
ఇక రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని షర్మిల తీవ్రంగా దుయ్యబట్టారు. ''గతంలో మద్రాసును తీసేసుకున్నారు.. ఇప్పుడు సీమాంధ్రకు హైదరాబాద్ను దూరం చేసేస్తారట. కాంగ్రెస్ ఉద్దేశం సీమాంధ్రను వల్లకాడు చేయాలనేనా? ఇంత జరుగుతున్నా చంద్రబాబులో చలనం లేనే లేదు. కాంగ్రెస్తో కలిసి చంద్రబాబు కూడా చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. చేసిందంతా చంద్రబాబు చేసి ఇప్పుడు వైఎస్ఆర్పై నెపం నెడుతున్నారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ సంకేతాలు ఇచ్చిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా ఒకేసారి రాజీనామా చేశారు. వాళ్లతోనే మిగతా పార్టీల వాళ్లు కూడా రాజీనామా చేసుంటే విభజన ప్రక్రియ ఆగిపోయేది'' అని షర్మిల అన్నారు.
చంద్రబాబు కాంగ్రెస్తో నిస్సిగ్గుగా కలిసిపోయి ఎప్డీఐ ఓటింగ్ సమయంలో తమ ఎంపీలను గైర్హాజపరిచి కోట్లాది రైతులను, చిన్నవర్తకులకు వెన్నుపోటు పొడిచారని, ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడితే... ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒక్క ఈగ కూడా వాలడానికి వీల్లేదని సిగ్గులేకుండా విప్ జారీ చేసి మరీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడి కోట్లాది ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఒకప్పుడు సొంతమామకు వెన్నుపోటు పొడిచి, తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు తెలుగు గడ్డకు, పుట్టిన గడ్డకు, తెలుగు తల్లికి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఈ వెన్నుపోటు చంద్రబాబుకు అసలు ఆత్మ ఉందంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు.