05 March 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

నారా లోకేశ్‌ తండ్రిని మించిన తనయుడు

Written By news on Thursday, March 9, 2017 | 3/09/2017

గుంటూరు : అబద్ధాలు చెప్పటంలో నారా లోకేశ్‌ తండ్రిని మించిన తనయుడిగా మారిపోయారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. కళ్లార్పకుండా  అబద్ధాలు చెప్పటంలో లోకేశ్‌ ఆరితేరి ముదిరిపోయారని ఆయన అన్నారు.  ఆరేళ్లుగా ప్రకటించిన ఆస్తులు కొన్న ధర ప్రకారమని చెప్పిన లోకేశ్‌‌, చంద్రబాబులు ఇన్నాళ్లు  ప్రజలను పచ్చి మోసం, దగా చేశారని ఆయన అన్నారు. నారా లోకేశ్‌ ఇచ్చిన ఎన్నికల అఫిడవిట్‌ చూస్తే ఆశ్చర్యం వేస్తోందన్నారు. ఇచ్చిన వివరాలను చూస్తుంటే పచ్చిమోసం, దగా చేస్తున్నారనడానికి ఇదే ఉదాహరణ అని ధ్వజమెత్తారు.

నారా లోకేశ్‌ ఆస్తుల వ్యవహారంపై ’సాక్షి’ కన్నా ముందుగా ఆంగ్ల దినపత్రిక ’హిందుస్తాన్‌ టైమ్స్‌’ సమగ్రంగా ఓ వార్తను ప్రచురించిందని అంబటి అన్నారు. ఆరు నెలల కాలంలో వందల కోట్ల ఆస్తులు ఎలా పెరిగాయని ప్రశ్నిస్తే దానికి సమధానం ఇవ్వకుండా ఎదురు దాడి చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పై పెచ్చు వైఎస్‌ జగన్‌ ను ఆస్తులు ప్రకటించాలని  ప్రశ్నించడం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు. దొంగ లెక్కలు ప్రకటించాల్సిన అవసరం లేదని అంబటి అన్నారు.

2014 మార్చిలో రూ.200 ఉన్న హెరిటేజ్‌ షేర్‌ ధర 2017 ఫిబ్రవరికి రూ.1134కు చేరిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే షేర్‌ ధర పెరిగిందని అంబటి తెలిపారు. ఆస్తులపై లోకేశ్‌ చెపుతున్న లెక్కలన్నీ బోగస్‌ అని, ప్రజలను మభ్యపెట్టేందుకే ఆస్తులు ప్రకటించారన్నారు

ఐదు నెలల్లో ఏకంగా 23 రెట్లకు పెరిగిన లోకేష్ ఆస్తులు

Written By news on Wednesday, March 8, 2017 | 3/08/2017

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కుమారుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆస్తులు కళ్లు చెదిరే రేంజ్‌లో పెరిగిపోయాయి. అది కూడా ఒకటి రెండింతలు అనుకుంటే పొరపాటే. గతంలో ప్రకటించిన ఆస్తుల కంటే ఏకంగా 23 రెట్లకు ఎగబాకాయి. అది కూడా కేవలం ఐదు నెలల్లోనే.

ఈ విషయాన్ని లోకేష్‌ స్వయంగా తాను ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాల్లో. తాజాగా ఆయన పేర్కొన్న తన మొత్తం ఆస్తుల విలువ రూ.330కోట్లు. ఐదు నెలల కింద ఆయన అక్టోబర్‌ 19, 2016న ఆయనే ప్రకటించిన ఆస్తుల మొత్తం విలువ రూ.14.56కోట్లు మాత్రమే.

ఐదు నెలల్లోనే ఆస్తులు ఇంత భారీ స్థాయిలో పెరగడంపై ఇప్పుడు సామాన్య జనం విస్తుపోతున్నారు. ఇది ఎలా సాధ్యం అయిందని ముక్కున వేలేసుకుంటున్నారు. ఏ కష్టం చేసి ఇంత భారీ మొత్తం కూడా బెట్టారని, ఏ వ్యాపారంలో ఆయనకు ఇంతపెద్ద మొత్తం కలిసి వచ్చాయని ప్రశ్నిస్తున్నారు.

ఆస్తుల విషయంలో బహిరంగంగా వివరాలు చెబుతూ పారదర్శకంగా ఉంటామని చెప్పే చంద్రబాబు కుటుంబం ఐదు నెలల్లో ఇంత పెద్ద ఆదాయం ఎలా పెరిగిందో చెబితే బాగుంటుందని అనుకుంటున్నారు. అక్టోబర్‌ 19, 2016, మార్చి 7, 2017 ఎమ్మెల్సీ నామినేషన్‌ సందర్భంగా ప్రకటించిన ఆస్తుల వివరాలు ఒకసారి పోల్చి చూస్తే..

అక్టోబర్‌, 19, 2016.................................. మార్చి 7, 2017 (ఎమ్మెల్సీ నామినేషన్‌ సందర్భంగా)

మొత్తం రూ.14.56కోట్లు                             మొత్తం ఆస్తి రూ.330కోట్లు
హెరిటేజ్‌ వాటా రూ.2.52 కోట్లు                      హెరిటేజ్‌ వాటా రూ.273.84కోట్లు
ఆయా కంపెనీల్లో షేర్‌ రూ.1.65 కోట్లు              స్థిరాస్తులు రూ.18 కోట్లు
కారు రూ.93లక్షలు                                    పూర్వీకుల ద్వారా వచ్చినవి రూ.38.52కోట్లు
బ్యాంకు లోన్లు రూ.6.35 కోట్లు                       బ్యాంకు లోన్లు రూ.6.27 కోట్లు

లోకేష్‌ భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాంష్‌ పేరిట ప్రకటించిన ఆస్తులు అప్పుడు ఇప్పుడు

అక్టోబర్‌, 19, 2016.................................. మార్చి 7, 2017 (ఎమ్మెల్సీ నామినేషన్‌ సందర్భంగా)

బ్రాహ్మణి మొత్తం ఆస్తులు రూ.5.38కోట్లు       బ్రాహ్మణి ఆస్తులు దాదాపు రూ.28 కోట్లు
దేవాంష్‌ మొత్తం ఆస్తులు రూ.11.70కోట్లు       దేవాంష్‌ ఆస్తులు దాదాపు గతంలో చెప్పినన్ని..

ఇవే కాదు.. లోకేష్‌ తన తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తల్లి భువనేశ్వరి ఆస్తుల మొత్తాన్ని కూడా ప్రకటించారు. చంద్రబాబు పేరు మీద మొత్తం రూ.64లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పిన లోకేష్‌ తల్లి భువనేశ్వరీ పేరిట రూ.33.66కోట్లు ఉన్నట్లుగా ప్రకటించారు. అయితే, వాస్తవానికి హెరిటేజ్‌లోని దాదాపు మెజార్టీ వాటాను తన భాగస్వామి ఫ్యూచర్‌ రిటెయిల్‌ లిమిటెడ్‌కు గత ఏడాది నవంబర్‌ 8నే రూ.295కోట్లకే అమ్మేశారు. హెరిటేజ్‌ అమ్మకం జరపనప్పుడు లోకేష్‌ అందులో తన వాటాగా రూ.2.52కోట్లుగా పేర్కొని తీరా విక్రయించిన తర్వాత అందులో వాటా రూ.273.84కోట్ల ఉన్నట్లు ప్రకటించడం ముఖ్యంగా గమనించాల్సిన విషయం.

బీకాంలో ఫిజిక్స్ చదివిన వాళ్లకు అర్థం కాకపోవచ్చు

Written By news on Tuesday, March 7, 2017 | 3/07/2017


బీకాంలో ఫిజిక్స్ చదివిన వాళ్లకు అర్థం కాకపోవచ్చు
అమరావతి :
అమరావతి : అన్ని రంగాలూ అభివృద్ధి చెందితేనే రాష్ట్రంలో వృద్ధిరేటు బాగుంటుందని.. ఒకవైపు ద్రవ్యోల్బణం పెరిగి, రైతులకు మద్దతు ధర లేకపోయినా... పారిశ్రామిక, ఇతర రంగాలు కూడా వృద్ధి చెందకపోయినా వృద్ధిరేటును ఎక్కువ చేసి చూపిస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. తాను చెబుతున్న లెక్కలు బీకాంలో ఫిజిక్స్ చదివినవాళ్లకు అర్థం కాకపోవచ్చని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. జగన్ ప్రసంగానికి యథాతథంగా అధికార పక్ష సభ్యులు పదే పదే ఆటంకాలు కలిగిస్తూనే ఉన్నారు. ఈ ప్రసంగంలో జగన్ ఏమన్నారంటే..
 
  • కొత్తగా కట్టిన తాత్కాలిక అసెంబ్లీలో అత్యున్నత ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టాలని కోరుకుంటూ ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నా.
  • గవర్నర్ ప్రసంగాన్ని ఒక్కసారి గమనిస్తే.. రొటీన్‌గా ఉంటోంది తప్ప ఏమార్పూ ఉండటం లేదు. గత మూడేళ్లుగా ఏ గవర్నర్ ప్రసంగం విన్నా కనిపించేది రొటీన్‌గా అంటున్న మాటలేతప్ప.. ఏమీ ఉండవు.
  • గవర్నర్ తాను ప్రసంగం రాసుకొచ్చి, తన మనసులో ఉన్న విషయం చెప్పలేరు. ఆ అవకాశం ఆయనకు లేదు.  ప్రభుత్వం రాసి ఇచ్చినదే చదువుతారు.
  • ప్రభుత్వం ఎన్నో మంచిపనులు చేసిందని, ఎంతో అభివృద్ధి సాధించామని, స్వల్పకాలంలో ఫలానా పనులు చేశామని, దీర్ఘ కాలం.. అంటే 2050 వరకు కూడా పోతారు.
  • ప్రజలు ఇచ్చింది ఐదేళ్లే అయినా, దీర్ఘకాలంలో ఫలానా లక్ష్యాలు పెట్టుకున్నామని పడికట్టు పదాలతో గొప్పలు చెప్పడం ఆనవాయితీగా జరుగుతోంది.
  • రాష్ట్ర ప్రజల కష్టనష్టాలను, తమ గొంతెత్తి మాట్లాడలేని వారి అభిప్రాయాలను వాళ్ల తరఫున చెప్పడానికి ఉన్న ఏకైక ప్రతిపక్షంగా మా బాధ్యత.
  • ప్రభుత్వం తన ఘన కార్యాలను చెప్పుకొంటోంది.. వాటికి సంబంధించి నిజానిజాలను చర్చించడం కూడా ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత.
  • ఇలాంటి పరిస్థితుల్లో నా ఈ ప్రసంగాన్ని కాస్త ఓపికగా, మధ్యలో మాటకోసారి అడ్డుకోకుండా వినే శక్తిని భగవంతుడు అధికారపక్షానికి ప్రసాదించాలని కోరుకుంటున్నా.
  • ఈ మొత్తం విషయంలో నిమిషానికోసారి నా మైకు కట్ చేసే సంప్రదాయాన్ని ఈ కొత్త అసెంబ్లీలోనైనా కొనసాగించకుండా పార్లమెంటరీ సంప్రదాయాలు పాటిస్తారని, విమర్శలు ముఖ్యమన్న విషయాన్ని గమనిస్తారని ఆశిస్తూ ప్రసంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నా.
  • మన రాష్ట్రం ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో విడిపోయిందో అందరికీ తెలుసు. అయినా మన రాష్ట్రం మాత్రం 2015-16లో దేశంలో రెండంకెల వృద్ధి అంటే దాదాపు 11 శాతం వృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రమని చెబుతున్నారు.
  • అక్కడే ఆగిపోకుండా, 2016-17కు సంబంధించి మొదటి అర్ధభాగంలో 12.23 శాతం వృద్ధిరేటు సాధించిందంటున్నారు.
  • నిజంగా ఇది చాలా గొప్ప పరిపాలన.
  • హైదరాబాద్ లాంటి మహానగరం దూరమైన తర్వాత మన పరిస్థితి ఏంటో రాష్ట్రంలో పదో తరగతి చదివే ఏ పిల్లాడికైనా అర్థమవుతుంది.
  • ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రభుత్వం మాత్రం.. దేశం కంటే రెట్టింపు వేగంతో అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్నట్లు చెప్పింది.
  • 29 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాలున్న భారతదేశం మొత్తం జీడీపీ 2015-16కు 7.57 మాత్రమే.
  • వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం.. ఈ అన్నింటి విలువ కట్టి, అది గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటే జీడీపీ వృద్ధి చెందినట్లు లెక్క.
  • 2015-16కు సంబంధించి రాష్ట్రంలో 10.99 శాతం వృద్ధిరేటు చూపిస్తే, దేశంలో అదే సమయంలో 7.57 శాతం వృద్ధిరేటు చూపించారు.
  • 2016-17కు సంబంధించి దేశంలో 7.20 శాతం వృద్ధిరేటు వస్తే మనం 5 శాతం ఎక్కువ సాధించాం.
  • అక్కడితో ఆగిపోలేదు. చెన్నైతో కూడిన తమిళనాడు వృద్ధిరేటు 2015-16లో 8.79 మాత్రమే, బెంగళూరుతో కూడిన కర్ణాటక వృద్ధిరేటు 2015-16లో 6.2 శాతమే. ముంబైతో కూడిన మహారాష్ట్ర వృద్ధిరేటు 2015-16లో 8 శాతమే. చివరకు గుజరాత్ తీసుకుందాం. ఆ రాష్ట్రం వృద్ధిరేటు కూడా కేవలం 7.7 శాతమే.
  • నిజంగా చంద్రబాబు గారి పాలనలో మన వృద్ధిరేటు 10.99 శాతం ఉంది. వారెవ్వా.. ఇది మాత్రం నిజంగా దేవరహస్యం
  • జీఎస్‌డీపీలో వ్యవసాయ రంగం 30 శాతం కంట్రిబ్యూట్ చేస్తుంది. మొత్తం జీఎస్‌డీపీ 6.03 లక్షల కోట్లు అయితే అందులో 1.77 లక్షల కోట్లు వ్యవసాయ రంగానికి సంబంధించినవి.
  • అభివృద్ధి 11 శాతం చూపించేటపుడు చాలా గొప్ప మాటలు చెబుతూ ఆక్వా రంగం 2015-16లో 31 శాతం అభివృద్ధి చెందిందని, ఈ ఏడాది 42 శాతం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
  • నిజానికి ఆక్వారంగం వాటా కేవలం 30 వేల కోట్లు మాత్రమే. అంటే, జీఎస్‌డీపీలో దాని వాటా 5.4 శాతం అన్నారు. 14వేల కోట్ల ఆక్వా ఎగుమతులు వచ్చాయని చెప్పారు.
  • కానీ అదే సంవత్సరానికి ఎంపెడా లెక్కలు ఒక్కసారి చూద్దాం. 2014-15తో 2015-16ను పోల్చారు. 2014-15లో సగటున కిలో 5.24 డాలర్లు ఉంటే, 2015-16లో 4.9 డాలర్లకు పడిపోయింది
  • ఇక రొయ్యలు 29 శాతం క్వాంటిటీ, 66 శాతం ఆదాయం కంట్రిబ్యూట్ చేస్తాయి. ఇవి 2014-15లో కిలో 10.38 డాలర్లు ఉంటే, 2015-16లో వీటి విలువ 8.28 డాలర్లకు పడిపోయింది.
  • దేశవ్యాప్తంగా 2014-15, 2015-16లో ఎంపెడా లెక్కలు చూస్తే 2014-15లో 33,441 కోట్లు ఆక్వా ఎగుమతుల వల్ల వచ్చాయి. 2015-16లో 30,421 కోట్లకు పడిపోయిందని చెప్పింది.
  • ఇందులో మన రాష్ట్రానికి సంబంధించినవి 14వేల కోట్లు ఉన్నాయి.
  • క్వాంటిటీ కొద్దోగొప్పో ఎక్కువ ఉండచ్చు గానీ.. అమ్మితే వచ్చే డబ్బులు తక్కువ అవుతాయి.
  • 2014-15కు సంబంధించి ఆక్వారంగం 31 శాతం వృద్ధిరేటు ఉందని చంద్రబాబు చెప్పారు. 2013-14నాటికి.. అంటే చంద్రబాబు సీఎం కాకముందు ఆక్వారంగం 28 శాతం వృద్ధి చెందింది. అంటే, ఆక్వారంగ వృద్ధి అనేది చంద్రబాబు సీఎం అయ్యిన తర్వాత ఉన్నట్టుండి వచ్చింది కాదు, ముందునుంచి ఉంది.
  • 2012-13లో రాష్ట్రంలో 15.88 లక్షల టన్నులు, 2013-14లో 17.69 లక్షల టన్నులు, 2014-15లో 19.79 లక్షల టన్నులు, 2015-16లో సుమారు 20 లక్షల టన్నులు రొయ్యల ఉత్పత్తి ఉంది.
  • రొటీన్‌గా జరుగుతున్న విషయాన్నే భూతద్దంలో చూపించి, దానివల్ల 11 శాతం వృద్ధిరేటు సాధించామని డబ్బాలు కొట్టుకుంటున్నారు.
  • బీకాంలో ఫిజిక్స్ చదివిన వాళ్లకు నా లెక్కలు అర్థం కాకపోవచ్చు.
  • చంద్రబాబు గారి గ్రహబలం ఏంటో నాకు తెలియదు గానీ.. భూమ్మీద పండించే రైతులకు మద్దతు ధర దేవుడెరుగు, నీళ్లలో పెరిగే చేపలకు కూడా ధరలు రాకుండా పోతున్నాయి.
  • గుజరాత్‌, మహారాష్ట్రలో కూడా ఆక్వా కల్చర్ ఉన్న వాళ్లు 7, 8 శాతమే వృద్ధిరేటు సాధిస్తే మనకు 11 శాతానికి పైగా వృద్ధిరేటు వస్తుందని చూపిస్తున్నారు.
  • వ్యవసాయానికి వద్దాం.. గత మూడేళ్లుగా కరువే కరువు. ఎంత దారుణమైన కరువంటే, రాష్ట్రంలో సగటు వర్షపాతం 866 మిల్లీమీటర్లయితే 2015లో 814 ఎంఎం, 2016లో 600 ఎంఎం వర్షపాతమే నమోదైంది.
  • ప్రతియేటా రబీలో 24.43 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేస్తాం. ఈసారి 19.56 లక్షల హెక్టార్లలో మాత్రమే విత్తనాలు వేశారు. అంటే 5 లక్షల హెక్టార్లలో విత్తనం తక్కువ పడింది.
  • 2016 ఖరీఫ్ చూస్తే.. ఆగస్టులో వర్షాలు లేక ఏకంగా 10 లక్షల హెక్టార్లలో పంట ఎండిపోయింది. అప్పుడే చంద్రబాబు రెయిన్ గన్స్ అన్నారు, నాలుగు రోజుల్లో కరువును పారద్రోలాం అన్నారు.
  • కేవలం పది రోజుల కోసం రెయిన్ గన్స్ కొనుగోలుకు 160 కోట్లు ఖర్చు పెడితే, 103 కోట్లతో వాటిని ఆపరేట్ చేశారు.
  • చివరకు వాటివల్ల ఒక్క ఎకరా కూడా పంట బతకలేదని, పంట ఎండిపోయిందని, 63 మండలాలు పూర్తిగా అనంతపురం అంతా కరువు మండలాలుగా ప్రకటించారు.
  • అంటే రెయిన్ గన్స్ పూర్తిగా ఫెయిలయ్యాయని అర్థమవుతోంది. 5 లక్షల ట్రాక్టర్లు అందుబాటులోకి లేకపోవడమే అందుకు కారణం.
  • మొత్తం 664 మండలాలుంటే, వాటిలో వరుసపెట్టి ప్రతియేటా దాదాపు 300 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు.
  • కరువు మండలాలుగా ప్రకటిస్తే.. రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడి తమకు సాయం చేస్తారని రైతులు ఆశిస్తారు, రుణాలు రీషెడ్యూలు అవుతాయనుకుంటారు.
  • కానీ ఈ మూడేళ్లలో ఒక్కసారి కూడా రుణాలు రీషెడ్యూలు కాలేదు.
  • ఇన్‌పుట్ సబ్సిడీ వస్తుందని, పంటలు నష్టపోయినందుకు సాయం వస్తుందని అనుకుంటారు.
  • 2013-14లో రూ.2,306 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి, అందులో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
  • 2014-15లో రూ.1,500 కోట్లు ఇవ్వాలని కలెక్టర్లు చెబితే, దాన్ని తగ్గించి రూ.1,067 కోట్లు చేశారు. మళ్లీ కేబినెట్ మీటింగ్ పెట్టి రూ.692 కోట్లకు తగ్గించారు. ఈవాల్టికీ అందులో 20, 30 కోట్లు బకాయిలు ఉన్నాయి.
  • 2015-16లో భారీ వర్షాల వల్ల రూ.270 కోట్లు, కరువు వల్ల రూ.600 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటే, ఈవాల్టికీ ఇంకా ఇవ్వలేదు.
  • 2016-17 ఆర్థిక సంవత్సరంలో కరువు వచ్చింది. 268 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. దానివల్ల రూ.1760 కోట్లు, మళ్లీ వర్షాలకు రూ.51 కోట్లు మొత్తం కలిపి రూ.1811 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి.
  • అందులో ఒక్క దమ్మిడీ కూడా ఇవ్వకపోగా, కలెక్టర్లు 400 మండలాలను రికమండ్ చేస్తే, 268 మండలాలే ప్రకటించారు. తర్వాత మళ్లీ ప్రజలనుంచి ఒత్తిడి వస్తే మరో 33 మండలాలను కలిపారు.
  • అక్టోబర్‌లో ప్రకటించాల్సిన వాటిని కేంద్రబృందం వెళ్లిపోయాక ఫిబ్రవరిలో ఈ 33 మండలాలు కలిపారు.
  • ప్రభుత్వం మంచి చేయాలంటే వినాలి.
  • చంద్రబాబు పుణ్యాన హేచరీలు ఉన్నచోట్ల ఫార్మా యూనిట్లు పెడుతున్నారు.
  • తుని వద్దకు వెళ్లి చూస్తే, 65 లక్షల లీటర్ల కాలుష్య జలాలు రోజూ సముద్రంలో కలుపుతారు.
  • హేచరీలకు హాని కలుగజేస్తూ సముద్రపు నీళ్లు కలుషితం అవుతున్నాయి
  • పరిశ్రమలకు నేను వ్యతిరేకం కాదు.. వాటిని పెట్టాల్సిన చోట పెట్టాలి. ఫార్మాసిటీలో అయితే ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఉంటాయి. కానీ హేచరీల క్లస్టర్ వద్ద పెడితే అవి నాశనం అయిపోతాయి.
  • చంద్రబాబు విధానాల వల్ల చేపలు పట్టే మత్స్య కారులు వేటకు వెళ్లాలంటే లోతుగా సముద్రంలోకి వెళ్లాల్సి వస్తోంది. తిరిగి ఇంటికి వస్తాడా రాడా అన్న భయం వేస్తోంది.
  • ఇదే వ్యవసాయ రంగంలో చంద్రబాబు సీఎం అవ్వడానికి ముందు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయిస్తామని, పెట్టుబడికి 50 శాతం లాభం వచ్చేలా కనీస మద్దతుధర ఇప్పిస్తామని మేనిఫెస్టోలో చెప్పారు.
  • కేంద్రంలో భాగస్వామ్య ప్రభుత్వంలో ఉన్న వీళ్లు కనీస మద్దతుధర విషయం చూడాలి.
  • చంద్రబాబు సీఎం అయినప్పుడు వరి రూ.1360 ఉంటే, 2015-16కు కేవలం 50 రూపాయలు పెంచారు, 2016-17కు రూ.1,470 మాత్రమే పెరిగింది. కేవలం 4 శాతం కంటే తక్కువ పెరిగింది.
  • పత్తి 2014-15లో రూ.3,750 ఉంటే 2015-16లో రూ.3,850, 2016-17లో రూ.3,860 మాత్రమే అయ్యింది. అంటే ఒకటి నుంచి ఒకటిన్నర శాతమే పెరిగింది.
  • ద్రవ్యోల్బణం 5 శాతం పైనే ఉంది. అంటే రైతులకు కనీస మద్దతుధర దానికి సరిపోయేలా కూడా లేకపోతే రైతుల వాస్తవాదాయం పెరిగిందా.. తగ్గిందా?
  • ముఖ్యమంత్రులు కేంద్రంపై ఒత్తిడి తేవాలి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరికి కనీస మద్దతు ధర రూ.530 నుంచి రూ.1050కి పెరిగింది
  • ముఖ్యమంత్రి కేంద్రం మీద తెచ్చే ఒత్తిడి ఆధారంగానే కనీస మద్దతుధరలు పెరుగుతాయి.
  • రుణమాఫీ వాగ్దానంచూస్తే.. రైతులు కోల్పోయిందే ఎక్కువని తెలుస్తుంది.
  • 2014-15కు సంబంధించి రైతులకు రూ.56వేల కోట్లు ఇవ్వాలంటే రూ.39వేల కోట్లు మాత్రమే ఇచ్చారు.
  • ఈ ఏడాది 2016-17కు రైతులకు 83వేల కోట్లు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుంటే రూ.55,914 కోట్లు మాత్రమే ఇచ్చారు
  • చంద్రబాబు సీఎం అయ్యాక రైతులకు రుణాలు ఇవ్వకపోవడం ఒకటైతే.. రుణభారం కూడా విపరీతంగా పెరిగిపోతోంది. 87 వేల కోట్ల నుంచి లక్ష కోట్లకు పైగా పెరిగింది.
  • మూడేళ్లలో రైతులు 47వేల కోట్ల అపరాధ రుసుము కడితే, ఆయన ఇచ్చింది 10వేల కోట్లు మాత్రమే.
  • రైతులకు 1.10 కోట్ల ఖాతాలుంటే, వాటిలో ఓవర్‌డ్యూ 31 లక్షలు, ఎన్‌పీఏ ఖాతాలు 8 లక్షలు ఉన్నాయి.
  • రైతులకు మొత్తం పంట రుణాలు 69వేల కోట్లయితే, వాటిలో ఓవర్‌డ్యూ, ఎన్‌పీఏ కలిపి 25వేల కోట్లు.. అంటే 35 శాతం ఉంది. టర్మ్ లోన్లది కూడా అదే పరిస్థితి.
  • ఒకవైపు పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే.. మరోవైపు ప్రాజెక్టుల మీద పెట్టే డబ్బులు ఏ ప్రాజెక్టులు మంచివోనన్న ఆలోచన కూడా లేకుండా కమీషన్ల కోసమే పెడుతున్నారు.
  • ఎలాంటి స్టోరేజి కెపాసిటీ లేని పట్టిసీమ కడతారు. ఈ ప్రాజెక్టు నుంచి ఎన్ని టీఎంసీలు లిఫ్ట్ చేశారంటే మంత్రి 54 టీఎంసీలు అంటారు. ఎస్ఈని అడిగితే 48 టీఎంసీలంటారు. కరెంటు బిల్లులు చూశాం. 
  • రూ. 135.46 కోట్ల బిల్లులు వచ్చాయి. 110 రోజులు పనిచేశాయి. వాటి ఆధారంగా చూస్తే 42 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశారు.
  • కానీ 55 టీఎంసీల నీళ్లు ప్రకాశం బ్యారేజి వద్ద సముద్రంలో కలుపుతారు.
  • కొత్త అసెంబ్లీలోనైనా సంప్రదాయం మారుతుందని ఆశించాను గానీ.. ఖర్మకొద్దీ మారలేదు
  • ప్రకాశం బ్యారేజి నుంచి నీళ్లు పోయేది అప్పుడే, పట్టిసీమ నీళ్లు లిఫ్ట్ చేసేదీ అప్పుడే.
  • కరెంటు బిల్లుల మీద పెట్టిన డబ్బులు కట్టి.. తెలంగాణ ప్రభుత్వం అడుగుతున్న ఆర్ అండ్ ఆర్ ప్యాకేజికి ఇస్తే, వాళ్లు ఆ ఊళ్లను ఖాళీ చేయించి ఇచ్చేవారు. అప్పుడు పులిచింతలలో 45 టీఎంసీల  నీళ్లు నిల్వచేసుకునే పరిస్థితి వచ్చేది.
  • వాళ్లకు ఆ డబ్బులు ఇవ్వని కారణంగా పులిచింతలలో ఇప్పుడు గరిష్ఠంగా 28 టీఎంసీలు మాత్రమే నిల్వచేయగలిగారు. దాని సామర్థ్యం 45 టీఎంసీలు.
  • గన్నవరంలోను, ఆయన నియోజకవర్గంలోను పంటలు కాపాడలేని పరిస్థితిలో నీటిపారుదల మంత్రి ఉన్నారు.
  • హంద్రీనీవాకు సంబంధించి పోయి ధర్నాలు చేయాల్సి వచ్చింది.
  • 80 శాతం పనులు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే అయిపోయాయి. కేవలం 20 శాతం మిగిలి ఉన్నాయి
  • వాటిని పూర్తి చేయడానికి డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులు పూర్తిచేయాలని ధర్నాలు చేశాం.
  • అవి రాకపోవడం వల్ల అనంతపురం జిల్లాలో మొత్తం 63 జిల్లాలను కరువు మండలాలుగా ప్రకటించారు. నిజంగా నీళ్లిచ్చి ఉంటే ఆ పరిస్థితి ఎందుకు ఉంటుంది.
  • గాలేరు నగరికి సంబంధించి.. గండికోట కెపాసిటీ 26 టీఎంసీలు. చంద్రబాబు సీఎం కాకముందు కలెక్టర్ శశిధర్ 3 టీఎంసీల నీళ్లు నింపి ఫొటో దిగారు, వీళ్లూ అదే పని చేశారు. దాని విషయాన్ని కూడా ఆలోచించరు.
  • పరిశ్రమల రంగానికి వస్తే రెండేళ్లలోనే 15 లక్షల కోట్ల ఎంఓయూల మీద సంతకాలు చేశారు
  • 4.67 లక్షల కోట్ల ఒప్పందాల మీద సంతకాలు చేశారు. లక్ష కోట్ల పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయని కూడా చెప్పారు
  • సోషియో ఎకనమిక్ సర్వే చూద్దాం.. 2014-15లో పెద్ద పరిశ్రమలు రూ.1,875 కోట్లు, చిన్న పరిశ్రమలు రూ.2,263 కోట్లు కలిపి మొత్తం రూ.4,138 కోట్లు పెట్టుబడులే వచ్చాయి.
  • 2015-16లో పెద్ద పరిశ్రమలు రూ.3,963 కోట్లు, చిన్నవి రూ.1,562 కోట్లు, మొత్తం రూ.5,561 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చినట్లు అర్థమవుతోంది.
  • పరిశ్రమలు వచ్చాయో లేదో తెలుసుకోడానికి రెండో పారామీటర్.. పరిశ్రమలకు అనుమతులు.
  • ఐఈఎం ఫైల్ చేస్తేనే అన్నిరకాల అనుమతులు వస్తాయి, అలాగని మొత్తం ఐఈఎంలన్నీ అమలవుతాయని లేదు
  • వాటిలో 10-20 శాతం పరిశ్రమలు మాత్రమే వస్తాయి.
  • 2014లో రూ.21,510 కోట్లు ఫైల్ చేస్తే, వాటిలో రూ.2,800 కోట్లు మాత్రమే అమలయ్యాయి.
  • 2016లో రూ.34,464 కోట్లు ఫైల్ చేస్తే, వాటిలో రూ.11,395 కోట్లు మాత్రమే అమలయ్యాయి.
  • ఈ రకంగా చూస్తే ఏరకంగా ఇప్పటికే లక్ష కోట్ల పరిశ్రమలు వచ్చాయని, ఉద్యోగాలు ఇచ్చామని ఎలా చెబుతారో అర్థం కావట్లేదు.
  • 2015లో దేశం మొత్తమ్మీద ఏపీతో కలిపి వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, ఆటోమొబైల్, రవాణా, ఐటీ, చేనేత.. ఇలా అన్ని రంగాల్లో కలిపి కొత్తగా 1.35 లక్షల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని కేంద్ర కార్మికశాఖ తెలిపింది.
  • గత ఏడేళ్లలో ఇంత తక్కువ ఉద్యోగాలు వచ్చింది కూడా 2015లోనే.
  • సేవల రంగం 46శాతం కంట్రిబ్యూట్‌ చేస్తోంది.
  • మిగిలిన వారికంటే మన రాష్ట్రం తక్కువుంది ఒక్క ఐటీ రంగంలోనే.. హైదరాబాద్‌లోనే ఐటీ రంగం 96శాతం ఉంది. అందుకే ఈ రంగంలో ఇబ్బందికర పరిస్థితి ఉంది.
  • గత మూడేళ్ల కాలంలో ఐటీ రంగానికి సంబంధించి చంద్రబాబునాయుడు గొప్పలు చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్‌ వస్తుందని చెప్పారు. కానీ, ఆయన అలా చెప్పిన కొన్ని గంటల్లోనే సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ తాము రావడం లేదని, కంపెనీ పెట్టడం లేదని ప్రకటించారు.
  • ట్రంప్‌ పేరు చెబితే భారతీయులు భయపడినట్లు చంద్రబాబు పేరు చెబితే భారతీయ సంస్థలతోపాటు అంతర్జాతీయ సంస్థలు కూడా భయపడుతున్నాయి. ఎన్‌సీఏఈఆర్‌ రిపోర్టులో ఆంధ్రప్రదేశ్‌ అవినీతిలో నెంబర్‌ 1 ర్యాంకు ఇచ్చినందువల్లే ఆ సంస్థలు వణికిపోతున్నాయి.
  • అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంకెలు మారుస్తుంది? ఎందుకు లెక్కలు తప్పుగా చూపిస్తుంది? భారీగా జీడీపీ పెరిగినట్లు, పరిశ్రమలు పెరిగినట్లు చూపించాల్సిన అవసరం ఏమిటి?ఇలా చెబితే కేంద్రం ఎలా సహాయం చేస్తుంది? పన్నుల ద్వారా ఆదాయం బాగానే వస్తుందని కేంద్రం భావిస్తే ఎందుకు నిధులు ఇస్తుంది? రూ.15లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు చెబితే కేంద్రానికి ఎలాంటి సంకేతాలు వెళతాయి? ఇది కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించినట్లు కాదా?.... అని ప్రశ్నిస్తూ వైఎస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగానే అర్థాంతరంగా మైకును కట్‌ చేసిన స్పీకర్‌ సభను ఈ నెల(మార్చి) 13వరకు వాయిదా వేశారు.
 

ఒకే అంశానికి సంబంధించి ఎన్నిసార్లు చర్యలు తీసుకుంటారు?


రాజకీయాలు పక్కనపెట్టి ఆలోచించాలి: వైఎస్‌ జగన్‌
అమరావతి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌ అంశంపై ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం విలేకరులతో ముచ్చటించారు. రాజకీయాలు పక్కనపెట్టి ఈ విషయాన్ని ఆలోచించాలని ఆయన అన్నారు. ‘ఒక జడ్జి ముందుకు ఒక కేసు వస్తుంది. వీళ్లు తప్పని వాళ్లు... వాళ్లు తప్పని వీళ్లు...ఇరుపక్షాలు వాదనలు వినిపించుకుంటాయి. అన్ని విన్న తర్వాత జడ్జి ఒక నిర్ణయం తీసుకుంటారు.
అలాగే రోజా విషయంలో నిర్ణయం తీసుకున్నారు. ఆమెకు శిక్ష కూడా పూర్తయింది. శిక్ష పూర్తయ్యాక కూడా మళ్లీ గతంలో ఏదో జరిగిందని పాత విషయాన్ని తిరగదోడడం కరెక్టేనా? ఒకే అంశానికి సంబంధించి ఎన్నిసార్లు చర్యలు తీసుకుంటారు?. ఒక ఆడకూతురు పట్ల ఇలా వ్యవహరించడం ధర్మమేనా?’  అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

చంద్రబాబు చాలా బాగా కష్టపడ్డారు

Written By news on Monday, March 6, 2017 | 3/06/2017


చంద్రబాబు చాలా బాగా కష్టపడ్డారు: వైఎస్‌ జగన్‌
విజయవాడ: ఓ ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం చాలా పెద్ద విషయమని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం సాయంత్రమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం పదవిలో ఉన్న వ్యక్తులు ఆడియో, వీడియోలతో సహా దేశంలో ఎక్కడా దొరకలేదన్నారు. కానీ చంద్రబాబు మాత్రం అడ్డంగా దొరికిపోయినా పదవిలో కొనసాగుతున్నారన్నారు. మనవాళ్లు బ్రీఫ్‌ డ్‌ మీ అన్న వాయిస్‌ తనది కాదని చంద్రబాబు ఇప్పటికీ చెప్పలేదన్న విషయాన్ని వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఓటుకు కోట్లు కేసును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు నానాతంటాలు పడ్డారని ఆయన అన్నారు.


ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ ప్రసంగం పూర్తి కాగానే అరగంటలోనే మళ్లీ చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి గవర్నర్‌ చెప్పిన విషయాన్ని మళ్లీ చెప్పారని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. మీడియాలో ఎక్కడ ఓటుకు కోట్లు విషయం వస్తుందేమో అన్న భయంతో చంద్రబాబు ఆ విషయాన్ని డైవర్ట్‌ చేయడానికి చాలా బాగా కష్టపడ్డారన్నారు. సరిగ్గా 11.06 నిమిషాలకు గవర్నర్‌ ప్రసంగం ప్రారంభమైతే 11.10 నిమిషాలకు చంద్రబాబు కేసును సుప్రీంకోర్టు విచారణకు చేపట్టిందన్నారు.
 
కేసును అడ్మిట్‌ చేసుకుని నోటీసులు ఇచ్చిందన్నారు. అయితే చంద్రబాబు మాత్రం అవన్నీ మామూలే అంటున్నారని, పైపెచ్చు తనపై 26 కేసులు పెట్టారని, అవన్నీ ఏమయ్యాయని ప్రశ్నించడం సిగ్గుచేటు అన్నారు. ఓటుకు కోట్లు కేసును పక్కదారి పట్టించే యత్నం చేస్తున్నారని వైఎస్‌ జగన్‌ విమర్శించారు.

బాధితులకు భరోసా ఇచ్చేందుకు వెళితే కేసులు


విజయవాడ: కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం బాధాకరమని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బాధితులకు భరోసా ఇచ్చేందుకు వెళితే తనపై కేసులు పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం వైఎస్ జగన్ విలేకరులతో మాట్లాడుతూ.. బస్సులో రెండో డ్రైవర్ లేడని, డిక్కీలో పడుకున్నాడని అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. బస్సు కల్వర్టు పైనుంచి కిందకు పడినప్పుడు డిక్కీలో వ్యక్తి బతుకుతాడా అని ప్రశ్నించారు. పోస్టుమార్టం చయకుండా మృతదేహాలను తరలించే ప్రయత్నం చేశారని, నిబంధనల ప్రకారం పోస్టుమార్టం చేయకపోతే జైలుకు వెళ్తారనడం తప్పా అని అడిగారు. యాజమాన్యం నుంచి పరిహారం ఇప్పించకుండా కుయుక్తులు చేస్తున్నారని మండిపడ్డారు.

టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి వైఎస్ జగన్ ను విలేకరులు ప్రశ్నించగా... ఆయన గురించి మాట్లాడడం అనవసరమని సమాధానమిచ్చారు. ఆయనకు మతిస్థిమితం ఉందో, లేదో తెలియదన్నారు. గజరాజు వెళ్తున్నప్పుడు కుక్కలు మొరగడం సహజమని వ్యాఖ్యానించారు.

మార్చితో ప్రత్యేక హోదా వెళ్లిపోతుందట: వైఎస్‌ జగన్‌


మార్చితో ప్రత్యేక హోదా వెళ్లిపోతుందట: వైఎస్‌ జగన్‌
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర గవర్నర్‌ నోటి ద్వారా అబద్ధాలు చెప్పించడం బాధాకరమైన విషయం అని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ఏది రాసిస్తుందో అదే గవర్నర్‌ చదువుతారన్నారు. విజయవాడలో ఆర్‌ అండ్‌ బీ అతిథిగృహంలో ఆయన సోమవారం సాయంత్రం ప్రెస్‌ మీట్‌ లో మాట్లాడారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ప్రసంగంపై వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ "చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక వరుసగా మూడేళ్లు కరువొచ్చింది.

ఓవైపు రైతులు కరువుతో అల్లాడుతుంటే మరోవైపు చంద్రబాబు మాత్రం దేశం కంటే రాష్ట్రం అయిదు శాతం ఎక్కువ అభివృద్ధి చెందిందంటున్నారు. జీఎస్‌టీ వచ్చినా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు రాయితీలు కొనసాగుతాయని చట్టంలో ఉంటే చంద్రబాబు మాత్రం మార్చితో ప్రత్యేక హోదా అయిపోతుందంటూ గవర్నర్‌ ప్రసంగంలో చెప్పించారు. అలాగే రాజధానిలో ప్లాట్ల కేటాయింపు కుంభకోణంగా మారింది. చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలు, దగ్గర మనుషులకు రోడ్ల పక్కన కూడళ్లలో ప్లాట్లు దక్కాయి. రైతులకు మాత్రం ఎక్కడో మారుమూల పాట్లు ఇచ్చారు. ప్లాట్‌ల కేటాయింపు పచ్చ చొక్కావాళ్లకు బాగా కేటాయింపులు జరిగాయి.


ఇది భూములు తీసుకున్న రైతులకు అన్యాయం జరిగినట్లు కాదా? అమరావతిలో భూమల లాటరీ అనేది ఓ స్కామ్‌ గా తయారు చేశారు. టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్‌, ధూళిపాళ్ల నరేంద్రకు నాలుగువైపులా రోడ్లు, రెండు కమర్షియల్‌ జోన్ల మధ్య 12వేల గజాల ప్లాట్లు ఇచ్చారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి కుమారుడికి నేలపాడులో సడ్‌ యాక్సిస్‌ రోడ్డు పక్కన ప్రభుత్వ షాపింగ్‌ కాంప్లెక్స్‌ ను ఆనుకుని ప్లాట్లు కేటాయించారు. స్పీకర్‌ పీఏకు వెలగపూడిలో సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు పక్కనే ప్లాట్లు ఇచ్చారు.
గుంటూరు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే కుమార్తెకు మందడంలో ఇరువైపులా రోడ్లు ఉన్న ప్లాట్లు కేటాయించారు. అసలు లాటరీ పద్థతిలో పారదర్శకత ఉందా?. మంచి ప్లాట్లు మీరు తీసుకుని, ఎక్కడో మారుమూల ఉన్నవి రైతులకు ఇస్తారా? రాజధానిలో చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌కు తెర తీసి, తన మనషుల భూములను రియల్‌ ఎస్టేట్‌ జోన్‌ లో పెట్టారు. రాజధాని విషయంలో టీడీపీ నేతలకు లబ్ది చేకూరేలా చేశారు. రైతుల వద్ద భూములు తీసుకుని ఇదేంటి బాబు, నీ మనుషులకు మేలు చేయడం ధర్మమా? అని సూటిగా ప్రశ్నించారు.

తొలిరోజే చంద్రబాబుకు షాక్ తగిలింది

అమరావతి: రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతిలో తొలిసారి జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు షాక్ తగిలిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ రోజు (సోమవారం) ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసిందని చెప్పారు.

తొలిరోజు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మీడియా పాయింట్ వద్ద కోటంరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు తనకు ఇష్టమైన వెన్నుపోటు అనే మాటను అస్త్రంగా చేసుకుని గవర్నర్‌ ప్రసంగంలో చదివించారని విమర్శించారు. ప్రత్యేక హోదాకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. గత ఎన్నికల సమయంలో తిరుపతిలో ఏడుకొండల వెంకన్నస్వామి సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. ఎన్నికల్లో గెలిచాక మాట మార్చారని విమర్శించారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ హామీలను విస్మరించారని మండిపడ్డారు.

చంద్రబాబు తప్పించుకోలేరు


చంద్రబాబు తప్పించుకోలేరు
న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసు నుంచి టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పించుకోలేరని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు. ఈ కేసులో తమకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పారు.

ఓటుకు కోట్లు కేసులో సుప్రీం కోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. వీలైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, ఈ కేసును సమగ్రంగా విచారిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. అనంతరం పొన్నవోలు మీడియాతో మాట్లాడుతూ.. కేసు తీవ్రతను సుప్రీం కోర్టు గుర్తించిందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. విచారణ సమయంలో కోర్టుకు వివరాలన్నీ సమర్పిస్తామని చెప్పారు.

చంద్రబాబుకు సుప్రీం కోర్టు నోటీసులు


చంద్రబాబుకు సుప్రీం కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో సుప్రీం కోర్టు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నోటీసులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. ఓటుకు కోట్లు వ్యవహారం అవినీతి నిరోధక చట్టం కిందకు వస్తుందని ఎమ్మెల్యే ఆర్కే సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.

తెలంగాణ శాసనమండలి ఎన్నికల సందర్భంగా ఓటుకు కోట్లు కేసు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొందరిని డబ్బుతో కొనేందుకు టీడీపీ ప్రయత్నించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ఆయన ఇంట్లో ప్రలోభపెడుతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు. అంతేగాక టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. స్టీఫెన్‌సన్‌తో నేరుగా మాట్లాడినట్టు ఆధారాలు బయటపడ్డాయి. మనవాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ అంటూ స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు చెప్పినట్టు ఫోన్ రికార్డుల్లో వెలుగుచూసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షల్లో బ్రీఫ్‌డ్ మీ అన్న గొంతు చంద్రబాబుదేనని తేలింది. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఏసీబీ కోర్టులో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ దాఖలు చేశారు. సాక్ష్యాల ఆధారంగా చంద్రబాబుపై దర్యాప్తు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించగా.. చంద్రబాబు హైకోర్టులో సవాల్ చేశారు. ఓటు వేసేందుకు లంచం తీసుకుంటే అవినీతి కిందకు రాదని చంద్రబాబు తరఫు న్యాయవాది వాదించారు. చంద్రబాబుపై ఏసీబీ కోర్టు ఆదేశాలను హైకోర్టు కొట్టివేయగా, ఎమ్మెల్యే ఆర్కే సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

46 ప్రధాన సమస్యలపై వైఎస్‌ఆర్‌సీపీ దృష్టి


విజయవాడ: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్షం సోమవారం ఉదయం సమావేశమైంది. వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన విజయవాడ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ లో జరిగిన ఈ సమావేశంలో.. 46 ప్రధాన సమస్యలను శాసనసభలో లేవనెత్తాలని వైఎస్‌ఆర్‌ సీపీ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలను పొడిగించేలా బీఏసీలో వైఎస్‌ఆర్‌ సీపీ పట్టుబట్టనుంది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు మరోసారి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ శాసనసభాపక్షం సమావేశం కానుంది.

అనంతరం గంగుల ప్రభాకర్‌ రెడ్డిని వైఎస్‌ జగన్‌ ఎమ్మెల్యేలకు పరిచయం చేశారు. ఫిరాయింపుల కారణంగా ఇద్దరికే ఎమ్మెల్సీ అవకాశం లభించిందని తెలిపిన జగన్‌.. అభ్యర్థుల ఎంపిక కారణాలను వివరించారు.

రాజధానిలో పచ్చనేతల చేతివాటం

ముఖ్యమైన వాణిజ్య, నివాస ప్లాట్లన్నీ ముందుగానే బ్లాక్‌
 రహదారుల పక్కన, కార్నర్‌లో, పార్కులు, ఖాళీ స్థలాలున్న చోట ప్లాట్లు కొట్టేసిన వైనం
⇒ ఆపై ఆన్‌లైన్‌లో పెట్టి.. ఊరికి దూరంగా సామాన్య రైతులకు కేటాయింపు
⇒ ఇదేంటని ప్రశ్నిస్తే.. అదంతా ఆన్‌లైన్‌ కేటాయింపులంటూ దాటవేత
⇒ రాజధాని రైతులను అడుగడుగునా దగా చేస్తున్న ప్రభుత్వ పెద్దలు
⇒ ‘సాక్షి’ పరిశోధనలో వెలుగు చూసిన మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమాలు


సాక్షి, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో అధికార టీడీపీ పెద్దలు అడుగడుగునా మోసాలకు పాల్పడుతున్నారు. ఆ ప్రాంతంలో భూములను కారు చౌకగా కొట్టేసి రైతులను నిలువునా ముంచిన టీడీపీ నేతలు.. ఆ భూములను ల్యాండ్‌ పూలింగ్‌ కింద ప్రభుత్వానికి ఇచ్చి పరిహారం రూపంలో అతి విలువైన ప్లాట్లను కొట్టేశారు. ఆన్‌లైన్‌ లాటరీ అంటూ ఎవరికీ అనుమానం రాకుండా, కావాల్సిన చోట.. కోరుకున్న ప్లాట్లను దక్కించుకున్నారు. రాజధాని కోసం భూములు వదులుకున్న సామాన్య రైతులకు మాత్రం ఊరికి దూరంగా.. వాస్తులోపం ఉన్న ప్లాట్లు ఎక్కడ పడితే అక్కడ కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఇలాంటి ప్లాట్లు కేటాయించారేంటని రైతులు ప్రశ్నిస్తే... అదంతా తమ చేతుల్లో పనికాదని, ఆన్‌లైన్‌ ద్వారా చేసిందని చిలక పలుకులు పలుకుతున్నారు. రాజధాని పేరుతో అధికార పార్టీ నేతల హైటెక్‌ మోసాన్ని ‘సాక్షి’ పక్కా ఆధారాలతో పట్టుకుంది. అధికారం అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు సాగించిన ప్లాట్ల కుంభకోణం వివరాలు ఇలా ఉన్నాయి.




ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం కోసం టీడీపీ ప్రభుత్వం గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని 29 గ్రామాలను ఎంపిక చేసింది. ఆ గ్రామాల పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములను ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో కొందరు రైతులను భయపెట్టి, మరి కొందరికి రకరకాల హామీలు ఇచ్చి బలవంతంగా లాక్కుంది. భూములు లాక్కునే సమయంలో రైతులకు కోరుకున్న చోట, కోరిన విధంగా ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇలా సమీకరించిన భూముల్లో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు.. రైతులను మోసం చేసి కొనుగోలు చేసిన భూములు కూడా ఉన్నాయి. రాజధాని కోసం భూములు ఇచ్చిన యజమానులకు ప్రభుత్వం పరిహారం కింద ఏటా కౌలు చెల్లించటంతో పాటు భూములు వదులుకున్న ప్రాంతంలోనే నివాస యోగ్యమైన, వాణిజ్య అవసరాల కోసం ప్లాట్ల కేటాయింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఎకరం జరీబు భూమిని తీసుకుంటే 1450 చదరపు గజాల ప్లాటు కేటాయించారు. ఇందులో 1200 చదరపు గజాల్లో నివాసం, 250 చదరపు గజాల్లో వాణిజ్య ప్లాటు ఉంటుంది. ఎకరం మెట్ట భూమి ఇచ్చిన వారికి 1200 చదరపు గజాలు ఇచ్చారు. ఇందులో 1000 చదరపు గజాల్లో నివాసం, 200 చదరపు గజాల్లో వాణిజ్య ప్లాటు కేటాయించారు. ఈ కేటాయింపు ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌ లాటరీ విధానంలో చేపట్టారు. చీటీల పద్ధతిన ప్లాట్లు కేటాయించాలని రైతులు డిమాండ్‌ చేసినా, ఆన్‌లైన్‌ ద్వారా అయితే మోసం జరగదని రైతులను నమ్మించారు. ప్లాట్లు కేటాయించక ముందే టీడీపీ పెద్దలు ఆన్‌లైన్‌లో వారు కోరుకున్న చోట, కోరిన ప్లాట్లను బ్లాక్‌ చేయించుకున్నారు. మిగిలిన ప్లాట్లను మాత్రమే ఆన్‌లైన్‌లో పెట్టి ప్లాట్లు కేటాయించారు.


 


పెద్దోళ్లకు పెద్ద పీట
రాజధానిలో భూములు వదులుకున్న వారందరికీ సీఆర్‌డీఏ 2016 జూన్‌ 25న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్లాట్ల కేటాయింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నాటి నుంచి నేటి వరకు 27 గ్రామాల వారికి ప్లాట్లు కేటాయించారు. పెనుమాక, ఉండవల్లి గ్రామస్తులకు ప్లాట్లు కేటాయించాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగిన ప్లాట్ల కేటాయింపుపై ఎక్కడికక్కడ స్థానికులు అభ్యంతరం చెబుతూ వచ్చారు. ఊరికి దూరంగా.. పక్క గ్రామం పొలిమేరల్లో కేటాయించారని కొందరు, కాలువ గట్టుపై, వాస్తు సరిగా లేని ప్లాట్లు కట్టబెట్టారని మరి కొందరు అభ్యంతరాలు తెలియజేశారు. వీటిని సీఆర్‌డీఏ అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు.

వాస్తవంగా ఆయా గ్రామాల్లో విలువైన ప్లాట్లన్నీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్, మంత్రులు నారాయణ, పల్లె రఘునాథరెడ్డి, «ఎమ్మెల్యేలు దూళిపాళ్ల నరేంద్ర, గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఎస్‌.ఆంజనేయులు, పయ్యావుల కేశవ్‌ తదితరులు తమ బంధువులు, అనుచరుల పేర్లతో కొనుగోలు చేసిన భూములకు పరిహారం కింద  దక్కించుకున్నారు. వీరు దక్కించుకున్న ప్లాట్లన్నీ అత్యంత విలువైనవి కావటం గమనార్హం. ప్రతి ప్లాటుకు ఇరువైపులా రహదారులు ఉన్నవే. కొన్ని ప్లాట్ల ముందు, వెనుక పార్క్‌లు ఉంటే, మరి కొన్ని ప్లాట్ల ముందు, పక్కన ఖాళీ స్థలాలు ఉన్న వాటినే కొట్టేశారు. ఇందులో చాలా వరకు కార్నర్‌ ప్లాట్లు కావడం గమనార్హం.




ఆన్‌లైన్‌లో ఇదెలా సాధ్యం?
ఏపీ సచివాలయానికి అతి సమీపంలోని వెలగపూడిలో స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ పీఏ బంధువుల పేరున భూములు కొనుగోలు చేశారు. ఆ భూములకు పరిహారం కింద వెలగపూడిలో నాలుగు విలువైన ప్లాట్లు దక్కించుకున్నారు. అందులో లలితకుమారి పేరున 352 కాలనీ, బ్లాక్‌ నంబర్‌ 2556లో 2,280 చదరపు గజాల వాణిజ్య ప్లాటు ఉంది. ఈ ప్లాటుకు తూర్పు వైపున సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు ఉండటం గమనార్హం. అదే విధంగా మరో నాలుగు ప్లాట్లు ఇదే వెలగపూడిలోనే ఉన్నాయి. రాజధాని నిర్మాణంలో కీలక పాత్రధారి, సూత్రధారి అయిన రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ.. బంధువులు, సన్నిహితులైన రాపూరు సాంబశివరావు, ఆవులు మునిశంకర్, పోతూరి పరిమళ, వరుణ్‌కుమార్‌ కొత్తప పేర్లతో రాజధాని గ్రామాలైన మందడం, లింగాయపాలెం, రాయపూడి, కొండమరాజుపాలెంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు.

ఆ భూములకు సంబంధించి కేటాయించుకున్న ప్లాట్లను పరిశీలిస్తే.. ఆన్‌లైన్‌ లాటరీ విధానంలో ఇది సాధ్యమేనా? అనే అనుమానాలు రాక మానవు. సచివాలయానికి ముందు గ్రామమైన మందడంలో 25 వేల చదరపు గజాల ఒకటే ప్లాటును దక్కించుకున్నారు. తూర్పు, ఉత్తరం, దక్షిణం 100 అడుగుల రహదారి ఉంది. కమర్షియల్‌ జోన్‌కు అతి సమీపంలో... రెండవ యాక్సెస్‌ రహదారికి మధ్యలో కార్నర్‌ ప్లాటు కావడం గమనార్హం. అదే గ్రామంలో 6,750,  2,190 చదరపు గజాల ప్లాట్లు ఉన్నాయి. లింగాయపాలెంలో 8,880, 4,000 చదరపు గజాల విస్తీర్ణం గల ప్లాట్లు, రాయపూడిలో 7,625,  3,750 చదరపు గజాల ప్లాట్లు ఉన్నాయి.

ఇదే ప్రాంతంలో 3,450 చదరపు గజాల ప్లాటు, 930 చదరపు గజాల ప్లాటు ఉన్నాయి. కొండమరాజు పాలెంలో 2,910,  720 చదరపు గజాల ప్లాట్లు దక్కించుకున్నారు. వీటిలో ఎక్కువ ప్లాట్లకు ఇరువైపులా రహదారులు ఉన్నాయి. మరి కొన్ని మూడు వైపులా రహదారులున్న కార్నర్‌ ప్లాట్లు కావటం గమనార్హం. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కుమారుడు పల్లె వెంకటకృష్ణారెడ్డి పేరున నేలపాడు గ్రామంలో 2,520 చదరపు గజాల ప్లాటు ఉంది. ఈ ప్లాటు పక్కనే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, ప్రభుత్వ షాపింగ్‌ క్లాంప్లెక్స్‌ల జోన్‌ ఉంది.






అగ్ర భాగంలో గుంటూరు జిల్లా అధ్యక్షుడు
రాజధాని పరిధిలోని దాదాపు అన్ని గ్రామాల్లో గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఎస్‌.ఆంజనేయులు.. భార్య గోనుగుంట్ల లక్ష్మీసౌజన్య, కొత్తా వెంకట ఆంజనేయులు, కొత్తా శివరామకృష్ణ పేర్లతో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. వెలగపూడి, మందడం, నేలపాడు, కృష్ణాయిపాలెం, ఐనవోలు, కొండమరాజుపాలెంలో కొనుగోలు చేసిన భూములకు సంబంధించి కేటాయించిన ప్లాట్లన్నీ కూడా విలువైనవే. అన్ని ప్లాట్లకు ఇరువైపులా 100, 200 అడుగుల రహదారులు, కమర్షియల్‌ జోన్, పార్కులు, ఖాళీ స్థలాలు ఉన్నాయి.

ఒక్క మందడం గ్రామంలోనే ఐదు ప్లాట్లు ఉంటే, మిగిలిన ఐనవోలు, వెలగపూడి, కృష్ణాయిపాలెం, నేలపాడులో ఉన్న మరో 8 ప్లాట్లు కూడా అత్యంత విలువైనవి కావటం గమనార్హం. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ ఇద్దరూ కలసి కొండమరాజుపాలెంలో 12 వేల చదరపు గజాల ఒక ప్లాటు, 3 వేల చదరపు గజాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి. 12 వేల చదరపు గజాల ప్లాటుకు నాలుగు వైపులా రహదారులు ఉన్నాయి. ఇది అతిపెద్ద పార్క్, కమర్షియల్‌ జోన్లకు మధ్యలో ఉంది. మరో ప్లాటుకు ఇరువైపుల రహదారులు ఉన్నాయి.

నేడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌


నేడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులుగా బరిలో ఉన్న ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), గంగుల ప్రభాకర్‌రెడ్డి సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు పలువురితో కలిసి నూతన అసెంబ్లీలోని శాసనసభ కార్యదర్శి చాంబర్‌లో మధ్యాహ్నం వారు నామినేషన్‌ దాఖలు చేస్తారని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

ఉదయం 9గంటలకు శాసనసభాపక్షం భేటీ
వైఎస్సార్‌ సీపీ శాసనసభాపక్ష సమావేశం సోమవారం ఉదయం 9 గంటలకు ఆర్‌ అండ్‌ బి అతిథిగృహం (స్వరాజ్‌ మైదాన్‌ పక్కన)లో జరుగుతుంది. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు

వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం


వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం
అమరావతి: అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రతిపక్షనేత, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి వెలగపూడి బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఆయనకు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఘనస్వాగతం పలికారు.

అనంతరం గన్నవరం మండలం కేసరపల్లిలో వైఎస్‌ఆర్‌సీసీ రాష్ట్ర కార్యదర్శి తోట శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహిళలు జగన్‌కు హారతి ఇచ్చారు. వైఎస్‌ జగన్‌తో పాటు రాజ‍్యసభ సభ‍్యుడు  విజయసాయిరెడ్డి, పలువురు శాసనసభ్యులు ఉన్నారు.

Popular Posts

Topics :