Home »
» కొత్త రాజధాని చుట్టూ స్కాములే
కొత్త రాజధాని చుట్టూ స్కాములే

లింగాయపాలెం: రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న దారుణాలు చూస్తుంటే గుండెతరుక్కుపోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని అక్కడ వస్తుంది.. ఇక్కడ వస్తుందంటూ లీకులిచ్చి తనకు కావాల్సిన వారికి మంచి జరిగేలా చూసుకొని రైతులను మాత్రం చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతాల్లోని గ్రామాల్లో పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం వైఎస్ జగన్ లింగాయపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రాజధాని పేరుతో బలవంతంగా ల్యాండ్ పూలింగ్ చట్టం పేరిట ఇష్టమొచ్చినట్లుగా భూములు లాక్కోవడం ఒక్క చంద్రబాబు నాయుడికే చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను తీవ్రంగా దెబ్బకొట్టి తన బినామీలకు, తన చెప్పుచేతల్లో ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనూకూలంగా భూసేకరణ చేశారని, అది కూడా అవసరానికి మించి వేల ఎకరాలను లాగేసుకుని రైతును రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రావాల్సిన లాభాలను తనకు వచ్చేలా చంద్రబాబు చేసుకున్నారని అన్నారు. రైతులకు మేలు జరగకూడదనేదే తన అభిమతం అన్నట్లుగా చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో లింగాయపాలెంలో రైతుల అరటి తోటల్ని చంద్రబాబు చెప్పుచేతల్లో ఉండేవారే తగులబెట్టారని చెప్పారు. రాజధాని చుట్టుపక్కల ప్లాట్లు ఒక్క అడుగు కేవలం రూ.పదిహేనువందలతో కడుతుంటే చంద్రబాబు నాయుడు మాత్రం తాత్కాలిక సెక్రటేరియట్ను ఒక్క చదరపు అడుగును పదివేల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఏం చేసినా టెంపరరీ.. టెంపరరీ, టెంపరరీగానే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని చుట్టుపక్కల జరిగేవన్నీ కూడా కుంభకోణాలే అని అన్నారు. బొగ్గు, ఇసుక, మద్యం, ఆఖరికి గుడి భూముల్లో కూడా చంద్రబాబు కుంభకోణాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజు మరెంతో దూరం లేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ భూములు చంద్రబాబు తన అత్తగారి సొమ్మని అనుకుంటున్నారని, అందుకే వివక్ష చూపిస్తూ వారికి కేవలం 500గజాలు ఇస్తానని చెప్పి అంతటితో సరిపెట్టుకోమంటున్నారని ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. దళితుల భూములు లాక్కుంటున్న చంద్రబాబు వారికి ముష్టి వేసినట్లుగా వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసైన్డ్ భూముల దళితుల పేరిట ఉన్నప్పటికీ కంప్యూటర్ అడంగల్లో మాత్రం ప్రభుత్వ భూమి అని పేర్కొంటూ దౌర్జన్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఎస్సీలకు ఇస్తామన్న ప్యాకేజీ కూడా ఇవ్వడం లేదని అన్నారు. ఎస్సీల జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.ఇంకా ఏం చెప్పారంటే..
- ల్యాండ్ పూలింగ్ పేరు చెప్పి 27 వేల ఎకరాలు తీసుకున్నారు
- మరో 21 వేల ఎకరాలను మళ్లీ లాక్కునే కార్యక్రమం చేశారు
- మొత్తంగా చంద్రబాబు ఆధీనంలో 48వేల ఎకరాలు ఉన్నాయి
- చంద్రబాబు పరిపాలన వచ్చి మూడేళ్లయినా రాజధాని కోసం ఒక్క ఇటుక పెట్టిన పాపాన పోలేదు
- టెంపరరీ సచివాలయం కట్టడానికి రూ.650కోట్లు ఖర్చు చేశారు
- దళితుల భూములంటే చంద్రబాబుకు లెక్కలేకుండాపోయింది
- దళితుల భూములను లాక్కునే స్వేచ్ఛం ఉందని తన అత్తగారి సొమ్మని చంద్రబాబు అనుకుంటున్నారు
- మంత్రులు, అధికారులను భూముల గురించి రైతులు నిలదీస్తుంటే ఇక్కడ దళితులకు భూములే లేవంటున్నారు
- కొంతమందికి ప్లాట్లు ఇచ్చినా అవి ఎక్కడ ఇచ్చారో వారికే తెలియదు
- ఎస్సీల జీవితాలతో చంద్రబాబు సర్కార్ చెలగాటమాడుతోంది
- అరిస్తే అరెస్టులు చేస్తామంటూ బెదిరిస్తున్నారు
- ఈ రెండేళ్లు కూడా సెంటు భూమి పోకుండా కోర్టులను ఆశ్రయించి ఆపుదాం
- దళితులు వారి భూముల పత్రాలు జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి
- లంక భూముల విషయంలో దళితులు భయపడాల్సిన పనిలేదు
- చంద్రబాబు అన్యాయం చేస్తే అసలే ఊరుకోం
- డీకే పట్టాలు, అడంగల్ ఆధారంగా వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే తిరిగి భూములు ఇచ్చేస్తాను
- రైతుల కన్నీళ్లతో వ్యాపారం చేయాలని చంద్రబాబు చేస్తున్నారు
- కమీషన్లు తీసుకొని చంద్రబాబుకు నచ్చిన వ్యక్తికి భూములు కట్టబెడుతున్నారు
- చంద్రబాబు రాజధాని కడతాడన్న నమ్మకం ప్రజలకు పోయింది
- వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే రైతుల ముఖాల్లో సంతోష వెల్లివిరిసేలా రాజధాని నిర్మిస్తాను
- ప్రజల, రైతుల అండదండలతో చక్కటి రాజధాని నిర్మిస్తాను
- చంద్రబాబుకు దేవుడు మొట్టికాయలు వేస్తాడు
- చంద్రబాబు భూదాహం ఇంకా తీరలేదు. మార్కెట్ విలువ కట్టించి ఇవ్వాలనే ఆలోచన కూడా బాబుకు లేదు
- భూసేకరణ పేరుతో ఇంకా భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు
- రైతు కూలీలకు అన్యాయం చేయడం ఏమాత్రం సరికాదని చంద్రబాబును హెచ్చరిస్తున్నాను
0 comments:
Post a Comment