నరసరావుపేట వెస్ట్ : ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాని సీఎం చంద్రబాబునాయుడు తన ప్రభుత్వంపై పెల్లుబుకుతున్న ప్రజావ్యతిరేకతను దృష్టి మళ్లించేందుకు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మంగళవారం సాయంత్రం పత్రికలకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మామ నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు పొడిచి ఆనాడే నైతిక విలువలను చంద్రబాబు నాయుడు కాలరాశాడని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవటం దేనికో చంద్రబాబు ప్రజలకు చెప్పాల్సి ఉందన్నారు.
తెలంగాణాలో అడ్డగోలుగా ఎమ్మెల్యేలను అక్కడి అధికార పార్టీ కొనుగోలు చేస్తోందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు, తాను ఏపీలో అదే పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో చేస్తే తప్పు.. తానుచేస్తే ఒప్పని చెప్పటం నీతిమాలిన రాజకీయాలకు నిదర్శనమన్నారు. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసి మునిగిపోయే తన పడవను కాపాడుకోవాలని సీఎం తాపత్రయపడుతున్నాడని తెలిపారు. తన పంచన చేరిన ఎమ్మెల్యేలే తమ నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పనికూడా జరగలేదని చంద్రబాబు ముందే ఏకరువు పెడుతుంటే ఈ రాష్ట అభివృద్ధి ఏవిధంగా ఉందో 175 నియోజకవర్గాలకు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వ్యక్తి రాష్ట్రప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన వెంటనే తనతో కలిసి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లి నైతిక విలువలకు కట్టుబడిన ఆదర్శ నాయకుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి అని గుర్తుచేశారు. ఇదేవిధంగా చంద్రబాబునాయుడు తన పార్టీలోకి వచ్చిన వారితో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లే సత్తా ఉందా అని ప్రశ్నించారు. ఈ విషయంలో ఆయన స్వయంగా ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయాల కోసం పాటుపడే నాయకులు, కార్యకర్తలకు పార్టీలో కొదవేలేదని ఆయన స్పష్టం చేశారు
0 comments:
Post a Comment