ఆటవిక పద్ధతులు.. మానుకోవాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆటవిక పద్ధతులు.. మానుకోవాలి

ఆటవిక పద్ధతులు.. మానుకోవాలి

Written By news on Wednesday, September 7, 2016 | 9/07/2016


ఆయనవి ఆటవిక పద్ధతులు.. మానుకోవాలి
గుంటూరు :
తుని మంటలతో చలికాచుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అమాయకులను శలభాలుగా మార్చాలని చూడటం అన్యాయం, ఆటవికం, అనాగరికమని.. ఈ ఆటవిక పద్ధతులను చంద్రబాబు మానుకోవాలని వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తుని ఘటనకు సంబంధించి సీఐడీ పోలీసులు రెండోరోజు ఆయనను దాదాపు ఏడున్నర గంటల పాటు విచారించారు. బయటకు వచ్చిన తర్వాత భూమన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ''చంద్రబాబు పాపాల గని. ఆయన చరిత్ర అంతా కుట్రలు, కుతంత్రాలు, వంచన. వీటితోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పెరిగారు. అమాయకులను వేధించడంలో ఆయన దిట్ట. తనను అధిక్షేపించేవాళ్లను, తన అప్రజాస్వామిక విధానాలను వ్యతిరేకించే వాళ్లను ఆయన సహించలేరు. విరుద్ధ అభిప్రాయాల పట్ల ఆయనకు గౌరవం లేదు.

తనకు వ్యతిరేకంగా ఆలోచన చేసేవారిని సహించలేక.. వాళ్లను అరాచకవాదులుగా చిత్రించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. అందులో భాగంగానే నామీద కక్షతో నన్ను తుని కేసులో విచారణకు పిలిపించారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించడమే కాపు ఉద్యమం. తమను బీసీలలో చేరుస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు తుంగలో తొక్కడం వల్లే వాళ్లు ఉద్యమించారు. ఆ సంఘటనతో ఏమాత్రం సంబంధం లేని నన్ను విచారణకు పిలిపించడం వల్ల కాపుజాతి యువకుల గుండెలు రగులుతున్నాయి. వాళ్లందరూ నాకు పరిపూర్ణమైన మద్దతును తెలియజేసినందుకు వారికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని సంఘ విద్రోహశక్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చంద్రబాబు మొదటి రోజు నుంచి చేస్తున్నారు. తుని ఘటన వెనక జగన్ ఉన్నారని చంద్రబాబు, హోం మంత్రి మొదటిరోజు నుంచే చెబుతుంటే దాని ప్రభావం విచారణ సంస్థపై ఉండక తప్పదు.

ఏదో ఒక రకంగా ఈ తుని ఘటన మేం చేయించామనే కుట్రపూరితమైన ఆలోచనతోనే చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. తునిలో ఆరోజు జరిగిన బహిరంగ సభ తర్వాత చోటుచేసుకున్న విధ్వంసాన్ని ప్రజాస్వామ్యవాదులు ఎవరూ హర్షించరు. స్వయంగా ముద్రగడ సహా అందరూ దాన్ని ఖండించారు. కానీ దానికి అమాయకులను బలిచేయడం అంతకంటే పెద్ద నేరం. అలాంటి నేరం చేయడానికి చంద్రబాబు పూనుకున్నారు. ఈ రోజు, నిన్న దానిపై నన్ను విచారించారు.

విచారణాధికారులు హరికృష్ణ, భాస్కర్ చాలా సంస్కారవంతంగా, సభ్యతతో ఆ ఘటన గురించి తెలిసిన విషయాలు మాట్లాడమని అడిగారు. ఏమాత్రం నొప్పించలేదు. వాళ్లను కూడా అభినందిస్తున్నా. కానీ దీని వెనక ఉన్న కుత్సితమైన ప్రేరకం చంద్రబాబుదే. నన్ను పిలిపించడానికి ఆరోజు చంద్రబాబు చేసిన ప్రకటనే కారణం. నాకు ఆ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని చెప్పాను. ఈ రోజుకు నన్ను పంపించారు, మళ్లీ ఎప్పుడు రమ్మంటారో తెలియదు. విచారణలో భాగంగా పిలిపించినట్లు నాకు చెప్పారు. నేను నేరస్థుడినని సీఐడీ వాళ్లు ఏమీ చెప్పలేదు. నేను ఏ ప్రభావాలకూ భయపడే వ్యక్తిని కాను. కాపుల న్యాయమైన కోరిక అయిన బీసీ రిజర్వేషన్లు వెంటనే అమలుచేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ప్రత్యేక హోదా ఇవ్వాలని ఒకరోజు, దానికంటే ఎక్కువ ప్యాకేజి ఇస్తున్నారంటూ ఈరోజు వాజమ్మ ప్రకటనలు చేయడం తగదు. తుని ఘటనపై సీబీఐ విచారణ లేదా, సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయిస్తే నిజానిజాలు నిగ్గుతేలుతాయి. విచారణాధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టారు'' అని భూమన కరుణాకర రెడ్డి చెప్పారు.
Share this article :

0 comments: