పోస్టుమార్టం చేయకుండా ప్యాకింగా..?: వైఎస్‌ జగన్‌ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పోస్టుమార్టం చేయకుండా ప్యాకింగా..?: వైఎస్‌ జగన్‌

పోస్టుమార్టం చేయకుండా ప్యాకింగా..?: వైఎస్‌ జగన్‌

Written By news on Tuesday, February 28, 2017 | 2/28/2017


నందిగామ: బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.20లక్షల నష్టపరిహారం చెల్లించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. బస్సు యాజమాన్యాల నుంచే నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. అప్పుడే ఇలాంటి సంఘటనలు జరగకుండా వారు జాగ్రత్తలు తీసుకుంటారని, లేదంటే ఏదో ఒక రోజు అందరి కుటుంబాలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలకు పోకుండా మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రభుత్వం, పోలీసులు, మీడియా ప్రతి ఒక్కరూ బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

చనిపోయిన వారి ప్రాణాలు తీసుకురాలేకపోయినా వారి కుటుంబాలు మనోధైర్యంగా ఉండేందుకు అండగా నిలవాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, ఇలాంటి యాజమాన్యాలకు మద్దతు ఇవ్వకూడదని చెప్పారు.  కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ములపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిదిమందికిపైగా చనిపోగా పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. మృతదేహాలను నందిగామ ఆస్పత్రికి తరలించగా ఘటన వివరాలు తెలుసుకొని బాధితులను పరామర్శించి అండగా నిలిచేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైస్‌ జగన్‌ ఆస్పత్రి వద్దకు వెళ్లగా.. ఆ విషయంలో తెలిసి అక్కడ టీడీపీ కార్యకర్తలు హైడ్రామాకు తెరతీశారు.

ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసి రెచ్చగొట్టే తీరుగా వ్యవహిరించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతదేహాలకు సరిగా పోస్టుమార్టం నిర్వహించకుండానే ఆస్పత్రి నుంచి తరలించే ప్రయత్నాలు చేశారు. పోలీసులే స్వయంగా ఈ చర్యలకు పాల్పడటం విస్మయానికి గురిచేసింది. ఈ సమయంలో కూడా ఎంతో సంయమనంతో వ్యవహరించిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ రాజకీయాల సమయం కాదని, చనిపోయినవారిపట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ ఆస్పత్రిలోకి వెళ్లారు. కలెక్టర్‌ అహ్మద్‌బాబును అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రమాద తీవ్రత, అందులోని లోపాలు, ప్రభుత్వం అనుసరించిన తీరు, నష్టపరిహారం తదితర అంశాలపై నిప్పులు చెరిగారు. ఆయన ఏమన్నారంటే..


‘బస్సు ప్రమాదంలో చనిపోయినవారికి చంద్రన్న బీమాకింద ఆంధ్రప్రదేశ్‌ వారికైతే రూ.3లక్షలు, తెలంగాణ ఇతర ప్రాంతాలవారికైతే రూ.2లక్షలు నష్టపరిహారం ఇస్తామంటున్నారు. ఈ నిర్ణయాన్ని అస్సలు అంగీకరించేది లేదు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసిన డ్రైవర్‌కు చెందిన యాజమాన్యం నుంచి కనీసం రూ.20 లక్షలు నష్ట పరిహారం బాధితుల కుటుంబాలకు ఇప్పించాలి. అలా చేయకుంటే బస్సు యాజమాన్యాలు మారవు. ఇప్పుడు నిర్లక్ష్యంగా వదిలేస్తే ఏదో ఒక రోజు మన కుటుంబ సభ్యులు, మన పిల్లలు, మన భార్యలు కూడా ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మానవతా హృదయంతో ఆలోచించండి.. పెద్ద మనసులతో ఆలోచించండి. తప్పు చేసినవారిని ప్రశ్నించండి. ప్రతి పోలీసు సోదరుడు, విలేకరి, ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో మానవత్వంతో ఆలోచించాలి. మరోపక్క, చనిపోయిన బస్సు డ్రైవర్‌కు పోస్టుమార్టం చేయకపోయినా చేశామంటున్నారు. డ్రైవర్‌ తాగి తోలాడ లేదా అని ప్రశ్నిస్తే పోస్టు మార్టం చేయలేదని డాక్టర్లు చెబుతున్నారు. అంటే డ్రైవర్‌కు పోస్టు మార్టం కూడా చేయకుండానే మృతదేహాన్ని ప్యాక్‌ చేశారు. రెండో డ్రైవర్‌ ఏమయ్యాడని అడిగితే వచ్చి వెళ్లాడని చెబుతున్నారు. రెండో డ్రైవర్‌ వెళ్లిపోయాడా..? వెళ్లగొట్టారా? అతడి దగ్గర లైసెన్స్‌ ఉందా లేదా? ఒక వేళ లైసెన్స్‌ ఉంటే, తాగి ఉండకుంటే అతడిని ఇక్కడే ఉంచేవారు.

కానీ పంపించారంటే అతడు ఈ రెండింట్లో ఏదో ఒక లోపం కలిగి ఉండి ఉండొచ్చు. ఇదంతా ఆలోచిస్తుంటే ప్రభుత్వం పెద్ద కుట్రనే చేస్తోందనిపిస్తోంది. ఇప్పుడున్న రెండో డ్రైవర్‌ను పంపించేసి కొత్త డ్రైవర్‌ను తీసుకొచ్చి ఇతడే నడిపాడని చెబుతారు. ఒక పద్థతి ప్రకారం బస్సు యాజమాన్యాన్ని రక్షిస్తారు. ఏడాదికిందట కేసినేని, అంతకుముందు దివాకర్‌ ట్రావెల్స్, ఇప్పుడు దివాకర్‌ ట్రావెల్స్‌‌.. ఈ యాజమాన్యం టీడీపీ ఎంపీలది. అందుకే చంద్రబాబు దగ్గరుండి మద్దతిస్తున్నారు. అందుకే వారికి రూల్స్‌ ఉండవు. ఒక పర్మిట్‌తో ఒకే చోట రెండు మూడు బస్సులు, రెండు మూడు రూటుల్లో తిప్పుతారు. స్టేజ్‌ క్యారియర్‌కు పర్మిషన్‌ లేకున్నా ఆపేసి ప్యాసింజర్లను ఎక్కించుకుంటారు.

లైసెన్స్‌ పట్టించుకోరు. ఈ బస్సు ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందో దెబ్బతిన్న బస్సును చూస్తే తెలుస్తోంది. అంతపెద్ద రోడ్డుపై ఎదురుగా వాహనం వచ్చే అవకాశం లేదు. నాకు తెలిసి ప్రమాద సమయంలో బస్సు 150 కిలో మీటర్ల వేగంలో ఉండి కల్వర్టు కోడను ఢీకొట్టి 150 అడుగులు దూరం గాల్లో ప్రయాణించి కల్వర్టు అవతలి గోడను ఢీకొట్టింది. కచ్చితంగా డ్రైవర్‌ తాగి ఉండి ఉంటాడు. అందుకే చనిపోయిన డ్రైవర్‌కు పోస్టు మార్టం నిర్వహించలేదు. రెండో డ్రైవర్‌ను అరెస్టు చేయలేదు. ప్రభుత్వం ఇలాంటి ఘటనకు కారణమైన వారిని ప్రొటెక్ట్‌ చేయడం సరికాదు. పోలీసులు ఈ విషయంలో ఆలోచించాలి. లేదంటే ఇలాంటి ఘటనలకు ఎవ్వరం కూడా మినహాయింపు కాకుండా పోము’ అని వైఎస్‌ జగన్‌ మీడియా ముందు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: