తిరుమల : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రోడ్డు విస్తరణ పేరుతో విజయవాడలో వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించడాన్ని పెద్దిరెడ్డి ఖండించారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ విజయవాడలో అన్ని అనుమతులతోనే వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. వైఎస్ఆర్ సీపీ పట్ల చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్ విగ్రహాలు ఉండటం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు.
వైఎస్ జగన్ ను ఎదుర్కోలేకే చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై బాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. హోదాపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే టీడీపీ కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమంలో పెద్దిరెడ్డి పాల్గొన్నారు.
0 comments:
Post a Comment