08 May 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

రేపు వైఎస్సార్‌సీపీ 3 జిల్లాల విస్తృత భేటీ

Written By news on Saturday, May 14, 2016 | 5/14/2016


రేపు వైఎస్సార్‌సీపీ 3 జిల్లాల విస్తృత భేటీ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల విస్తృత సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఆయా జిల్లాల నాయకులు, కార్యకర్తలు హాజరవుతారని పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ ప్రకటనలో తెలిపారు.

అసభ్య ప్రవర్తనతో టీడీపీ కార్పొరేటర్ పై కేసు నమోదు


అసభ్య ప్రవర్తనతో టీడీపీ కార్పొరేటర్ పై కేసు నమోదు
విజయవాడ :విమానంలో తోటి ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించడంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబుపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే... విజ్ఞాన యాత్రకు వెళ్లిన  టీడీపీ కార్పొరేటర్ చంటిబాబు విమానంలో చేసిన పోకిరీ చేష్టలు వివాదాస్పదమయ్యాయి. ఓ మహిళ ఫిర్యాదు మేరకు గన్నవరం ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ ఆఫీసర్ భీముడు అతడిని  అదుపులోకి తీసుకున్నారు.
సుమారు అరగంట సేపు విచారణ నిర్వహించారు. ఈ విషయాన్ని తోటి కార్పొరేటర్లు టీడీపీ నాయకుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు రంగంలోకి దిగి సర్దుబాటు చేసినట్లు సమాచారం. గత నెల 29న విజ్ఞానయాత్రకు వెళ్లిన కార్పొరేటర్ల బృందం ఢిల్లీ నుంచి శుక్రవారం తిరుగు ప్రయాణం కట్టారు. కొందరు టీడీపీ కార్పొరేటర్లు విమానం, మరికొందరు రైల్లో బయలుదేరారు. అయితే చంటిబాబు విమానంలో పక్క సీట్లో ఓ మహిళ ఉన్నారు.

తనతో చంటిబాబు అసభ్యంగా ప్రవర్తించాడని ఆ మహిళ హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా సెక్యూరిటీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గన్నవరం సెక్యూరిటీ వింగ్ రంగంలోకి దిగింది. విమానం గన్నవరం చేరుకోగానే సదరు కార్పొరేటర్‌ను సెక్యూరిటీ అధికారులు చుట్టుముట్టారు. అనూహ్య పరిణామంతో టీడీపీ కార్పొరేటర్లు కంగుతిన్నారు. అందరూ కలిసి ఉంటే బుక్కైపోతామని భావించారు.  డెప్యూటీ మేయర్ గోగుల రమణారావును చంటిబాబు వద్ద ఉంచి మిగితా వారంతా బయటకు వచ్చేశారు. అనంతరం ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లారు.

వారు ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులతో మాట్లాడి చంటిబాబును అక్కడ నుంచి తప్పించారు. గతనెల 30వ తేదీన పూణే లో ఓ కార్పొరేటర్ ట్రయిన్‌లో మద్యం సేవించి మహిళతో అసభ్యంగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. కార్పొరేటర్ల ఆగడాలతో తలలు పట్టుకున్న టీడీపీ నాయకులు కనీసం ఖండన ఇచ్చే ధైర్యం చేయలేదు. ఈ వివాదం సద్దుమణగక ముందే మరో కార్పొరేటర్ విమానంలో మహిళతో అసభ్యంగా ప్రవర్తించి చిక్కుల్లో పడ్డాడు. అయితే రాజకీయ ఒత్తిళ్లతోనే చంటిబాబును వదిలేశారని గన్నవరం పోలీసులపై విమర్శలొస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ కావటం వల్లే అతడిని వదిలేసినట్లు తెలుస్తోంది. మహిళలతో టీడీపీ కార్పొరేటర్ల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
http://www.sakshi.com/news/hyderabad/case-filed-on-ummadi-venkateswarrao-vijayawada-corporator-341710


అయితే దీనిపై కలిసిపోరాడుదాం రండి కాంట్రాక్టులు కూడా పోతాయ్

Written By news on Friday, May 13, 2016 | 5/13/2016


బహిరంగ చర్చకు రండి: అంబటి సవాల్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసలు తమను ప్రత్యేక హోదా కోరనే లేదని, ఆయన చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాని భారతీయ జనతాపార్టీ నేతలు వ్యాఖ్యానించిన తరువాత కూడా కేంద్ర ప్రభుత్వంలో కొనసాగటానికి సిగ్గనిపించడం లేదా అని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.

బీజేపీ నేతలు రాష్ట్రానికి 1,43,000 కోట్ల రూపాయలను కెటాయించినట్లు వెల్లడిచారని.. అయితే ఈ డబ్బును ఎలా ఖర్చు చేశారో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. నూతన రాజధాని శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో కూడా చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి కాకుండా ప్రత్యేక ప్యాకేజీ గురించి అడిగారని, ఆ తరువాత మాటమార్చారని ఈ సందర్భంగా అంబటి గుర్తుచేశారు.

ప్రత్యేక హోదా కోసం ప్రభుత్వం కృషి చేయక పోగా ఆ విషయంలో పోరాడుతున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం దారుణమన్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు.. విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై మాట్లాడడం లేదన్నారు. తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టుల్లో వైఎస్ జగన్ కు కాంట్రాక్టులు దక్కించుకున్నారని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారనీ.. అయితే దీనిపై కలిసిపోరాడుదాం రండి కాంట్రాక్టులు కూడా పోతాయ్ అంటూ చురకలంటించారు.

చంద్రబాబు తాబేదార్లు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, మంత్రి సుజనా చౌదరి బ్యాంకుకు పంగనామాలు పెట్టడానికి చూస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా, పక్కరాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టుల నిర్మాణం మీద బహిరంగ చర్చకు రావాలని అంబటి సవాల్ విసిరారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో చంద్రబాబుకు న్యాయస్థానాలు సరైన సమాధానం చెబుతాయన్నారు.

సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్ సీపీ


సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్ సీపీ
న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో వైఎస్సార్ సీపీ శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్, పార్టీ ఫిరాయించిన 16 మంది ఎమ్మెల్యేలను పిటిషన్ లో ప్రతివాదులు చేర్చింది. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులపై స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని పిటిషన్ లో వైఎస్సార్ సీపీ పేర్కొంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తక్షణం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కోరింది. 

స్పీకర్ చర్యలు తీసుకోకపోవడం వల్లే సుప్రీంకోర్టును ఆశ్రయించామని వైఎస్సార్ సీపీ లోక్‌ సభ పక్షనేత మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. ఉత్తరాఖండ్ తరహాలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను తక్షణం అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఎస్వీ మోహన్‌రెడ్డిని అనర్హుడుగా చేయాలి


స్పీకర్‌కు వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం వినతి

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ టీడీపీలో చేరిన ఎస్వీ మోహన్‌రెడ్డిని శాసన సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు విజ్ఞప్తి చేసింది. పార్టీ ఎమ్మెల్యేలు కళత్తూరు నారాయణస్వామి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు ఏపీ శాసనసభ డిప్యూటీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యను గురువారం సాయంత్రం 5.15 గంటలకు కలసి ఈ మేరకు ఒక ఫిర్యాదును సమర్పించారు.

స్పీకర్, శాసనసభ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో వారీ ఫిర్యాదును డిప్యూటీ కార్యదర్శికి అందజేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎస్వీ మోహన్‌రెడ్డి శాసనసభ్యునిగా కొనసాగే అర్హతను కోల్పోయారని, తక్షణం ఈ అంశంపై నిర్ణయం వెల్లడించాలని వారు కోరారు. ఎస్వీ మోహన్‌రెడ్డి సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువాను కప్పుకోవడంతోపాటు పార్టీని వీడుతున్నట్లు చేసిన  వ్యాఖ్యలను ఈ ఫిర్యాదు ద్వారా స్పీకర్ దృష్టికి తెచ్చారు

దుర్గాప్రసాదరాజుకు జగన్ పరామర్శ


దుర్గాప్రసాదరాజుకు జగన్ పరామర్శ
 రోడ్డు ప్రమాదంలో గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న వైఎస్సార్‌సీపీ నేత సాగి దుర్గాప్రసాదరాజును పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం పరామర్శించారు. ప్రశాసన్‌నగర్‌లోని రాజు నివాసానికి జగన్ వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాజంపేట ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి, పార్టీ నేతలు జి.ఆదిశేషగిరిరావు, గుడివాడ అమర్‌నాథ్, పి.సర్రాజు, రాజీవ్‌కృష్ణ కూడా రాజును పరామర్శించిన వారిలో ఉన్నా

నటుడు గిరిబాబుకు వైఎస్ జగన్ పరామర్శ

Written By news on Thursday, May 12, 2016 | 5/12/2016

హైదరాబాద్: సినీ నటుడు గిరిబాబు భార్య శ్రీదేవి మృతికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపాన్ని తెలిపారు. ప్రకాశం జిల్లా రావినూతలలోని స్వగృహంలో ఉన్న గిరిబాబుకు గురువారం సాయంత్రం వైఎస్ జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గత మూడేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆమె బుధవారం అర్థరాత్రి మృతిచెందిన విషయం తెలిసిందే.

కర్నూలులో వైఎస్ జగన్ జలదీక్ష


కర్నూలులో వైఎస్ జగన్ జలదీక్ష
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జలదీక్ష చేపట్టనున్నట్లు పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. కర్నూలులో ఈనెల 16,17,18 తేదీల్లో దీక్ష చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గురువారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు నాయుడు మౌనంగా ఉండటం ఏపీకి శాపంగా మారిందన్నారు.

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ లో ఎడారిగా మారే ప్రమాదం ఉందని, మన హక్కులను మనమే కాపాడుకోవాలనే వైఎస్ జగన్ జలదీక్ష చేస్తున్నారన్నారు. నీటి కోసం అనర్థాలు తలెత్తే అవకాశాలున్నాయని అన్నారు. వైఎస్ జగన్ జలదీక్ష ఒక ప్రాంతం, ఒక పార్టీ సమస్య కాదని, ఇది ప్రజలందరి సమస్య అని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. జలదీక్షను ప్రజలందరూ విజయవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. వైఎస్ జగన్ జలదీక్ష సందర్భంగా ఈ నెల 17న రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఉమ్మారెడ్డి తెలిపారు.

జైలుకైనా వెళ్తా గానీ..


జైలుకైనా వెళ్తా గానీ..
హైదరాబాద్ :
అవసరమైతే తాను జైలుకైనా వెళ్తాను గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో గల పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాను టీడీపీలో చేరుతున్నట్లుగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు కట్టు కథలేనని ఆయన అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు.

టీడీపీ నేతలు తనకు పలు రకాలుగా ఆశలు చూపించారని, చివరకు కేసులు పెడతామంటూ బెదిరించారని తెలిపారు. అయితే తాను కేసులకు భయపడేది లేదని, జగన్ వెంటే నడుస్తానని అన్నారు. వైఎస్ జగన్ రాష్ట్రప్రజల కోసం జలదీక్ష చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం ధనదీక్ష చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అవినీతి వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారని ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు.

అక్రమ ప్రాజెక్టుల చరిత్ర పునరావృతం


అక్రమ ప్రాజెక్టుల చరిత్ర పునరావృతం
- సీఎంపై బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజం
- చంద్రబాబు అప్పటి పాలనలోనే ఆల్మట్టి, బాబ్లీలకు అంకురార్పణ
- ఇప్పుడు ‘పాలమూరు’, డిండిలను నిర్మిస్తున్న తెలంగాణ
- అన్యాయాన్ని అడ్డుకునేందుకే విపక్ష నేత జగన్ దీక్ష

సాక్షి, హైదరాబాద్:
 చంద్రబాబునాయుడు అప్పటి తొమ్మిదేళ్ల పాలనలో ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలు సాగునీటి ప్రాజెక్టులు కట్టి ఏపీకి నష్టం కలుగజేశాయని, ఇప్పుడు తెలంగాణ కూడా ఆయన హయాంలోనే అక్రమంగా ప్రాజెక్టులు కడుతోందని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. బాబు హయాంలో చరిత్ర పునరావృతమవుతోందన్నారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లలో నీటి కొరత తీవ్రంగా ఉంటున్న పరిస్థితుల్లో.. ఎగువ రాష్ట్రాలు అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుగ్గన విలేకరులతో మాట్లాడారు.

చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్న 1995-2004 మధ్య కాలంలోనే అల్మట్టి, బాబ్లీ ప్రాజెక్టుల నిర్మాణానికి అంకురార్పణ జరిగిందన్నారు. అప్పట్లో కేంద్రంలో తాను కింగ్‌మేకర్‌ని అని చెప్పుకుంటూ కూడా చంద్రబాబు కర్ణాటకలో ఆల్మట్టిని, మహారాష్ట్రలో బాబ్లీని ఆపలేక పోయారని ఎద్దేవా చేశారు. ఈ నిర్మాణాల వల్లనే బచావత్ అవార్డు గడువు ముగిసి కొత్తగా వచ్చిన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ నుంచి ఆ రాష్ట్రాలు ఎక్కువ నీటి కేటాయింపులు పొందగలిగాయని వివరించారు. కర్ణాటక, మహారాష్ట్రలు తమ ప్రాజెక్టులను వేగంగా నిర్మించుకుంటే ఏపీలో ప్రాజెక్టులపై బాబు అసలు శ్రద్ధే చూపలేదని విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కృష్ణా నదిపై పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ప్రాజెక్టులను నిర్మిస్తుంటే చంద్రబాబు ఒక లేఖ రాసి సరిపెట్టారని విమర్శించారు.

ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్‌లో 800 అడుగుల నుంచి 120 టీఎంసీల నీటిని తోడుకోవాలని తెలంగాణ సంకల్పించిందని చెప్పారు. ఇదే కనుక జరిగితే రాయలసీమ పూర్తిగా ఎడారిలా మారుతుందని, కృష్ణా డెల్టా.. ప్రకాశం జిల్లాలు అల్లాడి పోతాయని బుగ్గన ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం నుంచి ఈ ప్రాంతాలకు నీరందాలంటే కనీసం 854 అడుగుల మేర నీటి మట్టం ఉండాలని చెప్పారు.బాబుకు రాయలసీమపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని, గుండ్రేవుల, సిద్ధేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణంపై శ్రద్ధ పెట్టక పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.

అందరి దృష్టికీ తీసుకెళ్లేందుకే..
ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ఆపేందుకే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో ఈ నెల 16, 17, 18 తేదీల్లో దీక్షను చేయబోతున్నారని బుగ్గన తెలిపారు. ఈ అక్రమాన్ని ప్రజ ల దృష్టికి, వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల దృష్టికి, కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడానికే జగన్ ఆందోళనకు
 దిగుతున్నారన్నారు.

అటకెక్కిన సంక్షేమ పథకాలు


అటకెక్కిన సంక్షేమ పథకాలు
 వైఎస్సార్  సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి

 సాక్షిప్రతినిధి, ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పాలనలో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్, పింఛన్లు, రేషన్, 108, 104, ఇంది రమ్మ ఇళ్ల పథకాలను ఈ ప్రభుత్వం అటకెక్కించిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతి నిధి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. ఖమ్మంలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కమీషన్లు దండుకోవడానికే సీఎం కేసీఆర్ ప్రాజెక్టులకు రీ డిజైన్ చేయిస్తున్నారని, రాష్ర్టంలో ఈ రెండేళ్లలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తిచేసి సాగునీటిని అందించారా? అని ప్రశ్నించారు.

మాటల గారడీ చేస్తూ.. పూటకోమాట చెబుతున్న కేసీఆర్ పాలనకు కాలం చెల్లే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఒక్క సంక్షేమ పథకం కూడా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని, ఇప్పటికే ప్రజల్లో దీనిపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఇప్పుడు కొత్త జిల్లాలంటూ మళ్లీ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ముందుగా జలయజ్ఞంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాం డ్ చేశారు. మంత్రి తుమ్మల ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, తుమ్మలను పాలేరు ఎన్నికలో పోటీలోకి దించడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు.    వైఎస్సార్ సీపీ, టీడీపీ మద్దతునిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితారెడ్డి విజయం ఖాయమన్నారు.  

గెలిపిస్తే... రోడ్డున పడేస్తారా?


గెలిపిస్తే... రోడ్డున పడేస్తారా?
► నిర్వాసితుల ఆగ్రహం
 ఇబ్రహీంపట్నం, ఫెర్రీలలో ఇళ్ల తొలగింపులో ఉద్రిక్తత
► బాధితులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ



ఇబ్రహీంపట్నం
 : ఓట్లు వేసి గెలిపిస్తే అభివృద్ధి పేరుచెప్పి రోడ్డున పడేస్తారా అంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పుష్కరాల అభివృద్ధి పనుల్లో భాగంగా ఇబ్రహీంపట్నంలోని సుందరయ్యనగర్, ఫెర్రీ రహదారిలో పేదల నివాసాలను బుధవారం ఉదయం తొలగించేందుకు విజయవాడ వెస్ట్ జోన్ ఏసీపీ జి.రామకృష్ణ, స్థానిక సీఐ డి.చవాన్ నేతృత్వంలో పోలీసులు భారీగా మోహరించారు. తహసీల్దార్ జయశ్రీ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది పొక్లెయిన్లతో నివాసాలు కూల్చేందుకు సిద్ధమయ్యారు. స్థానికులు ఏకమై ఉన్నపళంగా మా గూడులు కూల్చేస్తే మేమెక్కడికి వెళ్లాలని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ప్రత్యామ్నాయం చూపనిదే ఈ ప్రాంతాన్ని వీడేదిలేదని స్పష్టంచేశారు.


 బాధితులకు బాసటగా వైఎస్సార్ సీపీ
విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ బాధితులకు అండగా నిలిచారు. సుందరయ్యనగర్‌లో రెవెన్యూ, పోలీస్ అధికారులతో చ ర్చించారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదలను ఒక్కసారిగా ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళతారని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయం చూపిన తరువాతే ఇళ్లు తొలగించాలని వత్సవాయి తహసీల్దార్ శ్రీనివాసరావు, స్థానిక తహసీల్దార్ జయశ్రీని కోరారు. బాధితుల ఇంటింటికి వెళ్లి ప్రత్యామ్నాయ స్థలాలు వచ్చే వరకు పోరాడతామని, వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు.

పోరాడి సాధించిన నివేశన స్థలం పట్టాలు
బాధితులకు ప్రత్యామ్నాయంగా నివేశన స్థలం పట్టాలు ఇవ్వనిదే నివాసాలు ఖాళీచేసే ప్రసక్తే లేదని జోగి రమేష్ స్పష్టంచేశారు. స్థలాలు ఇచ్చే వరకు ఇక్కడే ఉంటారని చెప్పారు. దీనిపై సబ్ కలెక్టర్ సృజనతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. కనీసం అద్దెలు కూడా కట్టుకునే పరిస్థితి వీరికి లేదని వివరించారు. పట్టాలు ఇవ్వనిదే నిర్వాసితులు ఇక్కడి నుండి కదలరని చెప్పారు. దీంతో బాధితులకు తక్షణమే నివేశనస్థం పట్టాలు ఇవ్వాలని తహసీల్దార్ జయశ్రీకి సబ్‌కలెక్టర్ సూచించారు. ఆమె సూచనల మేరకు రెవెన్యూ అధికారులు సుందరయ్యనగర్‌లో, ఫెర్రిలో బాధితులకు పట్టాలను పంపిణీ చేశారు. అప్పటి వరకు దిక్కుతోచని స్థితిలో ఉన్న నిర్వాసితులకు వైఎస్సార్ సీపీ అండతో పట్టాలు మంజూరు కావడంతో ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మేడపాటి నాగిరెడ్డి, జిల్లా కార్యదర్శి లంకే అంకమోహనరావు, ఎంపీటీసీ సభ్యురాలు లంకే దేవకుమారి, వార్డు సభ్యులు రాయిపూడి వెంకటరావు, సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.

పనామా లీకుల్లో హెరిటేజ్ 'లింకు'


పనామా లీకుల్లో హెరిటేజ్ 'లింకు'
- అనుమానాస్పద కంపెనీలతో హెరిటేజ్ ఫుడ్స్ ఇండిపెండెంట్ డెరైక్టర్ మోటపర్తి శివరామ వరప్రసాద్‌కు సంబంధాలు
- ప్రసాద్‌కు చిన్న దేశాల్లో పలు కంపెనీలు, కొన్ని బినామీలతో నడుస్తున్నాయని పనామా పేపర్స్ అభియోగాలు

- చంద్రబాబు సీఎం అయిన నెలరోజులకే హెరిటేజ్ డెరైక్టర్‌గా మోటపర్తి నియామకం
- ఘనాలో ఉంటున్న ఎన్నారై ప్రసాద్‌ను డెరైక్టర్‌గా నియమించడంపై విస్మయం

- బాబుకు అత్యంత సన్నిహితుడు, ఏపీ బ్రాండ్ అంబాసిడర్ అజయ్‌దేవ్‌గణ్ పేరు పనామాలో వచ్చిన వారానికే ఇప్పుడీ ప్రసాద్ పేరు రావడంపై చర్చ

సాక్షి, హైదరాబాద్:
 ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పనామా పేపర్స్ తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబ కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్‌లో ఇండిపెండెంట్ డెరైక్టర్ అయిన మోటపర్తి శివరామ వరప్రసాద్‌కు అనుమానాస్పద కంపెనీలతో వున్న లింకుల్ని  వెల్లడించింది. పన్నులు ఎగవేసేందుకు చిన్న చిన్న దేశాల్లో, ద్వీపాల్లో నెలకొల్పుతున్న కంపెనీల భాగోతాల్ని,  బినామీల పేర్లతో నెలకొంటున్న కంపెనీల గుట్టురట్టుల్ని విప్పిచెపుతున్న పనామా పేపర్స్ తాజాగా బయటపెట్టిన ప్రసాద్ ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తెలుగు రాష్ట్రాల రాజకీయవర్గాలు ఒక్కసారిగా నివ్వెరపోయాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ప్రకంపనలు మొదలయ్యాయి.

ఈ మోటపర్తి ప్రసాద్ పేరును తాజా పనామా పత్రాల్లో మూడు దఫాలు ప్రస్తావించారు. ఆఫ్రికా ఖండంలోని ఘనా, టోగో దేశాల్లో ఎంపీ హోల్డింగ్స్ అసోసియేట్స్ లిమిటెడ్, బాలీవార్డ్ లిమిటెడ్, బిట్‌కెమీ వెంచర్స్ వంటి ఆఫ్‌షోర్ కంపెనీలతో ఆయనకున్న లింకుల్ని పనామా పేపర్స్ వెల్లడించింది.  నామమాత్రపు కంపెనీల పేర్లమీద పన్నులు ఎగవేసారన్న అభియోగాల్ని మోపింది. బ్రిటిష్ వర్జిన్ ఐలెండ్స్, ఈక్వడార్, ఘనా, పనామా దేశాల్లో రిజిష్టర్ అయి వున్న పలు కంపెనీల్లో ప్రసాద్‌కు వాటాలున్నాయి.

ఎన్నెన్నో అనుమానాలు...
పనామా పత్రాల వ్యవహారం తొలిసారిగా బయటపడ్డపుడే ప్రసాద్ పేరు ప్రస్తావనకు వచ్చింది. టోగో దేశంలోని వాసెమ్ అనే కంపెనీ గురించి పనామా పేపర్స్ విస్త్రతంగా కథనాలు వెలువరించింది. వాసెమ్ యజమానుల గురించి పనామా పేపర్స్‌లో ప్రస్తావిస్తూ దానిలో బ్రిటన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కెన్లెమ్ లిమిటెడ్‌కు 40 శాతం వాటా వున్నట్లు పేర్కొంది. ఆ కెన్లెమ్ యజమాన్యంపై అనుమానాలు వ్యక్తంచేస్తూ అసలు వ్యక్తుల పేర్లు యజమానులుగా ఆ కంపెనీ చూపించడం లేదని, బినామీ పేర్లతో నడుస్తోందన్న అభియోగాల్ని పనామా పేపర్స్ మోపింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... మోటపర్తి ప్రసాద్‌కు కెన్లెమ్‌లో 24 శాతం వాటా వుంది. అలాగే కెన్లెమ్‌లో మరో 17 శాతం వాటా రఫెల్ హోల్డింగ్స్‌కు వుంది. ఈ రఫెల్ హోల్డింగ్స్ అసలు యజమానులు కూడా వేరే వ్యక్తులని పనామా పేపర్స్ వెల్లడించింది. టోగోలోని వాసెమ్ సిమెంటు కంపెనీలో 89 శాతం షేర్లు ఆ దేశానికి చెందినవారికి కావు. ఈ కంపెనీ ప్రధాన వాటాదారుల్లో మోటపర్తి ప్రసాద్ ఒకరు.

బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే....
హెరిటేజ్ ఫుడ్స్ ఇండిపెండెంట్ డెరైక్టర్‌గా 2014 జూలై నెలలో ఐదేళ్ల కాలానికి ప్రసాద్ నియమితులయ్యారు. ఆయన కంపెనీకి ఇండిపెండెంట్ నాన్-ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారని హెరిటేజ్ ఫుడ్స్ తెలిపింది. 2014 జూన్ నెలలో కొత్త ఏపీ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. బాబు పదవిలోకి వచ్చిన నెలరోజులకే ప్రసాద్‌కు హెరిటేజ్ ఫుడ్స్‌లో డెరైక్టర్‌గా కూర్చోబెట్టడంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఘనా, టొగో తదితర దేశాల్లో పలు కంపెనీలు స్థాపించిన ప్రసాద్  ఏపీ సీఎంకు అత్యంత సన్నిహితుడని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఆయన  దేశంలో, ముఖ్యంగా  రాష్ట్రంలో ఉన్నపుడు చంద్రబాబు నిర్వహించే ప్రతి సమావేశంలో పాల్గొనే వారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఆయన  హెరిటేజ్‌లో ఉన్నతోద్యోగి అని చెప్తుండేవారని, చంద్రబాబుకు, ఆయనకు మధ్య ఇంత పెద్ద వ్యాపార, బినామీ సంబంధాలున్నాయని తమకు తెలియదని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నా యి. అయితే ఇండిపెండెంట్ డెరైక్టర్‌గా ఈ దేశంలో వుండే ఒక వృత్తినిపుడినో, పారిశ్రామికవేత్తనో ఎంచుకోకుండా, ఎక్కడో ఘనా దేశంలో వుంటున్న ఒక ఎన్నారైని నియమించడంపై పారిశ్రామిక వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.  

హైదరాబాద్‌లోనూ ఎన్నో కంపెనీలు
ప్రసాద్‌కు హైదరాబాద్‌లో సైతం పలు రిజిష్టర్డ్ కంపెనీలున్నాయి. చాలా కంపెనీలకు ఆయన చైర్మన్‌గా, డెరైక్టరుగా, భాగస్వామిగా ఉంటున్నారు. డిజైన్ ట్రయిబ్, విండ్సర్ ఎడిఫిసెస్, వోల్టా ఫ్యాషన్స్, వోల్టా ఎస్టేట్స్ , వోల్టా ఇంపాక్స్, తోషాలి సిమెంట్స్, ప్రకృతి సిమెంట్స్, పేపర్ ఇంజనీరింగ్ సర్వీసెస్, దక్కన్ ఆటో, పృధ్వీ అసెట్ రీకన్‌స్ట్రక్షన్స్ వీటిలో కొన్ని. ఇందులో చాలావరకూ హైద రాబాద్ సంజీవరెడ్డి నగర్‌లోని హౌస్ నంబర్ 123/3, మూడో ఫ్లోర్‌లో వున్నట్లు ఆల్ కంపెనీ డేటా.కామ్ సైట్ వెల్లడిస్తోంది. అయితే ఆ భవనంలో ఇప్పుడు అవేవీ లేవు. మరో కార్పొరేట్ గ్రూప్ కంపెనీలు అక్కడ వుండటం గమనార్హం. పనామా పేపర్స్‌లో  ఆయన పేరు ప్రస్తావనకు రావడంపై ప్రసాద్ స్పందిస్తూ ఘనా, టోగో దేశాలతో సహా పలు దేశాల్లో తనకు పలు కంపెనీలున్నాయని, అవన్నీ హోల్డింగ్ కంపెనీలని, చట్టబద్దమైనవేనన్నారు.తాను హెరిటేజ్ ఫుడ్స్‌లో ఇండిపెండెంట్ డెరైక్టర్‌నని ఆయన పేర్కొన్నారు. మోటపర్తి ప్రసాద్ కుమారుడు సునీల్ అమెరికా, హైదరాబాద్‌ల్లోని స్టార్టప్ కంపెనీల్లో దాదాపు రూ. 40 కోట్లు పెట్టుబడి చేశారు.  
 
ఎవరీ ప్రసాద్...
కృష్ణాజిల్లాకు చెందిన మోటపర్తి ప్రసాద్ చాలా కాలం క్రితం ఆఫ్రికా దేశాలకు వెళ్లి వ్యాపారాలతో బాగా సంపాదించారు.  వరంగల్ నిట్‌లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ విద్యనభ్యసించారు. ముంబై, గుజరాత్‌ల్లో ఇనుము, ఉక్కు ఫౌండ్రీల నిర్వహణకు సంబంధించి అనుభవం సంపాదించారు. 1985లో పటాన్‌చెరు వద్ద మార్టోపెరల్ అల్లాయిస్ అనే కంపెనీని స్థాపించి, దాని టర్నోవర్‌ను నాలుగేళ్లలో రూ. 5 కోట్లకు తీసుకెళ్లారంటూ ఆయన ఛైర్మన్‌గా వ్యవహరించే వోల్టాస్ ఫ్యాషన్ ప్రొఫైల్‌లో వివరించారు.

అటుతర్వాత సిమెంటు తదితర రంగాల్లోకి ప్రవేశించి, పలు దేశాల్లో వివిధ కంపెనీలను నిర్వహిస్తున్నట్లు ఆ ప్రొఫైల్‌లో వివరించారు. దీని సంగతి పక్కనబెడితే...ఆయన చంద్రబాబునాయుడుకి సన్నిహితుడంటూ పారిశ్రామిక, రాజకీయ వర్గాలు చెపుతుంటాయి. అందుకే ఘనా దేశంలో వుంటున్న ఎన్నారైను ఏరికోరి తన కుటుంబ కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్‌లో డెరైక్టరుగా నియమింపచేశారని చెప్పుకుంటుంటారు. ప్రసాద్ కుమారుడికి  రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ దివిస్ లేబరోటరీస్ యజమాని మురళీ కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు.
 
అజయ్ దేవ్‌గణ్ తర్వాత....
ఆంధ్రప్రదేశ్‌తో ఏ విధమైన సంబంధం, అనుబంధం లేని బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్‌ను ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపికచేసుకున్న కొద్దిరోజులకే ఆ హీరో పేరు పనామా పేపర్స్‌లో ప్రముఖంగా వెల్లడయ్యింది. హిందీ సినిమాల విదేశీ ప్రదర్శనా హక్కుల్ని పొందేందుకు బ్రిటిష్ వర్జిన్ ఐలెండ్స్‌లో ఒక కంపెనీని నెలకొల్పడంపై జరిగిన భాగోతాన్ని పనామా పేపర్స్ ఈ నెల మొదటివారంలో బయటపెట్టింది. ఇది జరిగి వారం తిరక్కుండానే బాబు కుటుంబ కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్ డెరైక్టర్ ప్రసాద్ పేరు పనామాలో పొక్కడంపై రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి

http://www.sakshi.com/news/hyderabad/ap-cm-chandrababus-heritage-director-motaparthi-prasad-name-in-panama-papers-341031?pfrom=home-top-story

విజయ సాయిరెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ

Written By news on Wednesday, May 11, 2016 | 5/11/2016


విజయ సాయిరెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడి  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డిని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పరామర్శించారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడ్డవారిని కూడా ఆయన పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
కాగా ఔటర్ రింగ్‌రోడ్డుపై నిన్న జరిగిన ప్రమాదంలో విజయసాయిరెడ్డితో పాటు పార్టీ నేత దుర్గాప్రసాదరాజు గాయపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. త్రుటిలో ప్రమాదం నుంచి ఇద్దరు నేతలూ క్షేమంగా బయటపడ్డారు. ప్రస్తుతం వీరు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయిరెడ్డి ఎడమ మోకాలికి గాయమైంది. దుర్గాప్రసాదరాజు తలకు ఎడమవైపు గాయాలయ్యాయి.

జగనన్న వెంటే ఉంటా, పార్టీని వీడేది లేదు


'జగనన్న వెంటే ఉంటా, పార్టీని వీడేది లేదు'
నెల్లూరు: తనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే  రామిరెడ్డి  ప్రతాప్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తాను టీడీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను జగనన్న వెంటే ఉంటానని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ప్రతాప్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పచ్చ ప్రలోభాలకు తాను లొంగేది లేదని, అవాస్తవాలను ప్రసారం చేయటం తగదని, తన వివరణ తీసుకుంటే బాగుండేదని ప్రతాప్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

మంత్రులను ఉపసంహరించుకుంటానని ఎందుకు చెప్పలేకపోతున్నాడో తెలుసా..?


అల్టిమేటమ్ ఇవ్వగలవా?
కేంద్రంలో మంత్రులను ఉపసంహరించుకుంటావా?
ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు వైఎస్ జగన్ సూటి ప్రశ్న

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే మంత్రులను ఉపసంహరించుకుంటానని కేంద్రానికి చంద్రబాబు అల్టిమేటం ఇవ్వగలడా? ఒక నెల మీకు గడువు ఇస్తున్నానని చెప్పగలడా? ఈవేళ ఇంత జరుగుతున్నా బాబు ఢిల్లీకి ఎందుకు అల్టిమేటం ఇవ్వలేకపోతున్నాడో, మంత్రులను ఉపసంహరించుకుంటానని ఎందుకు చెప్పలేకపోతున్నాడో తెలుసా..? ఎందుకంటే అలా అడిగిన రోజు ఢిల్లీవాళ్లు జైల్లో పెట్టి ఊచలు లెక్క పెట్టిస్తారనే భయం కాబట్టే బాబు ధైర్యం చేయడం లేదు’’ అని

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన కోసం పార్టీ ఆధ్వర్యాన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. ధర్నాకు అశేషంగా తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాటల్లోనే..

బాబు వెన్నుపోటు వల్లే హోదా దూరం..
‘‘ఏ రోజైతే చంద్రబాబు ఢిల్లీకి వార్నింగ్ ఇస్తాడో, మంత్రులతో రాజీనామా చేయిస్తామని ఏ రోజైతే అల్టిమేటం ఇస్తాడో ఆరోజు హోదా మన వాకిటకు వస్తుంది. ఇవాళ ప్రత్యేక హోదా రావాలంటే మనమంతా ఒక్కటై చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకురావాలి. బాబు ఇక్కడ ఉన్నప్పుడు బీద అరుపులు అరుస్తారు. ఢిల్లీకి వెళ్లినప్పుడు మోదీని పొగుడుతారు. ఈమధ్య కాలంలో మనం చాలా చూశాం. చాలా విన్నాం. ఎమ్మెల్యేలను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నాడు. ఒక్కొక్కరికి రూ.20 కోట్లు, రూ.30 కోట్లు కుమ్మరిస్తున్నాడు. 17 మంది ఎమ్మెల్యేలు.

ఒక్కొక్కరికి రూ.20 కోట్లు, రూ.30 కోట్లు అంటే రూ.400 కోట్లు, రూ.500 కోట్లు. ఇంత బ్లాక్‌మనీ బాబుకు ఎక్కడి నుంచి వచ్చింది అని గట్టిగా నిలదీయాలి. ఇదే చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ, ఈ మాదిరిగానే డబ్బులిస్తూ ఆడియో, వీడియో టేపులతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన విషయం కూడా మనమంతా చూశాం. ఇవాళ ఇన్నిన్ని ధర్నాలు, దీక్షలు చేస్తున్నా కూడా ప్రత్యేక హోదా మనకు ఎందుకు రావడం లేదంటే.. కారణం చంద్రబాబే. హోదాపై ఆయన మనకు వెన్నుపోటు పొడిచాడు కాబట్టే. ఇదే చంద్రబాబు ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదిహేనేళ్లు కావాలన్నాడు.

ఎన్నికలైపోయాక స్వరం మార్చాడు. ప్రత్యేక హోదా సంజీవని కాదట. ప్రత్యేక హోదా వల్ల స్వర్గం అయిపోదట. చివరకు ఆయన ‘కోడలు మగ పిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా’ అని అంటారు. ప్రత్యేక హోదా మీద బాబు ఈ మాదిరిగా స్వరం మారుస్తూ పోయాడు కాబట్టే చివరకు ఢిల్లీ వాళ్లకు లోకువ అయిపోయాడు. అందుకే ఢిళ్లీవాళ్లు ఇవాళ ప్రత్యేక హోదా ఇవ్వబోమని ఏకంగా పార్లమెంటులోనే చెప్పే ధైర్యం చేశారంటే అది బాబు వల్లే.

ఓట్లకోసం ఇంత మోసమా...?
ఈ రోజు ఇంతటి మండుటెండను లెక్క చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి. దీక్షలు జరుగుతున్నాయి. మిమ్మల్నందరినీ ఒకే ఒక సూటిప్రశ్న అడుగుతున్నాను. మీ అందరికీ ఉద్యోగాలు కావాలా? వద్దా? (అందరూ చేతులు పెకైత్తి ఉద్యోగాలు కావాలంటూ నినదించారు) ఇదే చంద్రబాబు ఎన్నికలకు వెళ్లేటప్పుడు ఇంటికి వెళ్లి ఏ టీవీ ఆన్ చేసినా మనకు వినిపించిందేమిటి? జాబు రావాలంటే బాబు రావాలన్న మాట వినిపించేది అవునా? కాదా? (అవునని జనం చేతులు పెకైత్తి చూపించారు.) ఒకవేళ జాబు ఇవ్వకపోతే ప్రతి నిరుద్యోగికి రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. బాబుకు ముఖ్యమంత్రి జాబు వచ్చింది.

ప్రజలతో పనైపోయింది. ఇవాళ మనకు జాబు వచ్చిందా అని అడుగుతున్నా? తన నైజం ప్రకారం.. ఎన్నికలప్పుడు ప్రజలను ఉపయోగించుకుంటాడు. ఆ తర్వాత ఆ ప్రజలను మోసం చేస్తాడు. ఇదేమీ బాబుకు కొత్త కాదు. ఇవాళ నిజంగా ఐదు కోట్ల మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. బాబు వస్తాడు జాబు వస్తుందని. ఇవాళ నిజంగా రాష్ర్టంలో జాబులు రావాలంటే, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యం.

ప్రత్యేక హోదా సంజీవనే...
ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రంలో కనీవినీ ఎరుగనివిధంగా పరిశ్రమలు వస్తాయి. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి. లక్షల ఉద్యోగాలు అందరికీ అందుబాటులోకి వస్తాయి. ప్రత్యేక హోదా వస్తే చంద్రబాబు సింగపూర్, జపాన్ వెళ్లాల్సిన పనిలేదు. ప్రత్యేక విమానాలు ఎక్కి ఎక్కడకూ తిరగాల్సిన పని లేదు. ప్రత్యేక హోదా వలన పరిశ్రమలు వస్తే వాటికి రాయితీలు ఇస్తారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెడితే పూర్తిగా ఎక్సైజ్ డ్యూటీ, ఇన్‌కంట్యాక్స్‌లు కట్టాల్సిన పనిలేదు. ఆ పరిశ్రమలకు 50 శాతం సబ్సిడీతో కరెంటు, పావలా వడ్డీకే వర్కింగ్ కేపిటల్ రుణాలు అందుబాటులోకి వస్తాయి.

ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా కేవలం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రానికి మాత్రమే ఉన్న ప్రోత్సాహకాలు మన రాష్ట్రానికి వస్తాయి. రాష్ట్రంలో ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొడుతుంటే తెలుగుదేశం, బీజేపీలు అదే చట్టసభలో ఉండి ఓట్లేశాయి. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఐదేళ్లు అంటోంది.. ఐదేళ్లు కాదు మేము అధికారంలోకి వస్తే పదేళ్లు ఇస్తామని చెప్పి ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టారు. ఎన్నికల సభల్లోనూ ఊదరగొట్టారు. ఆ రోజు వాళ్లు ఆడిన ఆటలు, వాళ్లు చేసిన మోసాలు అన్నీ ఇన్నీ కావు. అన్ని వర్గాలనూ మోసం చేశారు.

రైతు రుణాలన్నీ కూడా బేషరతుగా మాఫీ కావాలన్నా, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలన్నా, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలన్నా బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఎన్నికలప్పుడు బాబు వస్తేనే జాబు అన్నారు. ఎన్నికలయ్యాక అందరికీ పంగనామాలు పెట్టారు. ఇవాళ ఎంఆర్‌పీఎస్ సహా అనేక మంది ధర్నాలు చేస్తున్నారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు డోలు కొట్టారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరికీ పంగనామాలు పెట్టారు. కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలకతీతంగా ఆ దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి ప్రతి ఒక్కరికీ మేలు చేస్తే.. కులాలకు, మతాలకు, పిల్లలకు, అక్కచెల్లెమ్మలకు, రైతులకు పేరుపేరునా వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబునాయుడుగారే.

ఎన్నో పోరాటాలు చేశాం...
ప్రత్యేకహోదాపై వీళ్లకు జ్ఞానోదయం కావాలని  ఎన్నో ధర్నాలు చేశాం. దీక్షలు చేశాం. ప్రత్యేక హోదాను రాష్ట్ర ప్రజలు ఎంతగా కోరుకుంటున్నారో ప్రధాని నరేంద్రమోదీకి, చంద్రబాబుకు అర్థం కావాలన్న ఉద్దేశంతో... ప్రధాని రాష్ట్రానికి రావడానికి కొద్ది రోజుల ముందు నేనే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశా. కానీ ప్రధాని రాకుండానే నిరాహార దీక్ష చేస్తున్న మమ్మల్నందరినీ బలవంతంగా తరలించి దీక్ష భగ్నం చేసి ప్రత్యేక హోదాను నీరుగార్చారు. అయినా పోరాటం చేస్తూనే ఉన్నాం. ధర్నాలు, దీక్షలను ఢిల్లీ దాకా తీసుకుపోయి అక్కడ కూడా మనవాణి వినిపించాం. అయినా చంద్రబాబు కారణంగా ఫలితం దక్కకుండా పోయింది.

ఢిల్లీలో నరేంద్రమోదీని నిలదీయలేకపోతున్నాడు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేకుండా వారి జీవితాలతో చెలగాటాలాడుతున్నాడు. ఇలాంటి చంద్రబాబు పాలన మీకు కావాలా అని అడుగుతా ఉన్నా. కనీసం ఇప్పటికైనా చంద్రబాబుకు జ్ఞానోదయమై ప్రజలు పడుతున్న బాధలు తెలుసుకోవాలి. ఎమ్మెల్యేలను కొనడం కాదు.. ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించుకోవాలి అన్న విషయం ఆయనకు అర్థం కావాలి. చంద్రబాబుకు బుద్ధొచ్చేట్టుగా అందరం ఒక్కటై గట్టిగా ఈ పోరాటాన్ని కొనసాగిద్దాం.

కేసీఆర్‌ను ఎందుకు నిలదీయడం లేదు?
చంద్రబాబు తన స్వార్థం కోసం 5 కోట్ల మంది ప్రజల జీవితాలను ఎడారిపాలు చేస్తున్నారు. రాష్ర్టంలో ఒకవైపున నీళ్లు లేవు. రైతులు అల్లాడిపోతున్నారు. కృష్ణానది మహబూబ్‌నగర్ దాటుకుని శ్రీశైలంలోకి రావాలి. శ్రీశైలం దాటుకుని నాగార్జునసాగర్‌కు రావాలి. మహబూబ్‌నగర్‌లో కృష్ణానదిని ఆపుతూ శ్రీశైలానికి నీళ్లు రాకుండా కేసీఆర్ పైన దుండుకుంటూ ఉంటే, ఆయనను చంద్రబాబు వ్యతిరేకించరు. కారణం వ్యతిరేకిస్తే కేసీఆర్ ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపులను బైటకు తీస్తారని భయం. ఆయన జైల్లో పెట్టిస్తారన్న భయంతో రాష్ట్ర రైతులకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడు’’ అని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

డీఆర్‌వోకు వినతిపత్రం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ యాదగిరికి జగన్‌మోహన్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్‌సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, సీజీసీ సభ్యులు పినిపే విశ్వరూప్, కుడుపూడి చిట్టబ్బాయి, జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు, అల్లూరి కృష్ణంరాజు, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, రాష్ట్ర రైతు సంఘ అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, జడ్‌పీ ప్రతిపక్షనేత సాకే ప్రసన్న కుమార్,  పార్టీ కో ఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబుకు జాబొచ్చింది.. మనకేది

Written By news on Tuesday, May 10, 2016 | 5/10/2016


'చంద్రబాబుకు జాబొచ్చింది.. మనకేది'
కాకినాడ: ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ లో అందరి జీవితాలు బాగుపడతాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ విషయం తెలిసి కూడా ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం కాకినాడ కలెక్టరేట్ వద్ద మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో పాల్గొన్న వైఎస్ జగన్ మాట్లాడారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ప్రజలు ప్రత్యేక హోదా కోసం ఉద్యమబాట పట్టారని ఆయన అన్నారు.

ఉద్యోగాలు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్న, యువత జీవితాలు బాగుపడాలన్న ప్రత్యేక హోదా అవసరం అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పిన చంద్రబాబు ఎన్నికల అనంతరం పంగనామాలు పెట్టారని ఆయన విమర్శించారు.  జాబు రావాలంటే బాబు రావాలని ఎన్నికల సందర్భంలో చెప్పిన చంద్రబాబు తనకు ముఖ్యమంత్రి ఉద్యోగం వచ్చాక అన్నీ మరిచిపోయారని, రాష్ట్రంలో ఉన్నవారిని నిరుద్యోగులుగా మిగిల్చారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఇక నిరుద్యోగ భృతి విషయంలో కూడా మోసం చేశారని అన్నారు. చంద్రబాబు అన్ని కులాల వారిని వంచించారని, కులాలు, మతాల పేరిట విభజన రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు.

ప్రత్యేక హోదాపై వైఎస్‌ఆర్‌సీపీ పోరుబాట


ప్రత్యేక హోదాపై వైఎస్‌ఆర్‌సీపీ పోరుబాట
విశాఖ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద వైఎస్‌ఆర్‌సీపీ ధర్నాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలోని కలెక్టరేట్‌ వద్ద ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్‌సీపీ మంగళవారం ధర్నా చేపట్టింది. విశాఖ ధర్నాలో వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్ నాథ్, పలువురు నేతలు పాల్గొన్నారు.

చిత్తూరు జిల్లాలో కూడా ప్రత్యేక హోదా కోసం కలెక్టరేట్‌ వద్ద వైఎస్‌ఆర్‌సీపీ ధర్నా చేపట్టగా.. పార్టీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, దేశాయి తిప్పారెడ్డి, డా.సునీల్‌ కుమార్‌, పార్టీ ఇంఛార్జ్‌లు జంగాలపల్లి నివాసులు, సురేష్‌, ద్వారకానాథ్‌ లు హాజరయ్యారు.
పశ్చిమగోదావరి జిల్లా: ఏలూరులో చేపట్టిన ధర్నాలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, పిళ్లంగోళ్ల లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
కర్నూలు: ప్రత్యేక హోదా కోరుతూ కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలకు వైఎస్‌ఆర్‌సీపీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం కర్నూలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే ఐజయ్య, గౌరు చరిత, సాయి ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, మురళి, జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డిలతోపాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. హోదా విషయంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు.
నెల్లూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ఉదయం నెల్లూరు కలెక్టరేట్ వద్ద వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్దన్‌రెడ్డి, నేతలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ప్రసన్నకుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్, ప్రతాప్‌రెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డి, యల్లసిరి తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం ఉదయం గుంటూరు కలెక్టరేట్ వద్ద వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నేత అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీకాకుళం: ప్రత్యేక హోదా కోరుతూ కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలకు వైఎస్‌ఆర్‌సీపీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే కంబాల జోగులు, రెడ్డిశాంతి, తమ్మినేని, వరుదు కల్యాణి, గొర్లె కిరణ్, దువ్వాడ శ్రీనివాస్, రామారావు, జుత్తు జగన్నాయకులు, సాయిరాజ్‌లతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. విభజన హామీ ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొంగనాటకం ఆడుతున్నాయని ఈ సందర్భంగా నేతలు దుయ్యబట్టారు. నరేంద్రమోడి, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలా సంజీవని అయిన ప్రత్యేక హోదా కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 10వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.

Popular Posts

Topics :