డ్రెయిన్ల పనుల్లో దోచేశారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » డ్రెయిన్ల పనుల్లో దోచేశారు

డ్రెయిన్ల పనుల్లో దోచేశారు

Written By news on Saturday, March 5, 2016 | 3/05/2016


డ్రెయిన్ల పనుల్లో దోచేశారు
 జాఫర్ సాహెబ్ కెనాల్ డ్రెయిన్ల పనుల అవినీతిపై విచారణ జరపాలి
 విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు అసెంబ్లీలో ప్రస్తావించనున్న
► సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
► నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వెల్లడి



 ఇందుకూరుపేట: డ్రెయిన్ల పనుల్లో టీడీపీ నేతలు దోచేశారని, తోటపల్లిగూడూరు, ఇందుకూరుపేట మండలాల పరిధిలో ఉన్న జాఫర్‌సాహెబ్ కెనాల్ డ్రెయిన్ల పనుల్లో భారీ అవినీతి జరిగిందని వైఎస్సార్ సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి అన్నారు. సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మండలంలోని మొత్తలు గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాఫర్ సాహెబ్ కెనాల్ కింద ఇందుకూరుపేట మండలంలో 35 డ్రెయిన్లు రూ.1.02 కోట్లు, తోటపల్లి గూడూరు మండలంలో 32 డ్రెయిన్లు రూ.95 లక్షలు కలిపి మొత్తం రూ.1.97 కోట్ల పనులు జాఫర్ సాహెబ్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో  జరిగాయన్నారు.

కొన్ని పనులకు ఇప్పటికే బిల్లులు పెట్టారని, నామమాత్రంగా చేసిన ఈ పనులకు సంబంధించి బిల్లులు చేసుకొనే ప్రక్రియలో టీడీపీ నేతలు ఉన్నారన్నారు. ఆ అవినీతిపై బాగోతంపై తాను, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి చర్చించుకున్నామన్నారు. పనుల్లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ జనరల్‌కు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి లెటర్ పెట్టారన్నారు. విజిలెన్స్ విచారణ జరపాలని కోరామన్నారు. బిల్లులు చెల్లించిన అధికారులు బలవుతారన్నారు. ఇప్పటికే బిల్లులు చెల్లించి ఉన్న వాటిని రికవరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో కాకాణి గోవర్ధన్‌రెడ్డి దీనిపై మాట్లాడనున్నట్లు ఆయన తెలిపారు.

 పేదోళ్ల కడుపుకొట్టి పసుపుకోటరీకి భూముల అప్పగింత
 భూమిపై ఆధారపడి జీవించే రైతులు, పేదల కడుపుకొట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు తన పసుపుకోటరీకి వేల ఎకరాలు దోచిపెట్టారని ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు. భూములు కొంటే తప్పా, సంపాదించుకొంటే తప్పా, సీబీఐ ఎంక్వయిరీ ఎందుకు వేయాలని విలేకరుల సమావేశంలో చంద్రబాబునాయుడు మాట్లాడడం అతని అవినీతికి నిదర్శనమన్నారు. జిల్లా మంత్రి పి.నారాయణ కొన్న  3,120 ఎకరాల్లో సైతం అసైన్డ్, పేదల  భూములు ఉన్నాయన్నారు. భూములు ఇవ్వనన్న వారిని బెదిరించి మరీ టీడీపీ నేతలు కొనుగోలు చేశారన్నారు. సాక్షాత్తు రాష్ర్ట మంత్రి భార్యపేరు మీద భూములు కొనుగోలు చేశారని, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడితే సీబీఐ ఎంక్వయిరీ అవసరమా అని అనడం చంద్రబాబునాయుడు లెక్కలేనితనానికి నిదర్శనమన్నారు.

అమరావతి భూముల అవినీతిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి, సీబీఐతో ఎంక్వయిరీ చేయించాలని అడిగితే చంద్రబాబుకు భయమెందుకని ప్రశ్నించారు. టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ నాయకులు కూడా ఈ భూములపై విచారణ కోరడం అభినందనీయమన్నారు. విచారణ చేయమన్న బీజేపీ నాయకులను చంద్రబాబు బెదిరించడం దారుణమన్నారు. పోలవరానికి ఇచ్చిన రూ.100 కోట్లు పట్టిసీమకు, అమరావతికి ఇచ్చిన రూ.850 కోట్లు ఇరిగేషన్ పనులకు దారి మళ్లించారని మండిపడ్డారు.

భూమి లేని షెడ్యూల్ట్ కులాలకు భూములు, ట్రైబల్ సంస్థ ద్వారా గిరిజనులకు భూములు ఇస్తానన్న ఎన్నికల హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో చంద్రబాబుకు పెట్టుబడి పెట్టిన వారే అమరావతిలో భూములు కొన్నారన్నారు. ప్రజాసేవకే రాజకీయాల్లో వచ్చానన్న మంత్రి నారాయణ తొలుత తన మెడికల్ కళాశాల్లో డొనేషన్లు లేకుండా సీట్లు ఇచ్చి మాట్లాడాలని ప్రసన్న డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  మావులూరు శ్రీనివాసులురెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి విజయ్‌కుమార్, జెట్పీటీసీ సభ్యుడు బీవీ రమణయ్య, నాయకులు గూడూరు ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
Share this article :

0 comments: