04 June 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

విశాఖనూ మేసేశారు

Written By news on Friday, June 9, 2017 | 6/09/2017



పెను ‘భూ’కంపంతో విశాఖ వణికిపోతోంది.
ప్రకృతిలో భాగమైన భూమాతను చెరబట్టేందుకు
రాజకీయ బేహారులు సృష్టించిన భూదందాల విలయమిది.
డీ పట్టాలు, పోరంబోకు, ఈనాం, భూదాన భూములు.. ఇలా దేన్నీ వదల్లేదు.
వాటి అనుభవదారులు, యజమానులపై సకల మాయోపాయాలు ప్రయోగించారు.
రూ.లక్షల కోట్ల విలువైన భూ కుంభకోణాలు... చరిత్రలో కనీవినీ ఎరుగని దోపిడీకి పాల్పడిన టీడీపీ నేతలు
   అధికారులను పావులు చేసి వేల ఎకరాలు కబ్జా
    ప్రభుత్వ భూములు తనఖా పెట్టి రుణాలు, ఎగవేతలు
   లక్ష ఎకరాల భూముల రికార్డులు గల్లంతు
  హుద్‌హుద్‌లో కొట్టుకుపోయాయని మాయమాటలు
    సూత్రధారులు ప్రభుత్వ పెద్దలే
    పాత్రధారులు జిల్లా నేతలు
   బుధవారం నాటి విశాఖ పర్యటనలో
   ఓ మంత్రి ఆద్యంతం కలెక్టర్‌తో మంతనాలు
   ఆనక భూ కుంభకోణాలే జరగలేదని కలెక్టర్‌ ప్రకటన
  నిండా ముంచేశారని బాధిత రైతుల ఆవేదన

అడ్డగోలుగా.. అధికారం అండతో ఖాళీగా కనిపించిన భూమినల్లా కబ్జా చేసేశారు. ఓటేసిన వారిని వెన్నుపోటు పొడిచారు. బడుగుల పొట్ట కొట్టి తమ బొక్కసాలు నింపుకొన్నారు. ఇదంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే సాగింది. వారే స్కెచ్‌ వేశారు.. అధికారుల మెడపై కత్తి పెట్టి అమలు చేయించారు.
సామాన్యుడు నెత్తీనోరూ బాదుకున్నా వినలేదు. తరతరాలుగా ఆదరువుగా ఉన్న భూముల నుంచి వారిని ఈడ్చి పారేశారు. వీఆర్‌వో మొదలు  తహసీల్దార్‌ వరకు అందరినీగుప్పిట పెట్టుకుని కబ్జాకాండ సాగించారు. రాష్ట్ర చరిత్రలోనే కనీ వినీ ఎరుగని భూదోపిడీకి పాల్పడ్డారు. ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా ఇంత భారీ కుంభకోణం జరగడం అసంభవం అని రెవెన్యూ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
విశాఖపట్నం : టీడీపీ అధికారంలోకి రావడంతోనే విశాఖలో భూ దోపిడీకి బీజం పడింది. విభజన తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను లక్ష్యంగా చేసుకున్నారు. ఆర్థిక రాజధానిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళతామని బీరాలు పలికిన అధికార పార్టీ ప్రముఖులు.. భూ మాఫియాకు ద్వారాలు తెరిచి పాతాళానికి నెట్టేశారు. ముఖ్యనేత సహకారం, చినబాబు ప్రత్యక్ష ప్రమేయంతో కబ్జాకు రాచబాట వేసుకున్నారు.

నగరానికి ఈ చివర.. ఆ చివర పాగా వేశారు. రికార్డులు తారుమారు చేయడం.. సాధ్యం కాకపోతే బలవంతంగా లాక్కోవడం.. ఇదీ వారి దందా.. ల్యాండ్‌ పూలింగ్‌ ముసుగు కూడా ఈ మాఫియా ఆగడాలను బాగా కవర్‌ చేసింది. పూలింగ్‌లో భూములు పోతాయని బడుగు జనాలను బెదిరించడం.. కారుచౌకగా వారి భూములను లాక్కోవడం.. తిరిగి వాటినే ప్రభుత్వానికి ఎక్కువ ధరకు ఇవ్వడం ద్వారా వందల కోట్ల రూపాయలు దండుకున్నారు. భీమిలి, ఆనందపురం, విశాఖ రూరల్, పెందుర్తి మండలాల్లో ఇలాంటి భూ మాఫియా అక్రమాలు కోకొల్లలు.
‘సాక్షి’ ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో పర్యటించినప్పుడు బాధితులు వెల్లడించిన విషయాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఒకరి బ్యాంకు ఖాతా నుంచి మరొకరి బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ అయినంత ఈజీగా భూ రికార్డులు మారిపోయాయి. పచ్చిగా చెప్పాలంటే.. రైతు తన భూమిలో సాగు చేస్తుండగానే.. అక్కడ తహశీల్దార్‌ కార్యాలయాల్లో ఆ భూమి వేరొకరికి ధారాదత్తం అయిపోయింది. సొంతదారు భూమిలో ఉండగానే మరొకరు వచ్చి.. ఇది తనదని దబాయించే దారుణ పరిస్థితులు విశాఖ శివార్లలో రాజ్యమేలుతున్నాయి.

తిమ్మిని బమ్మి చేసిన గంటా బంధువు
విశాఖ భూముల కుంభకోణంలో మంత్రి గంటా శ్రీనివాసరావు బంధువు పరుచూరి వెంకట భాస్కరరావు కీలక పాత్ర పోషించారు. ప్రత్యూష కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన భాస్కరరావు రుణం కోసం ఇండియన్‌ బ్యాంకుకు భూములు కుదవ పెట్టాడు. ఆనందపురం మండలం వేములవలస గ్రామంలో 122 – 11లో 726 చదరపు గజాల భూమి, సర్వే నంబర్‌122–8, 9, 10, 11, 12, 13, 14, 15లలో 4.33 ఎకరాల భూములు, సర్వే నంబర్‌ 124–1, 2, 3, 4లలో 0.271 ఎకరాలు భూములు భాస్కరరావు కుదవపెట్టిన వాటిలో ఉన్నాయి.
ఇందులో ప్రధానంగా సర్వే నంబర్‌ 122/9ని పరిశీలిస్తే మొత్తం 59 సెంట్ల భూమిని జాతీయ రహదారి విస్తరణ కోసం ప్రభుత్వం సేకరించింది. ప్రభుత్వం తీసుకునే సమయానికి ముందు ఇక్కడ కేవలం 7 సెంట్ల భూమి మాత్రమే పరుచూరి భాస్కరరావు పేరిట నమోదై ఉంది. మిగిలిన భూమి పూర్వం నుంచి ప్రభుత్వ భూమిగానే ఉంది. రోడ్డు విస్తీర్ణం కోసం సేకరించిన తర్వాత ప్రస్తుతం రికార్డుల్లో ఇది ప్రభుత్వ భూమిగానే నమోదై ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఒక్క సెంటు భూమి కూడా భాస్కరరావు పేరిట లేదు.

► సర్వే నంబర్‌ 122/10లో 47 సెంట్ల జిరాయితీ భూమి ఉండేది. ఈ భూమిని పూర్తిగా ఎన్‌హెచ్‌ విస్తరణలో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. రికార్డుల్లో ప్రస్తుతం ప్రభుత్వ భూమిగానే నమోదై ఉంది. ఇక్కడ కూడా భాస్కరరావు పేరిట ఒక్క గజం భూమి కూడా లేదు.
► సర్వే నంబర్‌ 122 – 11లో 66 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. దీంట్లో కూడా 60 సెంట్ల భూమి కోరాడ అచ్చమ్మ ఆక్రమణలో ఉన్నట్టుగా రికార్డుల్లో స్పష్టంగా ఉంది. మిగిలిన ఆరు సెంట్ల భూమి కూడా ప్రభుత్వ మిగులు భూమిగానే చూపిస్తున్నారు. కోరాడ అచ్చమ్మ ఆక్రమణలో ఉన్న 60 సెంట్ల భూమిలో ప్రస్తుతం బలహీన వర్గాల కాలనీ ఉంది. అంటే ఇక్కడ ఒక్క సెంట్‌ భూమి కూడా పరుచూరి భాస్కరరావు పేరిట లేదని అర్థమవుతోంది.
► సర్వే నంబర్‌..122/12లో 1.04 ఎకరాల భూమిలో భాస్కరరావు పేరిట 30 సెంట్ల భూమి నమోదై ఉంది. మిగిలిన భూమి ప్రభుత్వానిది. కాగా, భాస్కరరావుకు చెందిన 30 సెంట్లలో 8 సెంట్ల భూమి ఎన్‌హెచ్‌ విస్తరణ కోసం ప్రభుత్వం సేకరించిన భూమిలో ఉంది. కానీ ఇక్కడ ఉన్న 1.04 ఎకరాల భూమిని కూడా తనదిగానే చూపించి బ్యాంకుకు కుదవపెట్టారు. ఇలా తనవి కాని భూములనే కాదు.. ప్రభుత్వం సేకరించిన భూములను కూడా గ్యారెంటీ కింద బ్యాంకుల్లో కుదవపెట్టి రూ. కోట్ల రుణం పొందారు.

ఇక్కడ విచిత్రమేమిటంటే ఎన్‌హెచ్‌ విస్తరణ కోసం భూసేకరణ చేసిన సంవత్సరం 2003. ప్రత్యూష కంపెనీ ఏర్పడిన సంవత్సరం 2005. రుణం పొందిన సంవత్సరం 2006. అంటే 2003 భూసేకరణలో కోల్పోయిన భూములను 2006లో రుణం కోసం కుదవపెట్టిన ఆస్తుల్లో చూపడం గమనార్హం. ఇక్కడ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. 2003లో భూసేకరణ తర్వాత రికార్డుల్లో ప్రభుత్వం ఎంత భూమి సేకరించింది. మిగిలిన భూమిలో ఎవరి పేరిట ఎంత భూమి ఉందన్న వివరాలు అడంగల్, ఎఫ్‌ఎంబీలలో నమోదు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. రెవెన్యూ అధికారుల నిర్లిప్తత భాస్కరరావుకు కలిసొచ్చింది.
ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకొని భూసేకరణలో కోల్పోయిన భూములను సైతం భాస్కరరావు తెలివిగా బ్యాంకులో కుదవపెట్టి రుణాలు పొందారు. మరో పక్క ప్రభుత్వ భూములను కూడా తనవిగా ఏమార్చి రుణాలు పొందడం గమనార్హం. కాగా, మంత్రి గంటా, ఆయన బంధువు భాస్కరరావు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి 1100 ఎకరాలు కబ్జా చేసినట్లు అధికార వర్గాల సమాచారం.
ఇందులో మంత్రి లోకేశ్‌కూ వాటా ఉండబట్టే ఈ వ్యవహారం పెద్దది కాకుండా చక్రం తిప్పుతుండటం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. బుధవారం విశాఖలో ఓ చిన్న కార్యక్రమానికి హాజరైన లోకేశ్‌ ఆద్యంతం కలెక్టర్‌తో మంతనాలు సాగిస్తూ భూ కుంభకోణాన్ని ఎలా పక్కదారి పట్టించారో మార్గనిర్దేశం చేశారు. లోకేశ్‌ అక్కడి నుంచి బయలు దేరిన వెంటనే.. విశాఖలో ఎలాంటి భూకుంభకోణాలు జరగలేదని కలెక్టర్‌ ప్రకటించడమే ఇందుకు నిదర్శనం.

సీఎం, మంత్రులు సూత్రధారులు
విశాఖ జిల్లాలో భూ దందాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా అధికార టీడీపీ వారే. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అయన తనయుడు, మంత్రి లోకేశ్, మరో మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిపై ప్రజలు, రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. టీడీపీకే చెందిన మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, బీజేపీ శాసనసభాపక్ష నేత ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వ్యవహారంపై ఆరోపణలను గుప్పిస్తున్నారు.
మంత్రి గంటా బంధువులు, అనుచరులపై వస్తున్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. బ్యాంకులకు ఎగనామం పెట్టిన వ్యవహారంలో గంటా సమీప బంధువు పరుచూరి భాస్కరరావు వ్యవహారం ఇటీవలే రచ్చకెక్కింది. భీమిలి ప్రాంతంలో ఏ రైతునడిగినా.. భాస్కరరావుపై ఆరోపణలు చేస్తున్నారు. అధికారులను చెప్పుచేతల్లో పెట్టుకొని తమ పొట్టకొట్టారని, టీడీపీకి ఓటు వేసిన వారినే దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చేతిలో అధికారులు.. అడ్డగోలుగా దందాలు
టీడీపీ అధికారంలోకి రాగానే జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు ముందుగా దృష్టి పెట్టింది రెవెన్యూ శాఖపైనే. ఆర్డీవో, తహసీల్దార్ల పోస్టుల్లో తాము చెప్పింది చెప్పినట్లు చేసే వారిని నియమించుకున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చే నాటికి విశాఖ ఆర్డీవోగా ఉన్న మురళిని కొనసాగించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు గట్టి పట్టుపట్టారు. మరో మంత్రి అయ్యన్న పాత్రుడు మాత్రం ఆయన్ను బదిలీ చేయాల్సిందేనని ప్రభుత్వ పెద్దల వద్ద డిమాండ్‌ చేశారు. అయ్యన్న మంత్రాంగమే ఫలించి మురళి బదలీ అయినప్పటికీ గంటా మరో విధంగా చక్రం తిప్పారు.
కొన్ని రోజులపాటు పోస్టు ఖాళీగా ఉండే విధంగా తన పరపతి ఉపయోగించారు. ఆ తర్వాత కొన్ని నెలలకు ఇప్పుడున్న వెంకటేశ్వర్లును ప్రభుత్వం ఆర్డీవోగా నియమించింది. ఆ తర్వాత గంటా వర్గానికి రెవెన్యూ యంత్రాగం సాగిలపడిందనే వాదనలు ఉన్నాయి. అనుకున్నదే తడవుగా రికార్డులు పుట్టించడం, అవసరమైతే వాటిని తారుమారు చేయడం, కావాల్సిన పేరు మీద పట్టాలు పుట్టించడం.. ఇలా ఒకటేమిటి జరగని అక్రమమంటూ లేదని సాక్ష్యాలతో సహా బట్టబయలవుతున్నాయి.
 
ఆ సీట్లు .. అక్రమాల పుట్టలు
భీమిలి, ఆనందపురం, విశాఖ రూరల్‌ తహశీల్దార్‌ కార్యాలయాలు మూడేళ్లుగా పచ్చనేతల పాలిట కల్పవృక్షాలుగా మారిపోయాయి. అక్రమాల పుట్టలుగా తయారయ్యాయి. వీటి పరిధిలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు వీటికి ఏమాత్రం తీసిపోవు. ప్రధానంగా భీమిలి తహసీల్దార్‌ కార్యాలయంలో మూడేళ్లలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఇక్కడ పని చేసిన వారు, బదిలీపై వెళ్లిన వారిలో చాలా మంది ఏసీబీ కేసుల్లో, అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. ఇక్కడ పని చేస్తున్న కాలంలో ఓ తహసీల్దార్‌ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. తర్వాత వచ్చిన ఇద్దరు తహసీల్దార్లు ఎక్కువకాలం కొనసాగలేదు. ఆ తర్వాత వచ్చిన బీటీవీ రామారావు అవినీతి, అక్రమాల్లో రికార్డులు సృష్టించారని చెప్పొచ్చు.
దాదాపు రూ.100 కోట్ల మేర అక్రమంగా ఆస్తులు సంపాదించారని ఏసీబీ  సోదాల్లో బయటపడింది. రికార్డుల్లో యజమాని ఫొటో తొలగించి ఇంకుపోసిన సంఘటనలు రామారావు హయాంలోనే జరిగాయి. భీమిలి సమీపంలోని చిప్పాడకు చెందిన 37 ఎకరాల వ్యవహారంలో జరిగిన అవకతవకలు ఎవరినైనా షాక్‌కు గురి చేస్తాయి. పూసపాటి సీతారామారాజు అనే వ్యక్తి తన హక్కుల కోసం విజయనగరం మన్సాస్‌ ట్రస్ట్‌తో దశాబ్దాల కాలంగా పోరాటం చేస్తున్న సమయంలోనే.. ఈ భూమి కలిదిండి రమాదేవి పేరిట బదిలీ అయిపోయింది. ఈమె వెంటనే మరొకరికి విక్రయించేశారు. మన్సాస్‌ ట్రస్టు ఇచ్చినట్లుగా చెబుతున్న ఎన్‌వోసీ ఆధారంగా ఈ భూముల రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. రాష్ట్రంలో ఎన్‌వోసీ ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేసిన ఘటన ఇదేనని స్వయంగా  రెవెన్యూ వర్గాలే చెబుతున్నాయి. ఈ ఒక్క స్కాం విలువే సుమారు రూ.40 కోట్లుపైగా ఉంటుంది. ఇది తహసీల్దార్‌ రామారావు హయాంలో జరిగిన ఓ కుంభకోణం మాత్రమే.

59 రోజులపాటు చార్జి ఇవ్వని తహసీల్దార్‌
విశాఖ రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయం కూడా అక్రమాల గని. ఇక్కడ తహసీల్దార్‌గా పని చేసిన లాలం సుధాకర్‌ నాయుడు విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ లాలం భవానీకి స్వయాన మరిది. టీడీపీ నేత లాలం భాస్కరరావుకు స్వయాన సోదరుడు. మంత్రి గంటాకు, అతని వర్గానికి అత్యంత అనుకూలంగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకున్నారనే అభియోగాలు సుధాకర్‌ నాయుడుపై ఉన్నాయి. ఆయన ఆస్తులపై దాడులు చేయాలన్న డిమాండ్లు చాలా కాలంగా వివిధ రాజకీయ, ప్రజాపక్షాల నుంచి వస్తున్నాయి. ఇంతటి ఘనుడైన సుధాకర్‌ నాయుడును విశాఖ రూరల్‌ తహసీల్దారుగా బదిలీ చేసిన తర్వాత దాదాపు 59 రోజులపాటు ‘కీ’ అప్పగించలేదు. రెవెన్యూ రికార్డులు, డిజిటల్‌ సిగ్నేచర్‌కు సంబంధించి ఈ కంప్యూటర్‌ కీ ఉంటేనే పని సాధ్యం. కొత్త తహసీల్దార్‌ వచ్చినా 59 రోజులపాటు కీ అప్పగించకపోవడం వెనక చాలా వ్యవహారాలు నడిచాయన్న విమర్శలు గట్టిగా వినిపించాయి.
ఈయన తరువాత వచ్చిన శంకర్రావు అనే తహశీల్దార్‌కు కూడా గతంలో సస్పెండ్‌ అయిన చరిత్ర ఉంది. ఇలాంటి వ్యక్తిని మళ్లీ విశాఖకు తీసుకురావడం విమర్శలకు దారి తీయడంతో తిరిగి ఆయన్ను శ్రీకాకుళం జిల్లాకు పంపారు. ఆ తర్వాత సుధాకర్‌ నాయుడే ఇన్‌చార్జిగా వ్యవహరించారు. పది రోజుల కిందట జరిగిన బదిలీల్లో సదరు సుధాకర్‌నాయుడును విశాఖకు ఆనుకునే ఉన్న పెందుర్తి తహసీల్దార్‌గా నియమించడం గమనార్హం. తహసీల్దార్‌ కార్యాలయాలు అధికార పార్టీ నేతల చేతుల్లో చిక్కుకున్నాయనడానికి సుధాకర్‌ నాయుడు వ్యవహారమే ఉదాహరణ.

వీరే ఇంత సంపాదిస్తే.. ఇక వారు?
ఏసీబీ దాడిలో ఓ తాహసీల్దార్‌ 100 కోట్ల రూపాయల ఆస్తులతో పట్టుబడ్డారంటే అంతా నివ్వెరపోయారు. వీరే ఇంతగా సంపాదిస్తే వీరి వెనుక ఉండి దందాలు నడిపించిన ప్రభుత్వ పెద్దలు ఎన్ని వేల కోట్లు.. కాదు.. కాదు.. లక్షల కోట్లు వెనకేసుకుని ఉంటారో స్పష్టమవుతోంది. ఒక్క విశాఖ జిల్లాలోనే వ్యవహారం లక్షల కోట్లలో ఉంటే, ఇంకా బయట పడని వ్యవహారాలు ఇతర జిల్లాల్లో ఇంకెన్ని ఉన్నాయో అని జనం చర్చించుకుంటున్నారు. అధికారులను పావుగా వాడుకుంటూ.. వారితో తప్పులు చేయిస్తూ.. వందల కోట్లు వెనకేసుకోవడమే ‘పెద్దలు’ పనిగా పెట్టుకున్నారు. విశాఖలో ఈ పెద్దలకు పావుగా మారిన తహసీల్దార్ల వివరాలు ఇలా ఉన్నాయి..
1. ఎస్‌.సిద్ధయ్య (2014 – 15) : ఓ ప్రజాప్రతినిధికి రూ.12 లక్షలు ఇచ్చి భీమిలిలో పోస్టింగ్‌ ఇప్పించుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నాడు. వచ్చిన తొమ్మిది నెలల వ్యవధిలోనే భీమిలి మండలం లక్ష్మీపురంలో ఒక రైతుకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వడానికి రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు.
2.ఎం.ఎ.మనోరంజని (ఆరు నెలలే పని చేశారు) : ఈమె విజయనగరం జిల్లా సాలూరు కోర్టులో నక్సలైట్ల చేతిలో హతమైన ఎస్‌ఐ ముద్దాడ గాంధీ భార్య. ఆ తర్వాత భీమిలి నుంచి బదలీపై వెళ్లిపోయారు.
3. బి.టి.వి.రామారావు(2015 – 17) :  భీమిలి మండలంలోని పలువురు రైతులకు చెందిన భూములను వెబ్‌ల్యాండ్‌లో పేర్లు మార్చడం, డి.పట్టా భూములు, ఎండోమెంట్‌ భూములు, మాజీ సైనికుల భూముల రికార్డులు మార్చి మంత్రి అనుచరుడైన పరుచూరి భాస్కరరావు తదితరులకు కట్టబెట్టడంలో వివాదాస్పదుడయ్యారు. ఈయన ఏడాదిన్నర కాలంలోనే రూ.100 కోట్లు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. దీంతో ఇటీవల ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్‌ అయ్యారు.
4. సుమతీబాయి (పద్మనాభం మండలం – 2014 నుంచి ఇప్పటి వరకు) : గతంలో ఒకసారి లంచం తీసుకున్న కేసులో ఏసీబీకి పట్టుబడ్డారు. 2015లో మండలంలోని బి.తాళ్లవలస పంచాయతీలో ఉన్న 427 ఎకరాల నీలయమ్మ సత్రం భూములను బినామీ రైతుల పేర్లతో వన్‌–బిలు, పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ చేశారు. అనంతరం పట్టాల ద్వారా ఈ భూములను మంత్రి గంటా అండ్‌ కో కొనుగోలు చేసేందుకు స్కెచ్‌ వేశారు. ఈలోగానే ఎండోమెంట్‌ అధికారులు మేలుకుని ఎండోమెంట్‌ భూములను రైతులకు పట్టాలుగా ఇవ్వకూడదని కోర్టును ఆశ్రయించారు.
5.ఎస్వీ  అంబేద్కర్‌ (ఆనందపురం మండలం – 2014 నుంచి ) : మంత్రి గంటాకు నమ్మినబంటు అనే ప్రచారం ఉంది. టీడీపీ భీమిలి నియోజకవర్గ కన్వీనర్, మంత్రి గంటా బంధువు పరుచూరి భాస్కరరావు, ఆ పార్టీ నేతలు కోరాడ రాజబాబు, కోరాడ నాగభూషణరావు, బంటుపల్లి మణిశంకరనాయుడుల కనుసన్నల్లోనే ఈయన పనిచేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. మండలంలో యథేచ్ఛగా భూకబ్జాలు, బంజరు, డి.పట్టా భూముల ఆక్రమణలు జరిగిపోతున్నా నిద్ర నటిస్తున్నారన్న అపవాదును మూట కట్టుకున్నాడు.

వైఎస్‌ జగన్‌ ఛాంబర్‌లో పనిచేసే వారిపై కేసులు?

Written By news on Thursday, June 8, 2017 | 6/08/2017


వైఎస్‌ జగన్‌ ఛాంబర్‌లో పనిచేసే వారిపై కేసులు?కోసేసిన పైపుల ఫొటోను చూపుతున్న స్పీకర్‌ కోడెల(ఫైల్‌)
- లీకేజీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది
- సీబీఐ దర్యాప్తుతోనే నిజమైన దోషులెవరో తేలతారు
- నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు


నరసరావుపేట:
 అసెంబ్లీ భవనంలోకి వర్షపు నీరు రావటాన్ని సామాజిక ప్రసార మాధ్యమాల (వాట్సాప్‌‌) ద్వారా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చిన వారిపై అక్రమంగా కేసులు పెట్టే కుట్రకు ప్రభుత్వం తెరతీస్తుందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తమ జేబు సంస్థ లాంటి సీఐడీతో అసెంబ్లీ ఆవరణలోని వైఎస్‌.జగన్‌ ఛాంబర్‌లో పనిచేసే వారిపై తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదని, కుతంత్రాలతో ప్రభుత్వం నడుస్తుందనే దానికి ఇదే నిదర్శనమని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ వ్యవహారంలో వాస్తవాలు వెలుగులోకి వచ్చి దోషులెవరో తేలాలంటే సీబీఐతో నిష్పాక్షికమైన విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ‘అసెంబ్లీ హాల్లోకి వర్షపు నీరు వచ్చిందనే విషయంపై వాస్తవాలను తెలుసుకునేందుకు బుధవారం ఎమ్మెల్యేలందరమూ పరిశీలించేందుకు వెళ్లాం కానీ సిబ్బంది మమల్ని లోపలికి అనుమతించలేదు. ఆ మేరకు స్పీకర్‌ తమకు కచ్చితమైన ఆదేశాలు జారీచేశారని సిబ్బంది చెప్పారు’ అని శ్రీనివాసరెడ్డి వివరించారు.

స్పీకర్‌ కోడెల.. మీడియాను అసెంబ్లీలోని లాబీల్లోకి గాని, మొదటి ప్లోర్‌లో ఉన్న ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహనరెడ్డి చాంబర్‌లోకి గానీ తీసుకెళ్లకుండా సరాసరిగా రూఫ్‌కు తీసుకెళ్లడం, అప్పటికే కట్‌చేసి ఉంచిన పైపును చూపించి లీకేజీకి ఇదే కారణమని చెప్పడం విడ్డూరమని శ్రీనివాసరెడ్డి అన్నారు. అసెంబ్లీ నిర్మాణానికి భూమి, ఇసుక ఉచితంగా ఇచ్చి నిర్మాణానికి స్కేర్‌ ఫీట్‌కు రూ.4వేలకు బదులుగా రూ.10వేలు చెల్లించినా వర్షపు నీరు ఎందుకు కారిందని ప్రశ్నించారు.

Written By news on Wednesday, June 7, 2017 | 6/07/2017


జగన్‌ ఛాంబర్‌లోకి నీళ్లు; భారీ కుట్ర

- అసెంబ్లీలోకి వర్షపునీరు.. అభాసుపాలైన బాబు
- నిర్మాణ లోపాలను కప్పిపుచ్చుకునేందుకు కొత్త నాటకం
- పైపులు కట్‌ చేయడం వల్లే నీరొచ్చిందన్న స్పీకర్‌ కోడెల
- సీఐడీ ఎంక్వైరీకి ఆదేశం.. సచివాలయం లీకేజీపై గప్‌చుప్‌


అమరావతి: 
అంతర్జాతీయ రాజధాని అమరావతిలోని తాత్కాలిక భవనాలు ఒక్క వర్షానికే అతలాకుతలం కావడంతో చంద్రబాబు ప్రభుత్వం నవ్వులపాలైంది. అసెంబ్లీకి బీటలు, సచివాలయంలోకి నీళ్లు రావడంతో బాబు బండారం బట్టబయలైంది. చేసిన తప్పును సరిదిద్దుకోకపోగా.. తనను తాను కాపాడుకునేందుకు కుట్రల పర్వానికి తెరలేపింది బాబు సర్కార్‌. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ ఛాంబర్‌లోకి నీళ్లురావడం వెనుక కుట్ర జరిగిందని సాక్షాత్తూ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మాట్లాడటం విడ్డూరం.

అధికారులతో కలిసి బుధవారం అసెంబ్లీని సందర్శించిన స్పీకర్‌ కోడెల.. లీకేజీ వ్యవహారంలో కుట్ర జరిగిందని, దీనిపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నానని చెప్పారు. స్పీకర్‌ రావడానికి ముందే.. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు.. మీడియాను అసెంబ్లీకి అనుమతించాలని ఆందోళన చేశారు. మంగళవారం వర్షం వెలిసిన కొద్దిసేపటికే అసెంబ్లీ నుంచి మీడియాను గెంటివేసినప్పుడే.. ప్రభుత్వం ఇలాంటి కుట్రకు తెరలేపుతుందనే అనుమానాలు వ్యక్తం కావడం గమనార్హం.

పైపులు కట్‌ చేశారు: స్పీకర్‌ కోడెల
అసెంబ్లీని పరిశీలించిన అనంతరం స్పీకర్‌ కోడెల కొన్ని ఫొటోలు చూపిస్తూ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ ఛాంబర్‌లోకి నీళ్లు వెళ్లేలా ఎవరో ఉద్దేశపూర్వకంగా పైపులు కట్‌ చేశారని ఆయన చెప్పారు. "ఇందులో కుట్ర జరిగిందని అనుమానిస్తున్నాం. ఆధారాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపుతున్నాం. కుట్రదారులు ఎవరనేది తేలాలి. వాళ్లను వదిలిపెట్టం"అని కోడెల వ్యాఖ్యానించారు.

మీడియాను ఎందుకు అనుమతించలేదు?
అసెంబ్లీలో లీకేజీలపై మాత్రమే సీఐడీ విచారణకు ఆదేశించానని, సచివాలయం లీకేజీలతో తనకు సంబంధం లేదని అన్నారు స్పీకర్‌ కోడెల. "అంత చిన్న పైపు నుంచి ఇంత పెద్ద వరద ఎలా వచ్చిఉంటుంది?", "ఇప్పుడు ఫొటోలు చూపిస్తున్న మీరు.. నిన్ననే మీడియాను లోనికి అనుమతించి ఉంటే అనుమానాలు ఉండేవి కాదుకదా?" అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు కోడెల సమాధానాలు దాటవేశారు. "అన్నీ ఎంక్వైరీలో తేలతాయి.."అని చిత్తగించారు.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ఆందోళన
చిన్న వర్షానికి అసెంబ్లీ భవనం చిల్లులుపడి కురుస్తుండటంపై ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు నిజనిర్ధారణకు సిద్ధమయ్యారు. బుధవారం ఉదయం మీడియాతో కలిసి అసెంబ్లీ భవనాన్ని పరిశీలించడానికి వారు ప్రయత్నించారు. అయితే, వారితోపాటు మీడియా ప్రతినిధులను అసెంబ్లీలోకి అనుమతించడానికి మార్షల్స్‌ నిరాకరించారు. దీంతో అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ భవనంలోని నిజానిజాలను తెలుసుకోవడానికి తమతోపాటు మీడియాను అనుమతించాలని కోరుతూ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు వద్ద ఆందోళనకు దిగారు.
(చదవండి: అసెంబ్లీకి బీటలు.. సచివాలయంలో నీళ్లు

ఏపీ అసెంబ్లీలోకి నో ఎంట్రీ.. ఉద్రిక్తత!


ఏపీ అసెంబ్లీలోకి నో ఎంట్రీ.. ఉద్రిక్తత!

అమరావతి: ప్రపంచ స్థాయి అత్యాధునిక రాజధాని అమరావతి చిన్నపాటి వర్షానికే చిల్లులు పడిన ఘటనతో చంద్రబాబు ప్రభుత్వం ఇరకాటంలో పడింది. చిన్న వర్షానికి అసెంబ్లీ భవనం చిల్లులుపడి కురుస్తుండటంపై ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు నిజనిర్ధారణకు సిద్ధమయ్యారు. మీడియాతో కలిసి అసెంబ్లీ భవనాన్ని పరిశీలించడానికి వారు ప్రయత్నించారు. అయితే, వారితోపాటు మీడియా ప్రతినిధులను అసెంబ్లీలోకి అనుమతించడానికి మార్షల్స్‌ నిరాకరించారు. దీంతో అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ భవనంలోని నిజానిజాలను తెలుసుకోవడానికి తమతోపాటు మీడియాను అనుమతించాలని కోరుతూ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు వద్ద ఆందోళనకు దిగారు. 
 
తమకిష్టమైన ప్రైవేట్‌ సంస్థలకు రూ.వందల కోట్లు ధారపోసి.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన రాష్ట్ర నూతన శాసనసభ, సచివాలయం చిన్నపాటి వర్షానికే కురవడంపై వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రజలకు నిజానిజాలు తెలియాల్సిన అవసరముందని, ఇందుకు అసెంబ్లీ భవనాన్ని పరిశీలించడానికి మీడియా ప్రతినిధులకు కూడా అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు. మంగళవారం కేవలం 20 నిమిషాలపాటు కురిసిన సాధారణ వర్షానికే అసెంబ్లీ, సచివాలయం జలదిగ్బంధంలో చిక్కుకోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

చంద్రబాబు ఇల్లు ఇలానే కురుస్తుందా?

Written By news on Tuesday, June 6, 2017 | 6/06/2017


ఒక్క వర్షంతో ‘తాత్కాలిక’ బండారం బట్టబయలు
- కూలిన అసెంబ్లీ, సచివాలయం భవనాల గోడలు.. పైకప్పు లీకేజీ
- చాంబర్లలోకి భారీగా వర్షపు నీరు.. సిబ్బంది ఇక్కట్లు
- 20 నిమిషాల వానకే ‘రాజధాని’ అతలాకుతలం.. భారీ వర్షం కురిస్తే పెనుప్రమాదం!
- మీడియాకు అనుమతి నిరాకరణ.. సర్వత్రా ఆందోళన


అమరావతి:
 గట్టిగా 20 నిమిషాలపాటు వర్షం కురిసిందోలేదో.. ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక రాజధాని అమరావతి అతలాకుతలం అయింది. భారీ టెక్నాలజీతో నిర్మించిన తాత్కాలిక భవనాలు గడగడలాడాయి. తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం భవనాలను వర్షపు నీరు ముంచెత్తింది. ఉద్యోగులు, సిబ్బంది లోపల ఉండలేని పరిస్థితిలో కార్మికులు నీళ్లను తోడే ప్రయత్నం చేశారు. తాత్కాలిక అసెంబ్లీలోని ప్రతిపక్షనేత కార్యాలయంలోనైతే ఏకంగా నీరు ధారలా కారిన దృశ్యాలు కనిపించాయి.

ఒక్క వర్షంతో.. తాత్కాలిక నిర్మాణాలే అయినా ప్రపంచ స్థాయి టెక్నాలజీని ఉపయోగించామన్న పాలకుల మాట నీటి మూటేనని తేలింది. తాత్కాలిక నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందన్న ప్రజల అనుమానం నిజమైంది. ఇంతా జరుగుతుంటే సీఎం చంద్రబాబు మాత్రం ఐదో రోజు నవనిర్మాణ దీక్ష పేరుతో ఊకదంపుడు ఉపన్యాసాలు వినిపించారు.

చంద్రబాబు ఇల్లు ఇలానే కురుస్తుందా?
అమరావతిలోని తాత్కాలిక భవనాల్లో మంగళవారం కనిపించి దృశ్యాలు చూసి ఆంధ్రదేశం నివ్వెరపోయింది. ఎంత తాత్కాలిక నిర్మాణమైతేమాత్రం మరీ కురవడమేమిటని సచివాలయ ఉద్యోగులు చర్చించుకున్నారు. ‘జనం సొమ్ము కాబట్టే అడ్డగోలుగా దోచుకుతిన్నారు.. అరకొరగా నిర్మాణాలు చేశారు.. ఏం? హైదరాబాద్‌లో వందల కోట్లతో కట్టిన చంద్రబాబు ఇల్లు కూడా ఇలానే కురుస్తుందా?’ అని విపక్ష నేతలు ప్రశ్నించారు. నల్లరేగడి నేలలో నిర్మాణాలు సరికాదని ఎప్పటినుంచో మొత్తుకున్నా చంద్రబాబు పెడచెవినపెట్టారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.

చదరపు అడుగుకు రూ.10 వేల ఖర్చు
భారీ దోపిడీకి తెరతీస్తూ చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన తాత్కాలిక భవనాల నిర్మాణానికి ప్రపంచంలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఖర్చు చేశారు. చదరపు అడుగుకు ఏకంగా రూ.10 వేలు ఖర్చుచేసి మొత్తం రూ.900 కోట్ల ప్రజాధానాన్ని బొక్కేశారు. నిర్మాణాలు తూతూ మంత్రంగా సాగుతుండటంపై గతంలోనే ‘సాక్షి’ అనేక కథనాలు రాసింది. కట్టిన ఆరు నెలల్లోనే రాజధాని బండారం బట్టబయలు కావడంతో నవ్వులపాలైన సర్కారు.. తాత్కాలిక భవనాల్లోకి మీడియాను అనుమతించకుండా పరుకుకాపాడుకునే వ్యర్థప్రయత్నం చేసింది.

పొంచిన పెనుముప్పు
నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించకముందే.. క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా మంగళవారం పలు జిల్లాలల​ఓ వర్షాలు కురిశాయి. సరిగ్గా అరగంట కూడా పడని వర్షానికి తాత్కాలిక భవనాలు అతలాకుతలం అయ్యాయి. గోడలు విరిగిపడి, పైకప్పునుంచి నీటి ధారలు కారాయి. మరో నాలుగైదు రోజుల్లో నైరుతి వర్షాలు ప్రారంభంకానుండటంతో రాజధానికి పెనుముప్పు పొంచిఉందనే చెప్పాలి. ఇవాళ్టి బీభత్సం తరువాత.. ‘మున్ముందు.. గంటో, రెండు గంటలో ఏకధాటిగా భారీ వర్షం కురిస్తే.. తాత్కాలిక భవనాలు తట్టుకుంటాయా? అక్కడ పనిచేస్తోన్న ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ ఉంటుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.

వర్షపు నీటిలో ఏపీ సచివాలయం


వర్షపు నీటిలో ఏపీ సచివాలయం
అమరావతి: గుంటూరు, కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. సచివాలయం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం పడుతోంది. వర్షం కారణంగా సచివాలయంలోని నాలుగో బ్లాక్ లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. దీంతో రెవెన్యూ శాఖ సెక్షన్ లో ఉద్యోగుల పనికి ఆటంకం ఏర్పడింది.
 
అసెంబ్లీ, సచివాలయంలోని పలు ఛాంబర్లు వర్షపు నీటితో నిండాయి. అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కార్యాలయంలోకి వర్షపు నీరు సన్నటి ధారగా నీరు పడుతోంది. దీంతో బకెట్లతో వర్షపు నీటిని సిబ్బంది తొలగిస్తున్నారు. కాగా అసెంబ్లీలోకి మీడియాను అనుమతించలేదు. విజువల్స్‌ తీయకుండా పోలీసులు మీడియాను అడ్డుకున్నారు. 
 
 

కాగా గుంటూరు జిల్లాలోని సత్తెన పల్లి పరిసర గ్రామాల్లో పిడుగు పడే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. కృష్ణా జిల్లా కంచికచర్లలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మొదలైన వాన, తీవ్ర ఈదురుగాలులతో స్థానికులు భీతిల్లారు. భీకరమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో చెట్లు నేలకూలాయి. రేకుల షెడ్ల పైకప్పులు గాలికి కొట్టుకుపోయాయి. కుండపోతగా కురిసిన వానతో రోడ్లపై ఎక్కడికక్కడ  నీరు నిలిచిపొయింది. దీనికి తోడు ఉరుముల మెరుపులతో జనం భయకంపితులయ్యారు. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపొయింది. పట్టణంలో జనజీవనం పూర్తిగా స్తంభించింది.
 

Popular Posts

Topics :