పార్లమెంట్ లో హోదా అంశాన్ని ఖూనీ చేశారు: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్లమెంట్ లో హోదా అంశాన్ని ఖూనీ చేశారు: వైఎస్ జగన్

పార్లమెంట్ లో హోదా అంశాన్ని ఖూనీ చేశారు: వైఎస్ జగన్

Written By news on Saturday, July 30, 2016 | 7/30/2016


పార్లమెంట్ లో హోదా అంశాన్ని ఖూనీ చేశారు: వైఎస్ జగన్
హైదరాబాద్ : ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఆగస్ట్ 2వ తేదీన బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.  శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ... బంద్ కు ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా  ఎంత అవసరమో ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టారని వైఎస్ జగన్ మండిపడ్డారు.. బీజేపీ, చంద్రబాబు కలిసి ఐదుకోట్ల మంది ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. హోదా ఇవ్వకపోయినా ప్రభుత్వంలో కొనసాగుతామని చంద్రబాబు సంకేతాలిచ్చారన్నారు.

పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయడం లేదని వైఎస్ జగన్ అన్నారు. ఏపీకి అయిదేళ్లు కాదు...పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల ముందు హోదాపై ప్రజలను మభ్యపెట్టారన్నారు. తిరుపతి ఎన్నికల సభ సాక్షిగా నరేంద్ర మోదీ ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ లో ఏం జరిగిందో చూశామని... రాజ్యసభలో శనివారం జరిగిన పరిణామాలు చూస్తే మరోసారి ఆ రోజులు గుర్తొచ్చాయన్నారు.

ఆ తర్వాతే చంద్రబాబు రాజీపడ్డారు..

ఓటుకు కోట్ల కేసులో దొరికిపోయిన తర్వాత చంద్రబాబు వైఖరిలో మార్పు వచ్చిందన్నారు. ఓటు కోసం కోట్లు ఇస్తూ...ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు పట్టుబడ్డారన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఒక్కొక్కరికీ రూ.20 కోట్లు ఎర చూపారన్నారు. సూట్ కేసులు ఇస్తూ నల్లధనంతో చంద్రబాబు దొరికిపోయారన్నారు. ఆ తర్వాతే చంద్రబాబు రాజీపడ్డారని వైఎస్ జగన్ అన్నారు. వారం రోజులకే చంద్రబాబు మాట మార్చారన్నారు. రాజధాని శంకుస్థాపన సభలో కూడా ప్రధానిని చంద్రబాబు హోదా విషయంపై అడగలేకపోయారన్నారు. ఆయన ఇప్పుడు ఏదీ అడగలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. అందుకే  హోదా సంజీవిని కాదంటూ ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగార్చుతున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఆయన హోదా సంజీవని కాదన్న తర్వాతే బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేమనే పరిస్థితిలోకి వెళ్లిపోయిందన్నారు.

గట్టి అల్టిమేటం ఇస్తారనుకున్న చంద్రబాబు ఏం చెప్పారో అంతా చూశామన్నారు. హోదా ఇవ్వకపోయినా పర్వాలేదన్నట్లు చంద్రబాబు మాట్లాడరన్నారు. చంద్రబాబు చాలా దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారని, నిలదీయలేని పరిస్థితిలో ప్రజాస్వామ్యం ఉందా? అనిపిస్తుందని వైఎస్ జగన్ అన్నారు. తన స్వప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని పణంగా పెట్టారని ఆయన ధ్వజమెత్తారు. పథకం ప్రకారం చంద్రబాబు డ్రామాలాడి, ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేశారన్నారు. అందుకే మొహమాటం లేకుండా బీజేపీ హోదా సాధ్యం కాదని చెప్పిందన్నారు. బీజేపీ ఆ మాట అన్నాక కూడా చంద్రబాబు ఇంకా తాను కేంద్రంలో కొనసాగుతానని చెప్తున్నారని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.  అంతా అయిపోయాక ఇప్పుడు చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని  అన్నారు.

జైట్లీ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం రాజ్యసభలో చెప్పిన వివరాలు తమకు ఆశ్చర్యాన్ని కలిగించాయని వైఎస్ జగన్ అన్నారు. 14వ ఆర్థిక సంఘం ప్రకారం ప్రత్యేక హోదా ఉన్న, లేని రాష్ట్రాలకు మధ్య తేడా చూపలేదన్నారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగిస్తామని పార్లమెంట్ లో తమ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లేఖకు సమాధానం ఇచ్చారన్నారు. ప్రత్యేక హోదా అంశానికి, ఆర్థిక సంఘానికి సంబంధం లేదని వైఎస్ జగన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయాన్ని రాష్ట్రాలకు ఎలా పంచాలన్నదానిపైనే ఆర్థిక సంఘం దృష్టి పెడుతుందన్నారు. హోదా ఇవ్వాలా? వద్దా? అన్న విషయం ఆర్థిక సంఘం పరిధిలో ఉండదన్నారు. ప్రధాని నేతృత్వంలోని ఎన్డీసీ ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకుంటుందని వైఎస్ జగన్ గుర్తు చేశారు.
 హోదాపై ప్రధానిదే నిర్ణయం
ప్రత్యేక హోదా కేవలం ఎగ్జిక్యూటివ్ నిర్ణయం మాత్రమే అని వైఎస్ జగన్ అన్నారు. అది లెజిస్లేటివ్ విషయం కానే కాదన్నారు. హోదా ఇవ్వాలా వద్దా అంశాన్ని ప్రధాని మాత్రమే నిర్ణయించగలరన్నారు. అప్పటి ప్రధాని వాజ్ పేయి ఒక్క సంతకంతో ఉత్తరాఖండ్ కు ప్రత్యేక హోదా ఇచ్చారన్నారు. హోదాపై మన్మోహన్ కేబినెట్ నిర్ణయం తీసుకుని అమలు చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చిందన్నారు. ప్లానింగ్ కమిషన్ కు కూడా ఆదేశాలు ఇచ్చిందన్నారు. ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలపాలని ఆరోజు నిర్ణయం తీసుకుందని వైఎస్ జగన్ అన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరో ఏడాది పాటు 13వ ఆర్థిక సంఘమే ఉందని వైఎస్ జగన్ తెలిపారు. నీతి ఆయోగ్ కూడా 2014 డిసెంబర్ లో వచ్చిందని, ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయకముందే ...ఆ ఫైల్ అక్కడే ఉందన్నారు. ఆ సమయంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటికీ...ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. ఒక పథకం ప్రకారం ఏపీని ఖూనీ చేశారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి 90 శాతం గ్రాంట్ల రూపంలో ఉంటాయని, హోదా లేని రాష్ట్రానికి 30 శాతం మాత్రమే గ్రాంట్ల రూపంలో ఉంటాయని వైఎస్ జగన్ అన్నారు. అలాగే హోదా ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు బాగా వస్తాయని, వంద శాతం ఎక్సైజ్, ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందన్నారు. ఇలాంటి రాయితీలు ఉన్నప్పుడే పెట్టుబడులు బాగా వస్తాయని, పెట్టుబడుల కోసం సింగపూర్, రష్యాలకు చంద్రబాబు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. లక్షల కోట్లు పెట్టుబడులే కాకుండా, లక్షల ఉద్యోగాలు కూడా వస్తాయని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయి
బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల ముందు ఊదరగొట్టారని, అయితే ఆయన అధికారంలోకి రాగానే ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయని వైఎస్ జగన్ అన్నారు. అలాగే రెండువేల రూపాయల నిరుద్యోగ భృతి లేదన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి తన అనుభవం చూపించి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆయన వ్యాఖ్యానించారు.  ఎన్నికల ముందు అబద్ధాలు చెప్పడం, తర్వాత మోసం చేసే తీరు మారాలని వైఎస్ జగన్ అన్నారు.
రాజకీయ నాయకులు మాట మీద ఉండాలని, మాట నిలబెట్టుకోకపోతే ప్రజలు నిలదీస్తారన్న భయం కూడా ఉండాలన్నారు.  మంగళవారం నిర్వహించే బంద్ కు అందరు సహకరించాలని ఆయన కోరారు. రాజకీయ పార్టీలతో పాటు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు.
Share this article :

0 comments: