విజయవాడలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నూతన కార్యాలయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయవాడలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నూతన కార్యాలయం

విజయవాడలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నూతన కార్యాలయం

Written By news on Monday, October 9, 2017 | 10/09/2017

విజయవాడ స్వరాజ్య మైదానం సమీపంలో సిద్ధమైన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నూతన కార్యాలయం
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ స్వరాజ్య మైదానం సమీపంలోని కేపీ రెడ్డయ్య (మాజీ మంత్రి కె.పార్థసారథి తండ్రి) ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నూతన కార్యాలయానికి సోమవారం సర్వమత ప్రార్థనలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం విజయవాడ గాంధీనగర్‌లో ఉన్న కృష్ణా జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో తాత్కాలికంగా పార్టీ రాష్ట్ర కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అయితే ఒకేచోట పార్టీ జిల్లా, రాష్ట్ర కార్యకలాపాలను నిర్వహించాల్సి రావడంతో ఇబ్బందులు కలుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యకలాపాలకోసం మరోచోట కార్యాలయం ఏర్పాటు చేయాలని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఆదేశించారు. దీంతో విజయవాడలోని స్వరాజ్య మైదానం సమీపంలోని కేపీ రెడ్డయ్య ప్రాంగణంలో పార్టీ కార్యాలయ పనులు చేపట్టారు. త్వరలో ఈ పనులు పూర్తికానున్నాయి. అయితే రానున్న రోజుల్లో మంచి ముహూర్తాలు లేవన్న కారణంతో సోమవారం సాయంత్రం ఆరు గంటలకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పనులన్నీ పూర్తయ్యాక పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

పూజా కార్యక్రమంలో పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా వ్యవహారాల ఇన్‌చార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, కృష్ణా, గుంటూరు జిల్లాల అధ్యక్షులు కె.పార్థసారథి, మర్రి రాజశేఖర్‌ ముఖ్యఅతిథులుగా పాల్గొననున్నారు. ఇంకా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ఇతర ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

Share this article :

0 comments: