు


గూండాగిరీని ప్రోత్సహిస్తున్నారు
హైదరాబాద్: ఏపీ రాజధానికోసం ఎంపిక చేసిన గ్రామాల్లో సీఎం చంద్రబాబునాయుడు గూండాగిరీని ప్రోత్సహిస్తూ భూములివ్వని రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. సీఆర్‌డీఏ ప్రాంత రైతులు తమ పొలాలివ్వం మొర్రో అని వేడుకుంటున్నా కర్కశంగా వారిని బెదిరించి లాక్కోవాలని టీడీపీ ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. ల్యాండ్ పూలింగ్(భూ సమీకరణ) అనే పదం వినడానికి చక్కగా ఉన్నా దాని మాటున జరుగుతున్నదంతా గూండాగిరీయేనన్నారు.

రాజధాని ప్రాంతంలో టీడీపీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బడా నేతలు భూములను కొనుగోలు చేశారని, అయితే వాటిని రాజధాని నిర్మాణంకోసం తీసుకోండని ఏ ఒక్క నేతా స్వచ్ఛందంగా ఎందుకు ముందుకు రావట్లేదని, సీఎం కూడా తన సొంత పార్టీ నేతలను భూములివ్వాలని ఎందుకు పిలుపునివ్వట్లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. గత నెలలో రాజధాని గ్రామాల రైతులు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్దకొచ్చి ఎలా వేధిస్తున్నదీ తెలిపారన్నారు.

తన పొలాలిస్తారా: రైతు సుధారాణి
ఏటా మూడు పంటలు పండించుకునే తమ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోమని రాజధాని ప్రాంతంలోని కిష్టాయపాలెంకు చెందిన రైతు బోయపాటి సుధారాణి స్పష్టం చేశారు. తమ భూములను లాక్కోవాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై ఆమె ఆగ్రహం వెలిబుచ్చుతూ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను వాసిరెడ్డి పద్మ విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. తమ భూములివ్వబోమని ఆయా గ్రామాల్లో రైతులు చేస్తున్న ఊరేగింపులను కూడా వీడియోలో ప్రదర్శించారు.

బాబు మాటల్ని కేంద్రం నమ్మలేదు..
కేంద్రం ఆర్థిక వనరుల వ్యత్యాసం కింద రాష్ట్రప్రభుత్వానికి రూ.500 కోట్లు మాత్రమే ఇచ్చిందని,వెనుకబడిన ప్రాంతాలకు రూ.350 కోట్లు ఇచ్చిందని పద్మ ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉందన్న బాబు మాటలను కేంద్రం నమ్మలేదన్నారు

చంద్రన్న సంచి... అవినీతిలో నుంచి..


చంద్రన్న సంచి... అవినీతిలో నుంచి...
చంద్రన్న సంక్రాంతి సరుకుల పంపిణీ అభాసుపాలు కాగా వాటి కోసం పంపిణీ చేసిన సంచులు గోడౌన్లలో మూలుగుతున్నాయి. కార్డుదారులకు ఇచ్చే సరుకుల కన్నా ... ఆ సరుకులు వేసుకునే సంచుల ప్రచారంపైనే పాలకులు దృష్టి పెట్టడంతో జిల్లా వ్యాప్తంగా లక్షల రూపాయల విలువైన సంచులు గోడౌన్లపాలయ్యాయి. ఆకలి తీర్చే ఆర్తి కన్నా కమీషన్ల కక్కుర్తే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. డబ్బులు లేవంటూ బీద అరుపులు అరుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంచులకే కోట్లు వ్యయం చేయడం ... ఆచరణలో వాటిని దుర్వినియోగం చేయడాన్ని ఏ విధంగా సమర్ధించుకుంటారని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
 
లాభం గోరంత ... వ్యయం కొండంత
ప్రజాధనం దుర్వినియోగం
గోడౌన్లలో మగ్గుతున్న చంద్రన్న సంచులు
కమీషన్ల కక్కుర్తే ఇందుకు కారణం


దర్శి : పేదలసంక్షేమ పథకాల కోసం డబ్బులు లేవంటూ చేతులెత్తేస్తున్న ప్రభుత్వం పచ్చచొక్కా కాంట్రాక్టర్ల కోసం కోట్ల రూపాయల ధనం దుర్వినియోగం చేస్తోందనడానికి చంద్రన్న సంక్రాంతి కానుకల సంచులే ఓ ఉదాహరణ. రాష్ట్రంలో గత జనవరి నెలలో అత్యంత ఆర్భాటంగా కోట్ల రూపాయలు వెచ్చించి చంద్రన్న కానుకల పేరిట ఆరు ఉచిత సరుకుల సరఫరాకు శ్రీకారం చుట్టింది. ఆ సరుకులన్నీ కార్డుదారుడు వేసుకోడానికి వీలుగా సంచులు ఏర్పాటు చేయాలని భావించింది. అనుకున్నదే తడవుగా ఒక్కో సంచికి రూ.12 రూపాయలు వెచ్చించి సర్కారుకు అనుకూలమైన ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించింది.

ఒప్పందం ప్రకారం సకాలంలో సంచులు ఇవ్వలేకపోవడంతో అప్పటికప్పుడు ప్లాస్టిక్ సంచులు కొనుగోలు చేసి రేషన్ డీలర్లకు ప్రభుత్వం అందజేసింది. గడువు లోపల సంచులు ఇవ్వకపోతే కాంట్రాక్టును రద్దు చేసి బిల్లులను నిలిపి వేయాలి. కానీ దీనికి భిన్నంగా జిల్లాకు వచ్చిన సంచులన్నీ ఆయా డీలర్లకు సరఫరా చేసేయడంతో ఈ సమస్య తలెత్తింది. జిల్లాలో 8,38,423 మంది రేషన్ కార్డుదారులున్నారు. ఆ విధంగా చూస్తే జిల్లాకు 8 లక్షలకు పైగా సంచులు వచ్చినట్టే. అంటే ఒక్కో సంచి రూ. 12 ధర పలికితే 8 లక్షల సంచులకు కోటి రూపాయలపైగానే వెచ్చించారు.

జిల్లా పౌర సరఫరా కార్యాలయానికి వచ్చిన సంచులను కొంతమంది పెద్దల ఒత్తిడి ఫలితంగా ఆయా మండలాలకు పంపించేశారు. చాలా మండలాలకు గడువు అయిపోయాక రావడంతో గోడన్లలో వృధాగా పడి ఉన్నాయి. అవసరం లేకపోయినా కమీషన్ల కక్కుర్తితో ఆయా డీలర్లకు వీటిని అంటగట్టారన్న విమర్శలున్నాయి. దర్శి, దొనకొండ పరిధి గోడౌన్లలో స్థలం లేక బయటనే వీటిని పడవేశారు.

జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకుంది. దర్శి నియోజకవర్గంలో 66,308 మంది రేషన్‌కార్డుదారులున్నారు. దర్శి మండలంలో 18,652, దొనకొండ 11537, ముండ్లమూరు 14481, కురిచేడు 9847, తాళ్ళూరు 11791 మంది రేషన్ కార్డుదారులున్నారు. అంటే ఒక్క దర్శి నియోజకవర్గంలోనే సుమారు రూ.7 లక్షల విలువై న సంచులు బూడిదలో పోసిన పన్నీరులా తయారయ్యాయి.
 
సకాలంలో రాకపోవడం వల్లే...
ఎన్‌ఫోర్సుమెంట్ డీటీ కృష్ణారావును వివరణ కోరగా...గోడౌన్‌కు ‘చంద్రన్న సంక్రాంతి సంచులు’ వచ్చినట్లు నాకు తెలియదు. సమయానికి సంచులు రాకపోవడం వల్లనే వాడుకోలేకపోయాం. వాటికి బదులు ప్లాస్టిక్ కవర్లను ప్రభుత్వం సరఫరా చేసింది.

తెలుగుదేశం ఏజెంటుల్లా అధికారులు

హైదరాబాద్: అధికారులు తెలుగుదేశం పార్టీ ఏజెంటుల్లా వ్యవహరిస్తూ.. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదంటూ పీలేరు వైఎస్సార్‌సీపీ శాసన సభ్యుడు హైకోర్టును ఆశ్రయించారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, చిత్తూరు జిల్లా కలెక్టర్, మదనపల్లి ఆర్‌డీవో, చిత్తూరు జెడ్పీ సీఈవో తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలకు తనను పిలవకుండా తనపై పోటీ చేసి ఓడిపోయిన అధికార పార్టీ అభ్యర్థి ఇక్బాల్ అహ్మద్ ఖాన్‌ను పిలుస్తున్నారని, రామచంద్రారెడ్డి పిటిషన్‌లో వివరించారు.

