సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎన్నికల హడావిడి మరింత పెరిగింది. ఓట్ల తొలగింపు వ్యవహారం ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ విషయంపై ఏపీ చీఫ్ ఎన్నికల కమిషనర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆదివారం నుంచి ప్రతిపథకానికి కోడ్ అమలులో ఉంటుందని తెలిపారు. ఎన్నికలకు ఎక్కువ సమయం కూడా లేదని, మార్చి 15 వరకే ఓటరు నమోదు దరఖాస్తులు తీసుకుంటామని స్పష్టం చేశారు. మార్చి 15 తర్వాత దరఖాస్తులు తీసుకోలేమని పేర్కొన్నారు. రాష్ట్రంలో 3 కోట్ల 82 లక్షల 31 వేల 326 ఓట్లు ఉన్నాయని వెల్లడించారు. ఫారం-7 ద్వారా మొత్తం 9 లక్షల 27 వేల 542 దరఖాస్తులు వచ్చాయని, అందులో 5,25914 దరఖాస్తులు తిరస్కరించామని, 1,58,124 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు.
ఇప్పటికే ఫేక్ ఫారం-7 సంబంధించి 446 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. పసుపు కుంకుమ పథకం మూడో చెక్కుపైన రిపోర్టును కేంద్ర ఎలక్షన్ కమిషన్కు పంపించామని , అది కేంద్ర ఎన్నికల కమిషన్ పరిశీలనలో ఉందన్నారు. ఐదో విడత రుణమాఫీ జీవో కూడా పరిశీలిస్తామని, ఏపీలో మొత్తం 9,345 సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించామని, ఏపీలో 45,920 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో అందరూ చెక్ చేసుకోవాలని సూచించారు.