వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ తమ పార్టీ ప్రైవేట్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ మూడుసార్లు లోక్సభను స్తంభింపజేసిందని తెలిపారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. హోదా సాధన కోసం తమ పార్టీ గుంటూరులో ఎనిమిది రోజులపాటు దీక్ష చేసిందని గుర్తుచేశారు. దీనిపై వివిధ జిల్లాల్లో ఆందోళన చేపట్టామన్నారు. సభలు, సమావేశాలు నిర్వహించామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటివరకూ ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని సుబ్బారెడ్డి విమర్శించారు.
‘ప్రకాశం’ను వెనుకబడిన జిల్లాల్లో చేర్చాలి
వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపరిచిన జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లాను చేర్చాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఈ చట్టానికి సవరణను ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రతిపాదించారు. ఈ బిల్లును శుక్రవారం నాటి లోక్సభ ప్రైవేట్ మెంబర్ బిజినెస్ ఎజెండాలో పొందుపరిచారు. అయితే సభ మధ్యాహ్నమే వాయిదాపడడంతో ఈ బిల్లు రాలేదు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలతోపాటు అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లాను కూడా ఇందులో చేర్చాలని వైవీ సుబ్బారెడ్డి ఈ బిల్లులో ప్రతిపాదించారు.
0 comments:
Post a Comment