ఆ పెంపును ఉపసంహరించాల్సిందే


ఆ పెంపును ఉపసంహరించాల్సిందే
  • వైఎస్సార్‌సీపీ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను, పెట్రోలు, డీజిల్‌పై పెంచిన వ్యాట్‌ను తక్షణం ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విద్యుత్ చార్జీల పెంపుపై ఒక్క అడుగు ముందుకు పడినా, ఒక్క పైసా చార్జీలు పెంచినా ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించింది.

కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో పైసా విద్యుత్ చార్జీలు పెంచేది లేదని, 2013-14లో పెంచిన విద్యుత్ చార్జీలు కూడా తగ్గిస్తామని 2013 ఏప్రిల్ 2న కాకినాడలో తాను చేసిన ప్రకటన కనీసం చంద్రబాబునాయుడుకు గుర్తుందా అని ప్రశ్నించింది. 1994 నుంచి నేటివరకు ఈ 21 ఏళ్ల కాలంలో టీడీపీ మొదటి పదేళ్లు పరిపాలించి ఏటా కరెంటు చార్జీల వాత పెట్టే విధానాన్ని అనుసరించిందని గుర్తుచేసింది. 2004-2009 మధ్య దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల మూడు నెలల కాలంలో మాత్రమే రాష్ట్రంలో ఏ ఒక్క కేటగిరీకి ఒక్క పైసా కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదని గుర్తుచేసింది.

2004-2009 మధ్య రైతులకు సరఫరా చేసిన ఉచిత విద్యుత్తు 800 కోట్ల యూనిట్ల నుంచి 1,400 కోట్ల యూనిట్లకు పెరిగినా ఆ ఐదేళ్లలో ఒక్క పైసా కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదని, ఆర్టీసీ చార్జీలు, పన్నులు కూడా పెంచని ఏకైక సువర్ణయుగం అదేనని పేర్కొంది. వైఎస్సార్ మరణం తరువాత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు.. చంద్రబాబు బాటలో నడిచి వేలకోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపారని, ఆనాడు ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ధరలు టన్నుకు 130 నుంచి 140 డాలర్ల మధ్య ఉండడాన్ని కారణంగా పేర్కొన్నారని తెలిపింది.

ఈ రోజు క్రూడ్ ఆయిల్ ధర ఒకప్పటి 110 డాలర్ల నుంచి బ్యారల్‌కు 50 డాలర్లు పడిపోయిందని, బొగ్గు ధరలు కూడా 130-140 డాలర్ల నుంచి 62 డాలర్లకు పడిపోయాయని ఇలాంటి సమయంలో కరెంటు చార్జీలు తగ్గించాల్సింది పోయి పెంచే ప్రయత్నం చేయడం అంటే ప్రజలతో చెలగాటం ఆడటమేనని పేర్కొంది. దేశంలోనే వ్యాట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని ప్రతిపక్ష నాయకుడిగా వాదించిన చంద్రబాబు ఈ రోజున పెట్రో ఉత్పత్తులపై మరో రెండు శాతం వ్యాట్ పెంచడం సిగ్గుచేటని విమర్శించింది. పెంచిన వ్యాట్‌ను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసింది. 2013 మార్చి, ఏప్రిల్ నెలల్లో విద్యుత్ చార్జీలు పెంచినపుడు చంద్రబాబునాయుడు ఏం మాట్లాడారో గుర్తుతెచ్చుకోవాలని సలహా ఇచ్చింది.
 
2013లో చంద్రబాబు ఏం మాట్లాడారు?

పెంచిన కరెంటు చార్జీలను బేషరతుగా తగ్గించాలని లేకుంటే ప్రభుత్వం నుంచి వైదొలగాలని, విద్యుత్ చార్జీల పెంపు ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని, ప్రభుత్వ చేతకాని తనానికి ప్రజలు పరిహారం చెల్లించాలా.. అని ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబునాయుడు ప్రశ్నించారని గుర్తుచేసింది. పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, విద్యుత్ చార్జీలు తగ్గించే వరకు సర్కారుపై తిరగబడాలని చంద్రబాబునాయుడు పిలుపు నిచ్చారని.. మరి ఈ రోజున ప్రజలు చంద్రబాబు సర్కారు మీద తిరగబడరా? అని వైఎస్సార్‌సీపీ ప్రశ్నించింది. విద్యుత్ చార్జీలు తగ్గించే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని 2013 ఏప్రిల్ 1న కాకినాడలో చంద్రబాబు ప్రకటించారని, ఈ ప్రభుత్వాన్ని కూడా ఒక్క పైసా విద్యుత్ చార్జీలు పెంచినా ప్రజలు వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది.

జనంపై విద్యుత్ చార్జీల మోత!


జనంపై విద్యుత్ చార్జీల మోత!
  • భారం రూ.1,261 కోట్లు
  •  ఏపీఈఆర్‌సీకి టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించిన విద్యుత్ పంపిణీ సంస్థలు
  •  ఈఆర్‌సీ ఆమోదమే తరువాయి..
  •  ఏప్రిల్ నుంచే అమలు!
సాక్షి, హైదరాబాద్: ఊహించినట్టే ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు విద్యుత్ షాక్ ఇచ్చింది. వారిపై భారీ ఎత్తున విద్యుత్ చార్జీల భారాన్ని వేసేందుకు సిద్ధపడింది. గృహ వినియోగదారులు మొదలుకుని పరిశ్రమల వరకూ అన్నింటిపైనా చార్జీల మోత మోగించింది. పేదలపై భారం పడనివ్వబోమని పైకి చెబుతూనే.. డిమాండ్ చార్జీల పేరుతో దొంగదెబ్బ సైతం తీసింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ చార్జీల ప్రతిపాదనలను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు గురువారం ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్(ఏపీఈఆర్‌సీ)కు సమర్పించాయి. వీటికి కమిషన్ అనుమతినివ్వడమే ఆలస్యం.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెంచిన విద్యుత్ చార్జీలను రాష్ట్ర ప్రజలు మోయకతప్పదు. ఈ మొత్తం విలువ రూ.1,261 కోట్లు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరేళ్లపాలనలో ఏనాడూ ఒక్కపైసా విద్యుత్ చార్జీలు పెరగలేదు. ప్రస్తుతం చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టిన ఎనిమిది నెలలకే జనం జేబుకు చిల్లు పెట్టడం విశేషం. వంద యూనిట్లలోపు గృహ వినియోగదారులపై కనికరం చూపించామని చెబుతున్న సర్కారు, ఆపైబడిన వినియోగదారులకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. వందకు ఒక్క యూనిట్ దాటినా, 50 యూనిట్ల నుంచే పెరిగిన భారాన్ని మీద వేసే పథక రచన చేసింది.

మధ్యతరగతి, వాణిజ్య వర్గాలు, పారిశ్రామిక, చేతివృత్తులను చావుదెబ్బ కొట్టింది. చేనేతలను ఉద్ధరిస్తానని చెప్పిన సర్కారు.. మరమగ్గాలకు చార్జీల పెంపును బహుమతిగా ఇచ్చింది. పెనుభారాన్ని వేసి చేనేత చితికిపోయేలా చేసింది. కాటేజీ ఇండస్ట్రీపై ఏకంగా కోటి రూపాయలు దండుకోవాలనుకుంది. నిధుల కోతతో అల్లాడుతున్న పంచాయతీలకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. వీధి దీపాలకయ్యే ఖర్చును అమాంతం రూ.25 కోట్లకు పెంచింది.

పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్న ఔత్సాహికులను తీవ్రంగా నిరాశ పరిచింది. నష్టాల ఊబిలో ఉన్న పరిశ్రమలపై చార్జీల భారం మోపి భయపెట్టింది. ఈ రంగం నుంచి ఏకంగా రూ.645 కోట్లు దండుకోవాలని నిర్ణయించింది. వాణిజ్య వర్గాల వెన్నువిరిచేలా రూ.71 కోట్ల భారాన్ని మోపింది. వీటిపై వేసిన భారం ఏకంగా రూ.81 కోట్లు.
 
గృహ వినియోగదారులపై పెను భారం..

100 యూనిట్లు దాటిన వినియోగదారులు(ఎల్‌టీ-సీ, డీ కేటగిరీలు) దాదాపు 25 లక్షల మందిపై విద్యుత్ చార్జీల భారం పడింది. ప్రతిపాదిత చార్జీలనే అమలు చేస్తే గృహ వినియోగదారులు మరో రూ.144 కోట్లు చెల్లించాలి. ఎప్పుడో కాలం చెల్లిన ఎఫ్‌ఎస్‌ఏలనూ పేరు మార్చి ట్రూ-అప్ చార్జీలుగా వసూలు చేయాలని నిర్ణయించింది. దీని పరిధిలోకి 99 లక్షలమంది వస్తారు. యూనిట్‌కు 16 పైసలతో మొదలైన పెంపు, కేటగిరీ వారీగా పెరుగుతూ వచ్చింది.

500 వందల యూనిట్ల పైబడి వాడితే, ఏకంగా రూ.300 వరకూ అదనంగా బిల్లు చేతికొచ్చే వీలుంది. విద్యుత్ పంపిణీ సంస్థలు వార్షిక ఆదాయ, అవసర నివేదికలను మాత్రమే తమకు సమర్పించాయని ఏపీఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ గ్రంథి భవానీప్రసాద్ తెలిపారు. దీనిపై ఈ నెల 23, 24న విశాఖపట్నంలో, 25న కాకినాడ, వచ్చేనెల 4న హైదరాబాద్‌లో విచారణ ఉంటుందని చెప్పారు. అదేవిధంగా ఈ నెల 26న గుంటూరు, 27, 28న తిరుపతిలో విచారణ చేపడతామన్నారు.


వైఎస్‌ఆర్‌సీపీ పోరుపథం


వైఎస్‌ఆర్‌సీపీ పోరుపథం
సాక్షి, ఖమ్మం: నూతన రాష్ర్టంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, ప్రజా సమస్యలపై ఉద్యమ బాట పట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఇంకా అర్హులకు అందని పింఛన్లు, ఆహార భద్రత కార్డులు తదితర ప్రజా సమస్యలపై ఉద్యమ బాట పట్టాలని పార్టీ నేతలు నిర్ణయించారు. సంక్షేమ పథకాలు అందక ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని సంకల్పించారు. అర్హుల పింఛన్లు కూడా ప్రభుత్వం తొలగించడంతో ఇప్పటికే వైఎస్సార్‌సీపీ జిల్లాలో నిరసన కార్యక్రమాలు నిర్వహించింది.

ఇంకా వేల మంది అర్హులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతుండడంతో వారికి భరోసానిచ్చేలా ప్రభుత్వంపై ఉద్యమించేందుకు కేడర్ కదం తొక్కేందుకు సమాయత్తమవుతోంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని మరింతగా బలోపేతం చేసే దిశగా ముందుకెళ్లాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది. స్థానిక సంస్థలు, సార్వత్రిక, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కేడర్ కదం తొక్కడంతో అదే రీతిలో త్వరలో రానున్న ఖమ్మం కార్పొరేషన్  ఎన్నికలపై ఇప్పటి నుంచే కార్యకర్తలను కదిలించాలని పార్టీ యోచిస్తోంది. నెల వారీగా ఏ నిరసన కార్యక్రమాలు తీసుకోవాలో ఈ సమావేశంలో పొంగులేటి నేతృత్వంలో చర్చించనున్నారు. జిల్లాలో పార్టీ చేపట్టేబోయే కార్యక్రమాలు, పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేసేందుకు శుక్రవారం ఖమ్మంలోని ఎస్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ఇందుకు వేదిక  అవుతోంది.

ఈ సమావేశానికి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. పార్టీ జిల్లా కేడర్‌కు పొంగులేటి భవిష్యత్ ఉద్యమ ప్రణాళికపై దిశానిర్దేశం చేస్తారు.
 పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిల్లా స్థాయి సమీక్ష చేస్తుండడంతో జిల్లా నలుమూలల నుంచి నేతలు భారీ ఎత్తున తరలిరావడానికి సిద్ధమయ్యారు.

ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో జిల్లా ప్రజల సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిర్వహించాల్సిన పోరాటాలపై చర్చించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, మండల పార్టీ కన్వీనర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, సొసైటి చైర్మన్లు, డెరైక్టర్లు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

విద్యుత్ ఛార్జీలను పెంచితే ఉద్యమం తప్పదు: వైఎస్సార్ సీపీ

Written By news on Thursday, February 5, 2015 | 2/05/2015


ఏపీలో విద్యుత్ ఛార్జీలను పెంచితే ఉద్యమం తప్పదు: వైఎస్సార్ సీపీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పెట్రోల్, డీజిల్ పై పెంచిన వ్యాట్ ను తక్షణం ఉపసంహరించుకోవాలని ఓ ప్రకటనలో కోరింది.  ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచరాదని గతంలో డిమాండ్ చేసిన చంద్రబాబు ఆ విషయం గుర్తుంచుకోవాలని సూచించింది. గత 10 ఏళ్ల టీడీపీ పాలనలో ప్రతి ఏటా కరెంట్ ఛార్జీలు పెంచే విధానాన్నే అనుసరించిందని ఎద్దేవా చేసింది.
 
వైఎస్ సీఎంగా ఉన్న కాలంలో ఏ ఒక్క కేటగిరిలో కూడా ఒక్క పైసా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని గుర్తు చేసింది. వ్యాట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటి అని చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నపుడు వాదించిన విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలని వైఎస్ఆర్ సీపీ పేర్కొంది. అయితే  పెట్రో ఉత్పత్తులపై మరో రెండు శాతం వ్యాట్ పెంచడం సిగ్గుచేటని విమర్శించింది. విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా పెంచినా చంద్రబాబును ప్రజలు వదిలిపెట్టే పరిస్థితి లేదని హెచ్చరించింది. విద్యుత్ ఛార్జీలు పెంపుపై ఏపీ సర్కారు ఒక్క అడుగు ముందుకు వేసినా, ఒక పైసా పెంచినా ఉద్యమం తప్పదని వైఎస్ఆర్ సీపీ హెచ్చరించింది.

వైఎస్ జగన్ పర్యటన ఫోటోలు










అధైర్య పడొద్దు.. మీకు అండగా ఉంటా

  • మోరంపూడి రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు జగన్ భరోసా
  • ఏ అవసరమొచ్చినా అందుబాటులో ఉంటానని హామీ
  • కన్నీరుమున్నీరైన బాధితులు..
  • తమ ఆవేదనను జగన్‌తో పంచుకున్న ఆయా కుటుంబాలవారు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘అధైర్యపడొద్దు.. నేను అండగా ఉంటాను.. ఏ అవసరమొచ్చినా మీకు అందుబాటులో ఉంటా’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజమండ్రి మోరంపూడి జంక్షన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం.. బాధిత కుటుంబాలకు భరోసానిచ్చారు. ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇనపకోళ్ల దుర్గాప్రసాద్, శివనేని మహాలక్ష్మి, ర్యాలి వెంకన్న మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ విషాద ఘటనను తెలుసుకుని చలించిపోయిన జగన్ ఆ కుటుంబాల వారిని పరామర్శించేందుకు బుధవారం తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు.
మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో రాజమండ్రి మధురపూడి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్ రాజమండ్రి, కరప మండలాల్లో బాధిత కుటుంబాలను పరామర్శించారు. మోరంపూడి రోడ్డు ప్రమాదంలో ఏడోతరగతి చదువుతున్న దుర్గాప్రసాద్ మృతిచెందగా, బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి తల్లి విజయలక్ష్మిని జగన్ పరామర్శించారు. తామంతా అండగా ఉన్నామంటూ భరోసానిచ్చారు. వైద్యులనడిగి ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.

విజయలక్ష్మి చేయి, తల, కాళ్లకు శస్త్రచికిత్స చేసినట్టు తెలుసుకుని చలించిపోయారు. జగన్‌ను చూడగానే విజయలక్ష్మికి దుఃఖం కట్టలుతెగింది. ఆమెను అనునయిస్తూ ‘మీకు వెన్నంటి ఉంటామమ్మా’ అని జగన్ ధైర్యం చెప్పారు. విజయలక్ష్మి త్వరగా కోలుకునేందుకు కావాల్సిన చికిత్స విషయంలో ఎలాంటి లోపం రాకుండా చూడాలని వైద్యులను కోరారు. అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వెన్నెముక దెబ్బతిన్న విజయలక్ష్మి భర్త శ్రీనివాసరావును మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్ తరలించినట్టు వైద్యులు తెలపగా.. అక్కడ ఏ ఆసుపత్రిలో చేర్పించేది తనకు సమాచారమందిస్తే అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యమందేలా చూస్తానని జగన్ చెప్పారు.
 
వెంకన్న కుటుంబానికి పరామర్శ..

అనంతరం రాజమండ్రి గోరక్షణపేటలో ర్యాలి వెంకన్న కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. వెంకన్న తల్లి నాగరత్నం, భార్య వరలక్ష్మి, కుమారుడు మహేష్, కుమార్తె హేమలత తదితర కుటుంబ సభ్యులను పేరుపేరునా పలకరించగా వారంతా ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. వడ్రంగం పనిచేసే వెంకన్న ఆరోగ్యం సహకరించక మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడని, వెంకన్న మృతితో ఆధారం కోల్పోయామంటూ వారు బావురుమన్నారు. అద్దె ఇంటిలో ఉంటున్నామని గోడు వెళ్లబోసుకున్నారు. వెంకన్న పాతచిత్రాలు చూసి జగన్ కళ్లు చెమర్చాయి. ‘‘మీరు అధైర్యపడకండి, మా నాయకులు జ్యోతుల నెహ్రూ, ఆదిరెడ్డి అప్పారావు మీకు అండగా నిలుస్తా’’రని జగన్ వారికి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం మనం ప్రతిపక్షంలో ఉన్నామని అంటూ.. సబ్ కలెక్టర్‌తో మాట్లాడి స్థలం వచ్చే ఏర్పాటు చేస్తారని తెలిపారు.  
 
ఫ్లై ఓవర్ నిర్మాణానికి కృషి చేస్తా..

తర్వాత జగన్ కరప మండలం కూరాడ వెళ్లి శివనేని మహాలక్ష్మి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. మహాలక్ష్మి కుమారులు సత్యనారాయణ, నారాయణరావుతోపాటు కుటుంబసభ్యులను పేరుపేరునా పలకరించారు. మృతురాలి మనవరాలు శిరీష మాట్లాడుతూ.. మోరంపూడి జంక్షనంటే భయమేస్తోందని, తమ కుటుంబసభ్యులు ఇద్దరు అక్కడే ప్రమాదంలో మృతి చెందారంటూ కన్నీరుమున్నీరైంది. తమ పరిస్థితి మరొకరికి రాకుండా చూడాలని కుటుంబ సభ్యులన్నారు. జగన్ స్పందిస్తూ ఆ జంక్షన్ వద్ద జరిగే ప్రమాదాలను ప్రభుత్వదృష్టికి తీసుకెళ్లి ఫ్లైఓవర్ నిర్మాణానికి కృషిచేస్తానని హామీఇచ్చారు. బాధితులకు ప్రభుత్వపరంగా ఆర్థిక సాయమందేలా అన్నిరకాలుగా ప్రయత్నిస్తానన్నారు.
 
పార్టీ నేతలకు పరామర్శ..  

ఇదిలా ఉండగా వేమగిరిలో మాతృవియోగంతో బాధపడుతున్న పార్టీ నాయకుడు రావిపాటి రామచంద్రరావు, వేంకటేశ్వరరావుల కుటుంబాన్ని ప్రతిపక్ష నేత జగన్ పరామర్శించారు. వారి తల్లి గంగాభవాని చిత్రపటానికి నివాళులర్పించారు. గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె తనను ఆత్మీయంగా పలకరించారని గుర్తు చేసుకున్నారు. అనారోగ్యంతో కాకినాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జెడ్పీ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు భార్య వెంకటలక్ష్మిలను కూడా వైఎస్సార్‌సీపీ అధినేత పలకరించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
 
మరోవైపు కాకినాడలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుమార్తె వివాహవేడుకలకు హాజరైన జగన్.. వధూవరులు అంజని, హర్షవర్ధన్‌రెడ్డిలను ఆశీర్వదించారు. నగరంలోని ఒక ఆస్పత్రిలో ఇటీవల జన్మించిన పెద్దాపురం పార్టీ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు రెండో కుమారుడిని జగన్ ఆశీర్వదించారు. అనంతరం రాజమండ్రి చేరుకుని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో రాత్రి బస చేశారు.

ఈ పర్యటనలో జగన్ వెంట పార్టీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా, గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ ఎమ్మెల్యేలు ఆళ్లనాని, ప్రసాదరాజు, పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, అమలాపురం, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గాల పార్టీ నాయకులు పినిపే విశ్వరూప్, చలమలశెట్టి సునీల్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు జక్కంపూడి రాజా, కొల్లి నిర్మల కుమారి తదితరులున్నారు.
 
వైభవంగా ద్వారంపూడి కుమార్తె వివాహ రిసెప్షన్

కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుమార్తె అంజని, హర్షవర్ధన్‌రెడ్డిల వివాహ రిసెప్షన్ బుధవారం రాత్రి  తూర్పుగోదావరి జిల్లా కాకినాడ భాస్కరపద్మ కల్యాణ మండపంలో వైభవంగా జరిగింది. రిసెప్షన్‌కు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సహా పలువురు ముఖ్యనేతలు, అధికారులు, అనధికారులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వైఎస్సార్‌సీపీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ జ్యోతుల నెహ్రూ, జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, సాక్షి డెరైక్టర్ కె.ఆర్.పి.రెడ్డి సహా పలువురు ప్రముఖులు రిసెప్షన్‌కు విచ్చేశారు. అలాగే శాసనమండలిలో ప్రభుత్వ విప్ కె.వి.వి.సత్యనారాయణరాజు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వేడుకకు హాజరయ్యారు.

ద్వారంపూడి కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ జగన్

Written By news on Wednesday, February 4, 2015 | 2/04/2015


ద్వారంపూడి కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కాకినాడ చేరుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి వైఎస్ జగన్ హాజరయ్యారు.  ఈ రోజు రాత్రి కాకినాడ నుంచి రాజమండ్రికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి గురువారం ఉదయం రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

వైఎస్ జగన్ ఈ రోజు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లి.. ఇటీవల నగరంలోని మోరంపూడి జంక్షన్ లో స్కూల్ బస్సు సృష్టించిన బీభత్సంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం వైఎస్ జగన్ వారి ఆరోగ్యం పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

బాబుకు నారాయణ లిమిట్ లెస్ ఏటీఎం


'బాబుకు నారాయణ లిమిట్ లెస్ ఏటీఎం'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : తాత్కాలిక రాజధాని పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ప్రజాధనాన్ని వృధా చేస్తోందని మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బుధవారమిక్కడ మండిపడ్డారు. జీతాలు ఇచ్చేందుకు డబ్బులు లేవన్న చంద్రబాబుకు తాత్కాలిక రాజధాని నిర్మాణం కోసం డబ్బులు ఎలా వచ్చాయన్నారు. విజయవాడ, గుంటూరులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లోనే తాత్కాలిక రాజధానిని సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభించాలని ఆయన  డిమాండ్ చేశారు. మంగళగిరి సమీపంలో ఉన్న హరిహంత్ ప్రాజెక్ట్ కి ప్రత్యామ్నాయ భూములు ఇచ్చిన విధంగానే రాజధాని ప్రాంత రైతులకు కూడా ఇవ్వాలని ఆర్కే అన్నారు.

భూకేటాయింపుల వ్యవహారాలను రెవెన్యూ మంత్రి చూడాలని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. అయితే రెవిన్యూ మంత్రిగా ఉన్న కేఈ కృష్ణమూర్తి ఒక్కసారి కూడా రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో పర్యటించకపోవటంలో ఆంతర్యమేమిటో చెప్పాలన్నారు. కేఈ కృష్ణమూర్తి కన్నా మంత్రి నారాయణ అయితే చంద్రబాబు నాయుడుకు బాగా పనికొస్తారని ఆయన్ని ముందుకు పెట్టారన్నారు.

ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే చంద్రబాబుకు కేఈ చెప్తారనే ఆయనను పక్కకు పెట్టారని ఆర్కే వ్యాఖ్యానించారు. కేవలం తన చేతిలో కీలుబొమ్మలా ఉండే వ్యక్తులకే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తారని ఆయన విమర్శించారు. ఎన్నడూ ప్రజల చేత ఎన్నికకాని మంత్రి నారాయణకు రాజధాని వ్యవహారాలను ఎలా అప్పగిస్తారన్నారు. చంద్రబాబుకు లిమిట్ లెస్ ఏటీఎంగా మంత్రి నారాయణ ఉన్నారని ఆర్కే వ్యాఖ్యానించారు. కృష్ణాతీరంలోని కబ్జారాయుళ్ల జోలికి వెళ్లిని ప్రభుత్వం...పేదల భూముల్ని లాక్కోవడం దారుణమన్నారు.

దుర్గాప్రసాద్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

రాజమండ్రి: రాజమండ్రి నగరంలోని మోరంపూడి జంక్షన్ లో స్కూల్ బస్సు సృష్టించిన బీభత్సంలో మరణించిన దుర్గాప్రసాద్ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాల అండగా ఉంటామని వైఎస్ జగన్ ఈ సందర్బంగా దుర్గా ప్రసాద్ కుటుంబానికి భరోసా ఇచ్చారు.
రాజమండ్రి మోరంపూడి జంక్షన్ లోని 16వ నంబరు జాతీయ రహదారిపై స్కూల్ బస్సు ఆదివారం బీభత్సం సృష్టించింది. వేమగిరి వైపు వెళ్తున్న ఈ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి ఒక కారును, మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొని, పక్కనే ఉన్న డ్రైనేజీలోకి దూసుకుపోయి, హై టెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది.
ఈ ప్రమాదంలో మండపేట గొల్లపుంతకు చెందిన ఇనపకోళ్ల దుర్గాప్రసాద్ (13), రాజమండ్రి గాంధీపురం-3కి చెందిన ర్యాలి వెంకన్న (55) అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రికి తరలిస్తుండగా కాకినాడ రూరల్ కరప మండలం కోదాడకు చెందిన శివనేని మహాలక్ష్మి (70) మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన నలుగురు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

రైతులకే లీజు ఇవ్వాలి: ఎమ్మెల్యే ఆర్కే


రైతులకే రూ.కోటి లీజు ఇవ్వాలి: ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం కోసమని భూమిని సమీకరిస్తున్న ప్రభుత్వం అక్కడి రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.కోటి చొప్పున లీజు కింద 99 ఏళ్ల కాలవ్యవధికి చెల్లించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
 
 ఆయన మంగళవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మంగళగిరి ప్రాంతంలో ఎకరాకు ఏడాదికి రూ.కోటి చొప్పున 33 సంవత్సరాల లీజుకు అమెరికాకు చెందిన ‘పై డేటా సెంటర్’ అనే సంస్థకివ్వాలని ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్ణయించిందని వివరించారు. ఈ మేరకు పత్రికల్లో వచ్చిన వార్తలను చూపుతూ.. రైతుల అభీష్టానికి భిన్నంగా రాజధాని ప్రాంతంలో వారి భూములను లాక్కుంటున్న చంద్రబాబు విదేశీ సంస్థల మెప్పుకోసం, అడ్డదారిలో సంపాదించుకోవడంకోసం రైతుల భూములను లాక్కోవడం దారుణమన్నారు.
 
 అక్కడి భూములను విదేశీ సంస్థలకు ఎకరాకు రూ.కోటి చొప్పున లీజుకు ఇస్తున్నపుడు.. అదే మొత్తాన్ని రైతులకిచ్చి ప్రతి ఏటా పెరిగే ధరల సూచీ ప్రకారం లీజును పెంచుతూ ఎందుకివ్వకూడదని ప్రశ్నించారు. మంగళగిరిలో స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులే లేరని, 90 శాతం మంది 9.2 ఫారాలు ఇస్తున్నపుడు స్పష్టత లేకుండా అమెరికా కంపెనీకి భూమిని లీజుకు ఎలా ఇస్తారని ఆర్కే ప్రశ్నించారు. చరిత్రలో ఏ రాజూ రైతుల భూములను లాక్కోలేదని, రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కొంటున్న చంద్రబాబు చరిత్రహీనుడుగా మిగిలిపోతారని దుయ్యబట్టారు.

చంద్రబాబు కాదు.. దుబారా బాబు


చంద్రబాబు కాదు.. దుబారా బాబు
 వైఎస్సార్‌సీపీ నేత అంబటి ధ్వజం
 ఆర్థిక పరిస్థితి బాగో లేదంటూనే  ప్రజాధనం వృథా చేస్తున్నారు

 
 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఓ వైపు చెబుతూనే మరోవైపు ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.  ప్రజాధనాన్ని ఇష్టానుసారం ఖర్చు పెట్టడం చూస్తే ఆయన చంద్రబాబు కాదు, దుబారా బాబు అనిపిస్తోందని విమర్శించారు.  విభజన వల్ల తీవ్రంగా నష్టపోయామని, రాజధాని ఏర్పాటుకు, రాష్ట్ర పునర్నిర్మాణానికి డబ్బులు లేవని చంద్రబాబు ముఖ్యమంత్రి గద్దెనెక్కిన నాటినుంచీ చెబుతూనే ఉన్నారన్నారు.
 
 ఐఏఎస్‌తో సహా అందరు అధికారులు, మంత్రులు తమ ఖర్చులు తగ్గించుకోవాలని, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలంటూ గత ఏడాది జూలైలో జీవోలు కూడా ఇచ్చారన్నారు. అలాగే రాజధాని నిర్మాణానికి హుండీలు పెట్టించడం, విరాళాలివ్వండని విజ్ఞప్తి చేయడం వంటివీ చేశారని చెప్పారు. పొదుపు చర్యలు పాటించాలని జీవోలిచ్చిన చంద్రబాబు తానే స్వయంగా వాటిని ఉల్లంఘిస్తూ దుబారా ఖర్చులకు పాల్పడ్డం చూస్తే ‘ఎదుటి వాళ్లకు చెప్పేటందుకే నీతులు ఉన్నాయి...’ అన్నట్లుగా ఉందని అంబటి ఎద్దేవా చేశారు.
 
 మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఢిల్లీ వెళ్లడానికి అనేక విమానాలుండగా.. చంద్రబాబు తన తాబేదార్లతో కలిసి చార్టర్డ్ ఫ్లైట్‌లలో భారీ మొత్తం చెల్లించి ప్రత్యేకంగా వెళ్లడం సబబేనా? గతంలో ఏ సీఎం ఢిల్లీకి ప్రత్యేక విమానాలు వేసుకుని వెళ్లిన సందర్భాలున్నాయా? గతంలో ఏదైనా ప్రత్యేక సందర్భంలో సీఎంలు అలా వెళ్లారేమో గానీ, చంద్రబాబులాగా పదే పదే అద్దె విమానాలకు ప్రజాధనాన్ని భారీ మొత్తంలో చెల్లించి వెళ్లలేదు.
 
 ఒక్క ఢిల్లీకే కాదు, హైదరాబాద్ నుంచి తిరుపతి, విశాఖపట్నం, విజయవాడకు కూడా చంద్రబాబు తన వందిమాగధులతో కలసి ప్రత్యేక విమానాల్లో వెళ్లడం ఏమిటి? అధికారులను విమానం ఎగ్జిక్యూటివ్ క్లాసులో కాకుండా ఎకానమీ క్లాసులో వెళ్లాల్సిందిగా చెబుతున్న చంద్రబాబు తాను మాత్రం ప్రత్యేక విమానాల్లో వె ళ్లడం సమంజసమా? ఇక సింగపూర్, జపాన్ పర్యటనలకు ప్రత్యేక విమానాల్లో వెళ్లి వచ్చినందుకు ఒకసారి రూ.70 లక్షలు, మరోసారి రూ.1.25 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఆ పర్యటనలకు అయిన అసలు ఖర్చు ఎంత అనేది దాచి పెట్టారు.
 
 పొదుపు పాటించడం అంటే ఇలా దుబారా చేయడమేనా?’ అని ప్రశ్నించారు.13 జిల్లాలతో ఉన్న ఏపీకి 15 మంది సలహాదారులను నియమించడం ఎంతవరకు సబబు అని అన్నారు. యోగా శిక్షణ కోసం రూ.2 కోట్లు ఖర్చు చేయడంలో ఔచిత్యాన్ని ఆయన ప్రశ్నించారు. దుబారా చేస్తూనే.. ఆర్థిక పరిస్థితి బాగో లేదని పదే పదే చె ప్పడం, ఉద్యోగుల పీఆర్సీని ఎగ్టొట్టేందుకేనని స్పష్టమవుతోందని అంబటి అన్నారు.
 

నేడు కాకినాడకు వైఎస్ జగన్


నేడు కాకినాడకు వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కాకినాడకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరి రాజమండ్రి చేరుకుంటారు.
 
 అక్కడి నుంచి కాకినాడకు వెళ్తారు. అక్కడ వైఎస్సార్ సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుమార్తె వివాహానికి హాజరవుతారు. అనంతరం రాజమండ్రికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

ఇదికూడా రాజకీయమేనా!

Written By news on Tuesday, February 3, 2015 | 2/03/2015

 హైదరాబాద్‌లోని ఆదర్శనగర్‌లో ఉన్న న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తనకు కేటాయించిన క్వార్టర్ నంబర్ 157ను పరిశుభ్రంగా ఉంచుకుందామని మరమ్మతులు చేయించుకున్నా రాజకీయం చేస్తారా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

కేటాయించిన క్వార్టర్లకు పునరుద్ధరణ పనులు చేయించుకోవడమనేది అందరూ చేసేదేనని తాను మాత్రమే ఆ పనులు చేయడంలేదని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఎరబెల్లి దయాకర్‌రావు, టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మరో ఎమ్మెల్యే గంగుల కమలాకర్  క్వార్టర్లు తనకు కేటాయించిన వరుసలోనే ఉన్నాయని వారంతా వాటిని తమ అభీష్టం మేరకు పునరుద్ధరణ పనులు చేసుకున్నారని, ఢిల్లీలో కూడా టీడీపీ ఎంపీ సీఎం రమేష్, మంత్రి సుజనాచౌదరికి కేటాయించిన క్వార్టర్లను స్టార్ హోటళ్ల మాదిరిగా పునర్నిర్మించుకున్నారని ఈ సందర్భంగా చెవిరెడ్డి ఉదహరించారు.

అయితే, తన విషయంలోనే వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తన క్వార్టర్ మరమ్మతులపై వ్యతిరేక కథనం రాసిన ఆంగ్ల పత్రిక ఎడిటర్, రిపోర్టర్‌పై తాను న్యాయపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. నంబర్ 157 క్వార్టర్‌లో అడుగు పెట్టేనాటికి  పైకప్పు పెంకులు ఊడిపోయి, వర్షపు నీళ్లు కారుతూ అధ్వానంగా ఉండడంతో.. పనులు చేసుకుంటానని ప్రభుత్వానికి లేఖ రాస్తే అనుమతించారన్నారు.

దీనికి సంబంధించిన ప్రభుత్వ ఆదేశాల కాపీని చెవిరెడ్డి చూపించారు. సీఎం చంద్రబాబు రూ.50 కోట్ల ప్రజాధనం వెచ్చించి తన కార్యాలయాన్ని పునర్నిర్మించుకుంటే తప్పులేదు కానీ తన విషయంలోనే ఎందుకు ఇలా రాశారని ఆయన ప్రశ్నించారు.

11న వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ కార్యాలయం ప్రారంభం

లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం రెండో అంతస్తులో పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యాలయాన్ని ఈ నెల 11న ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నట్టు తెలంగాణ వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ తెలిపారు.

జీహెచ్‌ఎంసీలో అన్ని డివిజన్లలో పోటీ



 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో 150 డివిజన్లలోనూ పోటీ చేస్తామని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల కార్యాచరణపై జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా జీహెచ్‌ఎంసీని ఐదు జోన్లుగా విభజించి, వాటికి పరిశీలకులను నియమించినట్లు చెప్పారు. తూర్పు జోన్‌కు కె.శిమకుమార్, పశ్చిమ జోన్‌కు కొండా రాఘవరెడ్డి, ఉత్తర జోన్‌కు నల్లా సూర్యప్రకాష్, దక్షిణ జోన్‌కు హెచ్.ఎ. రెహ్మాన్, సెంట్రల్ జోన్‌కు మథిన్‌లను అబ్జర్వర్లుగా నియమించామన్నారు. పరిశీలకులంతా ఒక్కో డివిజన్‌లో అధ్యక్షుడు, ఐదుగురు సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేసుకుని జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటారని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధం కావడంలో భాగంగా దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి కుమార్తె, పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మి ల వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలా కార్యాచరణను రూపొందించుకోవాలని కార్యాచరణ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సమావేశంలో పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త పి. సిద్ధార్థరెడ్డి, నాయకులు ఆదం విజయ్‌కుమార్, సురేష్‌రెడ్డి, కె.శివకుమార్, గున్నం నాగిరెడ్డి, బీష్వ రవీందర్, మథిన్‌భాయ్, నల్లా సూర్యప్రకాష్, ప్రఫుల్లారెడ్డి, అమృతసాగర్, ముస్తాఫా, హెచ్.ఎ. రెహ్మాన్, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

ఆస్పత్రి తరలింపు ఆపాల్సిందే


ఆస్పత్రి తరలింపు ఆపాల్సిందే
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ఉన్న ఛాతీ ఆస్పత్రిని తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. నిరుపేద వర్గాలకు చెందిన ఛాతీ, ఎయిడ్స్ రోగులకు వరప్రదాయినిగా ఉండటంతోపాటు నగరం నడిబొడ్డు నుంచే సేవలు అందిస్తున్న ఆస్పత్రిని వికారాబాద్‌కు తరలించాల్సిన అగత్యం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఆస్పత్రి తరలింపు జీవో 61ను వ్యతిరేకిస్తూ వైద్యులు, ఇతర సిబ్బంది చేస్తున్న ఆందోళనకు పూర్తిస్థాయిలో సంఘీభావం, మద్దతు తెలిపారు. ఈ మేరకు పార్టీ నేతలతో కలసి సోమవారం ఛాతీ ఆస్పత్రిని ఆయన సందర్శించి ఆందోళన చేస్తున్న సిబ్బందికి సంఘీభావంగా ఆస్పత్రి ప్రాంగణంలో కాసేపు నేలపై కూర్చొని ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పొంగులేటి విలేకరులతో మాట్లాడుతూ వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేసేలా సచివాలయాన్ని ఛాతీ ఆస్పత్రి ప్రాంగణంలోకి తరలించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రస్తుతమున్న సచివాలయం కేంద్రంగా ఎందరో ముఖ్యమంత్రులు దశాబ్దాల తరబడి రాష్ట్రాన్ని పాలించిన విషయాన్ని మరిచిపోయిన సీఎం కేసీఆర్ వాస్తు పిచ్చితో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని దుయ్యబట్టారు. నిమ్స్ ఆస్పత్రిని ఎయిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి బీబీనగర్‌లో నిర్మించిన భవనాలు ఆయన మరణానంతరం దిక్కులేకుండా పడిఉన్నాయని, వాటిని నేటికీ పూర్తిచేయకుండా నిరుపయోగంగా మార్చిన అసమర్ధ పాలకుల నిర్వాకంతో ప్రజలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే కొన్నేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పూర్తికాగానే సచివాలయం పూర్తిస్థాయిలో తెలంగాణ ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తుందని, అలాంటప్పుడు కొత్త భవనాలు నిర్మించి ప్రజాధనం వృథా చేయాల్సిన అవసరం ఏముందన్నారు. ఆస్పత్రి తరలింపునకు అనుమతిస్తూ జారీ చేసిన జీవో 61ని తక్షణమే ఉపసంహరించుకోవాలని పొంగులేటి డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న రోజుల్లో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పార్టీ సీనియర్ నేత రెహ్మాన్ మాట్లాడుతూ వాస్తుపేరుతో సీఎం నాటకాలు ఆడుతున్నారని, దీనివెనక కుట్ర దాగుందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ మహబూబ్‌ఖాన్ ఆస్పత్రి పనితీరును వివరించారు. 62 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆస్పత్రిలో నిత్యం దాదాపు 200 మంది ఛాతీ సమస్యలతో బాధపడే రోగులతోపాటు మరో 150 మంది ఎయి డ్స్ రోగులకు చికిత్స అందిస్తామన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే రోగులకు అందుబాటు లో ఉన్న ఆస్పత్రిని మార్చవద్దని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో నాయకులు శివకుమార్, ఆదం విజయకుమార్, శేషురెడ్డి, సురేష్‌రెడ్డి, సూర్యప్రకాశ్, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, ముస్త ఫా, జార్జ్, మహిళా నేత మేరీ సహా పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీలో ఆందోళన... వైఎస్సార్‌సీపీలో ఉత్సాహం


ఆలోచన రగిలించిన జగన్ రైతు దీక్ష
  • టీడీపీలో ఆందోళన... వైఎస్సార్‌సీపీలో ఉత్సాహం
  • ప్రతిపక్ష నేత రెండు రోజుల దీక్షతో విపక్షంలో నూతనోత్తేజం
  • టీడీపీని గెలిపించిన ‘పశ్చిమ’లో వై.ఎస్.జగన్ దీక్షకు పెద్దగా ప్రజాస్పందన ఉండదన్న అధికార పార్టీ అంచనాలు తల్లకిందులు జగన్ దీక్ష విజయవంతమైందంటూ సర్కారుకు ‘నిఘా’ నివేదిక!
సాక్షి, విజయవాడ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలను మాఫీ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను ఎండగడుతూ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శని, ఆదివారాల్లో పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన రైతు దీక్ష ప్రజలను ఆలోచింపచేసింది. పార్టీ శ్రేణల్లో నూతనోత్సాహం నింపింది.

చంద్రబాబు ఎన్నికల సమయంలో రైతు రుణాలు, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని ఇచ్చిన హామీని పశ్చిమగోదావరి జిల్లా ఓటర్లు పూర్తిగా నమ్మారు.  అయితే సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వేదిక మీద నుంచే తొలి సంతకం పేరుతో కోటయ్య కమిటీని నియమించడంతోనే బాబు తన హామీల అమలుకు కత్తెర వేస్తున్నారనే విషయాన్ని జనం పసిగట్టారు. అనేక షరతుల అనంతరం కుటుంబానికి లక్షన్నర రూపాయలైనా రుణ మాఫీ జరుగుతుందని భావించినా అది కూడా మరో నాలుగేళ్ల తర్వాత కూడా పూర్తిగా అమలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.

డ్వాక్రా మహిళలదీ ఇదే పరిస్థితి. బాబును ఎంతగానో నమ్మి ఆయన చేతిలో నిట్టనిలువునా మోసపోయిన పశ్చిమగోదావరి జిల్లానే వేదికగా చేసుకుని వైఎస్ జగన్ దీక్షకు దిగాలని నిర్ణయించారు. తణుకులో రెండు రోజుల దీక్ష అని తొలుత ప్రకటించిన సమయంలో ఎన్నికల్లో టీడీపీకి ఓట్లేసి గెలిపించిన ఈ జిల్లాలో జగన్ దీక్షకు పెద్దగా స్పందన ఉండదని ఆ పార్టీ వర్గాలు అంచనా వేశాయి. బాబు అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్నా ఒక్క హామీ కూడా అమలు కాకపోవడంపై జనంలో మొదలైన అసంతృప్తి, ఆగ్రహం ఈ దీక్ష ద్వారా ఖచ్చితంగా వ్యక్తమవుతుందని వైఎస్సార్ సీపీ శ్రేణులు భావించాయి.
 
రెండు రోజులూ జన నీరాజనం...

జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష ప్రారంభించిన శనివారం ఉదయం 9 గంటల నుంచే దీక్షా శిబిరం జనంతో కిక్కిరిసింది.  డ్వాక్రా మహిళలు వేలాది మంది తరలివచ్చి ఆయన కోసం గంటల తరబడి ఓపిగ్గా ఎదురు చూశారు. అంచనాలకు మించి జనం స్వచ్ఛందంగా తరలి రావడం అటు తెలుగుదేశం పార్టీ నేతల్లో ఆందోళన రేకెత్తించగా.. ఇటు వైఎస్సార్ సీపీ నేతలకు ఆనందం కలిగించింది.

చంద్రబాబు మోసాలను ఇదే వేదిక మీద నుంచి జనానికి అర్థమయ్యే రీతిలో వివరిస్తూ పార్టీ నేతలు తమ ప్రసంగాలు సాగించారు. రెండో రోజు ఆదివారం కూడా జన స్పందన ఇదేలా కొనసాగడంతో పాటు, జగన్ ప్రసంగం ప్రారంభించే సమయానికి స్థానికులు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది మహిళలు, యువకులు, వృద్ధులు దీక్షా స్థలికి పోటెత్తారు.
 
ఆలోచింపచేసిన ప్రసంగం...

దీక్ష ముగించిన అనంతరం వై.ఎస్.జగన్ చేసిన ప్రసంగం ఏ రాజకీయ పార్టీకి చెందని ప్రజలతో పాటు, టీడీపీ సానుభూతిపరులను కూడా ఆలోచింప చేసింది. రైతులు, డ్వాక్రా రుణ మాఫీల గురించి చదువు రాని వారికి కూడా బాగా అర్థమయ్యే రీతిలో జగన్ వివరించడంతో జనానికి బాగా అర్థమయ్యాయి.  ఈ దీక్ష భవిష్యత్తులో జరిగే మరింత గట్టి పోరాటాలకు బీజం వేసిందనీ, వైఎస్సార్ సీపీ శ్రేణులకు వెయ్యి ఏనుగుల బలం ఇచ్చిందని టీడీపీ వర్గాలు అంచనాకు వచ్చాయి.
 
ఇంటెలిజెన్స్ నివేదిల్లోనూ సక్సెస్...

జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల దీక్ష ఊహించనంత విజయవంతం అయ్యిందని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిసింది. రెండు రోజులు జనం భారీగానే వచ్చారనీ, జగన్ ప్రసంగం జనాన్ని ఆలోచింపచేసే రీతిలో సాగిందని ఆ వర్గాలు వివరించినట్లు సమాచారం.
 
 పవన్‌కల్యాణ్... బాబును ప్రశ్నించవేం?
 గుడివాడ సంధించిన ప్రశ్నలపై ప్రజల్లో చర్చ
నిరాహార దీక్ష ముగింపు రోజున విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ సినీ నటుడు పవన్‌కల్యాణ్ మీద సంధించిన ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి. ప్రశ్నించడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్‌కళ్యాణ్ ఇప్పుడెందుకు నోరు మెదపడంలేదని అమర్‌నాథ్ ప్రారంభించిన ప్రసంగం జనంలో చర్చకు దారితీసింది. ఎన్నికల సమయంలో పవన్‌కళ్యాణ్ భారీగా డబ్బులు తీసుకుని చంద్రబాబుకు అనుకూల ప్రచారం చేశారని అమర్ ఆరోపించారు.మోదీతో కలిసి మంచి పాలన అందిస్తానని నమ్మబలికిన చంద్రబాబు సీఎం కుర్చీ ఎక్కి ఏడు నెలలు దాటినా కేంద్రం హామీలు అమలు చేసేలా ఒత్తిడి తేలేకపోయారని సీఎంను కూడా ఆయన కడిగేశారు. లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా మారారని చెప్పడం ఆలోచింపజేసింది.
 

గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తాం

Written By news on Monday, February 2, 2015 | 2/02/2015


గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తాం: పొంగులేటి
హైదరాబాద్: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయమైన లోటస్ పాండ్ లో వైఎస్సార్సీపీ తెలంగాణ నేతల సమావేశం సోమవారం జరిగింది. త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ ఎన్నికల్లో పార్టీ తప్పకుండా పోటీ చేయాలని అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జీహెచ్ ఎంసీ పరిధిలోని అన్ని డివిజన్లలో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల కోసం ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పొంగులేటి చెప్పారు.

చెస్ట్ ఆస్పత్రిని తరలిస్తే ఉద్యమమే: పొంగులేటి

చెస్ట్ ఆస్పత్రిని తరలిస్తే ఉద్యమమే: పొంగులేటి
హైదరాబాద్: చెస్ట్ ఆస్పత్రిని తరలించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి పార్టీ నేతలు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన ధర్నా నిర్వహించారు. ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉన్న చెస్ట్ ఆస్పత్రిని వికారాబాద్ కు తరలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఉద్యమిస్తుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

జగన్ రైతు దీక్ష విజయవంతం

సంఘీభావంగా రాష్ట్రం నలుమూలల నుంచీ తరలివచ్చిన జనం
పెద్ద సంఖ్యలో పాల్గొన్న రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు
జగన్‌ను కలిసి తమ కష్టాలు వివరించిన రైతులు, డ్వాక్రా మహిళలు
అన్ని సమయాల్లోనూ అండగా ఉంటానంటూ ప్రతిపక్ష నేత భరోసా


రైతు దీక్షా శిబిరం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ప్రజా సమస్యలను విస్మరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజల్లో ఎండగట్టడానికి ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పాటు నిర్వహించిన రైతు దీక్ష విజయవంతమైంది. శని, ఆదివారాలు రెండు రోజుల పాటు సాగిన ఈ దీక్షకు మద్దతుగా రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల నుంచి ప్రజలు తరలివచ్చారు. ప్రధానంగా రైతులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొని దీక్షకు సంఘీభావం తెలియజేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను జగన్ ఒక్కొక్కటిగా విడమరిచి చెబుతున్నప్పుడు వారంతా శ్రద్ధగా విన్నారు.

ప్రభుత్వ వైఖరిని ఎండగట్టి ప్రజల పక్షాన పోరాటాలు కొనసాగుతాయని చెప్పినప్పుడు హర్షధ్వానాలతో వేదిక ప్రాంగణం మారుమోగింది. ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వంపై పోరాటం చేయడానికి ముందుకొచ్చిన జగన్‌ను చాలామంది అభినందించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రెండు రోజుల పాటు సాగిన నిరాహార దీక్ష సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలు ఒక్కొక్కరుగా ఆయనతో కలచాలనం చేసి వారు పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు. వారు చెబుతున్న విషయాలను శ్రద్ధగా విన్న జగన్‌మోహన్‌రెడ్డి అన్ని సమయాల్లోనూ అండగా ఉంటాననీ గుండె నిబ్బరం కోల్పోవద్దని వారికి భరోసా కల్పించారు.

స్వచ్ఛందంగా తరలివచ్చిన
రైతులు, మహిళలు...
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చేపట్టిన ఈ రైతు దీక్షకు శని, ఆదివారం రెండు రోజులు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో పార్టీ శ్రేణులు, రైతులు, డ్వాక్రా మహిళలు, యువకులు, కళాశాల విద్యార్థులు దీక్షా స్థలికి చేరుకున్నారు. దీక్షా శిబిర ప్రాంతం ఉదయం 9 గంటలకే జనంతో కిక్కిరిసిపోయింది. ప్రధానంగా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల నుంచి రైతులు, డ్వాక్రా మహిళలు స్వచ్ఛందంగా ఆటోలు, ట్రాక్టర్లలో తరలిరావడం కనిపించింది.

జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ప్రారంభించే సమయానికి ముందే పెద్ద ఎత్తున అక్కడి చేరుకున్న డ్వాక్రా మహిళలు, రైతులు యువనేతకు సంఘీభావాన్ని తెలిపారు. వెన్నంటి ఉండి ఉద్యమ పథంలో సాగుతామని వేలాది మంది రైతులు స్పష్టం చేశారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో హామీలను ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కేసారని వైఎస్ జగన్ అన్నపుడల్లా రైతుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. చేతులు పెకైత్తి యువనేతకు మద్దతుగా చంద్రబాబుపై ధ్వజమెత్తారు. రుణ మాఫీ అంశం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ ప్రభుత్వ వైఖరిపై డ్వాక్రా మహిళలు, రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

జగన్ ప్రసంగానికి అద్భుత స్పందన...
ఎన్నికల హామీలతో రాష్ట్ర ప్రజలను, రైతాంగాన్ని మోసగించిన బాబు సర్కారుపై పోరు ఆగదని యువనేత జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించిన సందర్భంలో శిబిరంలోని జనం నుంచి పెద్ద ఎత్తున సంఘీభావం లభించింది. రైతు దీక్ష ఆవశ్యకతను వివరించి, ప్రభుత్వ తీరును ఎండగట్టిన జగన్ ప్రసంగం ఆధ్యంతం స్ఫూర్తిదాయకంగా సాగి దీక్షా శిబిరాన్ని వేడెక్కించింది. ప్రసంగంలోని ప్రతి అంశం ప్రజలందరినీ ఆలోచింపజేసేలా వివరించారు. హైదరాబాద్‌లో ఉంటూ అక్కడే పాన్‌కార్డు, ఆధార్ కార్డు ఉన్న చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా కొనసాగేందుకు ఏ విధంగా అర్హుడని వైఎస్ జగన్ ప్రశ్నించినపుడు, నమ్మి ఓటేసిన డ్వాక్రా మహిళలకు  తీవ్ర అన్యాయం జరిగిందన్నపుడూ రైతులు, డ్వాక్రా మహిళలు హర్షధ్వానాలతో మారుమోగింది.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాశాలల విద్యార్థులు, యువకులు యువనేత జగ న్‌ను కలిసి వెన్నంటే ఉంటామని చెప్పారు. దీక్షా శిబిరంలో ప్రవేశించి యువనేతతో కరచాలనం చేయాలని ఒక్కసారిగా రైతులు, యువకులు ముందుకెళ్లడంతో కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. రైతు దీక్ష ముగిసే వరకూ జనం శిబిరం ప్రాంతం నుంచి కదలకపోవడంతో రహదారిపై రెండు కిలోమీటర్ల వరకూ వాహనాలు నిలిచిపోయాయి.

కన్నీళ్లు తుడుస్తానని.. కారం కొట్టాడు
మా గ్రూపు మొత్తం కలిసి రూ. 2 లక్షల రుణం తీసుకున్నాం. ఇంకా రూ.72 వేలు కట్టాలి. చంద్రబాబు రుణమాఫీ చేస్తానన్నాడని కట్టలేదు. బంగారం బ్యాంక్‌లో పెట్టి మరీ పిల్లలని చదివించుకుంటున్నాం. డ్వాక్రా, బంగారు రుణాలు మాఫీ చేస్తాడని నమ్మి ఓట్లేశాం. మా కళ్లలో కన్నీళ్లు చూడడం తప్ప ఏమీ చేయలేదు. చంద్రబాబుని నమ్మినందుకు మాకు బాగా బుద్ధి చెప్పాడు. ఇప్పుడు మేం వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. అందుకే వైఎస్ జగన్ రైతుదీక్షకు మద్దతు ఇవ్వడానికి వచ్చాం.
-తానుకొండ రత్నకుమారి, డ్వాక్రా మహిళ, అత్తిలి మండలం, తాలురుపాలెం

బాబు నయవంచకుడు
సీఎం చంద్రబాబు ఒక నయవంచకుడు. రుణమాఫీ చేస్తానని పదేపదే చెప్పడంతో నమ్మి.. ఓటేశా. దానికి ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నా. మాది కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం పెనమలూరు. నాకు 4 ఎకరాల భూమి ఉంది. రూ.50 వేల వరకు బ్యాంకు అప్పు ఉండగా, తొలిదశ రుణమాఫీ జరిగిందంటే బ్యాంకుకు వెళ్లా. నాకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదు. ఇదేంటని బ్యాంకు అధికారులను అడుగుతున్నప్పటికీ రేపు, మాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రుణమాఫీ కాదని తెలిసి పశ్చాత్తాప పడుతూ రైతుల కోసం దీక్ష చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు మద్దతుగా వచ్చా. రుణమాఫీ అనేది బాబు చేసిన మాయ మాత్రమే.
- గండ్రు పరమేశ్వరరెడ్డి, రైతు, పెనమలూరు గ్రామం, ఉయ్యూరు మండలం, కృష్ణాజిల్లా

రుణం.. వడ్డీ తడిసి మోపెడైంది
సీఎం చంద్రబాబు రుణమాఫీ చేస్తామన్నారు. అయినప్పటికీ మాఫీ కాలేదు. రుణం, వడ్డీ కలిపి ఇప్పుడు తడిసిమోపెడైంది. బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదు. అయితే చంద్రబాబు మాత్రం రుణమాఫీ చేస్తాం.. కట్టవద్దని చెప్పారు. 5వ తరగతి చదివితే సైకిల్ ఇస్తామని, 10వ తరగతి చదివితే ఉద్యోగం ఇస్తామని టీడీపీ వాగ్దానం చేసింది. ఎక్కడ ఇచ్చారు?. ఎవరికీ పింఛను కూడా ఇవ్వడం లేదు.  
- రాములమ్మ(గిరిజన మహిళ), తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం పెదమల్లాపురం గ్రామం

గన్నవరంలో వైఎస్ జగన్‌కు వీడ్కోలు
సాక్షి, విజయవాడ: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రెండు రోజుల రైతు దీక్ష నిర్వహించి హైదరాబాద్‌కు తిరుగుపయనమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి పార్టీ నేతలు ఆదివారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయంలో వీడ్కోలు పలికారు. జగన్ దీక్ష ముగించుకుని రోడ్డు మార్గాన కృష్ణా జిల్లా గన్నవరం చేరుకున్నారు. అక్కడినుంచి విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరారు.

పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, కోన రఘుపతి, మహ్మద్ ముస్తాఫా, పార్టీ నేతలు కొలుసు పార్థసారథి, కొత్తపల్లి సుబ్బారాయుడు, వంగవీటి రాధాకృష్ణ, తలశిల రఘురామ్, మర్రి రాజశేఖర్, ఆళ్ల నాని, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, సామినేని ఉదయభాను, గౌతమ్ రెడ్డి, దుట్టా రామచంద్రరావు, ఉప్పాల రాంప్రసాద్, దూలం నాగేశ్వరరావు, అన్నాబత్తుని శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. జగన్‌తో పాటు పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి, ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఆర్.ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డ్డి తదితరులు హైదరాబాద్‌కు వెళ్ళారు.

Popular Posts

Topics :